అర్దం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అర్దం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, నవంబర్ 2012, సోమవారం

గాయత్రీ మంత్రం .. ఇందుకా!!

గాయత్రీ మంత్రం.. ఎలా మొదలు పెట్టాలి అన్న ఆలోచనతో సతమతమౌతున్నప్పుడు, ఉన్నదేదో సూటిగా చెప్పేస్తే పోలా అన్న ఆలోచనతో ఎక్కువ చించకుండా మొదలుపెట్టేసాను.

 

ఉపోద్ఘాతం:

ఓ పెద్దాయన, గాయత్రీ మంత్రాన్ని తన ఇంట్లో కాలింగ్ బెల్ యొక్క సౌండుగా పెట్టుకున్నారు.

ఓ పెద్దాయన, గాయత్రీ మంత్రాన్ని తన సెల్ ఫోన్ రింగ్ టోనుగా పెట్టుకున్నారు.

ఓ పెద్దావిడ, గాయత్రీ మంత్రాన్ని తన ఫోన్ కాలర్ టోనుగా పెట్టుకున్నది.

ఓ కుర్రవాడు, గాయత్రీ మంత్రాన్ని తన కారు రివర్స్ చేసుకునేటప్పుడు హెచ్చరిక చేసే విధానంగా వాడుకున్నాడు.

ఓ యువతి, గాయత్రీ మంత్రాన్ని నలుగురు వినేటట్టు ఓ లౌడ్ స్పీకర్లో పొద్దు పొద్దునే పెట్టేసింది..

..

..

 

ఇక అసలు భావన

గాయత్రీ మంత్రం అనేది జగమెరిగిన రహస్యం. అట్టి గాయత్రిని ఉపనయన సంస్కరం అప్పుడు తండ్రి మాత్రమే చెప్పాలి, కొడుకు మాత్రమే వినాలి అన్నది ఆచారం. ఆ పద్దతిలో ఉపనయన క్రతువు జరిపించే బ్రహ్మగారు కూడా వినకూడదు అన్నట్లుగా, కొడుకు చెవిలో గాయత్రిని ఉపదేశించే తండ్రిని గోప్యంగా ఉంచాలన్న ఉద్దేశ్యంతో, వారిని కప్పుతూ ఉండే విధంగా ఓ పంచని కప్పుతారు. ఇది ఎన్నో ఏళ్లుగా వస్తున్న విధి విధానం. అందరూ పాటిస్తున్నా, ఈ విషయం తెలిసిన వారు కూడా ఖండించ కుండా మౌనం వహించి బ్రతకడం అంగీకరించ లేక పోతున్నాను.

ఎన్నో విషయాలు తెలిసాయి అనుకుని బ్రమ పడేవారు సైతం ఈ విషయాన్ని విశ్మరించి, జీవిస్తూ పెద్దవారిగా చెలామణి అవుతుంటే, అసహ్యం వేస్తోంది. వివరించి చెబుదాం అని ప్రయత్నం చేయ్యబోతే, వయస్సు రీత్యా చిన్నవాడివి నాకు చెప్పేంత సాహసం చేస్తావా అని దబాయించి బ్రతికేస్తున్నారు. చెట్టుకీ పుట్టకీ వస్తాయి, ఆలెక్కలో వేసుకుని ముందుకి సాగి పోతే సరి.

అందువల్ల చెప్పొచ్చినది ఏమిటంటే, సంస్కృతి అనేది ఒకటి ఉంది అని తెలుసుకుని ఆ విధంగా చేసేసుకుందాం.

17, ఏప్రిల్ 2011, ఆదివారం

దైవం – విలువ ఎంత?

దైవంపై పలు ఆలోచనల తరువాత, లెక్కా పత్రాలు అడిగే వారికోసం ఈవిధంగా సమాధానం ఇస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచనలలోంచి ఉద్బవించినదే ఈ పుట. దైవం గురించి ఆలోచనలకు రూపం ఇచ్చే ప్రయత్నంలో కొన్ని నిజాలను ప్రతిపాదించిన మహాను భావుల ఆలోచనలను మనం ఎలా ఊహించుకుని అర్దం చేసుకోవాలో చెప్పే ప్రయత్నంలోంచి అనుకోకుండా మరో ఆలోచన ఉద్బవించింది. ముందుగా క్రిందటి పుటలోంచి ఉద్బవించిన ఆలోచన.

నిజానికి ఎలక్ట్రాన్ అనేది ఉందని ఎవ్వరు చూసారు? భూమి గుండ్రంగానే కాక ఎలిప్టికల్ ఆకారంలో ఉందని ఎవ్వరు చూసారు?  గురుర్వాకర్షణ శక్తి గురించి చేసిన ప్రతిపాదనను మనం ఎలా నమ్మాలి? ఇంకా వగైరా వగైరా.. ఇవన్నీ చార్వాకుల ఆలోచనలు. ఇంతకీ ఈ చార్వాకులెవ్వరు? వారి సిద్దాంతం ఏమిటి? అని ఆలోచిస్తే .. ముందుగా చార్వాక సిద్దాంతం బయట పడుతుంది. ఆ తరువాత వీరి నేచర్ అర్దం అవుతుంది.

ఏదైనా విషయాన్ని తమ కళ్ళద్వారా చూచి నమ్మేవారిని చార్వాకులు అని అంటాము. ఉదాహరణకి భారతీయ సంసృతి ప్రకారం ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఆ తప్పుని చేస్తున్న వారు ఆ తప్పుని చేస్తున్నప్పుడు చూసిన సాక్షులు కావాలి. అలా సాక్షం ఉన్నప్పుడే నిజ్జంగా ఆ తప్పు జరిగినట్లు మన రాజ్యాంగం తీర్పునిస్తుంది. ఈ విధంగా చార్వాకులు అనే వారు ఎవ్వరంటే, చక్రవర్తి అనేవాడు ఈ పోస్ట్ వ్రాసాడు అని అంటే, చక్రవర్తి వ్రాస్తున్నప్పుడు నేను చూడలేదు కాబట్టి నేను నమ్మను అనేవారి. ఒకవేళ చక్రవర్తి నిజ్జంగా ఈ పోస్టు వ్రాస్తున్నప్పుడు వీరు చూచి ఉంటే, అప్పుడు వీరు నమ్ముతారు అన్నమాట.

ఇలాంటి చార్వాకులే కొన్ని సార్లు మనకి మేలు చేస్తుంటారు, కానీ చాలా సార్లు (అంటే దాదాపుగా అన్ని సార్లు) మనకు నష్టాన్నే కలిగిస్తారు. ఉదాహరణకి నన్నయ్య గారిని మన ప్రభుత్వం ఆది కవి అని గౌరవిస్తే, అసలు నన్నయ్య అనే వాడు లేడు అందువల్ల ఇలాంటి ఆలోచన వ్యర్దం అని వాదించే వారు. అదిగో అలాంటి ఆలోచనే ఖచ్చితంగా “దేవుడు లేడనే” వాదన. “దేవుడనే వాడు నిజ్జంగా ఉంటే కనబడమనిండి చూద్దాం!!” అని వితండంగా వాదించేవారు. క్రిందటి పుటలో Physics / Geology / Education / వంటి వాటి గురించి సున్నితంగా సృజించాను. ఇప్పుడు Mathematics పరంగా లెక్కలేసే ప్రయత్నం చేస్తాను.

మనం ఎప్పుడైనా లెక్కలలో ఏదైనా తెలియనప్పుడు దానిని X (ఎక్స్) అనుకుంటాం. అలాగే ఈ దైవాన్ని ప్రస్తుతానికి X అనుకుందాం. అలాగే ప్రతీ మనిషికీ ఓ విలువ ఉంటుంది. ఈ విలువ వారు చేసే పనిని బట్టి ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాం అనుకోండి మనచేత ఉద్యోగం చేయించుకునే వ్యవస్థ మన విలువను లెక్కగట్టి నెలకు ఇంత ఇస్తాం అని నిర్ణయిస్తారు. ఆ విలువను Y అనుకుందాం. ఇప్పుడు నాకు అక్కడ చేసే పనిలో దైవం తోడైయాడనుకుందాం అప్పుడు నా విలువ ఏమిటంటే

నా విలువ =  X (దైవం విలువ) + Y (నాకు ప్రపంచం కట్టిన విలువ)

ఆ విధంగా నావిలువ Z అనుకుందాం. Mathematics సూత్రాల ప్రకారం  Z = X + Y

ఇప్పుడు దైవం లేదనుకుందాం. దైవమే లేదనుకుంటే, దైవానికి విలువకూడా లేనట్టే కదా, అందువలన Z = Zero + Y, కాబట్టి

Z = Y

కానీ ఒక్క సారి ఇలా ఆలోచించండి. దైవం ఉండటం వల్ల దైవానికి ఓ విలువ ఉంటుంది కదా, అందువల్లన Z = SomeValue + Y, కాబట్టి

Z ≠ Y

నేను పాజిటివ్‍గా ఆలోచించే వాడిని కాబట్టి ఇంతకు ముందు చెప్పిన ప్రతిపాదనలోని SomeValue అనేది తప్పనిసరిగా అది సున్నాకన్నా ఎక్కువే ఉంటుంది అని అనుకుంటాను. ఆ విధంగా SomeValue అనేది అధమ పక్షంలో 1 అయినా

Z = 1 + Y

నేను నెగెటివ్‍గా ఆలోచించే వారి గురించి ఇక్కడ ప్రస్తావించను. ఇప్పుడు అన్ని లెక్కలు అయినాయి కాబట్టి, ఒక సూటి ప్రశ్న. నిజ్జంగా దేవుడు లేడనుకుంటే, నాకు పోయిన నష్టం ఏమీ లేదు. అదే కనుక దేవుడు లేడనుకున్న తరువాత దైవం ఉంది అని తెలిసందుకోండి అప్పుడు ఆ దైవం విలువ నాకు కలవక పోవడం వలన నాకు ఉండవలసిన విలువ తగ్గిపోయినట్లే కదా?

13, ఏప్రిల్ 2011, బుధవారం

దైవం – ఆలోచనల రూపం

దైవం గురించి వ్రాయడానికి నాకు అంత ఙ్ఞానము లేదు అలాగే అంతటి సాహసము చెయ్యలేను. కాకపోతే ఇంతకు ముందు నేను వ్రాసిన కొన్ని పుటల వెనుక దాగి ఉన్న వివరానికి ఒక రూపం ఇచ్చే ప్రయత్నంలో ముందుగా కొన్ని పుటలను ప్రశ్నలుగా వ్రాసుకుని వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేసాను. వాటికి ప్రప్రధమంగా నన్నయ్యగారిని హైలేట్ చేస్తూ వ్రాసాను. నన్నయ్యగారిని ఆదికవిగా నేను ఒప్పుకోను అని వ్రాసిన పుటకి ఎందరో స్పందించి వారి వారి అభిప్రాయాలు తెలియజేయడమే కాక పలు విభిన్న కోణాలను సృజించారు. అంతే కాకుండా తెలుగులో నన్నయ్యగారికన్నా ముందు అధర్వణాచార్యుడు అనే మహా వ్యక్తి గురించి కూడా ప్రస్తావనకొచ్చింది. కొన్ని చర్చలు ఇక్కడ అప్రస్తుతం అయినా, ప్రతీ వ్యక్తి ఆలోచనలు ఈ విధంగా రూపం దిద్దుకున్నాయి అని చెప్పడానికి కొన్ని కొలమానాలు ఉంటాయి.

మూల విషయానికి వెళ్ళేముందు, ఓ సున్నితమైన విషయాన్ని నాకు తెలిసినంత వరకూ వివరంగా వ్రాసే ప్రయత్నం చేస్తాను. ఏ వ్యక్తి అయినా ఏదైనా విషయాన్ని ఎలా నేర్చుకుంటారు?

ఇది చాలా పెద్ద విసృతమైన చర్చ. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్టు, తెలివైన వాడు ఎదుటి వాడి అనుభవం నుంచి నేర్చుకుంటాడు.. అలాగే తెలివి తక్కువవాడు స్వానుభవం చేత నేర్చుకుంటాడు అని. దీని గురించి ఇంతకు మించి వ్రాయదలచుకోలేదు అన్నంత మాత్రాన ఈ సామెతతో ఏకీభవించినట్టు కాదు అలాగే విభేదించినట్టుకూడా కాదు. దీని గురించి వ్రాస్తూ పోతే అసలు కధ మఱుగున పడిపోతుంది. అందుకన్నమాట.

ప్రతీ వ్యక్తీ చిన్నప్పటి నుంచే నేర్చుకుంటూ పెరుగుతారు. ఎప్పుడైతే నేర్చుకోవడం మానేస్తారో అప్పుడు ముసలి తనం వచ్చిందని నా అభిప్రాయం. ఇలా నేర్చుకునే ప్రయత్నంలో కొన్ని మనం చదివి నేర్చుకోవాలి, చాలా కొద్ది విషయాలు మాత్రం అనుభవించి నేర్చుకోవాలి, మరి కొన్ని విని నేర్చుకోవాలి, ఇంకా కొన్ని చూచి నేర్చుకోవాలి, అలాగే మరిన్నిటిని నమ్మి నేర్చుకోవాలి. చాలా విషయాలను మన సంస్కారం మనకు నేర్పిన విఙ్ఞతను ఆధారంగా తీసుకుని, నేటి సమాజంలో ఉన్న ధర్మాన్ని బేరీజు వేసుకుని మనం ఒక నిర్ణయానికి వచ్చి నేర్చుకోవాలి.

వీటిలో ఉదాహరణకి, భూమి గుండ్రంగా కాకుండా ఎలిప్టికల్ ఆకారంలో ఉంది అని చూచిన వాళ్ళు ఎంతమందో చెప్పండి చూద్దాం. భారత దేశ జనాభాలో నేటికి నూట ఇరవై కోట్ల జనాభా ఉన్నట్లు అంచనా. ఎంత మంది నిజ్జంగా ఆకాశంలోకి వెళ్ళి భూమిని చూచి వచ్చారో చెప్పండి? కానీ భూమి ఇలాగే ఉందన్న విషయాన్ని భారతదేశ జనాభా అంతమందీ ఒప్పుకుంటారు. ఎలా అబ్బా?? వీరందరు ఆకాశంలోకి వెళ్ళి చూచారా!! లేదే.. కానీ చూచి వచ్చిన వారు మరియు పరిశోధనలు చేసిన వారు ప్రతి పాదించిన విషయాన్ని నమ్మి ఒప్పుకున్నారు.

ఇంకొకటి, ఎలక్ట్రాన్ అనేది ఉంది అని అందరూ నమ్ముతారు. లేకపోతే మనకు విద్యుత్ అనేది ఉండదు. కానీ ఎంతమంది ఈ సదరు ఎలక్ట్రాన్ అనేదానిని చూచారో చెప్పమనండి. ఒక్కరు కూడా మనకు కనబడరు. ఆఖరికి దానిని కనిపెట్టిన వారుకూడా దానిని చూడలేదంటే అది అతిశయం కాదు. కానీ ఎలక్ట్రాన్ ఉందని దానికి రెండు విధాలైన ప్రవర్తన ఉంటుంది అని, అవి మనకు చాలా ఉపయోగకరమైనవని అని అందరూ నమ్ముతారు. ఈ విషయాన్ని మనం విని నేర్చుకున్నాం అలాగే చదివి నేర్చుకున్నాం. అంతే గాని ఎలక్ట్రాన్ ద్వారా వచ్చే షాక్ మనకు అనుభవంలోకి రావాలనుకోకూడదు.

మరొకటి, నిప్పు పట్టుకుంటే కాలుతుందని ప్రతీ వ్యక్తి నేర్చుకున్నదే. మొదటగా వీరు చదివి నేర్చుకున్నా, ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలో నేర్చుకున్నదే. ఆ అనుభవానికి చిన్న నిప్పురవ్వైనా సరే లేక వంటింటిలోని పొయ్యిపైన ఉన్న మంటైనాసరే లేదా మరేదైనా ప్రతీ వ్యక్తికి అనుభవంలోకి వచ్చిందే. కాదనగలరా??

గురుత్వాకర్షణ శక్తి గురించి కలిగిన ఆలోచన వెనకాల ఓ మహానుభావుడైన సర్ ఐజక్ న్యూటన్ ఆలోచనా విధానం మనకు ఓ ఉదాహరణ. ఈ మహాను భావుడు విపరీతంగా ఆలోచించలేదు కానీ వైవిధ్యభరితమైన కొత్త కోణాన్ని సృజించారు. అంతే కాని ప్రకృతి కి విరుద్దమైన ఆలోచన చేసి ఎయిడ్స్ లాంటి రుగ్మతకు రూపం పొందించలేదు. ఎకే 47 సృష్టికర్త కూడా ఇలాంటి మారణాయుధాన్ని ఎందుకు కనుగొన్నానా అని విలపించాడు. న్యుక్లియర్ బాంబ్ కనుక్కొవడమెందుకు ఆ తరువాత అనుభవించడం ఎందుకు.

ఇక్కడ ప్రస్తుతమైన విషయం ఏమిటంటే, మన సంసృతి మనకు నేర్పించినదేమిటి? విధ్వంసాన్నా లేక వినాశనానికి దారి తీసే విషయాన్నా? ఒక వేళ మనం ఉన్న సమాజం మనకు అదే నేర్పుతుంటే, మన విఙ్ఞత మనకేం నేర్పుతోంది అని మనం ఆలోచించుకోవలసిన అవసరం మనకు లేదా? లేదు అనుకుంటే మనం కొత్తగా ఆలోచించం. అలాగే ఎవ్వరిని మనం ప్రశ్నించం. కానీ దైవం విషయంలో మాత్రం చాలా మంది ప్రశ్నిస్తున్నారే!! అదే ఇక్కడ హాస్యాపదం. పోనీ వారు పుట్టి పెరిగిన సమాజం లేదా వారి సంసృతి వారికి దైవం విషయం గురించి చెప్పలేదా అంటే అదేం కాదు, చిన్నప్పటి నుంచి చెబుతున్నా వినిపించుకోకుండా చెవిటి వాళ్ళై పెరిగారు.

ఇలాంటి వారిని చూస్తే నాకు చార్వాక సిద్దాంతం గుర్తుకు వస్తుంది. చార్వాకుల గురించి తరువాత వ్రాస్తాను. అంతవరకూ నేను గమనించిన దేవుళ్ళ గురించి ఓ పుట. ఆఖరుగా దైవం గురించి తెలుసుకోవాలంటే ముందుగా..

చదివి తెలుసుకోవాలి..

విని తెలుసుకోవాలి..

అనుభవంలోకి తెచ్చుకుని తెలుసుకోవాలి..

ఆఖరిగా ఓ సంసృతిని అలవరచుకుని తరువాతి తరాలికి ఆ సంసృతిని అందించాలి.

15, మార్చి 2011, మంగళవారం

దైవం – ఆలోచనల పరంపర

దైవం పై నేను చేసిన మొదటి పుట వెనకాల ఉన్న మూల ఆలోచనని ఇంతకు ముందు వ్రాసుకున్నాను. ఇప్పుడు రెండొవ పుట వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశ్యం వివరించే ప్రయత్నం చేస్తాను. ఒక్క సారి అవలోకనం చేసుకుంటే, మనల్ని ఇలా శపించేటోడు దేవుడా!! అన్న శీర్షిక వచ్చిన రెండొవ పుట వెనకా ఉన్న ఆవేదన అనాధలైన పసి పిల్లలు మఱియు వారి స్థితి. ఇదే పుటలో ప్రకృతిలో జరుగుతున్న ప్రళయాల గురించి ప్రస్థావన జరిగింది. వీటితో బాటుగా సృష్టిలోంచి ఉద్బవించిన వాటిని తమ శక్తులతో ప్రతి సృష్టి చేస్తున్నాం అని చెప్పుకుంటున్న బాబాలను ప్రశ్నించడం జరిగింది.

ఇక ప్రస్తుత విషయానికి వచ్చేముందు, ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలను ఙ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య వార్తలలో కనబడే అతి సాధారణ విషయాలలో మొదటిది దుర్ఘటనలు (యాక్సిడెంట్స్) మరొకటి హత్యలు. ఇలాంటి ఘటనలో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరి మరణానికి వారు అతివేగంగా ప్రయాణం చెయ్యడం కారణమైతే, మరి కొందరు దొంగతనానికి వచ్చిన దొంగల అసహనానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అతి వేగంగా ప్రయాణం చెయ్యడమెందుకు ఆపై దుర్ఘటన జరిగింది దేవుడు మమ్ములను కాపాడలేదు అని నిందించడ మెందుకని. అర్భాటాలకు పోయి మా ఇంట్లో ఇంత ధనం ఉంది అన్నట్టుగా నిండా దొంగ బంగారాన్ని దిగేసుకుని నలుగురిలో తిరగడమెందుకని ఆ తరువాత నలుగురి కళ్ళల్లో పడ్డట్టే దొంగల కళ్ళలో కూడా పడి దోపిడీకో లేక మరింకేమైన పోగొట్టుకోవడం ఎందుకో.

సరే ఈ విషయాలు ప్రక్కన పెట్టి మరో విషయం ప్రస్తావిస్తాను, ఈ మధ్య వచ్చిన వార్తలలో ఓ తల్లి తన కన్న బిడ్డలనే చంపేశిందని చదివాను. ఆ తల్లి ఎందుకు అలా చేసిందో అని విచారించే ముందు, మరో విషయం. హైందవులు పరమ పవిత్రంగా పూజించే గంగా దేవి తనకు పుట్టిన అష్ట వసువులను పుట్టంగానే చంపేసిందంట. మరి ఈ తల్లి ఎంతటి ఖటినాత్మురాలో కదా!?

ఇక్కడ ప్రస్తావించిన రెండు సంగతులూ చాలా మటుకు ఒకే రకంగా ఉన్నా, వాటి వెనకాల ఉన్న కారణాలు ఒక్కసారి గమనిస్తే.. మొదటి తల్లి ఈ భవ సాగరంలో తన బిడ్డలను సాకలేక తన బిడ్డలకు మృత్యువుని ప్రసాదిస్తే, మరో తల్లి విషయం గురించి పురాణం తెలిసిన వారిని ఎవ్వరినైనా అడిగితె వివరం అర్దం అవుతుంది. తెలుసుకోవాలన్న కోరిక ఉన్న వారు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తెలిసిన తరువాత అర్దం చేసుకుంటారు. తెలుసుకో్వాలని అనుకోనివారు గంగమ్మ మీద నిందలేస్తూ ఇలాగే ఇక్కడే ఉండి పోతారు.

ఇవన్నీ ఎందుకు నిన్నగాక మొన్న జరిగిన భూకంపం మరియు సునామి ధాటికి జపాన్లో వేలకొద్ది జనాలు మరణిస్తున్నారు. వేల కోట్ల సష్టం లెక్కల లోకి రానుంది. జపాన్ ఆర్దిక వ్యవస్థ 1987 తరువాత ఇంతగా క్షీణించింది లేదు. ఇవన్నీ ప్రకృతి వైపరిత్యాల వల్ల మనకు అనుభవంలోకి వస్తున్న మరియు వచ్చిన ఘటనలు. ఇంతకు ముందు కూడా ఇలాగే రెండొవ ప్రపంచ యుద్ధంలో చైనా జెపాన్లపై అమెరికా అణుబాంబు ప్రయోగించిన తరువాత చాలా కాలం పాటు ఈ రెండు దేశాలు నిలదొక్కుకోలేక పోయ్యాయి. కానీ ప్రపంచం అంతా ఇప్పుడు మెచ్చుకునే రెండొవ ఆర్దిక వ్యవస్థగా ఎదినది ఎవ్వరు? ఏదో దెబ్బ తగిలింది కదా అని ఏడుస్తూ కూర్చోకుండా పోరాడి ఎలాంటి పరికరాన్నైనా చవకలో తయ్యారైయ్యే విధానాలకు మారు రూపమైన చైనా మాన్యుపాక్చరింగ్ వ్యవస్థను మెచ్చుకోకుండా ఉండలేం కదా.

ఇలా ఏదైనా వైపరిత్యం జరిగినప్పుడు లేదా అనుకోని ఆపద వచ్చినప్పుడు దైవాన్ని నిందించడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్న వాళ్ళకి వివరం చెప్పే విధంగా ముందుగా వారిని ఆకుట్టుకునే ప్రయత్నమే నా మరో పుట, మనల్ని ఇలా శపించేటోడు దేవుడా!! అలాంటి వాళ్ళకు కొన్ని ప్రశ్నలు..

  • రెండొవ ప్రపంచ యుద్దంలో అణుబాంబు వేసినది దైవమా..
  • ఏయిడ్స్ కనుకొన్నది దైవమా..
  • బుద్దిగా సంసారం చేసుకుంటూ ఒక స్త్రీయందే రమించి పిల్లలను కనమని పెద్దలు చెబుతున్నా పెడ చెవిన పట్టి ప్రకృతికి విరుద్దంగా జంతువులతో సంయోగం చేసే వివరీత బుద్ది కలిగినది దైవానికా..
  • మన లాభం కన్నా పక్కవాడి నష్టమే ప్రయోజనంగా ఎదుగుతున్న న్యూక్లియర్ ప్లాంట్లను కూలగొట్టింది దైవమా..

అందుకే పెద్దలు చాలా సార్లు చెప్పారు, వినాశకాలే విపరీత బుద్ధి అని. “విపరీతంగా ఆలోచించడం దేనికి ఆపై విసుగు చెందడం దేనికి” అన్న విషయం ఎంతమందికి అర్దం అవుతుందో కదా!!

21, డిసెంబర్ 2010, మంగళవారం

ముక్తి అనగానేమి?

ఈ మధ్య నేను తెలుగు నిఘంటువులో పాలుపంచుకుంటూ తెలుగు పదాలను యూనికోడ్ ద్వారా వ్రాస్తున్నప్పుడు కలిగింది ఈ ప్రశ్న. ఓ సత్‍సంగంలో ఈ విషయమై చర్చ మొదలు పెట్టగా పలు పలు సమాధానాలు మరియు వివరణలు వచ్చాయి. వాటన్నింటిని క్రోఢీకరించి ఓ చోట ఉంచితే బాగుంటుంది అన్న ఆలోచన రూపమే ఈ పోస్టు.

ముక్తి గురించిన వివరాలు చదివే మీకు తెలిసే ఉంటాయి. కానీ నాకు తెలిసిన వివరాన్ని ఇక్కడ పంచుకుంటున్నాను. అసందర్బం అనిపిస్తే మన్నించండి.


ముక్తి అనేది రెండు స్థితులలో ఉంటుంది అని, “లేవండి మేల్కొనండి” అనే బ్లాగు రచయతైన సురేష్ బాబుగారు ఈ క్రింది విధంగా స్పందించారు.

1.జీవన్ముక్తి, అంటే జీవించి ఉండగానె పరమాత్మలో లేక ఆత్మానందం లొ నిమగ్నమై ఉండడం.
2.విదేహముక్తి, అంటే మరణించిన తర్వాత ముక్తి పొందడం.


చర్చలో పాల్గొంటూ, “వాగ్విలాసము” అని బ్లాగుతున్న ముక్కు శ్రీ రాఘవ కిరణ్ గారు తన అభిప్రాయాన్ని వారిమాటలలో..

చతుర్విధ ముక్తములు అనేవి సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుజ్యం. ఇవి ముక్తిభేదాలు కావనుకుంటా! తన్మార్గంలో వివిధస్థాయీభేదాలు అనుకుంటాను.

సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే

సామీప్యం శివభక్తిధుర్యజనతాసాంగత్యసంభాషణే

సాలోక్యం చ చరాచరాత్మకతనుధ్యానే భవానీపతే

సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థో೭స్మ్యహమ్

అని శివానందలహరిలో ఆదిశంకరులు స్తోత్రం చేస్తారు.

· నిరంతరసంకీర్తనం గుణగానం వలన సారూప్యం (ఆ గుణాలు అలవడటం) సిద్ధిస్తుంది.

· శివభక్తులతో నిత్యసాంగత్యం వలన సామీప్యం (దగ్గఱితనం) సిద్ధిస్తుంది.

· సమస్త చరాచరజగత్తునందూ శివునినే చూడటం వలన సాలోక్యం (కైలాసవాసం) సిద్ధిస్తుంది.

· తదనంతరం సాయుజ్యం (స్వామిలో ఐక్యమవ్వటం) సిద్ధిస్తుంది


చర్చలో ఆఖరున పాల్గొన్న లీలామోహనం బ్లాగరి చిలమకూరు విజయ మోహన్ గారు ఈ క్రింది విధంగా వారి అభిప్రాయాన్ని తెలియ జేసారు.

మోక్షము,కైవల్యం,సాలోక్యం,సారూప్యం,సామీప్యం గురించి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారి సమాధానాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

మోక్షమంటే విడుదల అని అర్థము. కర్మబంధమునుండి పూర్తిగా విడుదల పొందడాన్ని మోక్షమని రూఢిగ అంటారు. అలా కర్మబంధం తొలిగాక, రెండు స్థితులుంటాయి.

జీవుడు అర్చిరాది మార్గం ద్వారా విరజానదిని దాటడందాక అంతా సమానమే. విరజానది దాటాక కేవలం ఆత్మానుభవమే కోరి తృప్తిచెంది, అలా ఉపాసన చేసినవారు ఆ పరమపదంలోనే ఓమూలనుండే చోటుకు చేరి కేవలునిగానే మిగిలిపోతాడు. దానిని కైవల్యం అంటారు. అదీ మోక్షమే.

కర్మలన్నీ నశించాయి అర్చిరాదిగుండా విరజానది దాటి వచ్చాడు కనుక ఇక తిరిగి జనన మరణ చక్రంలో ప్రవేశించడు. భగవదనుభవాన్ని కోరలేదు కనుక దాన్ని పొందడు, తిరిగి వెళ్ళడు. స్వాత్మసాక్షాత్కారం పొంది, ఆత్మానుభూతిలో తేలియాడుతుంటాడు.అది నిత్య స్థితి.

అదికాక, భగవత్సేవనే మోక్షమని ఉపాసించిన వాడు, విరజానది దాటగానే అమానవ అనే స్పర్శతో పంచోపనిషణ్మయ దివ్యదేహం ఏర్పడుతుంది. అది చాలా రకాలుగ అలంకృతమై, ప్రేమ పూర్ణమై భగవదనుభవార్హమై గరుడుని తోడ్పాటుతో పరమాత్మ సన్నిధికి చేరి స్వామిసేవలో ఉంటాడు.వీటిల్లో ఆలోకంలోకి, విరజానది దాటగానే, ప్రవేశిస్తాడే ఈ జీవుడు, ఆ స్థితిని సాలోక్యం. భగవంతునితో సమానంగా ఒకే లోకంలో ఉండడం.

ఆవెంటనే అమానవకరస్పర్శ దివ్యదేహప్రాప్తి, అలంకరణ జరుగుతాయే ఇది సారూప్యం అవుతుంది.

క్రమంగా భగవన్మండపము ప్రవేశించి భగవంతుని దరికి చేరు సమయం- సామీప్యం అంటారు.

అతడి అనుగ్రహాన్ని పొంది శ్రీమన్నారాయణ దివ్యదంపతుల గోష్ఠిలో ఉండి, అతడి గుణాలను పొంది నిత్యకైంకర్యాన్ని చేపట్టడం సాయుజ్యం అంటారు .

ఇందులో ముక్తులు అందరూనూ, గరుడాది పెద్దలందరినీ నిత్యులని వ్యవహరిస్తుంటారు.ఈ వెళ్ళిన వీడు ముక్త గోష్ఠిలో చేరతాడు.

23, నవంబర్ 2010, మంగళవారం

భవదీయుడు అంటే..

అనే గూగుల్ గుంపులో ‘’ అనే పదం యొక్క అర్దంపై ఓ చక్కని చర్చ జరిగింది. ఆ చర్చలో గౌరవనీయులైన Dr. R. P. Sarma గారు ఇచ్చిన వివరం బహు విపులంగా ఉండటంతో దానిని యధావిధిగా ఇక్కడ ఉంచుతున్నాను.


మొదటగా పవిరాల అచ్యుత్ ప్రసాద్ గారు ఈ ప్రశ్నని అడిగి ఈ క్రింది విధంగా వివరించారు

భవదీయుడు = భవత్ + విధేయుడు = your's obidiently

ఇక్కడ "భవదీయుడు" ని విడదీసిన విధానము మరియు "భవత్ = your's" రెండూ కూడా crude guesses మాత్రమే


ఇందుకు స్పందిస్తూ టెకుముళ్ళ వెంకటప్పయ్య గారు ఈ క్రింది విధంగా వివరిస్తూ తెలుగులోని ప్రధమా విభక్తి ప్రస్తావన తెచ్చారు

భవత్ అంటె నీవు, మీరు, జరుగుచున్న కాలం అని అర్ధము. అదే భవదీయ అంటే  నీది అని అర్ధం

ఐతే తెలుగు లో ("డు, ము, వు, లు") ప్రధమా విభక్తి చేయడంతో భవదీయుడు అయింది.  అంటే....  మీ యొక్క అని మాత్రమే, విధేయుడు అని అర్ధము తీసుకోరాదు అని నా అభిప్రాయం


నేదునూరి రాజేశ్వరి గారు తెలుగులో భవదీయుడు అన్న పదానికి అర్ధం దొరకలేదు కానీ

భవము =పుట్టుక,సంసారము,ప్రాప్తి,శుభము ,సత్తా అని

భవత్ =కలుగుచున్న,పుట్టుచున్నఅనీ,

భవదీయము =మీది ,అనీ,విధేయము = సాసింప తగినది , విహిత కార్యము అనీ

విధేయుడు = సేవకుడు  చెప్పినట్లు వినువాడు అనీ

ఇలా అర్ధాలు ఉన్నాయి అని వివరించారు.


వీరిని సమర్దిస్తూ సుధాకర్ గారు సంసృతంలో భవదీయుడు అని చదివినట్టు ఉంది అని ప్రస్తావించగా, Dr. R. P. Sarma గారు ఈ క్రింది విధంగా వివరించారు. వారి పాఠ్యాన్ని యధావిధిగా ఇక్కడ ఉంచుతున్నాను.


ఆసక్తికరమైన చర్చ జరిగింది. మొదటే టేకుమళ్ళవారు సరిగానే వివరించారు. భవదీయుడు పదం తెలుగు నిఘంటువుల్లో దొరకకుంటే దొరకక పోవచ్చుగాక. ఎందుకంటే - మనం వినే ఇటువంటి  సంస్కృతపదాలు చూడండి. దేశీయ పదజాలం, రాష్టీయ అసమానతలు, మానవీయ సంబంధాలు, జతీయ సంపద మొదలైనవి. (స్పష్టత కోసం వేరేపదాలతో సమసించిన పదాలను ఇచ్చాను.) వీటిని దేశ+ఈయ; రాష్ట్ర+ఈయ; మానవ+ఈయ; జాతి+ఈయ అనే విధంగా విభజించాలి. ఇందులో మొదటిది పదం(ప్రకృతి).రెండవది ప్రత్యయం. ‘ఈయ’ అనేప్రత్యయానికి పై ఉదాహరణలవల్ల ‘సంబంధించిన’ అనే అర్థం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కాబట్టి

 

భవదీయ = భవత్+ ఈయ  అని విభజించాలి.


ఇందులో భవత్ అనేది టేకుమళ్ళవారు చెప్పినట్టు ...‘తమరు’ అనే అర్థం ఇచ్చే శబ్దం. దాన్ని భవచ్ఛబ్దం అంటారు. దీనికి సంస్కృతంలో మూడులింగాల్లోనూ రూపాలున్నాయి.


పుం.      భవాన్      భవన్తౌ      భవన్త:  .........
స్త్రీ .        భవతీ       భవత్యౌ     భవత్య:  ........
నపుం.    భవత్       భవతీ       భవంతీ ........


కాబట్టి - భవత్+ఈయ > భవదీయ= తమరి (Yours)...


ఇక నిఘంటువుల్లో సాధారణంగా మూలపదం మాత్రమే ఇస్తుంటారు. దాని మీద ప్రత్యయాలు చేరగా ఏర్పడే కృత్తద్ధిత పదాలు అన్నీ ఇయ్యకపోవచ్చు. సూర్యరాయాంధ్రనిఘంటువు ఇందుకు కొంత మినహాయింపు.

ఇంకా భవ శబ్దానికి 1.పుట్టుక 2. సంసారం మొ. అర్థాలూ ఉన్నాయి.

భవత్ శబ్దానికి ‘జరుగుచున్న కాలం’ అనే అర్థం లేకపోయి ఉండవచ్చని గెడ్డపువారు అభిప్రాయపడినారు. కాని, జరుగుచున్న/జరగబోయే/జరిగిన అనే అర్థాల్లో ఉంది. సంస్కృతంలో ‘భూ’ ధాతువు(క్రియ) ఉంది. దానికి ‘సత్తాయాం’ అని అర్థం.

సత్తా అంటే ‘స్థితి’(Status).

మనం వాడే ‘భూత,భవిష్యత్’ పదాలు ఆ ధాతువునుండి పుట్టినవే.వర్తమాన అనే పదమొక్కటి ‘వృతూ వర్తనే’ అనే వేరొక ధాతువునుండి పుట్టినది.

ఇక ‘అస్మదీయ’ అనే పదం విషయానికి వస్తే.. అస్మద్ శబ్దం (అహం=నేను అనేది ఈ శబ్దరూపమే)పై ఈయ చేరిన రూపం

 
Clicky Web Analytics