అసహ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అసహ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, నవంబర్ 2012, సోమవారం

గాయత్రీ మంత్రం .. ఇందుకా!!

గాయత్రీ మంత్రం.. ఎలా మొదలు పెట్టాలి అన్న ఆలోచనతో సతమతమౌతున్నప్పుడు, ఉన్నదేదో సూటిగా చెప్పేస్తే పోలా అన్న ఆలోచనతో ఎక్కువ చించకుండా మొదలుపెట్టేసాను.

 

ఉపోద్ఘాతం:

ఓ పెద్దాయన, గాయత్రీ మంత్రాన్ని తన ఇంట్లో కాలింగ్ బెల్ యొక్క సౌండుగా పెట్టుకున్నారు.

ఓ పెద్దాయన, గాయత్రీ మంత్రాన్ని తన సెల్ ఫోన్ రింగ్ టోనుగా పెట్టుకున్నారు.

ఓ పెద్దావిడ, గాయత్రీ మంత్రాన్ని తన ఫోన్ కాలర్ టోనుగా పెట్టుకున్నది.

ఓ కుర్రవాడు, గాయత్రీ మంత్రాన్ని తన కారు రివర్స్ చేసుకునేటప్పుడు హెచ్చరిక చేసే విధానంగా వాడుకున్నాడు.

ఓ యువతి, గాయత్రీ మంత్రాన్ని నలుగురు వినేటట్టు ఓ లౌడ్ స్పీకర్లో పొద్దు పొద్దునే పెట్టేసింది..

..

..

 

ఇక అసలు భావన

గాయత్రీ మంత్రం అనేది జగమెరిగిన రహస్యం. అట్టి గాయత్రిని ఉపనయన సంస్కరం అప్పుడు తండ్రి మాత్రమే చెప్పాలి, కొడుకు మాత్రమే వినాలి అన్నది ఆచారం. ఆ పద్దతిలో ఉపనయన క్రతువు జరిపించే బ్రహ్మగారు కూడా వినకూడదు అన్నట్లుగా, కొడుకు చెవిలో గాయత్రిని ఉపదేశించే తండ్రిని గోప్యంగా ఉంచాలన్న ఉద్దేశ్యంతో, వారిని కప్పుతూ ఉండే విధంగా ఓ పంచని కప్పుతారు. ఇది ఎన్నో ఏళ్లుగా వస్తున్న విధి విధానం. అందరూ పాటిస్తున్నా, ఈ విషయం తెలిసిన వారు కూడా ఖండించ కుండా మౌనం వహించి బ్రతకడం అంగీకరించ లేక పోతున్నాను.

ఎన్నో విషయాలు తెలిసాయి అనుకుని బ్రమ పడేవారు సైతం ఈ విషయాన్ని విశ్మరించి, జీవిస్తూ పెద్దవారిగా చెలామణి అవుతుంటే, అసహ్యం వేస్తోంది. వివరించి చెబుదాం అని ప్రయత్నం చేయ్యబోతే, వయస్సు రీత్యా చిన్నవాడివి నాకు చెప్పేంత సాహసం చేస్తావా అని దబాయించి బ్రతికేస్తున్నారు. చెట్టుకీ పుట్టకీ వస్తాయి, ఆలెక్కలో వేసుకుని ముందుకి సాగి పోతే సరి.

అందువల్ల చెప్పొచ్చినది ఏమిటంటే, సంస్కృతి అనేది ఒకటి ఉంది అని తెలుసుకుని ఆ విధంగా చేసేసుకుందాం.

5, జూన్ 2012, మంగళవారం

సత్యమేవ జయతే కాదది, అపహాస్యమేవ జయతే ..

హర్యానా, పంజాబ్ మఱియు ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో జరుగుతున్న విషయాన్ని ప్రధానంగా తీసుకుని కొందరు ప్రముఖులతో చర్చా ఘోష్టిగా నిర్వహించిన జూన్ రెండొవ నాటి ఐదవ ఎపిసోడ్ గురించి వ్రాసే ముందు, ఆ నాటి చర్చాంచం గురించి ఒక్కసారి తలచుకోవడం ఎంతైనా అవసరమే. ప్రేమించడం నేరమా!!

మొదటి కధ:

ఓ గ్రామంలోని ఓ అబ్బాయి మఱో గ్రామంలోని ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అతనికి అమ్మాయి తరుఫువారి నుంచి కష్టాలు వచ్చాయి. వాటిని తప్పించుకునే ప్రయత్నంలో భార్యభర్తలిద్దరూ చాలా పట్టణాలు తిరిగారు. అధికార దుర్వినియోగం చేసిన పోలీసులు వీరికి చాలా కష్టాలు చూపించారు. ఈ విషయాన్ని ఆ ప్రేమికులే వారి స్వయం అనుభవాలుగా వివరించారు

రెండొవ కధ:

ఓ గ్రామంలోని ఓ అబ్బాయి మఱో గ్రామంలోని ఓ అమ్మాయిని ప్రేమించాడు. అతనికి అమ్మాయి తరుఫువారి నుంచి కష్టాలు వచ్చాయి. వాటిని తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులు కధనం ప్రకారం అబ్బాయి రైల్వే పట్టాల మీద శవమై కనబడ్డాడు. అంటే దీనిని ఆత్మహత్య క్రింద చిత్రీకరించారని సమాజంలోని కొన్ని మహిళా సంఘాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసి న్యాయం జరగాలని పోరాటం జరిపారు. ఈ విషయం అంతా చనిపోయిన అబ్బాయి తల్లి చేత చెప్పించారు.

మూడవ కధ:

ఓ గ్రామంలోని ఓ అబ్బాయి మఱో గ్రామంలోని ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఉన్న చిక్కల్లా ఒక్కటే.. వారిద్దరూ ఒకే గోత్రానికి చెందిన వారు. అతనికి అమ్మాయి తరుఫువారి నుంచి కష్టాలు వచ్చాయి వాటికి తోడుగా అక్కడి పెద్దలు కూడా వీరి వివాహానికి సమ్మతినివ్వలేదు. వాటిని  సమర్దించుకునే ప్రయత్నంలో భార్యభర్తలిద్దరూ కలసి ఢిల్లీ వెళుతుంటే, దారిలో కాపు కాచి బస్సులో ప్రయాణం చేస్తున్న అబ్బాయిని కొందరు పెద్దమనుషులు ఆయుధాలతో కిరాతకంగా నరికి చంపారు. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లినందుకు అబ్బాయి చెల్లెల్ని కూడా చంపించే ప్రయత్నం చేసారని ఆ అమ్మాయే చెప్పింది. న్యాయస్థానం కొందరు హంతకులను గుర్తించి పలువురికి ఉరిశిక్షను ఖరారు చేసింది. మఱి కొందరికి జీవిత ఖైదు శిక్ష పడింది. ప్రస్తుతం ఆ కేసు సుప్రీం కోర్టులో నడుస్తున్నది.


ఇలాంటి వారిద్దరి కధలే ఈ నాటి చర్చాంశం.

 

సత్యమేవ జయతే గురించి జరిగిన ప్రచారంలో కొన్ని నగ్న సత్యాలు నన్ను చాలా భాదించాయి. అందుకని సత్యాన్ని నగ్నంగా నైనా చూసే ధైర్యం లేని నాలాంటి వాడు మొదటి ఎపిసోడ్ నందలి కొన్ని నిజాలు తెలుసుకున్న తరువాత, నిజాన్ని జీర్ణించుకు లేని స్థితిలో తరువాతి ఎపిసోడ్స్ చూడలేదు.

 

ఆ తరువాత చూసిన మఱో ఎపిసోడ్ ఇది. నేను ఈ ఎపిసోడ్ చూసే సమయానికి ఎంత భాగం అయ్యిందో తెలియదు. కానీ అమీర్ ఖాన్ గారు, ఓ గ్రామ పంచాయితీలోని ఓ ఐదుగురు పెద్దవాళ్లతో చర్చిస్తున్నారు. చర్చ ఎప్పుడూ మంచిదే కాదనను, కానీ చర్చ అనేది ఒక వైపుగా జరగ కూడదు. ఇరువైపులనుంచి జరగాలి. కానీ పంచాయితీ పెద్దలతో ఇక్కడ జరిగిన తతంగం చర్చలా కాకుండా, వారిని అపహాస్యం చేస్తుంటే, ప్రేక్షకులలో కూర్చున్న వారు ఆనందిస్తూ చప్పట్లు కొడుతున్నారు. గ్రామ పంచాయితీ పెద్దలేమో పరంపర / Tradetion అంటూ ఉంటే, మన అమీర్ ఖాన్ గారేమో భారతదేశ రాజ్యాంగం గురించి ప్రస్తావిస్తున్నారు. వీరి చర్చను పూర్తి చెయ్యకుండానే అమీర్ ఖాన్ గారు మధ్యలో ముగిస్తూ మఱో వ్యక్తిని ప్రవేశ పెట్టారు

 

వీరి తరువాత మఱో వ్యక్తి వచ్చారు. ఆయన లవ్ కమాండోస్ అనే ఓ సమాజానికి ప్రతీకగా వచ్చారు. ఇంటర్ కాస్ట్ మారేజస్ మాత్రమే మన భారత దేశాన్ని ముక్కలు కాకుండా కాపాడుతున్నాయని, అవి మాత్రమే భారతదేశ గౌరవాన్ని నిలబెడతాయని సుప్రిం కోర్ట్ చెప్పిందని ఈయన చెబుతున్నారు. ప్రేమ మూర్తులుగా కనబడే దేవతలను ఉదహరింపుగా రాధా శ్రీకృష్ణులను చూపిస్తున్నారు కదా!! అలాంటి వారందరికీ ఓ మాట చెబుతున్నాను, వీలైతే ఆ మూర్తులున్న గుడిలలో పూజలైనా ఆపేయ్యండి లేదా.. ప్రేమియోంక ప్రేమ్ కో స్వీకార్ కర్లో.. love shall conquer the world.. అనేది వీరి భాష్యంలోని ఆఖరి అంశం.

వీటి తరువాత, ఉదాహరణగా మఱో ప్రేమ జంట గురించి ప్రస్తావించారు. అలాగే, ఆ ప్రేమ జంట యొక్క చరిత్రను వివరిస్తూ వారి కుటుంబం వారిని పాతిక సంవత్సారాలు దూరంగా ఉంచిన తరువాత వారికి మఱో సారి సాంప్రదాయ బద్దంగా వారికి వివాహం జరిపించిన వైనాన్ని చిత్రీకరించి ప్రేక్షకులకు సెంటిమెంట్ అందేపరంగా చూపించారు.

ముగింపులోకి వస్తుండగా, ప్రేమ వివాహం చేసుకున్న ఆ యువతి తన తండ్రికి సందేశానిస్తూ క్షమించమని వేడుకోవడం దానిని అమీర్ ఖాన్ గారు సమర్దిస్తూ ఆ పిల్ల తల్లి తండ్రులను బుజ్జగించే ప్రయత్నం చేసే పనిగా, ఓ చక్కని పాటని అందించారు.

ఇది అక్కడ జరిగింది. నా అభిప్రాయం మఱో సారి విపులంగా వ్రాస్తాను. ఈ పుటని ఇక్కడతో ముగించి, “సత్యమేవ జయతే ..” లో ఈ ఎపిసోడ్ గురించి నా అభిప్రాయాలు వ్రాసే ముందుగా, ప్రేమ అనే పదం గురించిన నా నిర్వచనాన్ని ఇక్కడ ప్రస్తావిస్తే, నా భావన ఏమిటో .. అది ఏ కోణం నుంచి చూస్తూ వ్రాస్తున్నానో అనే విషయం పై ఒక ఖచ్చితమైన అవగాహన వస్తుంది.


ప్రేమ పై నా నిర్వచనం

ప్రేమ అనే పదాన్ని ఒక్కొక్కరు ఒక్కొవిధంగా అభివర్ణిస్తాను. నా భావనలో మాత్రం, ప్రేమ అంటే భాద్యత. మనం ఎవ్వరినైనా ప్రేమిస్తున్నాం అంటే వారి భాద్యత తీసుకున్నట్లే. ఇది భార్యా భర్తల విషయమైనా లేదా తల్లి పిల్లల విషయమైనా లేదా తండ్రి పిల్లల విషయమైనా లేదా మరింకేదైనా. ఆ విధంగా ప్రేమించడం అంటే భాద్యతని భుజాలపై వేసుకుని, ప్రేమించ బడుతున్న వారికి ఒక రకమైన భద్రతా భావనని ఇవ్వటమే అని నా అభిప్రాయం మఱియు అనుభవం.

10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

వైద్యులంటే అసహ్యం వేస్తోంది

ఈ మధ్య అనుకోకుండా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే పేరుతో ప్రస్తావించ బడుతున్న చేతి వేళ్ళకు సంబందించిన ఓ వ్యాధితో బాధపడుతున్నాను. నిన్న నెప్పి ఎక్కువైతే దగ్గరలో ఉన్న ఓ MD చదువుకున్న ఓ వైద్యుని వద్దకు అత్యవసర పరిస్తితిలో వెళవలసి వచ్చింది. ఆ వైద్యులు గారు నా గోడు పూర్తిగా వినకుండానే ఓ నాలుగు రక్త పరిక్షలు వ్రాసి ఇచ్చారు. అందులో షుగర్ ఉందో లేదో అని తెలుసుకునే, RBS అంటే రాండమ్ బ్లడ్ షుగర్ పరిక్ష కూడా ఉంది. ఆ తరువాత మాటల మధ్యలో నాకు షుగర్ లేదని చెబుతుంటే, వినిపించుకోకుండా, ఆ పరిక్ష చేయ్యాల్సిందే అని చెప్పారు.

గత సంవత్సరంలో నవంబర్ నెలలో ఆఖరి సారిగా రక్త పరీక్ష చేయించుకున్నాను అంతేకాకుండా గత సంవత్సరంలో యాక్సిడెంట్ కారణంగా ఓ నాలుగు సార్లు చేయించుకున్నాను అని చెప్పిన  తరువాత విషయాన్ని విని ఓ నాలుగు రకాల మందులు వ్రాసి ఇచ్చారు. ప్రస్తుతానికి ఇవి వాడండి ఆ తరువాత పరిక్షలు చేయించుకుని రండి అప్పుడు చూద్దాం, అన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, జబ్బులు రోగులకు క్రొత్త కానీ వైద్యులకు క్రొత్త కాదు. చిటికెడు చెబితే చారెడు గ్రహించయ్యటం వీరికి అనుభవంలో వస్తుంది. కానీ రోగులకు విషయం చెప్పాలి కదా!! ఇలా వ్రాసుకుంటూ పోతే మరేదో వ్రాసేస్తాను.. విషయంలోకి వస్తే..

వైద్యో నారాయణ హరి.. అంటారు కదా, ఆయన చెప్పిన పరీక్షలకు రక్తం ఇచ్చి ఓ వెయ్యి రూపాయల బిల్లు చెల్లించి ఇంటికి చేరుకున్నాను. ఇచ్చిన మందులు వేసుకుని నొప్పి తగ్గుతుందేమో అని ఎదురు చూస్తూ గడిపేసాను. తీరా సాయంత్రం రిపోర్టులు తీసుకుని వెళ్ళి చూసే సరికి ఆ వైద్యులు గారు ఊరిలో లేరని తిరిగి సోమవారం వస్తారని తెలిసింది. ఇంతకు ముందు నాకు యాక్సిడెంట్ అయ్యినప్పుడు ట్రీట్ చేసిన వైద్యులు కూడా అంతే, వెళ్ళంగానే xరే తీయించుకుని రమ్మంటారు. తీయించుకుని వచ్చిన తరువాత దానిని చూడను కూడా చూడరు సరి కదా, చూపించ బోతే, “ నాకు తెలుసు ..” అంటూ మాట దాటేస్తారు.

ఇవన్నీ చూస్తున్న తరువాత వైద్యులపై గౌరవం కలుగకపోగా, అసహ్యం వేస్తోంది. అన్నింటికీ మించి, ఈ వైద్యులు గారు ప్రిస్క్రిప్షన్ ద్వారా ఇచ్చిన మందులు వారి ప్రక్కనే ఉన్న కొట్లో కొనుక్కోవాలన్నమాట. అమ్మే దుకాణానికి లైసెన్స్ లేదు. దీనికి తోడుగా, వీరు చెప్పిన పరీక్షలు కూడా ఆ ప్రక్కనే ఉన్న దుకాణం వెనకాల ఉన్న గదిలో చేయించుకోవాలన్నది వీరి డిమాండ్. అక్కడ కాకపోతే సరి అయిన లేదా కరక్ట్ రిజల్ట్స్ రావంట. సరే నొప్పి తగ్గాలి కదా అని వీరు చెప్పిన మందులు తీసుకుని ఆ ప్రక్కనే ఉన్న గదిలో రక్తాన్ని ఇచ్చి ఇంటీకి చేరుకున్నా.

దీని నుంచి నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే, కొంచం ఖర్చు ఎక్కువైనా వ్యాపార పరంగా ఉన్న పెద్ద హాస్పిటల్స్ ఫరవాలేదనిపిస్తోంది.

31, డిసెంబర్ 2011, శనివారం

కొత్త సంవత్సరమా !!

స్వతహాగా నాకు ఆంగ్ల సంవత్సరం అంటే పెద్ద పట్టింపు ఉండేది కాదు. అది మఱో రోజు. కానీ ఈ మధ్య అందిన ఓ సమాచారం నన్ను ఆలోచించ చేసింది. ఆ సమాచారాన్ని యధావిధిగా ఇక్కడ ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇది కొందరికి నచ్చక పోవచ్చు. కానీ నాకు నచ్చింది అందుకని ఇక్కడ ఉంచుతున్నాను.

జనవరి ౧ వ తారీఖున క్యాలెండర్ మారుతుంది

తెల్లవాడిని అనుసరించే గొఱెలు నమ్మే విషయం భారతీయ సింహాలు నమ్మే విషయాలు
తేదీ మార్పు అర్దరాత్రి 12 గంటలకు  తేదీ మారుతుందా?
ఎలా మారుతుంది?
ఏమార్పు కనిపిస్తుంది?
ఈ తేదీ మార్పునకు ఆధారం ఏమీ లేదు..
సూర్యోదయంతో చీకట్లు తొలగి ప్రపంచం నిదుర వీడి వెలుగు రేఖలు ప్రసరించాక సహజంగా వచ్చిన మార్పుతో తారీఖు మారుతుంది.
     
సంవత్సరం మార్పు జనవరి 1వతారీఖునకు గానీ డిసెంబర్ 30వ తారీఖునకు కానీ ప్రకృతిలో కానీ, వాతావరణంలో కానీ, గ్రాహాల స్థితిలో కానీ, భూమి గమనంలో కానీ ఏమార్పు ఉండదు. చాలా మంది తెల్లవాడి గొఱ్ఱెలకు జనవరి 1 నే సంవత్సరం  మారుతుందనుకుంటారు ఉగాది నాడు ప్రకృతిలో క్రొత్త ఆకులు చిగిర్చి, కోయిల పాటతో, శోభాయమానమైన వాతావరణంతో, నవీన శోభతో గ్రహ గమనాల ఆధారంగా కలిగే మార్పునే క్రొత్త సంవత్సరంగా భారతీయ సింహాలు భావిస్తారు.
     
క్యాలెండర్ మార్పు తెల్లవాడి క్యాలెండర్లో కేవలం వారాలు, తేదీలు మాత్రమే తెలుస్తాయి
ఏ రోజు ఏమి చెయ్యాలో / ఎప్పుడు తెలవారుతుందో / ఎప్పుడు ఏఏ మార్పులు వస్తాయో చెప్పలేని ఒక గీతల కాగితం గోడకు వేలాడుతుంది
తిధి, వారం, నక్షత్రం, కరణం, యోగం, అనే పంచ అంగాలతో సంవత్సరం పొడువునా ఏరోకు ఏమి చెయ్యాలో, విత్తు ఏప్పుడు నాటాలో, పెండ్లి ఎప్పుడు చెయ్యాలో, పగలు, రాత్రి, ఎప్పుడెప్పుడు వస్తాయో, చంద్రుడి గమనం ఏమిటో వివరిస్తూ, గ్రహాణాలు ఎప్పుడు వస్తాయో చెబుతూ, జీవితానికి క్రమపద్దతిలో ప్లానింగ్ ఇచ్చేది భారతీయ పంచాంగం

శాస్త్రీయంగా, విఙ్ఞానంగా, సనాతనంగా ఈ దేశంలో వస్తున్న పద్దతులను వదిలేసి, అశాస్త్రీయతకు ఆధారమైన తెల్ల వాడి పద్దతులపై ఎందుకీ వ్యామోహం?

వైఙ్ఞానీకంగా, ప్రకృతి సహజంగా, మానవాభివృద్ధికి ఆధారంగా ఉన్న మన ఉగాదిని సంబరంగా నూతన సంవత్సరంగా జరుపుకుందాం..

తెల్ల వాడి గొఱ్ఱెలుగా మారొద్దు. భారతీయ సింహాలు కండి..

31, జులై 2011, ఆదివారం

నేనేం చెయ్యాలి? భాధ పడాలా? మరింకేం చెయ్యాలి

ఆది లక్ష్మి గారికి కలిగిన దెబ్బ విషయం తెలిసిన తరువాత దానిని జీర్ణించుకోలేక తల్లడిల్లిపోవడం తప్ప ఏమీ చెయ్యలేక పోయిన నాకు నేనేమి చెయ్యాలి అన్న ఆలోచన పురుగల్లే తొలిచి వేస్తోంది. అమ్మ గురించి అమ్మఒడి గురించి తెలియని వారు ఉండరు, తెలుసుకోని వారు అభాగ్యులై అనాధలుగా కొన్ని చోట్ల కనబడినా వారి శాతం చాలా తక్కువనే చెప్పుకోవాలి. అలాంటి వారి గురించి ప్రక్కన పెడితే, ఆది లక్ష్మి గారికి ఎదురైన ఈ అవస్థకు లేదా వీరి ప్రస్తుత ఆపత్కాలానికి నేనేమీ చెయ్యలేక పోతున్నానే అనే భావన నన్ను మరింత కృంగదీస్తోంది.

వీరికి ఫోన్ చేసి మాట్లాడదాం అని ఒకసారి ప్రయత్నం చేస్తే నా నోటి వెంట మాటరాక నేనే చిన్నపిల్ల వాడిలాగా ఏడ్చేస్తున్నాను. అలాంటిది నా ద్వారా వీరికి మరింత బాధని అందజేసిన వాడనౌతున్నాను. అలా అని ఊరకే ఉందాం అనుకుంటే, మనసు మాట వినదాయె. మఱో ప్రయత్నంగా ఇంకొకసారి చేస్తే, ఈ సారి నాది అదే పరిస్థితి. ఓదార్చాల్సిన నేనే ఏడుస్తూ కూర్చుంటే, ఆ తల్లిని సముదాయించే వారెవ్వరు? ధైర్యం తెచ్చుకోండి అని చెప్పాల్సిన నేనే మూగబోయి ఆవిడ బాధకి మరింత తోడై, అగ్నికి ఆజ్యం పోసిన వాడనౌతున్నాను.

మా నాన్నగారు ఓ విషయాన్ని ఎల్ల వేళలా చెబుతూ ఉండేవారు. మనం ఎవ్వరికైనా సహాయం చెయ్యకపోయినా ఫరవాలేదు కాని మన వల్ల వేరొక్కరు నష్ట పోకూడదని. కానీ ఆదిలక్ష్మి గారి విషయంలో, నా వల్ల వీరి బాధ అధికం అవుతోంది కాని, వీరికి ఉపశమనం మాట అటుంచి, మఱచి పోతున్న ఙ్ఞాపకాలను తవ్వి వెలికి తీస్తున్నట్లుంది నా పరామర్శ. సరిగ్గా పరామర్శించడం చేతకాదు, పోనీ సరిగ్గా మాట్లాడడమా చాతకాదు, ధైర్యం చెబుదామా అంటే అదేలాగో తెలియదు, ఎందుకీ స్థితి నాకు? ఏమీ చాతకాని నేను ఏమి చెయ్యాలి.

ఏదో వారి బ్యాంక్ ఎక్కౌంట్ ఇచ్చారు కాబట్టి అంతో ఇంతో, అదిఇదీ కాకపోతో ఎంతోకొంత వారి బ్యాంక్ ఎక్కౌంటులో జమ చేసి మౌనంగా బ్రతికేయ్యాలా!! దిక్కుతోచని స్థితి. నామీద నాకే అసహ్యం వేస్తోంది.

17, జూన్ 2011, శుక్రవారం

పుట్టపర్తి – యజుర్ మందిరం వివరాలు నాకు అసహ్యాన్ని కలిగించాయి

ఇంతకాలం వరకూ పుట్టపర్తి సాయిబాబపై నాకు ఎటువంటి అభిప్రాయం లేదు. కానీ ఇవ్వాళ సత్యసాయి ట్రస్ట్ సభ్యులు వెల్లడించిన వివరాలు నాలో విస్మయాన్ని కలిగించాయి. అవి నాకు మింగుడు పడటం లేదు. సత్యసాయి బాబాను దైవంగా కొలిచే వారికి ఎటువంటి విషయమైనా అది దైవీక పరంగా కనబడుతుంది, అలా చూడని వారికి ప్రతీ చిన్న విషయం పెద్ద వివాదంగా కనబడుతుంది. అలా నేను వివాదస్పదమైనటువంటి భావనను కలిగించుకోవటం లేదు కానీ ఇంత ఆస్తిని కలిగి ఉండటం వెనుక ఉన్న వివరం నాకు అర్దం కావటం లేదు. అసలు విషయం లోకి వెళ్ళే ముందు పత్రికలలో వచ్చిన నిజాల గురించి ఒకసారి అవలోకనం చేసుకుంటే..

  1. పదకొండున్నర కోట్ల రూపాల నగదు లభ్యం అయ్యింది
  2. తొంభై ఎనిమిది కిలోల బరువు కలిగిన బంగారం
  3. మూడు వందల ఏడు కిలోల వెండి
  4. వగైరా .. వగైరా..

ఇంతటి విలువైన ఆభరణాలు కొన్నింటిని కలిగి ఉండటం వెనక సమర్దించుకునే్ కారణాలు కనబడుతున్నాయి. కానీ కొన్నింటి యందు నాకు అర్దం కావటం లేదు.  సత్యసాయి ట్రస్ట్ విషయంలో లక్షల కోట్లు కలిగి ఉండటం పెద్ద ఆశ్చర్య కరమైన విషయం కాదు. కానీ అవి అన్నీ బ్యాంకులలో లెక్కా పత్రంగా కలిగి ఉంటాయి అనేది వ్యవస్థగా ఎదిగిన అన్నింటికి ఒక ఖచ్చితమైన నియమం. అలా నియమాన్ని పాటిస్తూ సత్యసాయి ట్రస్ట్ వారు ఎంత టాక్స్ కట్టారో, ఎంత కట్టాలో వంటి వివరాల గురించి ప్రభుత్వం వారిని అడిగితే సమాచార చట్టం పరంగా మనకు అన్నీ నకలు పత్రాలు దొరుకుతాయి. కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో నగదు అందునా అయ్యవారి సేవా మందిరంలో కలిగి ఉండాల్సిన అవసరం నాకు కనబడటం లేదు.

నగదు పరంగా ఎవ్వరైనా వీరికి ఇచ్చినా, లేక వీరు ఎవ్వరికైనా ఇవ్వాల్సి వచ్చినా, వాటిని చెక్ పరంగా తీసుకోవడమో లేక ఇవ్వడమో చెయ్యకుండా ఇంత పెద్ద మొత్తంలో నగదుని ఒక్క రోజే కలిగి ఉండటాన్ని నేను జీర్ణించుకో లేక పోతున్నాను. నగదు రూపంలో ఇంత పెద్ద మొత్తాన్ని కలిగి ఉండాటాన్ని నేను హర్షించను.

ఇక బంగారం మఱియు వెండి విగ్రహాల విషయానికి వస్తే, ప్రతీ రోజు వీఐపీలు దర్శనార్దం వస్తూ ఉంటారు కాబట్టి, వారుకి ఆశీర్వాదంగా ఇచ్చే ప్రక్రియలో వీరు ముందుగా వీటిని తయారు చేయించి పెట్టుకున్నారు అన్న సమర్దన నాకు అంగీకారమే. అందువల్ల అలాంటి వాటిని నేను శంకించను. లాటుగా ఒకేసారి వీటిని తయారు చేయించు ఉంచుకోవడం వల్ల పలు సౌకర్యాలు ఉంటాయి. అందువల్ల సత్య సాయి బాబా అనునాయిలు ఇలా భారీ మొత్తంలో బంగారు విగ్రహాలు చేయించి ఉంచుకోవడం వల్ల పలు లాభాలు గమనించి ఉంటారు.

ఏది ఏమైనా, సత్యసాయి బాబా గారి మందిరం నుంచి ఇంత పెద్ద మొత్తం ధనం లభించడం వీరి యడల నాకు కించిత గౌరవభావం తగ్గింది అనే చెప్పు కోవాలి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి చుట్టూ కూడా ధనం తన ప్రభావాన్ని చూపించేటట్టు కనబడటం నాకు అసహ్యాన్ని కలిగిస్తోంది. ఇలా వ్రాసినందున నాకు ధనలక్ష్మి పట్ల సత్ భావన లేదనుకోవద్దు. నాకు ధన లక్ష్మి పట్ల అమితమైన గౌరవం. అలాంటి గౌరవాన్ని విధిగా ఎవ్వరు తప్పు చేసి మాట్లాడినా వ్యతిరేకిస్తాను. ఉదాహరణకి, కొంత మంది ఊతపదంగా ఇలా అంటూ ఉంటారు, “డబ్బుదేముందడి ..”. అలాంటి వారిని అప్పుడు వారు చేస్తున్న చర్చను ఆపి ధన లక్ష్మి గురించి తప్పుగా వాగొద్దని ఓ చిన్న సైజు క్లాసు పీకి ఆ తరువాత తిరిగి చర్చలోకి వస్తూ ఉంటాను. కాకపోతే ఇలాంటి ధనలక్ష్మిని జాగ్రత్తగా బద్రంగా క్షేమంగా లెక్కా పత్రంతో దాచుకోవాలి. కానీ లెక్కా పత్రం లేకుండా ఇంతటి నల్లధనాన్ని ప్రోత్సాహించడం మాత్రం జీర్ణించుకోలేక పోతున్నాను.

భాద్యతా యుతమైన స్థాయిలో ఉంటూ నలుగురికి ఓ ఆదర్శమైన వ్యక్తిగా వెలుగొందాల్సిన వ్యక్తి వద్ద ఇంత మొత్తంలో ధన నిలువలు నాకు అర్దం కావటం లేదు. అందువల్ల వీరు కూడా ధనానికే పెద్ద పీట వేసే వ్యక్తే అని నేను నమ్ముతున్నాను. ఒకవేళ తప్పవ్వవచ్చు. కానీ ప్రస్తుతానికి వీరి ప్రవర్తన నాకు నచ్చలేదు.

14, జూన్ 2011, మంగళవారం

మహిళా సంఘాలు – నిద్దరోతున్నారా!!

మహిళా సంఘాలు ఈ మధ్య నిద్దరోతున్నట్లున్నాయి. మహిళలను కించ పఱచే విధంగా ఎటువంటి ప్రకటనలు వచ్చినా వాటిని కారణంగా పెట్టుకుని మీడియాలో పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసే మహిళా సంఘాలకు ఎయిర్ టెల్ వారి ప్రకటనలో మహిళలపై జరుగుతున్న అమర్యాదను మరియు మగాళ్ళ హీన ప్రవృత్తి కనబడట్టు లేదు. ఎందుకంటే, దానిలో వారికి ఎటువంటి అసభ్యం కనబడటం లేదు కదా అని సమర్దించుకుంటారు. అంతే కానీ నైతికమైన విలువలకు గండి కొట్టి హింసా ప్రవృత్తిని ప్రేరేపించే విధంగా సాగుతున్న ఈ ప్రకటన ఎవ్వరి కంటా పడట్టు లేదు.

ఈ ప్రకటన జాగ్రత్తగా గమనిస్తే, ఓ ముసలాయన తన మనవడితో చేసిన సంబాషణ ఇలా ఈ క్రింది విధంగా సాగింది.

మనవడు : తాతా, ఇక్కడెందుకు ఆగవు?

తాత : మా పెళ్ళికి ముందు ఇక్కడే.. కాంతీ లాల్ అనే బద్మాష్ మీ బామ్మ బుగ్గపై <డాష్ .. డాష్ ..> వాడి పళ్ళు ఊడకొట్టలేక పోయ్యాను..

మనవడు : ఒక్క నిమిషం ఆగు. హాల్లో !! కిషన్ గంజ్ లోని కాంతీలాల్ గోడ్ బోలే ఎవ్వరికైనా తెలుసా!!

[[ కొంత సేపటికి సీన్ కాంతీలాల్ గోడ్ బోలే ఇంటి ముందు ..]]

ఆ ఇంటి వాకిలికి ఇవతల తాత మనవడు అటువైపు సదరు కాంతీలాల్ తన భార్యతో ఉంటాడు. ఈ కధలోని తాతగారు, “హిసాబ్ బరాబర్ ..” అంటూ అటువైపు ఉన్న మహిళ బుగ్గపై ముద్దుపెట్టి పారిపోతాడు.

నాకు అర్దం అయ్యిందేమిటంటే, ఎవ్వడైనా నా భార్యని ముద్దు పెట్టుకుంటే, నేను వెళ్ళి వాడి బార్యని ముద్దు పెట్టుకుంటే సరి పోతుందన్న మాట. కాకపోతే నేను చేసేటప్పుడు ప్రక్కన ఓ పిల్లవాడిని పెట్టుకుంటే సరిపోతుందన్నమాట.

ఇక్కడ చూపించిన ప్రకటనలో రెండుసార్లు ముద్దుకు గురైన మహిళలకు మర్యాద అక్కరలేదన్నమాట. రెండు సార్లు ముద్దు పెట్టుకున్న మగాడు హీరో అన్నమాట. ఇలా కంటికి కన్ను పంటికి పన్ను అనే నైపధ్యంలో సాగిన ఈ ప్రకటన మహిళల మర్యాదకు ఎటువంటి భంగపాటు కలగలేదన్నమాట.

ఇవేనా మనం మన తరువాతి తరం వారికి నేర్పే నైతిక విలువలు? తొక్కలో విలువలు, ఇక్కడ అందులో పోయిందేముంది మీ చాదస్తం తప్పితే అంటారా.. అయితే నిజ్జంగానే నాకు చాదస్తం. ఏమి చేస్తాం? నేను ఓల్డ్ ఫాషన్ కదా..

12, జూన్ 2011, ఆదివారం

బొత్స సత్యన్నారాయణ – నా అభిప్రాయం

బొత్స సత్యన్నారయణ గారి గురించి క్రొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్రొడక్షన్ అవసరం లేని వ్యక్తి అని నా అభిప్రాయం. కాకపోతే, ఒక్క సారి వారి గతాన్ని అవలోకించుకుంటే, కొన్ని పచ్చి నిజాలు నాకు మింగుడు పడని పచ్చి వెలక్కాయలు అవుతాయి. ఒకప్పుడు నాకు కాంగ్రెశ్ అంటే ప్రజల పరంగా సేవ చేసే ఓ రాజకీయ వ్యవస్థగా మంచి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు కూడా ఓ అభిప్రాయం ఉంది, కాకపోతే అది ఒక రాజకీయ పార్టీగా కాక రాజకీయ వ్యాపార వ్యవస్థగా ఓ మంచి వ్యాపార దృక్పధం కలిగిన సంస్థగా లాభాలను ఆర్జించే దిశలో సాగి అభివృద్ది చెందుతున్న లంచాల పార్టీగా నాకు అనిపిస్తోంది.

ఈ అభిప్రాయం వెనకాల కొన్ని (నన్ను మఱియు నా ఆలోచనలను సమర్దించుకునే) వివరాలు. మున్ముందుగా రాజకీయాల గురించి నాకు ఉన్న ఒకే ఒక అభిప్రాయం ఏమిటంటే, అది కాకాపట్టడం చేతనైన వారి వ్యాపారం అని. కనబడ్డ ప్రతీ వాడిని నువ్వు అది పీకావో లేక నువ్వు ఇది పీకావో అని డప్పుకొట్టి, అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ, అవసరం తీరిన తరువాత తొక్కేసే వాళ్ళకు అది ఓ మంచి వృత్తి. ప్రజా సేవ / సామాజిక అభివృద్ది / డాష్ .. డాష్.. వంటి మాటలు ఉత్తుత్తి ప్రగల్భాలు మాత్రమే. ఇక్కడ కొన్ని విషయాలలో కొంత మందిని మనం విడిచి పెట్టవచ్చు, ఉదాహరణకి లోక్ సత్తా కన్వీనియర్ గారైన జెపీ లాంటి వారిని చాలా విషయాలలో ప్రస్తుత రాజకీయ నాయకులతో పోల్చలేం. కాబట్టి ఇలాంటి వారు ఈ వ్యాపార పరిగణలోకి రారు.

ఇక వివరాల్లోకి వెళితే, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి రాజ్యం ఏలిందంటూ, వేరే పార్టీ పెట్టి, ఎన్నికలలో పోటీ చేసి, స్వతంత్ర పార్టీగా ఎదిగిన ప్రజా రాజ్యం పార్టీ, సదరు ముఖ్యమంత్రిగారు మరణించిన తరువాత, ప్రస్తుతం అవినీతి / లంచ గొండితనం / వగైరా వగైరా లేవు కాబట్టి, ప్రరాపా అవసరం లేదు, చక్కగా కాంగేస్ పార్టీలో కలసి పోతాం అన్న వివరం నాకు మింగుడు పడటం లేదు. దీని వెనుక మాకేమీ ధనలాభం జరగలేదు అని ప్రరాపా వారు అంటే, నిరూపించడానికి నావద్ద సాక్ష్యాలు లేవు. కానీ అదంతా ఒఠి హంబక్, అంటూ నమ్మెయ్యమంటే కొంచం కష్టం మరి.

రారె గారు, రాజశేఖర్ రెడ్డి గారు అని ఇకపై చదువుకోమనవి. రారెగారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వాగెన్ స్కాం ద్వారా తన పదవిని కోల్పోయిన ప్రస్తుత బొస గారు, (బొత్స సత్యన్నారాయణ గారు), ఆంద్రప్రదేశ్ కాంగ్రేశ్ పార్టీకి అధ్యక్ష్యులు అయ్యారు. అప్పటి స్కాం కనుక ప్రతి పక్షం వారు పట్టించుకోకుంటే, మఱో కర్మాగారం ఆంద్ర ప్రదేశ్ కు వచ్చేది. అదేనండి కార్ల తయారి కర్మాగారం. దాని ద్వారా చాలా మందికి ఉపాధి దొరికేది. సరే, అది అంతా గతం, అదే గనుక జరిగి ఉంటే, బొస గారు చక్కగా ఆ సంస్థ పనులలో బిజీగా ఉండి ఇలా అయ్యేవారు కాదేమో. ఇలా జరిగినందులకు బొసగారు అప్పటి ప్రతి పక్ష నాయకుడైన నాచనా గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, చాలా ఋణ పడి ఉంటారు. ఉండాలి కూడా.

నాచానా గారు పట్టు పట్టి బొసగారిని పంచాయితీ రాజ్ వ్యవస్థనుంచి తప్పించ కుంటే, బొసగారిలో కసి పెరిగేది కాదు. అలా బొసగారిలో కసి పెంచి వారి కుటుంబం నుంచి ఏకంగా నలుగురు వ్యక్తులను ఎమ్ ఎల్ ఎ లుగా చేసేటట్టు చేసిన నాచానా గారికి బొసగారు ఓ పెద్ద పార్టీ ఇవ్వాలి. ఈ రోజుల్లో ఒక్కరు ఎన్నికల్లో గెలవడమే చాలా కష్టమైన సందర్బాలుండగా, ఏకంగా ఒకే కుటుంబం నుంచి నలుగురికి పార్టీ టికెట్టులు తెచ్చుకుని, ఆ నలుగురిని గెలిపించే భాద్యత బుజాల మీదకు వేసుకున్న బొసగారు సామాన్యుడు కాదని మనం గమనించాలి. నిజమే, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎన్నికల్లో పార్టీ సీటు రావడం గొప్ప కాదు, కానీ ఏకంగా ఒకే కుటుంబం నుంచి నలుగురికి కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఇచ్చిందంటే, ఆ కుటుంబం అయితే ప్రజా సేవలో నిరతిశయమైన కృషి చేసుండాలి లేదా మరింకేమైనా చేసి ఉండాలి. బొసాగారి కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ టికెట్టు లభించిన నలుగురు వ్యక్తుల గురించి ప్రజలకు అంతగా కాదు కద కొంతగా కూడా తెలియదనే చెప్పుకోవాలి. ఇక్కడ నా మట్టి బుర్రకు సమాధానం లభించని కొన్ని ప్రశనలు.

  • కొంతగా కూడా తెలియని ఈ నలుగురికి కాంగ్రెస్ టికెట్టు ఏ బేసిస్ మీద ఇచ్చిందబ్బా?
  • ఇలా టికెట్టు కొట్టేసిన నలుగురు ఏ విధంగా గెలిచారబ్బా?
  • గెలిచిన ఈ నలుగురి వెనుక బొసగారి సపోర్ట్ లేదంటే నా మది ఎందుకు అంగీకరించటం లేదబ్బా?
  • .. ఇంకా

రారేగారి హయాములో వోక్స్ వాగన్ స్కాంలోనుంచి క్లీన్ గా బయట పడి, తన ప్రతాపమేమిటో నాచానా గారికి అలాగే కాంగ్రేశ్ పార్టీలో అందరికీ షాకులు ఇస్తున్న బొసాగారిని అభినందించ కుండా ఉండలేను. ఏది ఏమైనా వీరు మాత్రం చాలా యునీక్, అంటే ఓ స్పెషల్ ఐటం అన్న మాట. దేవుడు వీరిని ఎలా చేశాడో కానీ చాలా స్పెషల్ గా తయారు చేసారు. కాకపోతే వీరి అభివృద్ది అంతా ప్రజా సేవ వల్లే జరిగింది అంటే మాత్రం హాస్యాస్పదంగా ఉంటుంది. వీరు చేసిన ప్రజా సేవ ఏమిటో నాకు అర్దం కావటం లేదు. ఒక్కసారి వీరి నియోజక వర్గం అయిన విజయనగరం జిల్లాకు వెళ్ళి అక్కడ జరిగిన అభివృద్ది పనులేమిటో చూసి వస్తా. అంత వరకూ బొసాగారు, మీరు ఇక విజృంబించేయ్యండి. ఆల్ ద బెస్ట్

9, జూన్ 2011, గురువారం

హమ్మయ్య !! ఓ పనైపోయింది

ఇవాళ్ళ ఈ చిత్రకారుని జీవితం ముగిశింది అని వ్రాయాలని చాలా మంది అనుకుంటారు, కానీ నాకు మాత్రం హమ్మయ్య అనిపించింది. ఎందుకంటే, వివాదాలకు మూల బిందువైన కారణం చేత భారతదేశాన్ని ఒదిలి వేరే దేశాలలో ఉంటూ భారతదేశాన్ని నిందించే ప్రముఖల చిట్టాలో ముందు ఎవ్వరున్నారు అని ఆలోచిస్తే, లండన్ నగరంలో కాలం చేసిన ఎమ్ ఎఫ్ హుస్సేన్ ముందుంటారు.

పుట్టిందేమో భారతదేశంలో, వివాదస్పదమైన చిత్రాలు భారతదేశానికి సంబందించినవి, భారతదేశ పౌరసత్వాన్ని కాదనుకుని వేరేదేశంలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా స్టేట్ మెంట్స్ చేస్తూ భారతీయ సంస్కృతికి ఓ పెద్ద మచ్చలా నిలచిన వ్యక్తి. ఖత్తర్ యొక్క పౌరసత్వాన్ని తీసుకున్న తరువాత ఆఖరిరోజుల్లో భారతదేశానికి దూరంగా గత నాలుగైదేళ్ళ నుంచి అఙ్ఞాత వాశం చేస్తూ అదే పెద్ద గొప్పలా ఫీలై ఆఖరికి యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డ లండన్ హాస్పిటల్లో హృద్రొగంతో మరణించడం నాకైతే పెద్ద భాధగాలేదు. భారత మాతను నగ్నంగా చూపిస్తూ చిత్రాన్ని గీసి దానికి చెత్త కారణాలు వెతుక్కున్న రోజున ఎంత భాధ పడ్డానో ఆ భాదకి ఈరోజున ఉపశమనం కలిగింది.

ఈయన భారతీయ దేవతలను చాలా తుశ్చంగా చిత్రింకరించినప్పుడు, మనసు బాధ పడ్డా, అవి కులమత గొడవలకు దారతీస్తాయని మౌనంగా ఉన్నా, కులమతాలకు అతీతంగా భరత మాతను నగ్నంగా చిత్రీకరించినప్పుడు ఇతనిపై హేయాభావం కలిగింది. నిజమే, ప్రాచూర్యం రావాలనుకోవడంలో తప్పులేదు, అంత మాత్రాన కనబడ్డ ప్రతీ అమ్మాయిని నగ్నంగా చిత్రీకరించాలనుకోవడం ఎంతటి హీన ఆలోచనో తలచుకుంటే వ్యగ్రతతో నా మనసు చాలా భాధపడుతుంది.

ఏది ఏమైనా, ఇది ఒక శుభదినం అని నేను చెప్పను కానీ ఇకపై భరతదేశ గౌరవాన్ని కించ పరిచే ప్రముఖలలో ఒక వ్యక్తి తక్కువైయ్యాడు అనేది నిజం.

3, జూన్ 2011, శుక్రవారం

అభివృద్దా లేక వినాశనమా!!

యాపిల్ వారు విడుదల చేసిన రెండొవ సంతతికి చెందిన ఐపాడ్ కొనుక్కునేందుకు చైనాలోని ఓ పదిహేడేళ్ళ అబ్బాయి తన కిడ్నీని అమ్ముకున్నాడన్న విషయం నిన్న చైనా టీవీలో కనబడ్డా అదేమీ పెద్ద వింతకాదన్నుట్లు చైనీయులు పట్టించుకోలేదంటే, అక్కడ జరుగుతున్నది అభివృద్దా లేక వినాశనమా?

జనాభా పెరిగితే ఇంతకన్నా ఘోరమైన విషయాలు చదవాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. సాంకేతిక పరమైన అభివృద్ది మంచిదే, కానీ పిల్లలకు స్వేచ్చనిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు కనబడినా అదేమీ పెద్ద వింతకాదులే అనే వారి ధోరణిని ఎలా అర్దం చేసుకోవాలో తెలియటం లేదు. ఆ విషయాన్ని స్పందిచినవాళ్ళు అదేదో పెద్ద హాస్యం అన్నట్లు నవ్వుకోవడం మరీ చోద్యంగా ఉంది.

దీనివెనుక అక్కడి తల్లి తండ్రుల పెంపకం ప్రధాన పాత్ర వహిస్తుంది అనిపిస్తోంది. మున్ముందుగా పిల్లలు జాలంలో ఎలాంటి పనులు చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ పెద్దలు పట్టించుకున్నట్లు లేరు. ఆపై మూడు రోజులు అబ్బాయి కనబడక పోతే పట్టించుకు పోగా ఒక చేతిలో ఓ లాప్ టాప్ మఱో చేతిలో ఐపాడ్ పట్టుకు తిరుగుతున్న అబ్బాయిని పట్టుకుని అడిగితే అప్పుడు అస్సలు విషయం చావు కబురు చల్లగా చెప్పినట్లు వివరించాడంట.

అమ్మేవాడికి తెలివి లేదనుకుందాం, పోనీ కొనే వాడిని మానవతా విలువలు ఉండనక్కర్లేదా అని అడిగితే, దానిదేముందండి అది ఎక్కడ అమ్ముతారో చెప్పండి దాన్నీ కొనుక్కొచ్చేద్దాం అని అంటారు. ఇలా నైతికపరంగా వీరు చాలా దిగజారిపోతున్నారన్నది నిజమై అని మనం అనుకునేంతలో.. అక్కడెక్కడో ఎందుకు చూస్తావు, నీ ముడ్డి క్రింద నలుపు చూసుకో అంటూ మరో ఘటన మన ఆంద్ర ప్రదేశ్ లో ఇవ్వాళ్ళ ఉదయం జరిగింది.

మరో మహిళపై ఓ ప్రేమోన్మాది దాడి చేసి హత్య చేసిన వైనం. అదే తంతుగా ఇవ్వాళ్టి లైవ్ ఛానల్స్ అన్నీ ఊదరగొట్టేశాయి. చైనాలో కుర్రాడు చక్కగా తన కిడ్నీనే అమ్ముకుంటే, మనోళ్ళు ఇంకొంచం ముందుకు వెళ్ళి ప్రక్కనోళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. అక్కడ పడి ఉన్న శరీరాలను కెమెరాలలో భందించాలనే తాపత్రయం ఆ అమ్మాయిని బ్రతికిద్దాం అన్న విషయంపై పెట్టటం లేదు మన కెమెరా మెన్స్. ఒక కెమెరా మెన్ వీడియో తీస్తుంటె, మఱోకతను అక్కడ పడి ఉన్న వారిని కెమెరాలో బాగా పడ్డారా లేదా అన్ని వారిని సరి చేస్తుంటాడు. వీరిని చూస్తుంటే అసహ్యం వేస్తుంది.

ఇలాంటి సమస్యలన్నింటికీ కారణం..

మొదటిది) తల్లి తండ్రుల పెంకపంలో లోపం.

రెండొవది) స్వతహాగా ఉండాల్సిన నైతిక విలువలు. తల్లి తండ్రి నేర్పలేదనుకోండి, పెరిగి పెద్దైన వీరి బుద్ధికేమైంది.

ఇవన్నీ ఆలోచిస్తుంటే, అసహనం వస్తోంది. పిల్లలు లేకపోవడం ఓ రంకంగా సమాజానికి మేలేనేమో అనిపిస్తోంది. ఇంకా వ్రాస్తే ఏదో వస్తుంది.

 
Clicky Web Analytics