ఙ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఙ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జులై 2012, సోమవారం

అమెరికా ఏమీ మారలేదు ??

ప్రస్తుతం అమెరికా లోని మసాచూసెట్స్ అనే రాష్ట్రంలోని పిట్స్ ఫీల్డ్ అనే ఊరినించి వ్రాస్తున్నాను. అమెరికా కు విచ్చేయడం ఇది నాకు మూడో విడత. మొదటి సారి వచ్చినప్పుడు టెక్సస్ లోని ఆస్టిన్ అనే ఊరికి వెళ్లాను. రెండొవ విడతలో ఫిలడెల్ఫియాలోని రెడ్డింగ్, ఇదిగో ఇప్పుడు ఇక్కడ. మొదటి సారికి రెండొవ సారికి పోలికలు ఓ పోస్టులో వ్రాసుకుంటూ ఏవేవో ఆలోచించిన నాకు మూడోసారి ప్రయాణం కించిత్ కష్టం గా సాగినా, ఎందుకో మనసు అంతా ప్రశాంతతో కూడుకుని అన్నింటినీ క్షమించేసింది. అమెరికా లో నాకు చాలా విషయాలు నచ్చకపోయినా, నచ్చినా.. అవన్నీ ఇప్పుడు భావాతీతంగా అనిపిస్తున్నాయి. అమెరికా లోని ప్రజల అలవాట్లు నాకు ఎప్పటికీ అర్దం కాకపోయినా, వాటిల్ని అర్దం చేసుకోవాలన్న ఆలోచన ఇప్పుడు లేదు. ఇక్కడ విభిన్నమైన జాతులు కలసి మెలసి ఉంటున్నా, అప్పుడప్పుడు నాలాంటి మానశిక వికలాంగులకు అమెరికా అప్పుడప్పుడు ఓ అర్దం కాని విచిత్రమే.

 

అమెరికా లోని ప్రజల జీవన విధానం పై మొదటగా నేను వ్రాసుకున్న విషయాలు ఇప్పటికీ మారక పోయినా, నా దృక్పధంలో మార్పు ఎందుకు వచ్చిందో నాకు తెలియటం లేదు. వ్యక్తుల మధ్య ఉన్న బంధాలు అనుబంధాల గురించి అన్యోపదేశంగా ఎవేవి వ్రాసినా, అమెరికా లోని ప్రజల గురించి ఏమి వ్రాసినా అది అర్ద రహితంగానే ఉంటుందనిపిస్తోంది. ఆరోజుల్లోని నా ఆలోచనలు వాటిపై పడ్డ మొట్టికాయలు ఇప్పుడు ఎందుకో గుర్తుకు రావటం లేదు. మొదటి సారిగా అమెరికా వచ్చినప్పుడు వేసుకున్న నీలిరంగు చొక్కా ఇప్పటికీ గుర్తుండి తీసుకురావడం ఇప్పుడు అదే వేసుకుని మూడోసారి కూడా క్లైంటు వద్దకు వెళ్ళడం ఎదుకో చిత్రంగా అనిపిస్తోంది. ఇంత సింహావలోకనం చేసినా, ఇప్పుడు చెప్పాలనుకున్నది ఎక్కడ మొదలు పెట్టలో అర్దం కావటం లేదు.

 

మఱో సారి ప్రారంభిస్తాను. అప్పుడు ఆలోచనలు ఓ రూపాన్ని తెచ్చుకుని అక్షరంగా ఇక్కడ కనబడుతుందేమో!!! అప్పటిదాకా ..

 

సశేషం ..

18, ఆగస్టు 2011, గురువారం

భద్రాచలం – నా ప్రాప్తం : మొదటి భాగం

ఈశ్వరానుగ్రహం వల్ల నేను ఈ మధ్యనే భద్రాచలం వెళ్ళి వచ్చాను. ఇలా భద్రాచలం వెళ్ళడం మొదటి సారి కాదేమో, కాని నాకు బాగా ఊహ తెలిసి మొదటి సారి అని చెప్పుకోవచ్చు. దానికి తోడు భార్యకూడా వచ్చింది. దర్మ పత్నీ సమేతంగా వెళ్ళి రావడం కొంచం ఊరటగా ఉంది. అన్నింటికన్నా మించిన తృప్తినిచ్చిన విషయాలు ఒక్కటి అని చెప్పుకోవడానికి ఏదో తెలియటం లేదు.

యాక్సిడెంట్ అయిన తరువాత ఒక్కడినే నడుచుకుంటూ వెళ్ళడం అందునా ప్రయాణం చెయ్యడం ఇదే మొదటి సారి. కుంటుకుంటూ వెళుతున్నాను, ఏమైనా అవుతుందేమో అన్న భయం మనసులో ఉన్నా, అంతా శ్రీరామునిపై భారం వేసేసి, ధైర్యం చేసి బయలు దేరాను. నాలుగు రోజులు ముందు వరకూ నా ఆలోచనలో ప్రయాణం అంతా కారులో వెళ్ళడం గురించి ప్రళాణిక వేసుకుంటున్నంతో, హితులైన కృపాల్ కశ్యప్ గారి రూపంలో ఈశ్వరుడు మా ఇంటికి విచ్చేసి, భద్రాచలం వెళ్ళడానికి రైల్ ఉందు చూసుకోండి అని సలహా ఇచ్చారు. అంతే, అప్పుడే జాలంలో మనకు అందుబాటులో ఉన్న రైల్వే వారి బుక్కింగ్ సైట్లో వెతికితే, ఆఖరుగా రెండే రెండు సీట్లు మిగిలి ఉన్నాయి.

DSCN2432వెంటనే బుక్ చేసేసుకున్నాను. ఇది యాదృశ్చికమా లేక సదృశ్యమా అంటే, అది ఈశ్వరుని కృపే అని నేను నమ్ముతాను. అదిగో అలా మొదలైంది నా భద్రాచల ప్రయాణం. ప్రయాణం చక్కగా మొదలైంది అనుకునేంతలో ఓ విఘాతం బాలయ్య రూపంలో చేరుకుంది. మేము ప్రయాణిస్తున్న రైల్లోనే బాలయ్యకూడా భద్రాచలం వస్తున్నారంట. ఇంకేం భాట్రాజులు ఉండనే ఉంటారుకదా, నువ్వది ఈకావో, నువ్విద్ది పీకావో, అంటూ తిరిగే వాళ్ళన్నమాట, వారు ఎంత హడావిడి చేసేస్తున్నారంటే, తలకాయి నెప్పొంచిందనుకోండి. సరే వారి విషయం నాకు అనవసరం అనుకుంటూ నేను ఎంత జాగ్రత్తగా ఉండాలో అని ఆలోచించుకుంటూ నాకు కేటాయించిన చోటకు చేరుకున్నాను. చక్కగా సికింద్రాబాద్ నుంచి మొదలైన ప్రయాణం భద్రచలం రోడ్డు అనే స్టేషన్ అయిన కొత్తగూడం చేరుకునేటప్పటికి ఉదయం ఐదు గంటలైంది.

ఉదయం ఐదు గంటల వేళ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ స్టేషన్ నుంచి బయటకు వచ్చేటప్పటికి, బయట మూగిన జనాలు, మన హీరో గారి అభిమానులు అంతా జారుకున్నారు. అక్కడ మాకు ఒక్క ప్రయాణ సాధనం ఆటో తప్పితే మరింకేం కనబడలేదు. ఆటో వాళ్ళేమో మూడువందల యాభై రూపాయలనుంచి వారి నోటికి ఎంత తోస్తే అంత అడుగుతున్నారు. ఇలా ఐతే ఎలా అనుకుంటూ,  మెల్లగా బయటకు చేరుకునేటప్పటికి, ఓ ప్రైవేట్ ట్రావల్స్ బండి వాడు కనబడ్డాడు. ఒక్కొక్కరికి నలభై రూపాయలు అడిగాడు, హమ్మయ్య, అనుకుని సౌకర్యంగా భద్రాచలం చేరుకున్నాను. అప్పటికి తెలతెల్లవారుతోంది.

DSCN2436

ఇదిగో అక్కడ కూడా మన బాలయ్యగారి రాబోయే సినిమా, “శ్రీరామ రాజ్యం” పాటల సందడికి సంబందించిన బ్యానర్లు మాకు స్వాగతం ఇచ్చాయి. కానీ నాకు నచ్చని విషయమేమిటంటే, పూజ్యనీయమైన బద్రాచల శ్రీరాముని గుడికి వెళ్ళే ముఖ ద్వారమైన దారికి వీరు ఇలా బ్యానర్లు తగిలించడం ఎందుకో మింగుడు పడలేదు. కానీ ప్రస్తుతం మనం ఉన్నది ప్రజాపాలన కలిగిన రాజ్యంలో అని రాజ్యాంగం చెబుతోంది కదా, అందువల్ల ప్రజలు ఏమి చేసినా మనం మాట్లాడ కూడదు. అలాగే ఈ విషయంలో కూడా, అనుకుని, శ్రీరాముని తలచుకుని ముందుకు సాగాను. తెలవారు ఝామున ఇలాంటి దృశ్యం నాకు అనుకోని అనుభూతిని మిగిల్చింది. ఇంతటి అనుభూతిలో, బాలయ్యలాంటి వ్యక్తి కూడా భాగమైనందులకు కించిత్ బాధగా ఉన్నా, గురుతుల్యులు చెప్పిన ఓ విషయం ఇక్కడ ఙ్ఞప్తికి వస్తుంది. చండాలుడియందు అలాగే విఙ్ఞుల యందు సమదృష్టికలిగి ఉండాలి అన్న మాట గుర్తు తెచ్చుకుని, అందరియందు సమదృష్టి కలిగి ఉండాల్సిన ఆలోచనను పెంచుకునేందుకే ఈశ్వరుడు ఇలా చెపారని అనుకున్నాను.

DSCN2437

ఈశ్వరుని కృప మనకు ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు. కాకపోతే మనం అందుకు సిద్దంగా ఉండటమే ముఖ్యం. భద్రాచలం వెళ్ళడానికి ఆయితే టికెట్లు రిజర్వ్ చేయించుకున్నాను కానీ ఎక్కడ ఉండాలా అని అనుకుంటుంటే, ప్రయాణానికి ఒక్క రోజు మఱో హితుల రూపంలో ఈశ్వరుడు నాతో చెప్పించారు. వారికి తెలిసిన స్నేహితులు అక్కడే నివాశితులై ఉన్నారని, వారు నాకు ముందుగా ఓ రూము రిజర్వ్ చేయించి పెడతానని. అదిగో అదే ఈ “శ్రీరామ నిలయం”. తిరుపతిలో లాగా ఇక్కడ కూడా ఓ రిజర్వేషన్ కౌంటర్ యందు మనం ముందుగా రిజర్వ్ చేయించుకుంటే, ఇక్కడ ఉండటానికి మనకు అనుమతి లభిస్తుంది. ఈ శ్రీరామ నిలయం ప్రక్కనే “సీతా నిలయం” కూడా దేవాలయం వారు కట్టారు. గదుల లోపల నిర్వాహణా పరమైన లోపాలు చాలా ఉన్నా, భక్తితో వచ్చిన నాకు మరింకేం ఇబ్బంది కాలేదు. చక్కగా కాల కృత్యాలు తీర్చుకుని, గోదావరిలో స్నానం చేసివద్దాం అని ప్రక్కనే ఉన్న గోదావరికి చేరుకున్నాను.

DSCN2438వరద రావడం వల్ల అలాగే అక్కడ ఉన్న భక్తుల అత్యుత్సాహం గమనించిన తరువాత గోదావరిలో మునగలేక పోయ్యాను కానీ గోదావరీ జలాలను నెత్తిమీద జల్లుకున్నాను. వరద వల్ల నీరంతా బురద బురదగా ఉన్నా ఫరవాలేదు కానీ, అత్యుత్సాహంతో ఉన్న భక్తులు కుంటి వాడిని కాకపోయినా, అపరేషన్ చేసిన కాలు పూర్తి స్థాయిలో నడవనివ్వక పోవడం వల్ల నిలదొక్కుకోలేని నన్నువారు గమనించకుండా ఎన్ని గంతులు వేస్తున్నారో గమనించిన తరువాత వారితో కలసి నీళ్ళల్లోకి దూకడానికి సాహసించలేక పోయ్యాను.

అలా గోదావరీ జలాలతో ప్రోక్షణ చేసుకుని, సత్రానికి చేరుకుని, తలారా స్నానం చేసి ఈస్వరుని తలచుకుని, ఆలయం వైపు అడుగులు వేశాను. సాధారణంగా చాలా సార్లు నాకు దైవ దర్శనం అయ్యేంత వరకూ చుట్టూ ఉన్న (లేదా) జరుగుతున్న పరిణామాలు నాలో కోపాన్ని లేదా అసహనానికి గురిచేస్తాయి. కానీ ఏమి విచిత్రమో ఏమో, ఆరోజు ఉదయం నుంచి చాలా ఘటనలు నన్ను అసహనానికి గురిచేసినా నా మనస్సులో ప్రసాంతత దూరం కాలేదు. ఓ ప్రక్కన జరుగుతున్న పరిణామాలు నన్ను గుర్తుపెట్టుకునేటట్టు చేసినా, అవి నన్ను ఏమీ చెయ్యలేక పోయాయంటే, దానివెనకాల శ్రీరాముని కృప ఎంత సత్యమో నాకు మాత్రమే తెలుసు.

ఇలా ఒక్కో విషయానికి ఇంతగా వ్రాసుకుంటూ పోతే, ఒక్క పోస్టు చాలదేమో.. మరిన్ని వివరాలతో, మరో పోస్టు

23, జూన్ 2011, గురువారం

అమెరికా వాళ్ళే పిసినారోళ్ళు కాదు

ఇంతకు ముందు అమెరికా వాళ్ళ పిసినారి తనం గురించి ఓ వివరం వ్రాసుకున్నట్లు గుర్తు. కానీ ఇవ్వాళ ఈ లంకెలోని వ్యాసాన్ని చదివిన తరువాత నోటివెంట మాటరాలేదు. అమెరికా వారి గురించి వ్రాసుకున్నప్పుడు ఎనిమిది వందల బిలియన్ డాలర్ల గురించి ప్రస్తావిస్తే, గ్రాంట్ థ్రాన్‍టన్ సంస్థలో పనిచేస్తున్న హరీష్ చెపొచ్చేదేమిటంటె, ఇరవై బిలియన్ డాలర్ల ($20m) సొమ్ము నికరంగా నగదురూపంలో ప్రైవేట్ ఇన్వెస్టర్ల వద్ద మూలుగుతోంది. ఇంత పెద్ద మొత్తం కూడా పెట్టుబడికి సిద్దంగా ఉంది.

ఈయన కన్నా ఓ అడుగు ముందుకు వేసి బెంగళూర్ స్థానంగా వ్యాపారాన్ని నడుపుతున్న IDC Ventures యొక్క అధిపతి అయిన సుధీర్ సేథి ఇంకొంచం ముందుకెళ్ళి తొక్కలో ఇరవై ఏమిటి, చక్కగా ఓ డెబ్బైయ్యో లేదా డెబ్బైఅయిదు బిలియన్ డాలర్లు పెట్టుబడి చెయ్యక నగదు రూపంలో మూలుగుతున్నాయి అని అంటున్నారు. ఇలా అనడమే కాకుండా, వారి ఆలోచనలకు సాధ్యాసాధ్యలకు అనువైనటువంటి ఆలోచనలకు రూపం ఇచ్చేలాగా అంకెలతో గారడి చేస్తున్నారు.

ఈ అంకెల గారడి అంతా హంబక్.. పనిలేని వాళ్ళు వ్రాసుకునే చెత్త రాతలు అని అనుకుందాం అనుకుంటే, నేను బొర్లా పడ్డట్టే. ఎందుకంటే, ఈ సంవత్సరంలో మే నాటికి భారత దేశం నుంచి బయట దేశాలలో పెట్టుబడి పెట్టే నిమిత్తం తరలి వెళ్ళిన ధనాన్ని లెక్కల్లోకి తీసుకుంటే, క్రిందటి సంవత్సరానికన్నా దాదాపు సగానికి పడిపోయి (అంటే 59%), చూచాయిగా మూడున్నర బిలియన్ డాలర్లకు దగ్గరి దగ్గరగా ($3.7b) ఉంది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు తెలియజేసారంటె, మన భారత దేశం నుంచి బయటకు వెళ్ళాల్సిన పెట్టుబడి ఆగి పోయినట్లే కదా. ఈ విషయాన్ని ఈ వ్యాసంలో చదువుకోంటుంటె, అదే వ్యాసంలో మఱో చోట మొత్తం మీద క్రిందటి సంవత్సరం కన్నా భారతీయులు ఈ సంవత్సరంలో చాలా తక్కువగా పెట్టుబడులు పెడుతున్నారని తెలియజేసే విధానం నాకు అబ్బుర పఱచింది.

ఇలాంటి విషయాలను చదువుతుంటె, పాపం అమెరికా వాళ్ళు మాత్రమే పిసినారోళ్ళు కదనిపిస్తోంది. ఇలా అమెరికా వారి గురించి వ్రాసినందుకు కించిత్ బాధగా ఉన్నా, ఎక్కడ ఎనిమిది వందల బిలియన్ డాలర్లు ఎక్కడ ఇరవై బిలియన్ డాలర్లు, లేదు కాదు అనుకుంటే, అధికపక్షం ఓ ఎనబై బిలియన్ డాలర్లను బేరీజు వేసుకుంటే, అమెరికా వాళ్ళ గురించి అలా వ్రాయడం పెద్ద విషయం కాదని దానిగురించి నేను అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తోంది.

7, జూన్ 2011, మంగళవారం

హోమ్ లోన్ వివరించే ఎక్సెల్ ఫైల్ తప్పిపోయింది

చాలా కాలం క్రిందట ఓ స్నేహితుడినుంచి మైల్లో ఓ ఎక్సెల్ ఫైల్ వచ్చింది. దానిలో హోమ్ లోన్ తీసుకుంటే నెల నెల మనం ఎంత కట్టాలి అనే విషయాన్ని చాలా బాగా వివరించి ఉంది. దానిని డౌన్లోడ్ చేసి ఎక్కడో దాచి ఉంచాను. తీరా ఇప్పుడు అవసరం అయ్యింది. వెతికితే దొరకడం లేదు. నా లాప్ టాప్ నుంచి అది తప్పించుకుని తిరుగుతోంది. దొరికిన వారికి (తగిన) ఆశ్చర్య కరమైన బహుమతి ప్రకటించడమైనది.

టీసీయెస్ లో పనిచేసే ఓ ఉద్యోగి కొంచం శ్రమించి ఓ ఫైల్ ని తయారు చేసినా దానియందు 2010 సంవత్సరం వరకే అవకాశం ఉంది. మనం ప్రస్తుతం 2011 లో ఉన్నాం కదా అందుకని అది వీలు పడదు అని అనుకుంటే, నాతో పాటు పనిచేసే ఓ సహ ఉద్యోగి, “దానిదేముంది బాసు.. అందులో ఏదో ఒక సంవత్సరం వేసేయ్.. నీక్కావలసిందేంటి? ఏ సంవత్సరంలో ఎంత ఇంట్రస్ట్ కట్టావు? వగైరా వగైరా విషయాలేకదా!!” అంటూ తెల్చేశాడు. అవును అదికూడా నిజమే కదా అని ఆలోచించుతూ ఉంటె, ఆ ఎక్సెల్ ఫైల్లో ముందుగా మనం ఏదైనా ఎమౌంట్ కడితే దాని నుంచి ఎంత ఇంట్రస్ట్ తగ్గుతుంది వంటి వివరాలు లేవు.

ఏది ఏమైనా, అలాంటి ఫైల్ ఎవ్వరికి దొరికినా నాకు తెలియజేయండి గిఫ్ట్ కొట్టేయ్యండి.

14, ఏప్రిల్ 2011, గురువారం

పుణ్యభూమిపై జరుగుతున్న దాడి – మహానుభావుల భావన

కొంతకాలం క్రిందట పుణ్యభూమి అనే గుంపునందు ఓ చర్చ జరిగింది. ఆ చర్చలో ఇద్దరు వ్యక్తులు నా భావాలకు వ్యతిరేకంగా స్పందించారు. వారిలో మొదటి వారు ఓ పేరు మోసిన తెలుగు బ్లాగర్ గారైతే, పరదేశి గారు మరొకరు. వీరి భావనలలోని ఆంతర్యం మరో మహానుభావునితో పోలి ఉందని ఈ మధ్య నాకు అర్దం అయ్యింది. వీరందరి ఆలోచనలలో చాలాచక్కటి పోలికే కాక భారతీయత యందు వీరందరికీ చాలా దగ్గరి సంబంధం కనబడుతోంది. ఇంతకీ ఆ మూడో వ్యక్తి ఎవ్వరంటే, గౌరవనీయులైన గరిక పాటి నరశింహా రావు గారు.
ప్రతీరోజు భక్తి టీవిలో గరికపాటి వారు రామాయణం గురించి ప్రసంగం చేస్తున్నారు. మధ్య మధ్యలో వీరు పిట్టకధలుగా రామాయణం నుంచి తొలగి మన సంసృతికి పడుతున్న దుర్ఘతి గురించి వీరు పడుతున్న ఆవేదన పడుతూ చేసే వ్యాఖ్యానాలు పైన ఉదహరించిన వారి భావనలతో నూటికి నూరు శాతం సరిపోతుంది.  ఒక్కొసారి ఈ చర్చలో జరిగిన విషయాన్ని చదువుతుంటే, గరికపాటి వారి వ్యాఖ్యానం వింటుంటే చాలా ముచ్చటేస్తుంది.
నిజంగానే ఇది ఓ సరి అయిన సమయం, ముష్కరులపై మనం కూడా దాడి చెయ్యాలి. ఈ విషయం తెలియడానికి నాకు చాలా సమయం పట్టింది, కానీ వీరిని నేను అపార్దం చేసుకోలేదని బ్లాగు పూర్వకంగా వినతి. ఇక దాడి విషయానికి వస్తే, వివాదాలకి దూరంగా ఉంటూ వచ్చిన నాకు వివాదస్పదమైన చర్చ జరుగుతున్నప్పుడు వెళ్ళి అనవసర దాడిని తిరిగి త్రిప్పి కొట్టే ప్రయత్నం చెయ్యడానికి కొంచం ధైర్యం కావాలి. మన సంసృతిపై సరి అయిన అవగాహన వస్తే ధైర్యం దానంతట అదే వచ్చేస్తుంది. అలాగే చొరవ వస్తుందని నమ్ముతూ సంసృతిని అర్దం చేసుకునే ప్రయత్నం చేస్తాను.
అన్యమనస్కంగా ఆ ఇద్దరి పేర్లను ఇంతకు ముందు ప్రస్తావించినందులకు వారి అభిమతం దెబ్బదిన్నట్లైతే, మన్నించ ప్రార్ధన.

13, ఏప్రిల్ 2011, బుధవారం

దైవం – ఆలోచనల రూపం

దైవం గురించి వ్రాయడానికి నాకు అంత ఙ్ఞానము లేదు అలాగే అంతటి సాహసము చెయ్యలేను. కాకపోతే ఇంతకు ముందు నేను వ్రాసిన కొన్ని పుటల వెనుక దాగి ఉన్న వివరానికి ఒక రూపం ఇచ్చే ప్రయత్నంలో ముందుగా కొన్ని పుటలను ప్రశ్నలుగా వ్రాసుకుని వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేసాను. వాటికి ప్రప్రధమంగా నన్నయ్యగారిని హైలేట్ చేస్తూ వ్రాసాను. నన్నయ్యగారిని ఆదికవిగా నేను ఒప్పుకోను అని వ్రాసిన పుటకి ఎందరో స్పందించి వారి వారి అభిప్రాయాలు తెలియజేయడమే కాక పలు విభిన్న కోణాలను సృజించారు. అంతే కాకుండా తెలుగులో నన్నయ్యగారికన్నా ముందు అధర్వణాచార్యుడు అనే మహా వ్యక్తి గురించి కూడా ప్రస్తావనకొచ్చింది. కొన్ని చర్చలు ఇక్కడ అప్రస్తుతం అయినా, ప్రతీ వ్యక్తి ఆలోచనలు ఈ విధంగా రూపం దిద్దుకున్నాయి అని చెప్పడానికి కొన్ని కొలమానాలు ఉంటాయి.

మూల విషయానికి వెళ్ళేముందు, ఓ సున్నితమైన విషయాన్ని నాకు తెలిసినంత వరకూ వివరంగా వ్రాసే ప్రయత్నం చేస్తాను. ఏ వ్యక్తి అయినా ఏదైనా విషయాన్ని ఎలా నేర్చుకుంటారు?

ఇది చాలా పెద్ద విసృతమైన చర్చ. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్టు, తెలివైన వాడు ఎదుటి వాడి అనుభవం నుంచి నేర్చుకుంటాడు.. అలాగే తెలివి తక్కువవాడు స్వానుభవం చేత నేర్చుకుంటాడు అని. దీని గురించి ఇంతకు మించి వ్రాయదలచుకోలేదు అన్నంత మాత్రాన ఈ సామెతతో ఏకీభవించినట్టు కాదు అలాగే విభేదించినట్టుకూడా కాదు. దీని గురించి వ్రాస్తూ పోతే అసలు కధ మఱుగున పడిపోతుంది. అందుకన్నమాట.

ప్రతీ వ్యక్తీ చిన్నప్పటి నుంచే నేర్చుకుంటూ పెరుగుతారు. ఎప్పుడైతే నేర్చుకోవడం మానేస్తారో అప్పుడు ముసలి తనం వచ్చిందని నా అభిప్రాయం. ఇలా నేర్చుకునే ప్రయత్నంలో కొన్ని మనం చదివి నేర్చుకోవాలి, చాలా కొద్ది విషయాలు మాత్రం అనుభవించి నేర్చుకోవాలి, మరి కొన్ని విని నేర్చుకోవాలి, ఇంకా కొన్ని చూచి నేర్చుకోవాలి, అలాగే మరిన్నిటిని నమ్మి నేర్చుకోవాలి. చాలా విషయాలను మన సంస్కారం మనకు నేర్పిన విఙ్ఞతను ఆధారంగా తీసుకుని, నేటి సమాజంలో ఉన్న ధర్మాన్ని బేరీజు వేసుకుని మనం ఒక నిర్ణయానికి వచ్చి నేర్చుకోవాలి.

వీటిలో ఉదాహరణకి, భూమి గుండ్రంగా కాకుండా ఎలిప్టికల్ ఆకారంలో ఉంది అని చూచిన వాళ్ళు ఎంతమందో చెప్పండి చూద్దాం. భారత దేశ జనాభాలో నేటికి నూట ఇరవై కోట్ల జనాభా ఉన్నట్లు అంచనా. ఎంత మంది నిజ్జంగా ఆకాశంలోకి వెళ్ళి భూమిని చూచి వచ్చారో చెప్పండి? కానీ భూమి ఇలాగే ఉందన్న విషయాన్ని భారతదేశ జనాభా అంతమందీ ఒప్పుకుంటారు. ఎలా అబ్బా?? వీరందరు ఆకాశంలోకి వెళ్ళి చూచారా!! లేదే.. కానీ చూచి వచ్చిన వారు మరియు పరిశోధనలు చేసిన వారు ప్రతి పాదించిన విషయాన్ని నమ్మి ఒప్పుకున్నారు.

ఇంకొకటి, ఎలక్ట్రాన్ అనేది ఉంది అని అందరూ నమ్ముతారు. లేకపోతే మనకు విద్యుత్ అనేది ఉండదు. కానీ ఎంతమంది ఈ సదరు ఎలక్ట్రాన్ అనేదానిని చూచారో చెప్పమనండి. ఒక్కరు కూడా మనకు కనబడరు. ఆఖరికి దానిని కనిపెట్టిన వారుకూడా దానిని చూడలేదంటే అది అతిశయం కాదు. కానీ ఎలక్ట్రాన్ ఉందని దానికి రెండు విధాలైన ప్రవర్తన ఉంటుంది అని, అవి మనకు చాలా ఉపయోగకరమైనవని అని అందరూ నమ్ముతారు. ఈ విషయాన్ని మనం విని నేర్చుకున్నాం అలాగే చదివి నేర్చుకున్నాం. అంతే గాని ఎలక్ట్రాన్ ద్వారా వచ్చే షాక్ మనకు అనుభవంలోకి రావాలనుకోకూడదు.

మరొకటి, నిప్పు పట్టుకుంటే కాలుతుందని ప్రతీ వ్యక్తి నేర్చుకున్నదే. మొదటగా వీరు చదివి నేర్చుకున్నా, ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలో నేర్చుకున్నదే. ఆ అనుభవానికి చిన్న నిప్పురవ్వైనా సరే లేక వంటింటిలోని పొయ్యిపైన ఉన్న మంటైనాసరే లేదా మరేదైనా ప్రతీ వ్యక్తికి అనుభవంలోకి వచ్చిందే. కాదనగలరా??

గురుత్వాకర్షణ శక్తి గురించి కలిగిన ఆలోచన వెనకాల ఓ మహానుభావుడైన సర్ ఐజక్ న్యూటన్ ఆలోచనా విధానం మనకు ఓ ఉదాహరణ. ఈ మహాను భావుడు విపరీతంగా ఆలోచించలేదు కానీ వైవిధ్యభరితమైన కొత్త కోణాన్ని సృజించారు. అంతే కాని ప్రకృతి కి విరుద్దమైన ఆలోచన చేసి ఎయిడ్స్ లాంటి రుగ్మతకు రూపం పొందించలేదు. ఎకే 47 సృష్టికర్త కూడా ఇలాంటి మారణాయుధాన్ని ఎందుకు కనుగొన్నానా అని విలపించాడు. న్యుక్లియర్ బాంబ్ కనుక్కొవడమెందుకు ఆ తరువాత అనుభవించడం ఎందుకు.

ఇక్కడ ప్రస్తుతమైన విషయం ఏమిటంటే, మన సంసృతి మనకు నేర్పించినదేమిటి? విధ్వంసాన్నా లేక వినాశనానికి దారి తీసే విషయాన్నా? ఒక వేళ మనం ఉన్న సమాజం మనకు అదే నేర్పుతుంటే, మన విఙ్ఞత మనకేం నేర్పుతోంది అని మనం ఆలోచించుకోవలసిన అవసరం మనకు లేదా? లేదు అనుకుంటే మనం కొత్తగా ఆలోచించం. అలాగే ఎవ్వరిని మనం ప్రశ్నించం. కానీ దైవం విషయంలో మాత్రం చాలా మంది ప్రశ్నిస్తున్నారే!! అదే ఇక్కడ హాస్యాపదం. పోనీ వారు పుట్టి పెరిగిన సమాజం లేదా వారి సంసృతి వారికి దైవం విషయం గురించి చెప్పలేదా అంటే అదేం కాదు, చిన్నప్పటి నుంచి చెబుతున్నా వినిపించుకోకుండా చెవిటి వాళ్ళై పెరిగారు.

ఇలాంటి వారిని చూస్తే నాకు చార్వాక సిద్దాంతం గుర్తుకు వస్తుంది. చార్వాకుల గురించి తరువాత వ్రాస్తాను. అంతవరకూ నేను గమనించిన దేవుళ్ళ గురించి ఓ పుట. ఆఖరుగా దైవం గురించి తెలుసుకోవాలంటే ముందుగా..

చదివి తెలుసుకోవాలి..

విని తెలుసుకోవాలి..

అనుభవంలోకి తెచ్చుకుని తెలుసుకోవాలి..

ఆఖరిగా ఓ సంసృతిని అలవరచుకుని తరువాతి తరాలికి ఆ సంసృతిని అందించాలి.

15, మార్చి 2011, మంగళవారం

దైవం – ఆలోచనల పరంపర

దైవం పై నేను చేసిన మొదటి పుట వెనకాల ఉన్న మూల ఆలోచనని ఇంతకు ముందు వ్రాసుకున్నాను. ఇప్పుడు రెండొవ పుట వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశ్యం వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక్క సారి అవలోకనం చేసుకుంటే, మనల్ని ఇలా శపించేటోడు దేవుడా!! అన్న శీర్షిక వచ్చిన రెండొవ పుట వెనకా ఉన్న ఆవేదన అనాధలైన పసి పిల్లలు మఱియు వారి స్థితి. ఇదే పుటలో ప్రకృతిలో జరుగుతున్న ప్రళయాల గురించి ప్రస్థావన జరిగింది. వీటితో బాటుగా సృష్టిలోంచి ఉద్బవించిన వాటిని తమ శక్తులతో ప్రతి సృష్టి చేస్తున్నాం అని చెప్పుకుంటున్న బాబాలను ప్రశ్నించడం జరిగింది.

ఇక ప్రస్తుత విషయానికి వచ్చేముందు, ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలను ఙ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య వార్తలలో కనబడే అతి సాధారణ విషయాలలో మొదటిది దుర్ఘటనలు (యాక్సిడెంట్స్) మరొకటి హత్యలు. ఇలాంటి ఘటనలో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరి మరణానికి వారు అతివేగంగా ప్రయాణం చెయ్యడం కారణమైతే, మరి కొందరు దొంగతనానికి వచ్చిన దొంగల అసహనానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అతి వేగంగా ప్రయాణం చెయ్యడమెందుకు ఆపై దుర్ఘటన జరిగింది దేవుడు మమ్ములను కాపాడలేదు అని నిందించడ మెందుకని. అర్భాటాలకు పోయి మా ఇంట్లో ఇంత ధనం ఉంది అన్నట్టుగా నిండా దొంగ బంగారాన్ని దిగేసుకుని నలుగురిలో తిరగడమెందుకని ఆ తరువాత నలుగురి కళ్ళల్లో పడ్డట్టే దొంగల కళ్ళలో కూడా పడి దోపిడీకో లేక మరింకేమైన పోగొట్టుకోవడం ఎందుకో.

సరే ఈ విషయాలు ప్రక్కన పెట్టి మరో విషయం ప్రస్తావిస్తాను, ఈ మధ్య వచ్చిన వార్తలలో ఓ తల్లి తన కన్న బిడ్డలనే చంపేశిందని చదివాను. ఆ తల్లి ఎందుకు అలా చేసిందో అని విచారించే ముందు, మరో విషయం. హైందవులు పరమ పవిత్రంగా పూజించే గంగా దేవి తనకు పుట్టిన అష్ట వసువులను పుట్టంగానే చంపేసిందంట. మరి ఈ తల్లి ఎంతటి ఖటినాత్మురాలో కదా!?

ఇక్కడ ప్రస్తావించిన రెండు సంగతులూ చాలా మటుకు ఒకే రకంగా ఉన్నా, వాటి వెనకాల ఉన్న కారణాలు ఒక్కసారి గమనిస్తే.. మొదటి తల్లి ఈ భవ సాగరంలో తన బిడ్డలను సాకలేక తన బిడ్డలకు మృత్యువుని ప్రసాదిస్తే, మరో తల్లి విషయం గురించి పురాణం తెలిసిన వారిని ఎవ్వరినైనా అడిగితె వివరం అర్దం అవుతుంది. తెలుసుకోవాలన్న కోరిక ఉన్న వారు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తెలిసిన తరువాత అర్దం చేసుకుంటారు. తెలుసుకో్వాలని అనుకోనివారు గంగమ్మ మీద నిందలేస్తూ ఇలాగే ఇక్కడే ఉండి పోతారు.

ఇవన్నీ ఎందుకు నిన్నగాక మొన్న జరిగిన భూకంపం మరియు సునామి ధాటికి జపాన్లో వేలకొద్ది జనాలు మరణిస్తున్నారు. వేల కోట్ల సష్టం లెక్కల లోకి రానుంది. జపాన్ ఆర్దిక వ్యవస్థ 1987 తరువాత ఇంతగా క్షీణించింది లేదు. ఇవన్నీ ప్రకృతి వైపరిత్యాల వల్ల మనకు అనుభవంలోకి వస్తున్న మరియు వచ్చిన ఘటనలు. ఇంతకు ముందు కూడా ఇలాగే రెండొవ ప్రపంచ యుద్ధంలో చైనా జెపాన్లపై అమెరికా అణుబాంబు ప్రయోగించిన తరువాత చాలా కాలం పాటు ఈ రెండు దేశాలు నిలదొక్కుకోలేక పోయ్యాయి. కానీ ప్రపంచం అంతా ఇప్పుడు మెచ్చుకునే రెండొవ ఆర్దిక వ్యవస్థగా ఎదినది ఎవ్వరు? ఏదో దెబ్బ తగిలింది కదా అని ఏడుస్తూ కూర్చోకుండా పోరాడి ఎలాంటి పరికరాన్నైనా చవకలో తయ్యారైయ్యే విధానాలకు మారు రూపమైన చైనా మాన్యుపాక్చరింగ్ వ్యవస్థను మెచ్చుకోకుండా ఉండలేం కదా.

ఇలా ఏదైనా వైపరిత్యం జరిగినప్పుడు లేదా అనుకోని ఆపద వచ్చినప్పుడు దైవాన్ని నిందించడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్న వాళ్ళకి వివరం చెప్పే విధంగా ముందుగా వారిని ఆకుట్టుకునే ప్రయత్నమే నా మరో పుట, మనల్ని ఇలా శపించేటోడు దేవుడా!! అలాంటి వాళ్ళకు కొన్ని ప్రశ్నలు..

  • రెండొవ ప్రపంచ యుద్దంలో అణుబాంబు వేసినది దైవమా..
  • ఏయిడ్స్ కనుకొన్నది దైవమా..
  • బుద్దిగా సంసారం చేసుకుంటూ ఒక స్త్రీయందే రమించి పిల్లలను కనమని పెద్దలు చెబుతున్నా పెడ చెవిన పట్టి ప్రకృతికి విరుద్దంగా జంతువులతో సంయోగం చేసే వివరీత బుద్ది కలిగినది దైవానికా..
  • మన లాభం కన్నా పక్కవాడి నష్టమే ప్రయోజనంగా ఎదుగుతున్న న్యూక్లియర్ ప్లాంట్లను కూలగొట్టింది దైవమా..

అందుకే పెద్దలు చాలా సార్లు చెప్పారు, వినాశకాలే విపరీత బుద్ధి అని. “విపరీతంగా ఆలోచించడం దేనికి ఆపై విసుగు చెందడం దేనికి” అన్న విషయం ఎంతమందికి అర్దం అవుతుందో కదా!!

11, మార్చి 2011, శుక్రవారం

నేను అనుభవాలనుంచి నేర్చుకోవటం లేదు

ఇలా వ్రాయడానికి సంకోచించడం లేదు కానీ ఇబ్బందిగా ఉంది. నిజం ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటుంది. కాని అది నిజ్జంగా నిజంగానే ఉంటుంది. దానిని అంగీకరించి ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అంతటి ధైర్యం నాలో రావాలనే ఈ ప్రయత్నం.

స్వతహాగా నాకు ఉన్న కొన్ని బలహీనతలలో ఒకటి నన్ను చాలా ఇబ్బందులలోకి తోస్తోంది. అలా చెయ్యడం ద్వారా నేను ఇబ్బందుల పాలౌతున్నాను అన్న విషయం గ్రహించి కూడా అలా చెయ్యడం మానుకోలేక పోతున్నాను. అలా చెయ్యడం మానడానికి నేను చాలా శ్రమించ వలసి వస్తుంది. కానీ చాలా కాలంనుంచి ఉన్న అలవాట్లు తొందరగా మానుకోలేం అన్న ఆంగ్ల నానుడి నాయందు స్పష్టమైంది. ఆంగ్ల నానుడిని ఆంగ్లంలో, Old habits die hard.

ఈ పుట వ్రాయడం వెనకాల ఉన్న చాలా విషయాలలో ఒక్క విషయాన్ని ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. తెలుగులో ’రాయడం’ అనే పదం చూచిన రోజునుంచి నాకు చాలా కోపంగా ఉండేది. ఎవ్వడో చదువురాని లేదా వ్రాయడం చేత కాని ఓ అభాగ్యుడు వ్రాయడం అనే అచ్చమైన తెలుగు పదాన్ని తెలియక అలా వ్రాస్తే, ఏవిదంగా వ్రాస్తే ఏమిటి అని ఎదురు ప్రశ్న వేస్తూ ఈ నాటి చాలా మంది రచయితలు అందునా విద్యావంతులు అంతే కాక సమాజంలో ఎంతో కొంత గౌరవం ఉన్న వాళ్ళు కూడా ఈ రాసే జబ్బుని వారంటించుకుని అందరికీ పూయ్యడం అలవాటు చేస్తుంటే కడుపు రగిలిపోయ్యేది. ఇక్కడ మరో విషయన్ని ప్రస్తావించాలి.

ఉదాహరణాకి, ఓ ఇంటి ముందు నుంచొని ఓ పెద్దాయిన ఆ ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లవాడిని ఇలా అడిగితే ఎలా ఉంటుంది..

౧) అబ్బాయి, మీ నాన్నగారు ఉన్నారా?

౨) బిడ్డా!, మీ నాయిన ఉన్నడా?

౨) కొడకా, బాబు ఏంజేస్తుండు?

౪) వగైరా .. వగైరా..

ఇవన్నీ ఏదో ప్రాంతీయ యాస కలిగి ఉంటాయి, అంతే కానీ ఏ భాణిలోను మనం తండ్రి అనే పదాన్ని అగౌరవ పరచం. కాకపోతే మనం చేయ్య వలసినదల్లా, ఆ ప్రాంతీయ తత్వాన్ని మనం అర్దం చేసుకోవడమే.

అదిగో అలాంటి సమయంలో తెలుగు బ్లాగింగ్ చెయ్యడం, eతెలుగులో చేరడం, నా అభిప్రాయాన్ని నలుగురితో పంచుకోవడం, పలువురు నన్ను వ్యక్తిగతంగా నిందించడం, వగైరా వగైరా, ఒకదాని తరువాత ఒకటి జరిగిపోయ్యాయి. ఎవ్వరి అభిప్రాయాలు వారు తెలియజేయడం జరిగింది. ఆ తరువాత ఈ విషయమై నేను ఓ అభిప్రాయానికి వచ్చేసాను. నేను తెలుగు భాషని నలుగురిలోకి తీసుకు వేళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఎవ్వరు ఏవిధంగా నైనా తెలుగులో వ్రాయడం మొదలైతే ఎంతో కొంత తెలుగు భాష వాడుకలోకి వస్తుంది కదా అని సమర్దించుకుని నా భాదని దిగమింగుకుని నాకు వీలైనంత వరకూ వ్రాయడమే చేస్తున్నాను.

అదిగో అలాంటిదే మరొక్కటి. అయినా నాకు ఎందుకో ఈ జాడ్యం? భాష యందు పూర్తి పట్టులేక పోయినా కొన్ని కొన్ని విషయాలపై పూర్తిగా అవగాహన ఉంది అని చెప్పవచ్చు. నాకు అవగాహన ఉన్న విషయాలలోని అర్దాన్ని తెలియని అందునా మాకు తెలియని విషయాన్ని చెప్పండి అని అడిగిన వారికి మాత్రమే తెలియ జేస్తుంటాను. అలా తెలియజేస్తూ ఉండే ప్రక్రియలో తెలుసుకునే వారు, తాము చేస్తున్నది భాషకి విరుద్దం అని తెలిసి.. ఆ విషయాన్ని ఒప్పుకునే చొరవ లేక వితండంగా వాదించడమే కాకుండా తిరిగి నాపై లేదా నేను చేసే తప్పులను భూతద్దంలో చూపించి వారేదో పెద్ద ఘన కార్యం చేసినట్టు ఫీల్ అవుతారు.

ఇలాంటి వారి విషయాలలో కొన్ని అంశాలు. మొదటిది, నాకు నేరుగా తపుచేస్తున్న వాళ్ళను సరిదిద్దే ప్రయత్నం చెయ్యడం లేదు. వారు అడిగితేనే నాకు తెలిసిన విషయాన్ని చెబుతున్నాను. రెండవది. నేనేమి తప్పు చేస్తున్నాను అన్న విషయాన్ని ఎవ్వర్ని నేను అడగలేదే, మరి అలాంటది నా చర్యలపై ఎందుకు స్పందిస్తారు? ఇలాంటి వాటి గురించి మరోసారి. ప్రస్తుతానికి ముఖ్య విషయానికి వచ్చేస్తా..

ప్రస్తుత ముఖ్య విషయాన్ని, అనుభవం నుంచి నేర్చుకోవడం అనే విషయంపై నేను ఇంతకు ముందు ’వ్రాయడం’ అనే విషయంలో అనుభవించి ఉన్నాను. కానీ ఇది పునరావృత్తం అవుతోంది అంటే, నేను అనుభవాలనుంచి నేర్చుకో లేక పోవడమే కాకుండా, స్వయం కృతాపరాధానికి అనుభవించాల్సి వస్తోంది. ఇలా ఎంత కాలం జరుగుతుందో చూడాలి ఇకనైనా నేను నాలోని ఈ బలహీనతను అధిగమించి ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూచుకోవాలి.

26, జనవరి 2011, బుధవారం

రిపబ్లిక్ డే ప్రతిజ్ఞ

భారత దేశం నా మాతృభూమి. భారతీయులు అందరు నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. శుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము. దీనికి అర్హుడనగుటకై సర్వదా నేను కృషి చేయుదును. నేను నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరిని గౌరవింతును. ప్రతివారితోను మర్యాదగా నడచుకొందును. నా దేశముపట్లను, నా ప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము.

 

ఇలా చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసినట్టు జ్ఞాపకము. ఈ రోజుల్లో అస్సలు ఎవ్వరికైనా ఇది గుర్తుందా?? ఇలా ఏ పాఠశాలలోనైనా పదిమంది చేత చెప్పిస్తున్నారా??(డౌటే) ఇందులో మార్పు చెయ్యాల్సిన విషయాలు ఏమిటబ్బా!! మరోసారి ఆలోచిస్తాను. అంతవరకూ .. జైహింద్.

24, జనవరి 2011, సోమవారం

రిపబ్లిక్ డే వచ్చేసిందోచ్.. బ్లాగర్లకు విన్నపం

రిపబ్లిక్ డే పరంగా పాఠశాల రోజులలో (అంటే చదువుకునే రోజులలో అని చదువుకో మనవి) మేము చక్కగా జరుపుకునే వాళ్ళము. నాకు గుర్తు తెలిసినప్పటి నుంచి నేను విజయవాడ SKPVV హిందూ హైస్కూల్ విధ్యార్ధిని. అలాగే మేము బావాజీ పేట మొదటి లైన్లో ఉండే వాళ్ళము. నాన్నగారు విజయవాడ రైల్వేస్టేషన్‍లో పని చేసే వారు. వారి ఉద్యోగరీత్యా ఉదయం తొమ్మిది గంటలకల్లా వెళ్ళే వారు. నాకు మ్యూజికల్ కళాశాలలో నాట్యభ్యాశం ముగించుకుని ఎనిమిదిన్నరకల్లా ఇంటికి చేరుకునే వాడిని. అలాంటి రోజుల్లో నాకు బాగా గుర్తున్న కొన్ని సంఘటనలలో ఒకటి నాన్నగారితో వెళ్ళి కూరగాయల మార్కెట్‍కు వెళ్ళి కూరగాయలు తీసుకుని వచ్చేవాడిని. కూరగాయలి కొనిచ్చి నాన్నగారు ఉద్యోగానికి వెళ్ళేవారు. ఆలా మార్కెట్ నుంచి వచ్చిన తరువాత అమ్మ పెట్టిన పెరుగన్నం తిని ఝాం ఝాం అంటూ స్కూల్‍కి పరిగెత్తే వాడిని. అదిగో అలాంటి రోజుల్లో మరొకటి ఈ రిపబ్లిక్ డే రోజు.

స్వతహాగా మా పాఠశాల నిభందనల ప్రకారం ఆకు పచ్చ లాగు అలాగే తెల్ల చొక్కా వేసుకుని వెళ్ళేవాళ్ళం. అలాగే నాట్యాభ్యాసానికి తెల్ల పైజామా పై తెల్ల కుర్తా వేసుకుని వెళ్ళే వాడిని. కానీ ఒక్క రిపబ్లిక్ డే నాడు మాత్రం చక్కగా ఉదయం నుంచి సాయంత్రం దాకా వైట్ అండ్ వైట్ అన్న మాట. అలా తెల్ల డ్రస్ వేసుకుని చాలా మంది వచ్చే వాళ్ళు కానీ నేను మాత్రం తళతళ మని మెరుస్తూ ఉండే వాడిని. ఎందుకంటారా.. తెల్ల లాల్చి కుర్తా డ్రస్‍పై మా అమ్మ చాలా శ్రద్ద తీసుకునేది. ఎందుకంటే ఇది భరతనాట్యం నేర్చుకునేటప్పుడు వేసుకునే డ్రస్ కదా అందుకన్నమాట. మా అమ్మకు నాట్యం అంటే ఎందుకో తెలియని అభిమానం. అందువల్ల స్కూల్ విధ్యార్దులందరిలో నేను కొంచం స్పెషల్‍గా కనబడే వాడిని. అలా మెరుస్తూ ఉండటం వల్ల మా హెడ్ మాస్టారు గారు ఆ నాటి ప్రతిజ్ఞని నా చేత చదివించే వారు. అలా అలవాటైన ప్రతిజ్ఞా కార్యక్రమం ఇంటర్ మీడియట్ కాలేజీ రోజుల్లో కొనసాగినా, డిగ్రీ రోజుల్లో సాగలేదు. అందుకు కారణం నేను చదువుకున్నది ముస్లిం కాలేజీ. అక్కడ ఇలాంటివి పాటించేవారు కాదు.

కానీ ఉద్యోగ భాధ్యతలు వచ్చిన తరువాత నేను చొరవ తీసుకుని ఈ రోజున అక్కడ పని చేసే వారిలో ఔత్సాహికులను ఓ చోట చేర్చి జండా వందన కార్యక్రమం చేసే వాడిని. పోను పోను ఔత్సాహికులు తగ్గిపోవడం వల్ల రిపబ్లిక్ డే అలాగే ఇండిపెండెన్స్ డే ఒక సెలవు రోజుగా మాత్రమే మిగిలిపోయింది కానీ అంతకన్నా ఎక్కువ ఏమీ జరగటం లేదు. కనీసం ఆ నాడైనా బ్లాగర్లు అందరూ ఓ పోస్టు వేస్తే బాగుంటుందని నా ప్రపోజల్. చదివే వారు ఏమంటారు?

6, నవంబర్ 2010, శనివారం

భాగ్యనగరంలో బ్లాగు ప్రమదలు

భాగ్యనగరంలోని బ్లాగు ప్రమదలన్నీ ఈ రోజు అక్కడేక్కడో కలుసుకుని ఏదేదో చర్చించుకున్నారు. ఈ విషయం నాకెలా తెలిసింది అని అడుగుతున్నారా!! మరేం లేదండి. ఇవ్వాళ ప్రొద్దునే నా భార్య ఓ చిన్న గిన్నెలో గుప్పెడు బియ్యం ఉడకేసి వాటికి జతగా ఓ నాలుగు బెండకాయల్ని వేయించి అక్కడ పెట్టి నేను బయటకు వెడుతున్నా, నాకు బండి కావాలి అని అడిగింది. ఏంటబ్బా తనకి ఇంత అవసరం అని మనసులో అనుకుని, సరే గాని ఎక్కడికి వేళుతున్నావ్ అని అడిగా. అదిగో అప్పుడు పేలింది మొదటి తూటా.

ఏం? మీకు చెప్పాలా.. మా ఆడోళ్ళంతా ఓ చోట చేరి మా కష్ట సుఖాలు పంచుకోకూడదా.. అన్నీ మీకు చెప్పే చెయ్యాలా..

ఆ సౌండ్ కొంచం తేడాగా ఉంటే, శాంత తల్లీ మనం ఈ విషయమై మళ్ళీ చర్చించుకుందాం అని అప్పటికి దాటేశాను. కానీ నాకు కూడా బండి కావాల్సి వచ్చినందున, నేను దింపుతాలే అని ఓ స్టిల్ ఇచ్చా. మాటైతే ఇచ్చాను కానీ ఏమి జరుగుతోందా అన్న ఆలోచన బ్యాక్‍గ్రౌండ్ లో తిరుగుతోంది. ఆ ఆలోచన అలా తిరుగుతూ ఉండగా మెల్లిగా బయటకు వెళ్ళి కూరగాయలు తీసుకు వద్దాం అని బయలు దేరాం. రెండో తూటా పేలే ముందు కొంచం గింగిరాలతో ఫ్లాష్ బ్యాక్..

మాకు పెళ్ళి కాక ముందు వరకూ నా భార్యది చాలా చిన్న ప్రపంచం అని చెప్పవచ్చు. అందరి ఆడపిల్లలలాగా చాలా  గారాబంగా పెరిగింది, చదువుకున్నంత సేపు ఇల్లు కాలేజీ తప్ప మరో ప్రపంచం ఎరగదు. విజయవాడలో వాళ్ళ ఇల్లు ఉన్న ఏరియా, దుర్గాపురం మరియు గాంధీనగర్ లోని శాతావాహన కాలేజీ వైపు తప్ప మరో ప్రదేశం తెలియదు. ఈ రెండు కాకుండ, ఏలూర్ రోడ్డులో విజయటాకీస్ నుంచి కాంగ్రెశ్ ఆఫీస్ రోడ్డు వరకు కొంచం తెలుసు. అంతకు మించి ఏమి తెలియవు. ఓ డొక్కి సైకిల్ తొక్కుకుంటూ బొంగరం తిరిగినట్టు దుర్గాపురంలో ఉన్న వాళ్ళ స్నేహితుల ఇళ్ళకు మాత్రం వెళ్ళి వచ్చేది.

పెళ్ళికి ముందు మా అత్తగారు నాభార్య గురించి ఓ డైలగ్ కొట్టారు. మీరు కొంచం దారి చూపించండి ఇకపై తాను అల్లుకు పోతుందని. సరే ఏదో అన్నారు కదా అని అప్పట్లో మా అమ్మ వాడే లూనా నేర్పించాను. ఫరవాలేదు ఒక్క సారి నేర్పగానే పట్టేసింది. సైకిల్ తొక్కడం ద్వారా వచ్చిన బాలెన్స్ చెయ్యడం ఉపయోగ పడింది. ఎలాగో వచ్చు అనిపించిన తరువాత తనకి అంటూ ఓ బండి ఉంటుంది కదా అని హోండా వాడి ఏవియేటర్ కొనిచ్చా. ఆ తరువాత మేము ఎక్కడికి వెళ్ళినా తననే డ్రైవ్ చెయ్యమంటాను. ఎంత ఎక్కువ డ్రైవ్ చేస్తే అంత ఎక్కువ అలవాటౌతుందని దాని వెనకాల ఆంతర్యం. మొదట్లో తాను కొంచం భయపడినా, పోను పోను నేర్చుకుంది. మొత్తం మీద హైదరాబాద్ అంతా కాకపోయినా దాదాపు ప్రధాన ప్రదేశాలన్నీ తనకి తెలుసు. ఓ రకంగా చెప్పాలంటే, విజయవాడ కన్నా హైదరాబాదే ఎక్కువ తెలుసు అని చెప్పొచ్చు.

మా పెళ్ళి కాకముందు నాకు ఓ ఆలోచన ఉండేది, భార్యగా వచ్చే నా అర్ధాంగికి నేను మాత్రమే ప్రపంచం కావాలి అనుకోకుండా, తనకి అంటూ ఓ ప్రపంచం ఉండాలి అందులో నాకు కూడా స్థానం ఉండటమే కాకుండా, తనది అంటూ ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని తనకు నచ్చిన విధంగా తీర్చి దిద్దుకునే వ్యక్తిత్వం ఉండాలి అనుకునే వాడిని. అలా తనదైన ప్రపంచంలో నాది ఒక ముఖ్యమైన భాగం కావాలనుకున్నానే కానీ నేనే మొత్తం కావాలనుకోలేదు. అదిగో అలాంటి ఘటనే ఈ నాటి ఈ సమావేశం అని చెప్పుకోవచ్చు. ఇవ్వాళ అక్కడ చేరే ప్రమదలలో ఒక్కరు కూడా నా భార్యకి చుట్టరికం ఉన్న వాళ్ళు కాదు. అక్కడి వారు ఇటు నావైపు భందువులు కారు అటు తనవైపు చుట్టరికం ఉన్న వారు కాదు. బ్లాగు పెట్టి తనకు నచ్చిన సోది వ్రాసుకుంటూ మిత్రులైన తోటి బ్లాగర్లతో కలసి ఓ ఫుల్ నూన్ ఎంజాయ్ చెయ్యడానికి సిద్దం అయ్యింది అంటే, ఆ ప్రపంచంలో నేను లేను కానీ ఆ బ్లాగు పెట్టడానికిన్ నేనే కారణం అనేది నాకు ఆనందానిస్తోంది.

ఇక రెండో తూటా విషయానికి వద్దాం, ముందుగా ఎర్రగడ్డ రైతు బజార్ వెళ్ళి కూరగాయలు తెచ్చాం. అప్పుడు కూడా నా భార్యే డ్రైవర్. వెళ్ళాం, వచ్చాం. బాగానే జరిగింది. అప్పుడు కూడా నేను వెనకాలే కూర్చున్నా. ఇంతకాలం నేను వెనకాలే కూర్చున్నా లేని అనుభూతి ఇదిగో ఇప్పుడు ప్రమదలందరినీ కలిసేందుకు వెళుతుంటే కలిగింది. అదే భయం. ఎందుకంటారా, ఎప్పుడూ లేని హుషారు ఒక్కసారిగా కనబడింది. బండి నడుపుతుంటే, అది కాస్తా ఏ మాత్రం స్పీడ్ తగ్గదే. నా పై ప్రాణాలు పైనే పోయ్యాయి అంటే అది అతిశయోక్తి కాదు. ఎలాగో గుండె చిక్కబట్టుకుని వెనకాల కూర్చున్నా. కూర్చున్నా అన్న మాటే గాని వెనకనుంచి ఒకటే సణుగుడు. ఒక టైంలో తనకి విసుగు పుట్టి ఇంకెక్కువ మాట్లాడావో ఇక్కడే దింపేస్తా అని అల్టిమేటం ఇచ్చింది. దాంతో ఇక మనం సైలెంట్. అలా రెండో తూటా ఓ పావుగంట సతాయించగానే వీళ్ళు కలుసుకోవాల్సిన ప్రదేశం వచ్చింది. బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి బయట పడగానే చూడాలి నా మొఖంలోని రిలాక్స్, వర్ణనాతీతం.

అలా బ్లాగు ప్రమదల సమావేశం ఈ నాడు నాకు రెండు హార్ట్ ఎటాక్స్ ఇచ్చింది. మనకేమైనా వివరాలు లీకైతే, మీకు మరో పుటలో చెబుతా, అంత వరకూ అంతా ఉష్.. గప్ చుప్..

26, అక్టోబర్ 2010, మంగళవారం

అమెరికా ప్రయాణ ఫలితాలు

నేను అమెరికాకు రెండు పర్యాయాలు వెళ్ళి వచ్చాను. రెండు సార్లు రెండు వైవిధ్యభరితమైన అనుభవాలను మిగుల్చింది. వీటిల్ని ఎప్పటి నుంచో వ్రాయాలనుకుంటున్నాను, కుదరటం లేదు. ఇవ్వాళ మొదలు పెట్టాను, చూద్దాం ఎన్ని రోజుల్లో ముగిస్తానో..

మొదటి సారి

రెండొవ సారి

౧) అమెరికా ఆర్ధిక మాంధ్యం మొదలైంది ౧) ఆర్ధిక మాంధ్యం నుంచి బయట పడ్డట్టు వార్తలు వచ్చాయ్
౨) ఆరు నెలలు అనుకున్న ప్రయాణం ఎనిమిది వారాలలో ముగిసింది ౨) రెండు వారాలు అనుకున్న ప్రయాణం పదమూడు వారాలు సాగింది
౩) మొదటి వారంలో దిగిన హోటల్ నుంచి ఖాళీ చేసి వేరే ఇంటికి మారాల్సి వచ్చింది ౩) దిగిన చోటే చివ్వరి దాకా ఉన్నాను
౪) హోటల్ పనిమనుష్యులు నా డబ్బుని దొంగిలించారు ౪) హోటల్ వాళ్ళు ఒక్క పెన్నీ కూడా ముట్టుకోలేదు
౫) ఓ రోజు తెల్లవారుఝామున పోలీసు వాళ్ళు నిద్రని పాడు చేసి పోలీస్ స్టేషన్ కి పట్టు కేళ్ళారు. కారణం ఏమిటంటే, నేనుంటున్న ఇంటిలో ఇంతకు మునుపు ఓ దొంగ వెధవ ఉండే వాడంట, వాడి పేరున అరస్ట్ వారెంట్ ఉండటం వల్ల అది నేననుకుని పట్టుకు పోయ్యారు. కాదని ఎంత చెప్పినా వినలేదు ౪) ఈ సారి పోలీసోళ్ళ గొడవే లేదసలు.
౬) ఎడారిలో ఒయసిస్సులా కల్పన అక్క ౬) లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ టన్నల్ లా వెరైజన్లో పనిచేసిన సహ ఉద్యోగి హరనాద్ గారు మరియు వారి ఫామిలి
౭) ఆస్టిన్ తప్పమరే ఊరు చూడలేదు ౭) వెళ్ళింది రెడ్డింగ్ అనే పల్లెటూరికి, కానీ న్యూయార్క్ లోని మాన్‍హట్టన్ మొదలుకుని, ఫిలడెల్‍ఫియాలోని పలు పట్టణాలు తిరిగాను. న్యూజెర్సీ లోని సోమర్ సెట్ ప్రాంతలో ఉన్న హరనాద్ వారింటికి, మరియు వారికి దగ్గరలోని మరికొన్ని ప్రాంతాలు. వాషింగ్‍టన్ డీసీ, మేరీలాండ్, వర్జీనియా, న్యూజెర్సి సిటీతో కలుపుకుని విహారం బాగానే చేసాను
౮) కల్పన అక్క వాళ్ళు తప్ప మరెవ్వరితో కలవలేకపోయ్యాను ౮) ముఖ పరిచయంలేని చాలా మంది మెక్సికన్స్ తో కలసి ఎన్నో సాహసయాత్రలు చేసాను అలాగే వారి గెట్ తుగెదర్స్ కి అటెండ్ అయ్యాను
౯) క్లైంట్ చాలా బాగా చూసుకున్నాడు ౯) క్లైంట్ బాగా చూసుకోలేదు అని చెప్పలేను కానీ బాగా చూసుకున్నాడు అని మాత్రం చెప్పలేను.
౧౦) అహారం మరియు చిరు తిండి విషయాలలో ఇక్కడ ఎలాంటి కొరత లేకపోయింది ౧౦) అహారం విషయం ప్రక్కన పెడితే, మంచినీళ్ళుకూడా కొనుక్కోవలసి వచ్చింది
౧౧) క్లైంట్ ఫెసిలిటీస్ బాగా ఇచ్చాడు. తాగడానికి కూల్ డ్రింక్స్, తినడానికి రకరకాలైన తిను బండారలతో బాటుగా, ప్రతీ రోజు రకరకాలైన స్నాక్ ఇచ్చేవారు ౧౧) ఉచితమా!! అంటే ఏమిటి?
౧౨) క్లైంట్ దగ్గర పనిచేసే వారందరి కోసం వారాంతంలో ఇంటికి పట్టుకెళ్ళేందుకు కూడా లెఫ్ట్ ఓవర్స్ ఉండేటట్టుగా ఆర్డర్ చేసే వారు ౧౨) హూ!! What language am I using and what is the grammar of the language?
౧౩) అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న వైనంలా, నేను వెళ్ళిన కార్యక్రమం పతాకస్థాయికి చేరుకునేటప్పటికి క్లైంట్ వాళ్ళని మరో కంపెనీ కొనేసి మానోట్లో మట్టి కొట్టింది ౧౩) వెళ్ళింది ఒక పని పై అయితే, నా పని తీరు నచ్చి మరో రేండు పనులు చేయించుకుని, రెండు కొంటే ఒకటి ఉచితం అన్నట్లుగా ఓ చిన్న ప్రాజెక్టుని ఇండియాకి పార్శిల్ చేసారు
౧౪) నాలుగు రాళ్ళు వెనకేసుకోవాల్సిన నేను ఉన్నది పోగొట్టుకుని, ఉంచుకున్నదాని పోగొట్టు కోవాల్సి వచ్చింది. అంటే ఇండియాలో ఉన్న ఉద్యోగం కూడా పోయింది ౧౪) నాలుగు వెనకేసుకుందాం అనుకుంటే, రోజుకి పది డాలర్ల బోనస్ గా క్లైంట్ ఇచ్చాడు. అలా నాలుగు కాస్తా ఐదు అయ్యింది. లాభదాయకమే
౧౫) భోజన పరంగా ఇబ్బంది కలగలేదు. వీకెండ్స్ లో కల్పనక్క వాళ్ళింట్లో చక్కగా భోజనం అలాగే ఓ రెండు కూరలు వండుకుని తెచ్చుకునే వాడిని. అలా సోమ మంగళ వారాలు గడిపేస్తే, భుధ గురువారాలకు ఏదో చేసుకుని తినేసే వాడిని. ఇక శుక్రవారం నాటికి మళ్ళీ అక్కావాళ్ళింటికి చెరుకునేవాడిని.. ౧౫) ఆఖరి రోజుల్లో చాలా ఇబ్బంది అయ్యింది. మొత్తం మీద ఇబ్బంది కరంగానే సాగింది
౧౬) తిరుగు ప్రయాణం అసహనంగా గడిచింది ౧౬) తిరుగు ప్రయాణం బాగా జరిగినా, రెడ్డింగ్ చేరుకునే టప్పుడు పలు చికాకులు, అలాగే ఇరవై నిమిషాల విమాన ప్రయాణానికి ఎనిమిది గంటలు వేచి చూడవలసి వచ్చింది
౧౭) వచ్చేటప్పుడు ఇంట్లో వారికోసం తెచ్చిన సామానులలో ఓ పెద్ద బ్యాగ్ ఆమ్‍స్టర్ డామ్ ఏయిర్‍పోర్ట్ లో తప్పిపోయింది. దానికి ఎటువంటి రికవరీ అందలేదు ౧౭) ఈ సారి హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు కుమ్మేసారు
౧౮) క్రెడిట్ కార్డుల ద్వారా దాదాపు ఓ ఐదు నెలల పాటు అనవసరమైన పేమెంట్స్ చెయ్యాల్సి వచ్చింది ౧౮) క్రెడిట్ కార్డ్స్ వారికి ముందుగా తెలియ జేసినా, అవి పని చెయ్యలేదు
౧౯) బంధు మిత్రులను ఎవ్వరినీ కలవలేదు ౧౯) మా పెద్దనాన్నగారి పిల్లల్ని వారి పిల్లల్ని కలిసాను
౨౦) మొత్తంగా చెప్పాలి అంటే, ఆదాయం ౩ ఖర్చు ఏడు ౨౦) అదాయం ఆరు ఖర్చు నాలుగు

31, జనవరి 2010, ఆదివారం

ఆధారపడటం - మన బలహీనతా !! ??

 

helping-hand మొన్నా మధ్య "అధారపడటం .. " అనే  విషయమై తెలిసిన వాళ్ళతో చర్చిస్తుంటే నాలో కలిగిన కొన్ని ఆలోచనలు మరియు ఆ చర్చనించి వెలువడిన కొన్ని విషయాలు ఇక్కడ ఉంచుతున్నాను. నా ఆలోచనలలో ఏమైనా మార్పు రావాలంటే లేదా నా ఆలోచనలలో ఏదైనా లోపాలున్నట్లైతే లేదా నా ఆలోచనను మరో విధంగా కూడా ఆలోచించవచ్చు అని మీకు అనిపించినట్లైతే.. ప్లీజ్.. ప్లీజ్.. స్పందించండి

ఈ పుట గురించి కొంచం ఎక్కువగా ఆలోచించానో అని అనిపించింది. కానీ నాకు ఉన్న కొన్ని లోపాపలో ఇది ఒకటి. అదేమంటే, నా భావాలను అక్షర రూపం ఇవ్వాలంటే, అది ఒక యజ్ఞమే. భావ వ్యక్తీకరణకు భాషపై చాలా పట్టు ఉండాలని నా అభిప్రాయం. నా ఈ ప్రయత్నంలో అక్షరలోపాలు దోషాలు ఉన్నట్లైతే మన్నించి సరిదిద్దండి. సరిదిద్దే కొద్ది నా శైలి మారుతుంది అని నా నమ్మకం. నా నమ్మకాన్ని ఒమ్ము చెయ్యకండి.

౧) ముందుగా మనం ఎందుకు మనం ఎదుటి వాళ్ళపై మనం ఆధారపడాలి?

ఈ ప్రశ్న గురించి మొదలు పెట్టే ముందు సదురు "ఎదుటి వాళ్ళు .." ఎవ్వరు అని తెలుసుకోవాలి.

మొన్నామధ్య నాకు యాక్సిడెంట్ అయ్యినప్పుడు, నేను స్పృహలేకుండా రోడ్డు పైన పడి ఉన్నప్పుడు నాకు పరిచయంలేని ఓ బాటసారి నడిరోడ్డుపై పడి ఉన్న నన్ను ప్రక్కకు లాగి  నా ఫోన్ నుంచి 108 కాల్ చేసి నన్ను ఆసుపత్రి చేరుకునేటట్టు చేస్తే, మరో బాటసారి నన్ను గుద్దిన వారిని కూడా రోడ్డు ప్రక్కకు చేర్చి అంతా చోద్యం చూస్తున్న పోలీసోళ్ళతో మాట్లాడి గుద్దిన వాళ్ళని వారికి అప్పజెప్పారు. ఇలాంటి విషయాలలో నాకు ప్రమేయం లేకుండానే నేను వారిపై అధార పడ్డాను. దీనిని అధారపడటం అంటారా!!?? ఏమో!! నాకు స్పృహలేనప్పుడు జరిగిన పరిణామాల గురించి నేను స్పందించలేను. ఒకవేళ్ళ నాకు స్పృహ ఉన్నట్లైతే నేను తప్పని సరిగ్గా వారి సాయాన్ని తీసుకునే వాడిని కాను. నాలో శక్తి ఉన్నంత వరకూ పోరాడే వాడిని. దానికి ఉదాహరణే, అంతటి గాయాలతో కూడ నాకు చికిత్స అయ్యిన తరువాత వైద్యుడిని ఆడిగి మెల్లగా ఇంటికి చేరుకున్నాను. అలా ఇంటికి చేరుకున్న నన్ను చూసి ఒక్క సారి జడుసుకుంది నా భార్య. దీనిని మొండి ధైర్యం అని నేను అంటే, కొంత మంది మూర్ఖత్వం అని అంటారు. మరి మీరేమంటారు?

ఇలా మనకు పరిచయం లేని వాళ్ళని నేను "ఎదుటి వాళ్ళు.." అని నిర్వచిస్తాను.

ఇక అసలు విషయానికి వస్తే, మనం ఎదుటి వాళ్ళపై అధార పడాలి అని చెప్పను. కానీ ఎదుటి వాళ్ళపై అధార పడకుండా ఉండేందుకు ప్రయత్నించమంటాను. మనలో మనకు శక్తి ఉన్నంత వరకూ పోరాటం చెయ్యాల్సిందే అంటాను. మనం పూర్తిగా అశక్తులమైనప్పుడు సదురు ఎదుటి వారిపై ఆధారపడటంలో తప్పులేదు.

౨) మనం ఎవ్వరిపై ఆధారపడాలి?

నా ఆలోచనలో కొన్ని ..

  • శారీరక సుఖం కోసం భార్య భర్తపై మాత్రమే ఆధారపడాలి, అలాగే భర్త భార్యపైన మాత్రమే
  • భర్త తన ద్వారా కలగ బోయే పిల్లల కొరకు భార్యపై మాత్రమే ఆధారపడాలి.. (భార్యకు పిల్లలు పుట్టలేని పరిస్థితి వస్తే.. అదే భర్త నపుంశకుడైతే.. అది వారి వారి వ్యక్తిగత అభిప్రాయం, నేను ఆ విషయాన్ని సృజించను)
  • పెద్దలు బ్రతికున్నంత వరకూ పిల్లలు వారి తల్లి తండ్రులపై మాత్రమే ఆధారపడాలి .. (ఒక వేళ్ళ వారి తల్లి తండ్రులు అంతటి విధ్యావంతులు కాని పక్షంలో ఈ విషయాన్ని మనం పలు పలు కోణాలలో చర్చించుకోవచ్చు)
  • మనకు భావోద్వేగాలు కలిగినప్పుడు పంచుకోవడానికి ఒక ఆసరా కావాలి, కాబట్టి వాటి కొరకు ఒకరిపై మనం ఆధారపడవచ్చు. ఇక్కడ ఒక చిన్న మినహాయింపు, అలా అధరాపడే వాళ్ళు మనిషై ఉండాల్సిన అవసరం లేదు. నాకు చాలా హితుడైన ఒక స్నేహితునికి ఓ వింత అలవాటు ఉంది. ఏమిటంటే, అతనికి ఎటువంటి భావోద్వేగాలు కలిగినప్పుడైనా, తనకు అతి ఇష్టమైన ఓ కొండపైన ఉన్న ఓ పెద్ద బండరాయి వద్దకు వెళ్ళి ఏడ్వటమో లేక నవ్వడమో చేసే వాడు. నాకు అందులో ఎటు వంటి అతిశయం కనబడలేదు.
  • ప్రతీ అనుభవం మనకు ఒక గుణపాఠమే. కాబట్టి అనుభవాలపై కూడా అధారపడాలి. కాబట్టి, ప్రతీ అనుభవాన్ని** మనం అనుభవించే ప్రయత్నం చెయ్యవచ్చు. సదురు మొదలుగా ఉదహరించిన అనుభవం** నాది అవ్వవచ్చు లేదా మీది అవ్వవచ్చు. మీది ఫలనా అనుభవం అని తెలిసినప్పుడు .. కొన్ని అనుభవాలు చదివి తెలుసుకోవాలి, మరికొన్ని విని తెలుసుకోవాలి, మరికొన్ని స్వయంగా అనుభవించి తెలుసుకోవాలి. భూమి  గుండ్రంగా ఉంది అని మనం గురుముఖఃతహ తెలుసుకున్నాం అలాగే చదువుకున్నాం కాబట్టి నమ్మాలి. అంతె కానీ, తూచ్ .. నేను స్వయంగా చూస్తేనే నమ్ముతాను అని అనడం మూర్ఖత్వం అని నా అభిప్రాయం. అలాగే సైన్సులో మన చేత కొన్ని ప్రయోగాలు చేయిస్తారు మన గురువులు అప్పుడు వాటిల్ని మనం స్వయంగా అనుభవించి తెలుసుకుంటాం. ఇలా వేటిల్ని శూత్రప్రాయంగా నమ్మెయ్యాలో వేటిల్ని మనం అనుభవించాలో అది ప్రతీ ఒక్కరి ఉచితానుచితాల పరిధిలో పరిమితమై ఉంటుంది. అది గమనించడమే మన సక్సస్

౩) అస్సలు ఆధార పడకుండా మనం జీవించలేమా!!!

జీవించగలం.. కాకపోతే అడవిలో. అక్కడకూడా మనం చెట్టూ చేమలపై ఆధారపడాలి, తప్పదు. మనిషి ఒక సామాజిక జీవి. కాబట్టి మనకు ఒక సమాజం కావాలి. అలాంటి సమాజంలోని కొన్ని అంశాలపై మనం తప్పని సరిగా ఆధారపడాలి. 

  • ఉదయం నిద్రలేస్తే కాలకృత్యాల అవసరాలకై నీళ్ళు తెచ్చి ఇచ్చే వారిపై ఆధారపడాలి
  • అహార అవసరాలకై మనకు సహాయం చేసే పని వాళ్ళపై  మనం ఆధారపడాలి
  • తెచ్చిన కాయగూరల్ని మనం తినేందుకు వీలుగా అమర్చి ఇచ్చే వంట వాళ్ళపై మనం ఆధారపడాలి
  • మన ఆహార్యం బాగా ఉండాలి కాబట్టి మంచి బట్టలు కట్టుకునే మనకు బట్టలు ఇచ్చే వారిపై మనం ఆధారపడాలి
  • దినచర్యలో అవసరమైన శుబ్రమైన వాతావరణం తెచ్చి పెట్టె పని వారిపై మనం ఆధారపడాలి
  • మనకు ఇంతమంది చేస్తున్న సహాయాన్ని అర్దవంతమైన ప్రతి సహాయం చేయ్యడానికి మనకు ఓ పని కావాలి కాబట్టి మనకు పని ఇచ్చే వాళ్ళపై మనం ఆధారపడాలి
  • ఇంత చేసి ప్రశాంతంగా నిద్రపోవడానికి తోడు కావాలి. అలాంటి తోడుపై మనం ఆధారపడాలి, ఆ తోడు
    ** పిన్న వయస్సులో తల్లితండ్రులు
    ** యుక్తవయస్సులో చెలి(కాడు) తలపులు
    ** యవ్వనంలో ప్రియు(డు)రాలు సాంగత్యం
    ** మలి వయస్సులో పిల్లలో / మనుమలో / అనుభూతులో / జ్ఞాపకాలో / మరేమైనా ..

ముగింపుగా, మనం ఎంత తక్కువ ఆధారపడి.. ఎంత ఎక్కువగా ఆధారపడే అవకాశం ఇస్తామో మనం అంత గొప్ప వాళ్ళం మరియు అది మన వ్యక్తిత్వాన్ని తెలియ జేస్తుంది అని నా అభిప్రాయం. మరి మీరేమంటారు?

10, జనవరి 2010, ఆదివారం

తప్పిపోయినారు - పట్టి ఇచ్చిన వారికి బహుమానం

పై చిత్రం లో ఉన్న వ్యక్తి 2008 క్రిస్మస్ రోజునాటి నుంచి కనబడుట లేదు. కావున ఎవ్వరికైనా కనబడితే తెలియ జేయగలరు. పట్టి ఇచ్చిన వారికి తగిన బహుమానం. [[Wanted only  alive]]
.
.
.
.
నాయినా.. నువ్వు ఎక్కడ ఉన్నా కొంచం కనబడు.. నువ్వులేక మా ప్రక్క ఇంట్లో అంతా బెంగ పెట్టుకున్నారు. వాళ్ళింట్లోని రామ చిలుక కూడా పారిపోయింది. కావున ఎక్కడ ఉన్నా వచ్చేయ్.. నిన్ను కొట్టము తిట్టము.

ఇట్లు
శ్రేయోలాభిలాషి

 

గమనికః ఇది ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశ్యంతో వ్రాసినది కాదు. It is an attempt to rebuild the interface with his person, with whom I lost contact with since Dec 2008 . తప్పుగా అనిపించిన యడల మన్నించండి.

13, సెప్టెంబర్ 2009, ఆదివారం

నా వల్ల అవుతుందా!!

నా జీవితంలో కొన్ని కొన్ని కోరికలు తీరకుండా పోతానేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అలా అని చెప్పి గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు కానీ తీరడానికి అనువైనవే అని చెప్పొచ్చు. అలాంటి వాటిల్లో ఒకటి నా కుటుంబం పిల్లల్లు గురించి నేను ఈ క్రింది విధంగా చెప్పుకోవాలని కోరిక

 

నేను.. చదువు రీత్యా పోస్టు గ్రాడ్యుయేట్.. వృత్తి రీత్యా బ్రమ్మి.. ప్రవృత్తి రీత్యా నృత్యకారుణ్ణి.. వీలైతే చదరంగంలో క్రీడాకారుడిగా రిటైర్ అవ్వాలని కలలు కంటున్నవాడిని. హాపీలీ మారీడ్ టు ఏన్ ఇన్డిపెన్‍డెంట్ టెక్నికల్ కాంన్సల్టెంట్. మాకు ఓ కూతురు  మేము మరో అమ్మాయిని దత్తత తీసుకున్నాం. వీరిద్దరినీ చక్కగా చదివించాం. వీరి భవిష్యత్తు వీరి చేతుల్లో ఉంచి మేము ఈ తనువు చాలించాం

 

పైన పరిచయ కార్యక్రమం లో చాలా “నేను” దాగి ఉంది కదా.. ఏమి చేస్తాం.. స్వార్ధం... ఈ సదురు నేను నుంచి ఎంత ప్రయత్నిస్తున్నా బయటకు రాలేక పోతున్నాను. ఇప్పటికే మూడింట రెండొంతుల జీవితం అయిపోయింది. ఇప్పటికైనా నేను లోంచి మేము లోకి ఎప్పటికి వస్తానో అర్దం కావటం లేదు. ఏది ఏమైనా, ఈ కోరికలు తీరనంతగా లేవని నా అభిప్రాయం.

 

మరి మీరేమంటారు?

26, ఫిబ్రవరి 2009, గురువారం

మంత్రాలయం వెళ్ళివచ్చాము – విషేశాలు : మొదటి భాగం


ఈ పుట వెనుక చాలా కధ ఉంది, కానీ అది ఇక్కడ అప్రస్తుతం. ఇక్కడ పస్తుతమైనది ఏమిటంటే, ఆలోచనా తరంగాలుగా బ్లాగుతున్న మరో తెలుగు బ్లాగరు, తెలుగు యోగి, శ్రీ సత్యన్నారాయణ శర్మగారు మరియు వారి స్నేహాతత్పరత.

వీరి బ్లాగులో ’ఎస్ జానకి గారితో ప్రయాణం’ అన్న పుటలో వీరు మంత్రాలయం నుంచి గుంతకల్లు వరకూ ప్రయానిస్తుంటే అనుకోకుండా ఎస్ జానకి గారు అందులో ఉన్నట్లు, వీరు వెళ్ళి జానకి గారితో కొద్ది సేపు మాట్లాడినట్లు వారి మధుర క్షణాలను గుర్తుకు తెచ్చు కున్నారు. ఇది చదివిన తరువాత మంత్రాలయం వెళ్ళే విషయంలో వీరిని సంప్రదించాలి అనుకున్నాను. అనుకున్నదే తడవుగా వీరిని సంప్రదించేప్రయత్నంలో పడ్డాను. వీరికి ఫోన్ చేసి, అయ్యా నేను మంత్రాలయం వెళ్ళాలి అనుకుంటున్నాను, కొంచం వివరాలు తెలియ జేయ గలరా అని అడిగాను. అంతే అన్నదే తడవుగా, మీకు ఈ విషయాలు నేను చెబితే అర్దం కావు కానీ, ఎప్పుడు వద్దాం అనుకుంటున్నారో చెప్పండి మిగతావి నేను చూసుకుంటాను అన్నారు. అంటూనే.. మీరు మంత్రాలయం వచ్చేటప్పటికి అర్దరాత్రి అవుతుంది, అందుకని మీ కోసం అక్కడ ఒక రిటైరింగ్ రూమ్ అట్టి పెడతాను. మంత్రాలయం లొ దిగగానే నేరుగా బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్ళండి. అక్కడ డ్యూటీలో ఉండే టీటీ కి మీపేరు చెప్పండి, ఆయన మీకు ఆ రూమ్ ఇస్తారు. చక్కగా ఉదయం వరకూ విశ్రాంతి తీసుకోండి. ఉదయం మీ కోసం అక్కడ ఒక వ్యక్తిని ఎరేంజ్ చేస్తాను, అతను మిగిలిన విషయాలన్నీ చూసుకుంటాడు .. అంటూ ముగించారు. ఏమిటో ఇలా అన్నారు అని మనసులో ఉన్నా భారం దేవుని మీద వేసి బయలు దేరాను.

హైదరాబాదు నుంచి రాయగడ ఎక్సుప్రస్ మంత్రాలయం మీదుగా వెళ్ళుతుందని తెలిసి ముందుగా రిజర్వేషన్ చేయించుకున్నాను. చక్కగా శని వారం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు బేగం పేట రైల్వే స్టేషన్ నుంచి మా ప్రయాణం మొదలైంది. రాత్రికి ప్రయాణం మధ్యలొ తినడానికి ఏమైనా దొరుకుతాయో లేదో అని ఓ టిఫిన్ బాక్స్ నిండా పులిహోర చేసుకుని బయలు దేరాము. అలా నిదానంగా ప్రశాంతంగా మొదలైన మా ప్రయాణం ఆద్యంతం ఇలాగే సాఫీగా చక్కగా సాగి పోనుందని మాకు అప్పడు తెలియలేదు.

మంత్రాలయం చేరుకునేటప్పటికి అర్ద రాత్రి అవుతుందని టీటీ చెప్పగానే నిద్రని ఆపుకుని మెలుకువగా ఉండి వచ్చే పోయ్యే స్టేషన్ పేర్లను మననం చేసుకుంటూ కాలం గడిపేయ్యడం మొదలు పెట్టాను. మా దురదృష్టవశాత్తు ఆరోజు రాయగడ ఎక్సుప్రస్ ఓ గంట ఆలస్యంగా నడుస్తోంది. అలా మేము సమయాన్ని లెక్కపెడుతూ సాగిస్తున్న మా ప్రయాణంలోని మొదటి మజిలీ రానే వచ్చింది. అప్పటికి మధ్య రాత్రి దాటి గంటన్నరైంది. సత్యన్నారాయణ శర్మ గారు మాతో చెప్పినట్లుగా మంత్రాలయం లో దిగగానే నేరుగా టీటీ దగ్గరకు వెళ్ళగానే చక్కగా మాకోసం బుక్ చేసిన రూమ్ తాళాలు ఇచ్చారు. అక్కడి రిజిస్టరులో మా చిరునామా వ్రాసి, అద్దె క్రింద ఓ వంద రూపాయలు జమ చేసి మెల్లగా మా గదికి చేరుకుని నిద్రకి ఉపక్రమించె సమయం లో ఎవ్వరో తలుపు తట్టారు. ఈ సమయంలో ఎవ్వరై ఉంటారా అని అనుకుంటూ, తలుపు తెరిచాను.

ఎదురుగా ఓ పెద్దాయన, “నాపేరు ప్రకాష్.. మీరు రేపు గుడికి ఎన్ని గంటలకు వెళతారు?” అని ప్రశ్నిస్తూ కనబడ్డారు. నిద్ర మత్తులో ఉన్నానేమో, ముందు కొద్ది సేపు ఏమీ అర్దం కాలేదు. మెల్లగా తేరుకుని,

“ఏడు గంటలకల్లా మేము సిద్దంగా ఉంటాము. ఆ తరువాత ఆలోచిద్దాం తదుపరి కార్యక్రమం” అనగానే,

“సరేనండి. ఉదయం కలుస్తాను.. ఉంటాను..” అంటూ సెలవు తీసుకున్నారు, సదురు ఫ్రకాష్.

అలా ఆ రాత్రి అక్కడ విశ్రాంతి. మరునాటి విషయాలు మరో పుటలో.

19, ఫిబ్రవరి 2009, గురువారం

పిల్లలూ! మీకో లేఖ..

మీరు రోజులు పసిగొడ్డుగా ఉన్నప్పుడు,

తెరిచీ తెరవని అరమోడ్పు కళ్ళతో (మమ్మల్ని) చూస్తుంటే, అన్నీ మరచిపోయే ఓ తల్లి వ్రాసే లేఖ..

మీకు నెలలు నిండుతూ మొదటి సంవత్సరం పుట్టిన రోజునాడు మీరు ఏవేవో శభ్దాలు చేస్తూ ఉంటే, మురిసిపోయే ప్రతి తండ్రీ వ్రాసే లేఖ..

మీకు నామకరణం చేసి, మా పేరును మీకు ఆపాదించినందుకు.. అలాగే మా స్వార్దాన్ని మీ ద్వారా చూపించుకున్నందుకు, మమ్మల్ని శిక్షించకండి..

మీకు ఎలా అక్షరాభ్యాసం చెయ్యాలి.. ఏ  చదువు చదివించాలి.. ఏ పాఠశాలైతే భవిష్యత్తు చదువుకు బాగుంటుంది.. వంటివి  కూడా మేమే నిర్ణయించి, చదివే బడిని కూడా మేమే ఏకపక్షంగా నిర్ణయించి నందులకు, మమ్ములను ఈ వృధాశ్రమంలో ఏకాకులను చేసి శిక్షించకండి..

మీరు కష్టపడి పరుగెత్తి పరుగు పందెంలో బహుమతులు తెస్తే, అది చూసి మురిసి పోయి, “నా బిడ్డ..” అంటూ అక్కడ కూడా ఆ గొప్పదనాన్ని మాది అని, మీ శ్రమను కొట్టేసిన మమ్ములను ఈ కడపటి పయనంలో ఒంటరిని చేసి ఇక ఇప్పుడు మీరు పరుగెత్తండి చూద్దాం అని శిక్షించకండి..

పాఠశాల చదువులు పూర్తై కళాశాల చదువుల విషయానికి వచ్చినప్పుడు, “అమ్మా నాకు లెక్కలు అర్దం కావటం లేదు.. నాన్నా నేను సైన్సు తీసుకోను..” అన్నా వినకుండా, మిమ్ములను మంచి చదువు చదివించాలన్న తాపత్రయంలో, ఇప్పుడు మీకు కాసులు కురిపించే చదువులను మీ చేత అతి కష్టం మీద (మా బలవంతం మీద మీకు) రుబ్బించినందులకు, మమ్ములను ఈ ఙ్ఞాపకాల బడిలో పాత శ్మృతులను నెమరు వేయ్యమంటూ శిక్షించకండి..

కళాశాల చదువులు పూర్తై విశ్వవిధ్యాలయాలలో విధ్యనభ్యశించే విషయంలో పరదేశానికి వెళతానన్నప్పుడు, మాకు దూరంగా వెళ్ళిపోతావా అన్న మాభయం.. మాకు ఎల్లప్పుడూ దగ్గరగా ఉండాలి అన్న మా స్వార్దం మీకు కనబడనీయ్యకుండా, ఆర్దికంగా కొంచం కష్టమైన పని అయినా సంతోషంతో పరదేశానికి పంపించిన మమ్ములను ఆర్ధికంగా అన్నీ ఇస్థున్నాంగా అంటూ శిక్షించకండి..

మాకు నచ్చే పిల్లని లేదా పిల్లాడిని చేసుకుంటారు అని అనుకునేంతలో, “అమ్మా!! ఇదిగో మీ కోడలు..” అనో.. “నాన్నా!! నేను ఈ అబ్బాయినే చేసుకుంటాను..” అంటూ మన కుటుంబ సంస్కృతి ఏమిటో తెలియని వాళ్ళని తెచ్చినప్పుడు మేము కించిత్తు భాధ పడ్డ మాట నిజమే అయినా మీ జీవితానికి మేమెప్పుడూ అడ్డు కాదే, మాతో ఒక్క సారి సంప్రతిందించి ఉంటే బాగుంటుంది కదా అని మేము భాధ పడ్డాము అని చెప్పినందుకా మా కీ శిక్ష..

ఏది ఏమైనా.. ఒక్క మాట.. ఒక్క విన్నపం.. ఒక్క వేడుక..

జీవితం చాలా పెద్ద ప్రయాణం. చివ్వరి దాకా మనం ఇరువురం కలసి ప్రయాణించలేం.. కానీ, ఈ పెద్ద ప్రయాణంలో..

మాకు వయస్సు ఉన్నప్పుడు మీకు మేము చేయూత.. మాకు వయస్సు ఉడిగినప్పుడు మీరు మాకు చేయూత..

కనీసం రోడ్డు దాటేటప్పుడైనా మా చేయ్యి పట్టుకోండి.. ఈ కట్టేను మోసేందుకు మాత్రమే కాదు మీరు మాకు కావల్సింది.. ఈ కట్టే తుళ్ళి తూలి పడకుండా నిలిపేందుకు మీ ఆసరా కావాలి.

తల వాల్చి కన్ను మూయ్యడానికి మీ భుజం కావాలి..

కన్ను తెరిస్తే పలకరించడానికి మీరు కావాలి..

కావాలి.. మీరు కావాలి.. తిట్టేందుకైనా.. కొట్టేందుకైనా.. పెట్టేందుకైనా.. పెట్టించేందుకైనా.. మీరే కావాలి..

వస్తారు కదూ..

రెండు + రెండు కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం..

9, ఫిబ్రవరి 2009, సోమవారం

మా ఊరు వెళుతున్నానోచ్

వచ్చే వారాంతంలో నేను మా ఊరు వెళుతున్నాను. మా ఊరు అంటే, నేను పుట్టి పెరిగిన ఊరు కాదు కానీ, మా పూర్వీకులు ఉన్న ఊరు అన్నమాట. నిజానికి మా ముందు తరం లోని మా నాన్నగారు అక్కడ పుట్టలేదు, కానీ మా తాతగారు కాలం చేసేంత వరకూ అక్కడే గడిపారు. అక్కడే కాలం చేసారు. అక్కడే కరణంగా పనిచేసారు.

ఏదో ఆనందం... ఎందుకో తెలియదు.. కానీ ఆనందం. అక్కడ నేను పుట్టలేదు, పోనీ అక్కడ పెరిగానా!! అంటే, అదీ కాదు. ప్రతీ సంవత్సరం సెలవులకు అక్కడకు వెళ్ళే అలవాటు ఉందా అంటే, అదీలేదు. ఏదో పండగకో పబ్బానికో వెళ్ళినట్లు చూచాయగా ఒకటో రెండో అనుభవాలు లీలగా గుర్తుకు వస్తున్నాయి. అయినా ఎందుకీ ఆనందం? మా చిన్నాన్న ఒక్కడే అక్కడ ఉంటున్నాడు. చిన్నాన్నా మరియు పిన్నీ తప్ప అక్కడ మరెవ్వరూ ఉండటం లేదు. మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి, వరసకు తమ్ముడు కూడా ఇక్కడే, అంటే హైదరాబాద్‍ లోనే ఉద్యోగం చేసుకుంటున్నాడు. వీడికి ఒడుగు చేస్తున్నారంటూ పిన్ని ఫోన్ చేసి చెప్పిన తరువాత వెంటనే రైల్ రిజర్వేషన్ చేయించాను. మాకంటూ అక్కడ అస్తిపాస్తులు ఏమీ లేవు.. కానీ ఎందుకీ ఎదురు చూపులు??

అక్కడి మట్టితో ఎటువంటి అనుబందం లేదే.. కానీ ఎందుకీ ఎదురు చూపులు?? ఎప్పుడో కాడి కట్టుకుని నీళ్ళు మోసినందుకా!!! లేక వేరుశనగ చేలోకి వెళ్ళి దొంగతనంగా వేరిశనగ కాయల మొక్కలు పీకి కాల్చుకుని తిన్నందుకా!!! లేకపోతే పెరడులో కాచిన పుచ్చకాయలను కోసుకు రమ్మన్నప్పుడు, కోసిన పుచ్చకాయను మొయ్యలేక మీదవేసుకుని చతికిలపడ్డ వైనం మరోసారి గుర్తుకు తెచ్చుకునేందుకా!! నాకు సీతాఫలాలు అంటే చాలా ఇష్టం. మా వూళ్ళో ఎవ్వరూ వాటి గురించి పట్టించుకోరు. ఎందుకంటే, ఎవ్వరి పెరడు చూసినా తప్పకుండా కనబడుతూనే ఉంటాయి. ఎన్ని సార్లు గంపలు గంపలు సీతాఫలాలు బ్రేక్ ఫాస్ట్‍గా లాగించామో గుర్తు తెచ్చుకునేందుకా!! ఎండాకాలంలో లేత లేత ముంజికాయలను బ్రొటన వ్రేలితో జుర్రుకుని తిన్న పొలం గట్ల వెంబడి పరుగు తీసేటందుకా!! పండిపోయిన తాటి ముంజి కాయలను కాల్చి రశం తీసుకుని మామిడి చెట్టు కొమ్మల మీద కోతీ కొమ్మచ్చి ఆట ఆడిన రోజులను మర్చిపోకుండా పదిలంగా పదికాలాల పాటు భద్ర పరచుకునేందులకు.. వెళ్ళుతున్నా.. వెళ్ళుతున్నా.. మా ఊరు వెళ్ళుతున్నా..

ఇంతకీ ఏ ఊరో చెప్పలేదు కదా.. ఏలూరు దగ్గరున్న దెందులూరు మండలం పరిధి లోని చల్ల చింతల పూడి.   ఈ పర్యటన తరువాత వికీ పీడియాలో మరిన్ని వివరాలు పొందు పరుస్తాను.

 
Clicky Web Analytics