భద్రాచలం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భద్రాచలం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఆగస్టు 2011, శనివారం

భద్రాచలం – మఱో ఙ్ఞాపకం

DSCN2500వెళ్ళిన వెంటనే లగేజి సత్రంలో ఉంచి, కాల కృత్యాలు తీర్చుకుని ప్రక్కనే ఉన్న గోదావరిని చూచి వచ్చిన తరువాత ఆలశ్యం అవుతోందని, తొందరలో అయ్యవారి దర్శనార్దం వెళ్ళాము. తీరా దేవాలయం దగ్గరకి వెళితే, అయ్యవారు కొండెక్కి కూర్చున్నారు. ఆ మాత్రం కష్టపడక పోతే అయ్యవారి దర్శనం కలగదులే అని అనుకుని, మెల్లగా ఒక్కోఅడుగు ముందుకు వేసుకుంటూ కనబడుతున్న మెట్లెక్కడం మొదలు పెట్టాను.

భక్తులలో చాలా రకాలు ఉంటారు కదా, వారిలో అయ్యవారిని తొందరగా దర్శనం చేసుకునే హడావిడి ఉన్నవారికి నాలా నత్తలా నడుస్తున్న వారు కనబడక పోవడం వల్ల కొంచం చికాకు వేసినా, నా స్థితికి నేను సమాధానం ఇచ్చుకుని పరుగులెత్తేవారికి దారివ్వడం అలవాటు చేసుకున్నాను. ఆ రోజు నా అదృష్టమో లేక అది సహజమో కానీ సర్వదర్శనానికి ఎవ్వరూ లేరు, అందరూ ప్రత్యేక దర్శనానికే మక్కువ చూపుతున్నారు. అందుకని మేము కూడా ప్రత్యేక దర్శనానికే టికెట్టు తీసుకుని దర్శనార్దం వరుసలో నిలబడ్డాం. మెల్లగా ఒక్కొరొక్కరూ ముందుకు సాగుతుంటే, గర్బాలయంలో కూర్చొని ఉన్న అయ్యవారిని దర్శించుకునే అవకాశం రానే వచ్చింది.

చక్కగా సీతమ్మను ఎడమ తొడపై కూర్చొని ఉంచుకున్న  శ్రీరాముడుని చూడటానికి నా కన్నులు చాలలేదంటే నమ్మండి. ఆ దృశ్యాన్ని ఇప్పటికీ నా కళ్ళ ముందు నిలిపివేసిన ఆ క్షణాన్ని ఏమని చెప్పాలి. వీరిద్దరినే చూద్దాం అనుకున్నంతలో వీరి ప్రక్కనే నిలబడ్డ లక్ష్మణ స్వామి నా దృష్టిని ఆకర్షించారు. ఆవిధంగా సీతమ్మ సమేతుడైన శ్రీరాముడుని మఱియు లక్ష్మణ స్వామిని దర్శించుకున్న తృప్తి వర్ణనాతీతం. అలా సాగి ఆలయం బయటకు వచ్చిన మాకు ఆ ప్రక్కనే పులిహోర ప్రసాదంగా లభించింది. అది తింటూ చుట్టూ చూస్తుంటే, శ్రీరామదాసు కాలం నాటి ఆభరణాలను ఉంచిన మ్యూజియం కూడా దేవాలయ ప్రాంగణంలో ఉంచడం కొంచం ఆశ్చర్య పఱచినా, ఇది బాగానే ఉందనిపించింది.

వింతైన విషయం ఏమిటంటే, అయ్యవారిని చూడటానికి ఎంత మంది బారులు తీరారో అంతకు రొండింతలు ఇక్కడ కనబడ్డారు. దానికి ప్రవేశ రుసుముగా రెండు రూపాయలు దేవస్థానం వారు ఎందుకు విధించారో నాకైతే అర్దం కాలేదు కానీ ఆ విధంగా నైనా కొంత ద్రవ్యం అయ్యవారి ఖాతాకు జమా అయ్యి ఎంతో కొంత మొత్తం భక్తుల సౌకర్యార్దం ఉపయోగపడుతుందనుకుంటాను. ఇక్కడ మఱో విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయ్యవారి ఆలయం ప్రక్కనే కళ్యాణం చేస్తున్నారు. అక్కడ కళ్యాణం చేయించుకునే దంపతులు అందరూ ఆసీనులై ఉన్నారు. వారితో సమానంగా మనమూ కూర్చునే వీలున్నా మేము మాత్రం ఓ ప్రక్కగా కూర్చుని కళ్యాణాన్ని తిలకిద్దాం అని అనుకుని అనువైన చోటుకోసం వెతుకుతుంటే, మా అదృష్టమో ఏమో కానీ వేదం చదువుకుంటున్న విఙ్ఞులు మా కంట పడ్డారు.

అధర్వ వేదం చదువుకుంటున్న ఓ మహానుభావుని వద్దకు చేరుకుని మమ్ములను మేము పరిచయం చేసుకుని వారి క్షేమ సమాచారాలు తెలుసుకి కొంత సేపు సజ్జనులతో గడిపాము. ఇంతలో అక్కడ వరుసలో ఎవ్వరూ కనబడకపోయేసరికి, నా భార్య మఱో సారి అయ్యవారిని అమ్మవారిని దర్శించుకుని వస్తానన్ని వెళ్ళి చక్కగా రెండోసారి దర్శన భాగ్యం కలిగించుకుంది. ఇలా సాగింది ఆ రోజు ఉదయం. అక్కడి నుంచి మెల్లగా రూముకి చేరుకుని, బట్టలు మార్చుకుని సత్రంలో భోజనం కోసం వెళ్ళాం.

18, ఆగస్టు 2011, గురువారం

భద్రాచలం – నా ప్రాప్తం : మొదటి భాగం

ఈశ్వరానుగ్రహం వల్ల నేను ఈ మధ్యనే భద్రాచలం వెళ్ళి వచ్చాను. ఇలా భద్రాచలం వెళ్ళడం మొదటి సారి కాదేమో, కాని నాకు బాగా ఊహ తెలిసి మొదటి సారి అని చెప్పుకోవచ్చు. దానికి తోడు భార్యకూడా వచ్చింది. దర్మ పత్నీ సమేతంగా వెళ్ళి రావడం కొంచం ఊరటగా ఉంది. అన్నింటికన్నా మించిన తృప్తినిచ్చిన విషయాలు ఒక్కటి అని చెప్పుకోవడానికి ఏదో తెలియటం లేదు.

యాక్సిడెంట్ అయిన తరువాత ఒక్కడినే నడుచుకుంటూ వెళ్ళడం అందునా ప్రయాణం చెయ్యడం ఇదే మొదటి సారి. కుంటుకుంటూ వెళుతున్నాను, ఏమైనా అవుతుందేమో అన్న భయం మనసులో ఉన్నా, అంతా శ్రీరామునిపై భారం వేసేసి, ధైర్యం చేసి బయలు దేరాను. నాలుగు రోజులు ముందు వరకూ నా ఆలోచనలో ప్రయాణం అంతా కారులో వెళ్ళడం గురించి ప్రళాణిక వేసుకుంటున్నంతో, హితులైన కృపాల్ కశ్యప్ గారి రూపంలో ఈశ్వరుడు మా ఇంటికి విచ్చేసి, భద్రాచలం వెళ్ళడానికి రైల్ ఉందు చూసుకోండి అని సలహా ఇచ్చారు. అంతే, అప్పుడే జాలంలో మనకు అందుబాటులో ఉన్న రైల్వే వారి బుక్కింగ్ సైట్లో వెతికితే, ఆఖరుగా రెండే రెండు సీట్లు మిగిలి ఉన్నాయి.

DSCN2432వెంటనే బుక్ చేసేసుకున్నాను. ఇది యాదృశ్చికమా లేక సదృశ్యమా అంటే, అది ఈశ్వరుని కృపే అని నేను నమ్ముతాను. అదిగో అలా మొదలైంది నా భద్రాచల ప్రయాణం. ప్రయాణం చక్కగా మొదలైంది అనుకునేంతలో ఓ విఘాతం బాలయ్య రూపంలో చేరుకుంది. మేము ప్రయాణిస్తున్న రైల్లోనే బాలయ్యకూడా భద్రాచలం వస్తున్నారంట. ఇంకేం భాట్రాజులు ఉండనే ఉంటారుకదా, నువ్వది ఈకావో, నువ్విద్ది పీకావో, అంటూ తిరిగే వాళ్ళన్నమాట, వారు ఎంత హడావిడి చేసేస్తున్నారంటే, తలకాయి నెప్పొంచిందనుకోండి. సరే వారి విషయం నాకు అనవసరం అనుకుంటూ నేను ఎంత జాగ్రత్తగా ఉండాలో అని ఆలోచించుకుంటూ నాకు కేటాయించిన చోటకు చేరుకున్నాను. చక్కగా సికింద్రాబాద్ నుంచి మొదలైన ప్రయాణం భద్రచలం రోడ్డు అనే స్టేషన్ అయిన కొత్తగూడం చేరుకునేటప్పటికి ఉదయం ఐదు గంటలైంది.

ఉదయం ఐదు గంటల వేళ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ స్టేషన్ నుంచి బయటకు వచ్చేటప్పటికి, బయట మూగిన జనాలు, మన హీరో గారి అభిమానులు అంతా జారుకున్నారు. అక్కడ మాకు ఒక్క ప్రయాణ సాధనం ఆటో తప్పితే మరింకేం కనబడలేదు. ఆటో వాళ్ళేమో మూడువందల యాభై రూపాయలనుంచి వారి నోటికి ఎంత తోస్తే అంత అడుగుతున్నారు. ఇలా ఐతే ఎలా అనుకుంటూ,  మెల్లగా బయటకు చేరుకునేటప్పటికి, ఓ ప్రైవేట్ ట్రావల్స్ బండి వాడు కనబడ్డాడు. ఒక్కొక్కరికి నలభై రూపాయలు అడిగాడు, హమ్మయ్య, అనుకుని సౌకర్యంగా భద్రాచలం చేరుకున్నాను. అప్పటికి తెలతెల్లవారుతోంది.

DSCN2436

ఇదిగో అక్కడ కూడా మన బాలయ్యగారి రాబోయే సినిమా, “శ్రీరామ రాజ్యం” పాటల సందడికి సంబందించిన బ్యానర్లు మాకు స్వాగతం ఇచ్చాయి. కానీ నాకు నచ్చని విషయమేమిటంటే, పూజ్యనీయమైన బద్రాచల శ్రీరాముని గుడికి వెళ్ళే ముఖ ద్వారమైన దారికి వీరు ఇలా బ్యానర్లు తగిలించడం ఎందుకో మింగుడు పడలేదు. కానీ ప్రస్తుతం మనం ఉన్నది ప్రజాపాలన కలిగిన రాజ్యంలో అని రాజ్యాంగం చెబుతోంది కదా, అందువల్ల ప్రజలు ఏమి చేసినా మనం మాట్లాడ కూడదు. అలాగే ఈ విషయంలో కూడా, అనుకుని, శ్రీరాముని తలచుకుని ముందుకు సాగాను. తెలవారు ఝామున ఇలాంటి దృశ్యం నాకు అనుకోని అనుభూతిని మిగిల్చింది. ఇంతటి అనుభూతిలో, బాలయ్యలాంటి వ్యక్తి కూడా భాగమైనందులకు కించిత్ బాధగా ఉన్నా, గురుతుల్యులు చెప్పిన ఓ విషయం ఇక్కడ ఙ్ఞప్తికి వస్తుంది. చండాలుడియందు అలాగే విఙ్ఞుల యందు సమదృష్టికలిగి ఉండాలి అన్న మాట గుర్తు తెచ్చుకుని, అందరియందు సమదృష్టి కలిగి ఉండాల్సిన ఆలోచనను పెంచుకునేందుకే ఈశ్వరుడు ఇలా చెపారని అనుకున్నాను.

DSCN2437

ఈశ్వరుని కృప మనకు ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు. కాకపోతే మనం అందుకు సిద్దంగా ఉండటమే ముఖ్యం. భద్రాచలం వెళ్ళడానికి ఆయితే టికెట్లు రిజర్వ్ చేయించుకున్నాను కానీ ఎక్కడ ఉండాలా అని అనుకుంటుంటే, ప్రయాణానికి ఒక్క రోజు మఱో హితుల రూపంలో ఈశ్వరుడు నాతో చెప్పించారు. వారికి తెలిసిన స్నేహితులు అక్కడే నివాశితులై ఉన్నారని, వారు నాకు ముందుగా ఓ రూము రిజర్వ్ చేయించి పెడతానని. అదిగో అదే ఈ “శ్రీరామ నిలయం”. తిరుపతిలో లాగా ఇక్కడ కూడా ఓ రిజర్వేషన్ కౌంటర్ యందు మనం ముందుగా రిజర్వ్ చేయించుకుంటే, ఇక్కడ ఉండటానికి మనకు అనుమతి లభిస్తుంది. ఈ శ్రీరామ నిలయం ప్రక్కనే “సీతా నిలయం” కూడా దేవాలయం వారు కట్టారు. గదుల లోపల నిర్వాహణా పరమైన లోపాలు చాలా ఉన్నా, భక్తితో వచ్చిన నాకు మరింకేం ఇబ్బంది కాలేదు. చక్కగా కాల కృత్యాలు తీర్చుకుని, గోదావరిలో స్నానం చేసివద్దాం అని ప్రక్కనే ఉన్న గోదావరికి చేరుకున్నాను.

DSCN2438వరద రావడం వల్ల అలాగే అక్కడ ఉన్న భక్తుల అత్యుత్సాహం గమనించిన తరువాత గోదావరిలో మునగలేక పోయ్యాను కానీ గోదావరీ జలాలను నెత్తిమీద జల్లుకున్నాను. వరద వల్ల నీరంతా బురద బురదగా ఉన్నా ఫరవాలేదు కానీ, అత్యుత్సాహంతో ఉన్న భక్తులు కుంటి వాడిని కాకపోయినా, అపరేషన్ చేసిన కాలు పూర్తి స్థాయిలో నడవనివ్వక పోవడం వల్ల నిలదొక్కుకోలేని నన్నువారు గమనించకుండా ఎన్ని గంతులు వేస్తున్నారో గమనించిన తరువాత వారితో కలసి నీళ్ళల్లోకి దూకడానికి సాహసించలేక పోయ్యాను.

అలా గోదావరీ జలాలతో ప్రోక్షణ చేసుకుని, సత్రానికి చేరుకుని, తలారా స్నానం చేసి ఈస్వరుని తలచుకుని, ఆలయం వైపు అడుగులు వేశాను. సాధారణంగా చాలా సార్లు నాకు దైవ దర్శనం అయ్యేంత వరకూ చుట్టూ ఉన్న (లేదా) జరుగుతున్న పరిణామాలు నాలో కోపాన్ని లేదా అసహనానికి గురిచేస్తాయి. కానీ ఏమి విచిత్రమో ఏమో, ఆరోజు ఉదయం నుంచి చాలా ఘటనలు నన్ను అసహనానికి గురిచేసినా నా మనస్సులో ప్రసాంతత దూరం కాలేదు. ఓ ప్రక్కన జరుగుతున్న పరిణామాలు నన్ను గుర్తుపెట్టుకునేటట్టు చేసినా, అవి నన్ను ఏమీ చెయ్యలేక పోయాయంటే, దానివెనకాల శ్రీరాముని కృప ఎంత సత్యమో నాకు మాత్రమే తెలుసు.

ఇలా ఒక్కో విషయానికి ఇంతగా వ్రాసుకుంటూ పోతే, ఒక్క పోస్టు చాలదేమో.. మరిన్ని వివరాలతో, మరో పోస్టు

 
Clicky Web Analytics