Values లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Values లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, నవంబర్ 2012, సోమవారం

గాయత్రీ మంత్రం .. ఇందుకా!!

గాయత్రీ మంత్రం.. ఎలా మొదలు పెట్టాలి అన్న ఆలోచనతో సతమతమౌతున్నప్పుడు, ఉన్నదేదో సూటిగా చెప్పేస్తే పోలా అన్న ఆలోచనతో ఎక్కువ చించకుండా మొదలుపెట్టేసాను.

 

ఉపోద్ఘాతం:

ఓ పెద్దాయన, గాయత్రీ మంత్రాన్ని తన ఇంట్లో కాలింగ్ బెల్ యొక్క సౌండుగా పెట్టుకున్నారు.

ఓ పెద్దాయన, గాయత్రీ మంత్రాన్ని తన సెల్ ఫోన్ రింగ్ టోనుగా పెట్టుకున్నారు.

ఓ పెద్దావిడ, గాయత్రీ మంత్రాన్ని తన ఫోన్ కాలర్ టోనుగా పెట్టుకున్నది.

ఓ కుర్రవాడు, గాయత్రీ మంత్రాన్ని తన కారు రివర్స్ చేసుకునేటప్పుడు హెచ్చరిక చేసే విధానంగా వాడుకున్నాడు.

ఓ యువతి, గాయత్రీ మంత్రాన్ని నలుగురు వినేటట్టు ఓ లౌడ్ స్పీకర్లో పొద్దు పొద్దునే పెట్టేసింది..

..

..

 

ఇక అసలు భావన

గాయత్రీ మంత్రం అనేది జగమెరిగిన రహస్యం. అట్టి గాయత్రిని ఉపనయన సంస్కరం అప్పుడు తండ్రి మాత్రమే చెప్పాలి, కొడుకు మాత్రమే వినాలి అన్నది ఆచారం. ఆ పద్దతిలో ఉపనయన క్రతువు జరిపించే బ్రహ్మగారు కూడా వినకూడదు అన్నట్లుగా, కొడుకు చెవిలో గాయత్రిని ఉపదేశించే తండ్రిని గోప్యంగా ఉంచాలన్న ఉద్దేశ్యంతో, వారిని కప్పుతూ ఉండే విధంగా ఓ పంచని కప్పుతారు. ఇది ఎన్నో ఏళ్లుగా వస్తున్న విధి విధానం. అందరూ పాటిస్తున్నా, ఈ విషయం తెలిసిన వారు కూడా ఖండించ కుండా మౌనం వహించి బ్రతకడం అంగీకరించ లేక పోతున్నాను.

ఎన్నో విషయాలు తెలిసాయి అనుకుని బ్రమ పడేవారు సైతం ఈ విషయాన్ని విశ్మరించి, జీవిస్తూ పెద్దవారిగా చెలామణి అవుతుంటే, అసహ్యం వేస్తోంది. వివరించి చెబుదాం అని ప్రయత్నం చేయ్యబోతే, వయస్సు రీత్యా చిన్నవాడివి నాకు చెప్పేంత సాహసం చేస్తావా అని దబాయించి బ్రతికేస్తున్నారు. చెట్టుకీ పుట్టకీ వస్తాయి, ఆలెక్కలో వేసుకుని ముందుకి సాగి పోతే సరి.

అందువల్ల చెప్పొచ్చినది ఏమిటంటే, సంస్కృతి అనేది ఒకటి ఉంది అని తెలుసుకుని ఆ విధంగా చేసేసుకుందాం.

18, ఏప్రిల్ 2012, బుధవారం

నీతి శాస్త్రం : నడువడి ఎలా ఉండాలి

ఈ మధ్య కాలంలో ఏమీ వ్రాయాలని అనిపించక వ్రాయటం లేదు. ఇవ్వాళ మాత్రం ఇది వ్రాయక తప్పదని నిశ్చయించుకుని మొదలు పెడుతున్నాను. ఇక్కడ ప్రస్తావించే విషయాన్ని మానవ దృక్పధంతో ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీనిని కులమతాలకు అతీతంగా ఆలోచించాలి. భావం ప్రధానం కాని భాష్యం కాదు అని అనుకుంటే, సమగ్రంగా అర్దం అవుతుంది.

కొంతకాలంగా వీలు చేసుకుని శ్రీ మహా భాగవతము చదువుతున్నాను. అందలి కొన్ని విషయాలు ఇప్పుడు నన్ను ఇలా ప్రేరేపించాయి. పోతనగారి గురించి నేను ఏమి వ్రాసినా అది దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటుంది. ఎందుకంటే, సాహిత్యం అనే పదమే కానీ దానిలోని గొప్పతనన్ని చాలా కాలం వరకూ ( .. గ్రహించడం మాట అటువుంచి, ఆ గొప్పతనాన్ని .. ) హేయాభావంతో చూస్తూ బ్రతికిన నాకు దాని గురించి ప్రస్తావించడం మినహా ఆఖ్యానించకూడదని అవగతం అయ్యింది. అలాంటి సాహిత్యానికి తలమానికమైన భాగవత, తెలుగు అనువాద రచయిత అయిన పోతనగారి గురించే!! అందునా నేను కామెంట్ చెయ్యటమా!!! హరి హరి.. ఎంతటి సాహసమో కదా అని చదివే వారు ముక్కున వేలువేసుకుని నోటితోనే కాదు చేతితోకూడా నవ్వుతారు. ఇప్పటికే ఎన్నో రాళ్ళు పడ్డాయి, వాటికి తోడుగా మరిన్ని అవసరమా నాకు. అందుకని పోతనగారిని ప్రస్తావిస్తూ, వారి కవితా చాతుర్యానికి వేవేల కొనియాడుతూ, వారు రచించిన కొన్ని పద్యాలను ఇక్కడ ప్రస్తావిస్తాను.

శ్రీ కృష్ణ భగవానుని నిర్యాణాంతరం ద్వారక నుండి ఖిన్నుడై వచ్చిన అర్జునుని చూచి ధర్మరాజు దుఃఖ హేతువుని తెలియక ప్రశ్నించిన ఘట్టమున రచించిన శ్లోకములు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

క. ఓడితివో శత్రువులకు నాడితివో సాధుదూషాలామ్ముల్
గూడితివో పరసతులను వీడితివో మానధనము వీరుల నడుమన్.

క. తప్పితివో యిచ్చెద నని, చెప్పితివో కపట సాక్షి చేసిన మేలుం
దప్పితివో శరణార్ధుల, రొప్పితివో ద్విజులఁ బసుల రోగుల సతులన్.

క. అడిచితివో భూసురులను, గుడిచితివో బాల వృద్ధు గురువులు వెలిగా
విడిచితివో యాశ్రితులను, ముడిచితివో పరుల విత్తములు లోభమునన్

అనిఅడుగుతారు ధర్మరాజు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వీటి అర్దాలు నాకు అంతగా అవగతం అవ్వక పోయినా, నాకు అర్దం అయ్యినంత వరకూ ఏమి అర్దం అయ్యిందో వ్రాస్తాను.

మొదటి శ్లోకంలో ..

౧) శత్రువుల చేతిలో ఓడి పోయ్యావా
౨) సాధువుల యందు దూషణ చేసావా
౩) పరసతులను కూడి రమించావా, అంటే పర స్త్రీలతో రతి సంగమం కావించావా
౪) వీరుల మధ్యలో ఉండి మానము ధనము వంటి వాటిని వదిలి ప్రవర్తించావా

రెండొవ శ్లోకంలో ..

౫) ఏదైనా చేస్తాను అని ఇచ్చిన మాట తప్పావా
౬) కపటమైనటువంటి శాక్ష్యం చెప్పావా
౭) చేసిన మేలుకి తిరిగి మేలు చెయ్యడం అనే ప్రక్రియను తప్పావా (లేక మఱో భావంగా, మేలు చేసిన వారి మేలుని మెచ్చుకోక పోగా దెప్పి పొడిచేటట్టుగా ప్రవర్తించడం చేసావా )
౮) శరణార్దులను రక్షించకుండా ఏడిపించావా అంత యేకాక, పైన ప్రస్తావించిన వాటిల్లో, ద్విజులు రాజులు రోగులు లేదా స్త్రీలు ఉన్నారా

మూడొవ శ్లోకంలో ..

౯) భూసురులు అంటే రాజులను అణచావా
౧౦) బాలలను వృధులను గురువులను .. [[ ఏమి చేసారు అని అన్నారో అర్దం కాలేదు. నాకు తెలుగుని అర్దం చేసుకునే ఇంగితం లేనందున ]]
౧౧) ఆశ్రయించి ఉన్న వారిని విడిచి వెళ్లి పోయ్యావా
౧౨) లోభత్వం కలిగి ఉండి పరుల విత్తమును దాచుకున్నావా

అని నాకు అర్దం అయ్యింది. అంతే కాకుండా నాకు మఱింకో విషయం కూడా అర్దం అయ్యింది. ఒక వేళ అర్జునుడు పైన ఉదహరించిన వాటిల్లో ఏదైనా చేసి ఉన్నట్లైతే, కొన్నింటి యందు తత్వ చింతన చేస్తేనే అర్దమయ్యే విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. మరికొన్నింటిలో తత్వ చింతన చేసినా నిస్పక్ష పాతంగా ఆలోచించగలిగే మనసు కలిగి ఉండాలి. అప్పుడే చేసిన పని తప్పు అని తెలిసి చింతిస్తారు. ఉదాహరణకి, సాధువుల యందు దూషణ అనే కార్యం తీసుకున్నాం అనుకుంటే, అర్జునుడు దూషణ చేసి ఉన్నా, అది సాధువులయందు అని గ్రహించడానికి మనసు ఒప్పుకోదు. వారేదో వెధవ పని చేసారు కాబట్టి నేను దూషణ చేసాను అని సమర్దించు కునే వాడు. అలా సమర్దించుకున్నా, తన తప్పు తెలుసుకుని పశ్చాతాపంతో దుఃఖించే స్థితికి చేరుకోవడం అంటే ఎంతో నిబద్దతతో కూడుకున్న వ్యక్తిత్వం కలిగిన వారై ఉండాలి. అలాంటి స్థితిలో అర్జునుడు ఉన్నాడు అని అనుకోవాలి.

ఇక్కడ ఉన్న విషయాలను క్షుణ్ణంగా కాకపోయినా మన స్థాయికి తగ్గట్టుగా ఆలోచించుకున్నా, చాలా విషయాలు మనకు అవగతం అవుతాయి. కానీ ఇక్కడ ప్రస్థావించినవి ఎన్ని వందల ఏళ్ళ క్రిందట అనే మాట ప్రక్కన పెడితే, ఎన్ని రోజులు క్రిందటిదైనా పాత చింతకాయ పచ్చడి రుచిగానే ఉన్నట్లు, ఈ మాటలు కూడా చాలా ప్రశస్తంగా మరింత క్రొత్తగా ఈ నాటి రోజులకు అనుగుణంగా రచించారా అన్నట్లు ఉన్నాయి. ఎవ్వరి గురించో నాకెందుకు, నా గురించి నేను ఆలోచించుకుంటే..

అను నిత్యం నేను శత్రువుల చేతిలో ఓడిపోతూనే ఉన్నాను. సాధువుల యందు దూషణ చేస్తూనే ఉన్నాను. పర సతులను కూడి బ్రతకటం లేదు కానీ కపట శాక్ష్యాలు అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను. చేసిన మేలుకి కృతఙ్ఞతా పూర్వకంగా తిరిగి మేలు చేయకపోయినా, వారి సహృదయానికి గుర్తుగా ఉన్న (నా యందు వారు చేసిన) మేలుని మఱచి జీవిస్తూ ఉంటాను. ఆఖరులో లోభత్వం కలిగి పరుల విత్తమును అని అనను కానీ నాకు ఉధ్యోగం ఇచ్చే వ్యవస్థను సంకట స్థితిలో ఉంచి నా జీతాన్ని బేరం చేస్తూనే ఉన్నందున వారి ధనాన్ని ఆకాక్షించి దోచుకుని దాచుకుంటున్నాను అనిపిస్తోంది.

ఇదంతా నా గురించి నేను ఆత్మ విమర్స చేసుకునే సమయంలో ఒలికిన భావనలోని కొన్ని వాక్యాలు మాత్రమే. కానీ నా గురించి తీసి ప్రక్కన పెడితే, ప్రస్తుతం నేను ఉన్న సమాజంలో ఎంతమంది ఇలాంటి వాటిని గమనించి మెచ్చుకుంటారు? మెచ్చుకోవడం ఒక మాట అయితే, వాటిని అవగాహన చేసుకుని అర్దం చేసుకుని ఆ విధంగా జీవించే వారు ఎంతమంది? ఇలాంటి ప్రశ్నల పరంపర ప్రక్కన పెడితే ఇంత చక్కగా ప్రతీ మనిషి తన తోటి వారియందు సతు బుద్ది కలిగి ఉండాలి అని మన గ్రంధాలు చెబుతున్నాయని ఒప్పుకునే వారు చాలా అఱుదు అని నా అభిప్రాయం

13, డిసెంబర్ 2011, మంగళవారం

మానవ దేవుళ్ళు – ఓ ఆలోచన

డాక్టర్ కొమ్మూరి వేణుగోపాల రావు గారు రచించిన, “ఆలోచన ఒక యఙ్ఞం” అనే శీర్షికతో, “అందులోంచి అద్బుత జీవితం” అనే ఉప శీర్షికతో ఉన్న పుస్తకం, ఈ మధ్య నేను చదువుతున్న ఓ పుస్తకం. ఈ పుస్తకం గురించిన ఓ రివ్యూ మఱో సారి వ్రాస్తాను. కాకపోతే, కొన్ని వాక్యాలు / పేరాలు ఇక్కడ యధావిధిగా ఉంచేస్తున్నాను. ఈ పుస్తకం అందరూ చదివి ఉండవచ్చు అలాగే చదివి ఉండక పోనూ వచ్చు. ఈ పుస్తకాన్ని నేను ఇంకా పూర్తి చెయ్యక పోయినా, కొన్ని ఆలోచనలను యధావిధిగా ఇక్కడ ఉంచుకోకపోతే మర్చి పోతానేమో అన్న భయంతో ఇక్కడ యధాతధంగ ఉంచుతున్నాను.


పేజీ: 144

నా మనసు క్షోభింపచేస్తున్నదల్లా మానవ దేవుళ్ళే!

వీరిలో కూడా ఆదిలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కుని, తరువాత జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి పోయి, ప్రస్తుతం ప్రజల క్షేమమే దృష్టిలో పెట్టుకుని కృషి చేస్తున్న వారిని అభినందిస్తూ అంజలి ఘటిస్తున్నాను గాని వారిక్ జోలికి పోవటం లేదు!

దేవుడనేవాడు యుగానికి ఒకటి రెండుసార్లో, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారో అవతరిస్తాడు. మిగతావారు రమణ మహర్షి, రామ కృష్ణ పరమ హంస వంటి దివ్యపురుషులు. వారు భగవత్ స్వరూపులుగా ఆరాధనలు పొందారు గానీ, మేమే దేముళ్ళమని ఎప్పుడూ ప్రకటించుకోలేదు.

చిన్మయానంద, శివానంద ఇంకా కొందరు మహా పురుషులు ప్రజలను ఆధ్యాత్మిక దృష్టివైపు మళ్ళించి, వారిలో పరివర్తన తీసుకురావటానికి ప్రయత్నించారు కానీ, అందరితో కలసి జీవించారు. కానీ మేమే దేముళ్ళమని ఎప్పుడూ బడాయిలు చెప్పుకోలేదు. పైగా అందరితో కలసి భగవంతుణ్ని కీర్తించారు. భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం, వీటి గొప్పదనాన్ని తమదైన శైలిలో అద్భుతంగా వ్యాఖ్యానించి, ప్రజలకు అందుబాటులోకి రావటానికి ఎనలేని సేవ చేశారు.

మానవ దేవుళ్ళు ….

ప్రతీ అయిదేళ్ళకూ, పదేళ్ళకూ ఒకసారి వెలుస్తూ ఉంటారు. కొందరు, ఆ ఊరి వరకే పరిమితమై ఉంటారు. కొందరు జిల్లా స్థాయికి, రాష్ట్రస్థాయికి, జాతీయ స్థాయికి, ఎదుగుతూ ఉంటారు, వారి వారి శక్తి సామర్ధ్యాలను బట్టి.

వీళ్ల నెక్కువగా ఆర్ధికంగా చితికి పోయి, కుటుంబ వైఫల్యాలతో విసిగిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలు ఆశ్రయిస్తూంటారు.

ఎందుకూ?

భగవంతుడు ప్రత్యక్షంగా కనబడుతున్నాడని అనుకుంటున్నారు.

ఎవరెవరికో ఏమేమో జరిగాయని కధలు చెప్పుకుంటున్నారు.

“నన్ను కొలవండి. మీ కష్టాలు తీరిపోతాయి” అని హామీలు ఇస్తున్నారు.

మొదట్లో అంతగా నమ్మకం కుదరక తటస్థంగా, ఊగిసలాడుతుంటే, సీనియర్ వీర భక్తులు వాళ్ల మీద ఒత్తిడి తీసుకు వచ్చి బలవంతంగా చేర్పించేస్తున్నారు.

ఒకసారి అడుగుపెడితే… ఇక అక్కడ ఇరుక్కు పోయినట్టే!!

మొదట ప్రేమతత్వం…

భరోసాలు …

కొన్ని జిమ్మిక్స్ ….

వాళ మీద నమ్మకం, గురి కుదిరేలా చేస్తారు.

తమ సమస్యలు తీరుతాయన్న ఆశయంతో వాళ్ళ ప్రలోభాలకి ఒకటొకటిగా లొంగి పోతుంటారు.

“మీకు భక్తి చాలలేదు. మీలో మార్పు రాలేదు.”

“అది చెయ్యండి. ఇది చెయ్యండి”

ఎవేవో కార్యకలాపాలు చేయిస్తుంటారు.

అసలే ఆర్దిక దుఃస్థితిలో ఉంటే ప్రతీ సారి డబ్బు ఖర్చు… అప్పో సొప్పో చేసి … తప్పించుకోవటానికి వీల్లేని చిక్కు పరిస్థితిలో ఇరుక్కు పోతూ ఉంటారు.

ఒక సారి లోక కళ్యాణం కోసం …

ఒకసారి వ్యక్తిగత సమస్యలు చిటికెలో తీరటం కోసం ….

ఇంకోక సారి ఆర్ధికాభి వృద్ది కోసం ….

ఎవేవో తతంగాలు.

ఇలా కాకుండా, కొన్ని తప్పని సరి కార్యక్రమాలు విరుచు పడుతుంటాయి.

నూతన సంవత్సర సందేశం ….

దేవుడు గారి పుట్టిన రోజుల వేడుకలు ….

దేముడి గారి భార్య గారి జన్మదిన సంరంభాలు, దేముడు గారి కళ్యాణ మహోత్సవం (సీతారాముల కళ్యాణంలా).

ఇలా ప్రతి రెండు మూడు నెలలకూ ఏదో ఒక తతంగం, ఉత్సవాలు, డబ్బు వసూళ్ళు..

ఇంచుమించు స్థాయి భేదాలు మినహాయించి మానవ దేవుళ్లు వెలసిన చోటల్లా ఇవే విన్యాసాలు!

ఇంతటితో ఆగదు, వారి ఖ్యాతి విస్తరిస్తోన్న కొద్ది ఇప్పుడున్న ఆశ్రమం పరిధిలు సరిపోవు. వారి దృష్టి జాతీయ – అంతర్జాతీయ స్థాయి మీదకి మళ్లుతుంది. పని పాటు లేనట్లు ఎక్కడెక్కణుంచో ఫారినర్స్ రావటం మొదలయ్యే సరికి ఈ ఆకర్షణ ఇంకా ఎక్కువవుతుంది. ఇలా పైకి వస్తున్న దేవుళ్ళ  దగ్గర చూడండి, విధిగా కొంత మంది విదేశీయులు కనిపిస్తారు. మన భాషలో, వాళ్ల స్టయిల్లో పాటలు పాడుతూ కనువిందూ, వీనుల విందూ చేస్తూ ఉంటారు.

భారీ ఎత్తున ఆశ్రమాలు నిర్మాణం మొదలవుతుంది, కోట్ల రూపాయల బడ్జెట్ తో.

డబ్బు…. చందాలు… వేల, లక్షల స్థాయిలో,

అసలే సమస్యలతో నలిగి పోతూ, హృదయ విదారకస్థితిలో ఉన్న భక్తులను ఇంకా పీల్చి పిప్పి చేస్తుంటారు.

“దుఃఖం నుండి విముక్తి, సమస్యల పరిష్కారం” ఈ నినాదాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి.

చిత్రమేమిటంటే ఇందులోకి చేరాక కూడా ఏ సమస్యకూ పరిష్కారం లభించని వారు కూడా ఆత్మ వంచన చేసుకుంటూ ఈ ప్రచారం చేస్తూ ఉంటారు.

వాళ్లకూ మధ్య మధ్య అనేక సందేహాలొస్తూ ఉంటాయి. ప్రశ్నలు ఉదయిస్తూంటాయి.

“మీకు భక్తి లేదు. మీలో అహంకారం పోలేదు. మీలో ఇంకా మార్పులు రాలేదు.” అంటూ వారిని అణగదొక్కేస్తూ ఉంటారు.

కొంత మంది బాధ ఆపుకోలేక కొంచం సూటిగా అడగబోతే అవహేళన చేస్తూ, అవమానం కలిగే రీతిలో హీనంగా మాట్లాడుతారు. మిగతా వాళ్ళు తాము చాలా గొప్ప వాళ్లయినట్లు ఫీలైపోతూ, హేళనగా నవ్వి, అలా అడిగిన వాళ్ళను పురుగుల్లా చూడటం మొదలు పెడతారు.

అంటే, భక్తుడిలో ప్రశ్నలు ఉండకూడదు.

అతడికి వ్యక్తిత్వం ఉండకూడదు.

అతను ఓ బానిసలా ఉండాలి.

మానవదేవుళ్ల ఉనికి ఇలా బానిసల్ని తయారు చేయటం మీదే ఆధార పడి వుంటుంది ..


ఇలా సాగిన తరువాత వీరు ఓ మాంచి మాట వ్రాస్తారు

“మానవ దేవుళ్ళు” అబద్దం కావచ్చు కానీ మంచి గురువులున్న మాట “మాత్రం” నిజం!

 

ఈ వాక్యంలో ఎన్ని నిఘూడమైన అర్దాలున్నాయో!!

5, అక్టోబర్ 2011, బుధవారం

క్రొత్తగా నేర్చుకున్న పాఠం

చదరంగం ఆట అంటే నాకు ఎందుకో తెలియని ఇష్టం. చాలా రోజులుగా నేను ఈ ఆటని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆడుతునే ఉన్నాను. అంతా కాకపోయినా కొంతలో కొంత ఘటికుడనే అని చెప్పుకోవాలి. కానీ నాలోని ఓ బలహీనత నన్ను ఈ ఆట యందు ఎదగకుండా ఉంచుతున్నదని నాకు కొంతకాలం వరకూ తెలియదు. కానీ తెలిసేటప్పటికి పుణ్యకాలం కాస్తా దాటిపోయింది. ఆలశ్యంగా నైనా అసలు విషయం తెలిసినందులకు కొంతలో కొంత మెఱుగైనా, పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలదాకా వస్తాయన్న సామెత పరంగా కొన్ని కొన్ని అలవాట్లు నన్ను వదలి పోనంటున్నాయి.

ఇంతకు ముందు కొంతకాలం క్రిందట, అనుభవాలనుంచి నేను నేర్చుకోవటం లేదని వ్రాసుకున్నట్లు గుర్తు. ఇది జరిగి దాదాపుగా ఓ తొమ్మిది నెలలైనా, ఈ నిజం వంటపట్టడానికి చాలా కాలం పట్టేట్టు ఉంది. తోలు మందంకదా. అందునా ఒంటి నిండా కొవ్వుందని ఈ మధ్యనే డాక్టర్ గారు తేల్చేశారు. అంత కొవ్వు కరిగి నిజం మింగుడు పడాలంటే, కొంచం కష్టమే కానీ నిజం నిజం కాకపోతుందా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, చదరంగం ఆట మఱియు నా ప్రవేశం గురించి.

ప్రతీ సంవత్సరం మా ఆఫీస్ వాళ్ళు చదరంగం పోటీలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా నేను పాలు పంచుకుంటాను. క్రిందటి ఏడాది ఇలాగే పాలు పంచుకుని ఓ అనామకుని చేతిలో ఓడిపోయ్యాను. ఈసారి కూడా గెలుపు అంచులదాకా వెళ్ళి ఓడిపోయ్యానని ఒప్పుకుని విరమించుకున్నాను. నేను ఓడిపోయ్యాను అన్న స్థితికి ఒక్క నిమిషం వరకూ ఆలోచిస్తే, అన్ని కోణాల్లోనూ నాదే పైచేయ్యిగా సాగుతున్న ఆట అది. కానీ ఇక్కడ నా ప్రత్యర్ది పోరాట పఠిమని మెచ్చుకోకుండా ఉండలేను. తాను ఓడిపోవడనికి అన్ని దారుల్లోనూ వీలుంది అని తెలిసి కూడా చచ్చేవరకూ పోరాడాలి అన్న ఒకే ఒక్క ఆలోచన అతనిని గెలిపించింది.

మానవుడన్న తరువాత తప్పులు అనేవి సహజం. ఒక్కొసారి మనం చేసే తప్పుల వల్ల మనం ఎంతటి మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందో నాకు ఎన్ని సార్లు అవగతం అవుతున్నా, నేను తెలుసుకోలేక పోతున్నా. చేసిన తప్పులే పునరావృత్తం అవుతున్నాయి. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, స్వతహాగా నాలో ఓ చిన్న భావన ఎప్పటి నుంచో ఉన్నది. మనం ఆడే ఆట వల్ల ఒక్కోసారి ఎదుటి వారికి పోరాడటానికి అవకాశం ఇవ్వకుండా, దుందుడుకుగా యదేశ్చగా ఓడించుకుంటూ పోకుండా, వారికీ పోరాడి ఓడిపోయ్యాం అన్న భావన కలిగించి కొంత ఉపశమనం కలిగిద్దాం అని ఆడేవాడిని. అదిగో అందువల్లే ఇంతకు ముందు నేను గెలవాల్సిన ఆట ఓడిపోవడనికి దారి తీసింది.

పోనీలే అని ఊరుకోకుండా, నిష్కర్షగా ఎలా పడితే అలా నరుక్కుంటూ పోతే అప్పుడు ఎదుటి వారు బాధ పడుతున్నారు అన్న భావన నాలో ఉత్పన్నం అవకుండా ఉండి, నేను గెలవాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో చివ్వరిదాకా పోరాడాలి అన్న క్రొత్త పాఠం నేను నేర్చుకున్నాను. ఎదుటి వారు ఫీల్ అవుతారని నేను ఫీల్ అవ్వడం ఇంతకాలం నేను చేసిన ఓ తప్పిదం అని ప్రస్తుత కాలం ఓ గుణపాఠాన్ని నేర్పింది. రాబోయే కాలం ఇంకేం నేర్పుతుందో.

18, ఆగస్టు 2011, గురువారం

భద్రాచలం – నా ప్రాప్తం : మొదటి భాగం

ఈశ్వరానుగ్రహం వల్ల నేను ఈ మధ్యనే భద్రాచలం వెళ్ళి వచ్చాను. ఇలా భద్రాచలం వెళ్ళడం మొదటి సారి కాదేమో, కాని నాకు బాగా ఊహ తెలిసి మొదటి సారి అని చెప్పుకోవచ్చు. దానికి తోడు భార్యకూడా వచ్చింది. దర్మ పత్నీ సమేతంగా వెళ్ళి రావడం కొంచం ఊరటగా ఉంది. అన్నింటికన్నా మించిన తృప్తినిచ్చిన విషయాలు ఒక్కటి అని చెప్పుకోవడానికి ఏదో తెలియటం లేదు.

యాక్సిడెంట్ అయిన తరువాత ఒక్కడినే నడుచుకుంటూ వెళ్ళడం అందునా ప్రయాణం చెయ్యడం ఇదే మొదటి సారి. కుంటుకుంటూ వెళుతున్నాను, ఏమైనా అవుతుందేమో అన్న భయం మనసులో ఉన్నా, అంతా శ్రీరామునిపై భారం వేసేసి, ధైర్యం చేసి బయలు దేరాను. నాలుగు రోజులు ముందు వరకూ నా ఆలోచనలో ప్రయాణం అంతా కారులో వెళ్ళడం గురించి ప్రళాణిక వేసుకుంటున్నంతో, హితులైన కృపాల్ కశ్యప్ గారి రూపంలో ఈశ్వరుడు మా ఇంటికి విచ్చేసి, భద్రాచలం వెళ్ళడానికి రైల్ ఉందు చూసుకోండి అని సలహా ఇచ్చారు. అంతే, అప్పుడే జాలంలో మనకు అందుబాటులో ఉన్న రైల్వే వారి బుక్కింగ్ సైట్లో వెతికితే, ఆఖరుగా రెండే రెండు సీట్లు మిగిలి ఉన్నాయి.

DSCN2432వెంటనే బుక్ చేసేసుకున్నాను. ఇది యాదృశ్చికమా లేక సదృశ్యమా అంటే, అది ఈశ్వరుని కృపే అని నేను నమ్ముతాను. అదిగో అలా మొదలైంది నా భద్రాచల ప్రయాణం. ప్రయాణం చక్కగా మొదలైంది అనుకునేంతలో ఓ విఘాతం బాలయ్య రూపంలో చేరుకుంది. మేము ప్రయాణిస్తున్న రైల్లోనే బాలయ్యకూడా భద్రాచలం వస్తున్నారంట. ఇంకేం భాట్రాజులు ఉండనే ఉంటారుకదా, నువ్వది ఈకావో, నువ్విద్ది పీకావో, అంటూ తిరిగే వాళ్ళన్నమాట, వారు ఎంత హడావిడి చేసేస్తున్నారంటే, తలకాయి నెప్పొంచిందనుకోండి. సరే వారి విషయం నాకు అనవసరం అనుకుంటూ నేను ఎంత జాగ్రత్తగా ఉండాలో అని ఆలోచించుకుంటూ నాకు కేటాయించిన చోటకు చేరుకున్నాను. చక్కగా సికింద్రాబాద్ నుంచి మొదలైన ప్రయాణం భద్రచలం రోడ్డు అనే స్టేషన్ అయిన కొత్తగూడం చేరుకునేటప్పటికి ఉదయం ఐదు గంటలైంది.

ఉదయం ఐదు గంటల వేళ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ స్టేషన్ నుంచి బయటకు వచ్చేటప్పటికి, బయట మూగిన జనాలు, మన హీరో గారి అభిమానులు అంతా జారుకున్నారు. అక్కడ మాకు ఒక్క ప్రయాణ సాధనం ఆటో తప్పితే మరింకేం కనబడలేదు. ఆటో వాళ్ళేమో మూడువందల యాభై రూపాయలనుంచి వారి నోటికి ఎంత తోస్తే అంత అడుగుతున్నారు. ఇలా ఐతే ఎలా అనుకుంటూ,  మెల్లగా బయటకు చేరుకునేటప్పటికి, ఓ ప్రైవేట్ ట్రావల్స్ బండి వాడు కనబడ్డాడు. ఒక్కొక్కరికి నలభై రూపాయలు అడిగాడు, హమ్మయ్య, అనుకుని సౌకర్యంగా భద్రాచలం చేరుకున్నాను. అప్పటికి తెలతెల్లవారుతోంది.

DSCN2436

ఇదిగో అక్కడ కూడా మన బాలయ్యగారి రాబోయే సినిమా, “శ్రీరామ రాజ్యం” పాటల సందడికి సంబందించిన బ్యానర్లు మాకు స్వాగతం ఇచ్చాయి. కానీ నాకు నచ్చని విషయమేమిటంటే, పూజ్యనీయమైన బద్రాచల శ్రీరాముని గుడికి వెళ్ళే ముఖ ద్వారమైన దారికి వీరు ఇలా బ్యానర్లు తగిలించడం ఎందుకో మింగుడు పడలేదు. కానీ ప్రస్తుతం మనం ఉన్నది ప్రజాపాలన కలిగిన రాజ్యంలో అని రాజ్యాంగం చెబుతోంది కదా, అందువల్ల ప్రజలు ఏమి చేసినా మనం మాట్లాడ కూడదు. అలాగే ఈ విషయంలో కూడా, అనుకుని, శ్రీరాముని తలచుకుని ముందుకు సాగాను. తెలవారు ఝామున ఇలాంటి దృశ్యం నాకు అనుకోని అనుభూతిని మిగిల్చింది. ఇంతటి అనుభూతిలో, బాలయ్యలాంటి వ్యక్తి కూడా భాగమైనందులకు కించిత్ బాధగా ఉన్నా, గురుతుల్యులు చెప్పిన ఓ విషయం ఇక్కడ ఙ్ఞప్తికి వస్తుంది. చండాలుడియందు అలాగే విఙ్ఞుల యందు సమదృష్టికలిగి ఉండాలి అన్న మాట గుర్తు తెచ్చుకుని, అందరియందు సమదృష్టి కలిగి ఉండాల్సిన ఆలోచనను పెంచుకునేందుకే ఈశ్వరుడు ఇలా చెపారని అనుకున్నాను.

DSCN2437

ఈశ్వరుని కృప మనకు ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు. కాకపోతే మనం అందుకు సిద్దంగా ఉండటమే ముఖ్యం. భద్రాచలం వెళ్ళడానికి ఆయితే టికెట్లు రిజర్వ్ చేయించుకున్నాను కానీ ఎక్కడ ఉండాలా అని అనుకుంటుంటే, ప్రయాణానికి ఒక్క రోజు మఱో హితుల రూపంలో ఈశ్వరుడు నాతో చెప్పించారు. వారికి తెలిసిన స్నేహితులు అక్కడే నివాశితులై ఉన్నారని, వారు నాకు ముందుగా ఓ రూము రిజర్వ్ చేయించి పెడతానని. అదిగో అదే ఈ “శ్రీరామ నిలయం”. తిరుపతిలో లాగా ఇక్కడ కూడా ఓ రిజర్వేషన్ కౌంటర్ యందు మనం ముందుగా రిజర్వ్ చేయించుకుంటే, ఇక్కడ ఉండటానికి మనకు అనుమతి లభిస్తుంది. ఈ శ్రీరామ నిలయం ప్రక్కనే “సీతా నిలయం” కూడా దేవాలయం వారు కట్టారు. గదుల లోపల నిర్వాహణా పరమైన లోపాలు చాలా ఉన్నా, భక్తితో వచ్చిన నాకు మరింకేం ఇబ్బంది కాలేదు. చక్కగా కాల కృత్యాలు తీర్చుకుని, గోదావరిలో స్నానం చేసివద్దాం అని ప్రక్కనే ఉన్న గోదావరికి చేరుకున్నాను.

DSCN2438వరద రావడం వల్ల అలాగే అక్కడ ఉన్న భక్తుల అత్యుత్సాహం గమనించిన తరువాత గోదావరిలో మునగలేక పోయ్యాను కానీ గోదావరీ జలాలను నెత్తిమీద జల్లుకున్నాను. వరద వల్ల నీరంతా బురద బురదగా ఉన్నా ఫరవాలేదు కానీ, అత్యుత్సాహంతో ఉన్న భక్తులు కుంటి వాడిని కాకపోయినా, అపరేషన్ చేసిన కాలు పూర్తి స్థాయిలో నడవనివ్వక పోవడం వల్ల నిలదొక్కుకోలేని నన్నువారు గమనించకుండా ఎన్ని గంతులు వేస్తున్నారో గమనించిన తరువాత వారితో కలసి నీళ్ళల్లోకి దూకడానికి సాహసించలేక పోయ్యాను.

అలా గోదావరీ జలాలతో ప్రోక్షణ చేసుకుని, సత్రానికి చేరుకుని, తలారా స్నానం చేసి ఈస్వరుని తలచుకుని, ఆలయం వైపు అడుగులు వేశాను. సాధారణంగా చాలా సార్లు నాకు దైవ దర్శనం అయ్యేంత వరకూ చుట్టూ ఉన్న (లేదా) జరుగుతున్న పరిణామాలు నాలో కోపాన్ని లేదా అసహనానికి గురిచేస్తాయి. కానీ ఏమి విచిత్రమో ఏమో, ఆరోజు ఉదయం నుంచి చాలా ఘటనలు నన్ను అసహనానికి గురిచేసినా నా మనస్సులో ప్రసాంతత దూరం కాలేదు. ఓ ప్రక్కన జరుగుతున్న పరిణామాలు నన్ను గుర్తుపెట్టుకునేటట్టు చేసినా, అవి నన్ను ఏమీ చెయ్యలేక పోయాయంటే, దానివెనకాల శ్రీరాముని కృప ఎంత సత్యమో నాకు మాత్రమే తెలుసు.

ఇలా ఒక్కో విషయానికి ఇంతగా వ్రాసుకుంటూ పోతే, ఒక్క పోస్టు చాలదేమో.. మరిన్ని వివరాలతో, మరో పోస్టు

31, జులై 2011, ఆదివారం

నేనేం చెయ్యాలి? భాధ పడాలా? మరింకేం చెయ్యాలి

ఆది లక్ష్మి గారికి కలిగిన దెబ్బ విషయం తెలిసిన తరువాత దానిని జీర్ణించుకోలేక తల్లడిల్లిపోవడం తప్ప ఏమీ చెయ్యలేక పోయిన నాకు నేనేమి చెయ్యాలి అన్న ఆలోచన పురుగల్లే తొలిచి వేస్తోంది. అమ్మ గురించి అమ్మఒడి గురించి తెలియని వారు ఉండరు, తెలుసుకోని వారు అభాగ్యులై అనాధలుగా కొన్ని చోట్ల కనబడినా వారి శాతం చాలా తక్కువనే చెప్పుకోవాలి. అలాంటి వారి గురించి ప్రక్కన పెడితే, ఆది లక్ష్మి గారికి ఎదురైన ఈ అవస్థకు లేదా వీరి ప్రస్తుత ఆపత్కాలానికి నేనేమీ చెయ్యలేక పోతున్నానే అనే భావన నన్ను మరింత కృంగదీస్తోంది.

వీరికి ఫోన్ చేసి మాట్లాడదాం అని ఒకసారి ప్రయత్నం చేస్తే నా నోటి వెంట మాటరాక నేనే చిన్నపిల్ల వాడిలాగా ఏడ్చేస్తున్నాను. అలాంటిది నా ద్వారా వీరికి మరింత బాధని అందజేసిన వాడనౌతున్నాను. అలా అని ఊరకే ఉందాం అనుకుంటే, మనసు మాట వినదాయె. మఱో ప్రయత్నంగా ఇంకొకసారి చేస్తే, ఈ సారి నాది అదే పరిస్థితి. ఓదార్చాల్సిన నేనే ఏడుస్తూ కూర్చుంటే, ఆ తల్లిని సముదాయించే వారెవ్వరు? ధైర్యం తెచ్చుకోండి అని చెప్పాల్సిన నేనే మూగబోయి ఆవిడ బాధకి మరింత తోడై, అగ్నికి ఆజ్యం పోసిన వాడనౌతున్నాను.

మా నాన్నగారు ఓ విషయాన్ని ఎల్ల వేళలా చెబుతూ ఉండేవారు. మనం ఎవ్వరికైనా సహాయం చెయ్యకపోయినా ఫరవాలేదు కాని మన వల్ల వేరొక్కరు నష్ట పోకూడదని. కానీ ఆదిలక్ష్మి గారి విషయంలో, నా వల్ల వీరి బాధ అధికం అవుతోంది కాని, వీరికి ఉపశమనం మాట అటుంచి, మఱచి పోతున్న ఙ్ఞాపకాలను తవ్వి వెలికి తీస్తున్నట్లుంది నా పరామర్శ. సరిగ్గా పరామర్శించడం చేతకాదు, పోనీ సరిగ్గా మాట్లాడడమా చాతకాదు, ధైర్యం చెబుదామా అంటే అదేలాగో తెలియదు, ఎందుకీ స్థితి నాకు? ఏమీ చాతకాని నేను ఏమి చెయ్యాలి.

ఏదో వారి బ్యాంక్ ఎక్కౌంట్ ఇచ్చారు కాబట్టి అంతో ఇంతో, అదిఇదీ కాకపోతో ఎంతోకొంత వారి బ్యాంక్ ఎక్కౌంటులో జమ చేసి మౌనంగా బ్రతికేయ్యాలా!! దిక్కుతోచని స్థితి. నామీద నాకే అసహ్యం వేస్తోంది.

17, జూన్ 2011, శుక్రవారం

పుట్టపర్తి – యజుర్ మందిరం వివరాలు నాకు అసహ్యాన్ని కలిగించాయి

ఇంతకాలం వరకూ పుట్టపర్తి సాయిబాబపై నాకు ఎటువంటి అభిప్రాయం లేదు. కానీ ఇవ్వాళ సత్యసాయి ట్రస్ట్ సభ్యులు వెల్లడించిన వివరాలు నాలో విస్మయాన్ని కలిగించాయి. అవి నాకు మింగుడు పడటం లేదు. సత్యసాయి బాబాను దైవంగా కొలిచే వారికి ఎటువంటి విషయమైనా అది దైవీక పరంగా కనబడుతుంది, అలా చూడని వారికి ప్రతీ చిన్న విషయం పెద్ద వివాదంగా కనబడుతుంది. అలా నేను వివాదస్పదమైనటువంటి భావనను కలిగించుకోవటం లేదు కానీ ఇంత ఆస్తిని కలిగి ఉండటం వెనుక ఉన్న వివరం నాకు అర్దం కావటం లేదు. అసలు విషయం లోకి వెళ్ళే ముందు పత్రికలలో వచ్చిన నిజాల గురించి ఒకసారి అవలోకనం చేసుకుంటే..

  1. పదకొండున్నర కోట్ల రూపాల నగదు లభ్యం అయ్యింది
  2. తొంభై ఎనిమిది కిలోల బరువు కలిగిన బంగారం
  3. మూడు వందల ఏడు కిలోల వెండి
  4. వగైరా .. వగైరా..

ఇంతటి విలువైన ఆభరణాలు కొన్నింటిని కలిగి ఉండటం వెనక సమర్దించుకునే్ కారణాలు కనబడుతున్నాయి. కానీ కొన్నింటి యందు నాకు అర్దం కావటం లేదు.  సత్యసాయి ట్రస్ట్ విషయంలో లక్షల కోట్లు కలిగి ఉండటం పెద్ద ఆశ్చర్య కరమైన విషయం కాదు. కానీ అవి అన్నీ బ్యాంకులలో లెక్కా పత్రంగా కలిగి ఉంటాయి అనేది వ్యవస్థగా ఎదిగిన అన్నింటికి ఒక ఖచ్చితమైన నియమం. అలా నియమాన్ని పాటిస్తూ సత్యసాయి ట్రస్ట్ వారు ఎంత టాక్స్ కట్టారో, ఎంత కట్టాలో వంటి వివరాల గురించి ప్రభుత్వం వారిని అడిగితే సమాచార చట్టం పరంగా మనకు అన్నీ నకలు పత్రాలు దొరుకుతాయి. కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో నగదు అందునా అయ్యవారి సేవా మందిరంలో కలిగి ఉండాల్సిన అవసరం నాకు కనబడటం లేదు.

నగదు పరంగా ఎవ్వరైనా వీరికి ఇచ్చినా, లేక వీరు ఎవ్వరికైనా ఇవ్వాల్సి వచ్చినా, వాటిని చెక్ పరంగా తీసుకోవడమో లేక ఇవ్వడమో చెయ్యకుండా ఇంత పెద్ద మొత్తంలో నగదుని ఒక్క రోజే కలిగి ఉండటాన్ని నేను జీర్ణించుకో లేక పోతున్నాను. నగదు రూపంలో ఇంత పెద్ద మొత్తాన్ని కలిగి ఉండాటాన్ని నేను హర్షించను.

ఇక బంగారం మఱియు వెండి విగ్రహాల విషయానికి వస్తే, ప్రతీ రోజు వీఐపీలు దర్శనార్దం వస్తూ ఉంటారు కాబట్టి, వారుకి ఆశీర్వాదంగా ఇచ్చే ప్రక్రియలో వీరు ముందుగా వీటిని తయారు చేయించి పెట్టుకున్నారు అన్న సమర్దన నాకు అంగీకారమే. అందువల్ల అలాంటి వాటిని నేను శంకించను. లాటుగా ఒకేసారి వీటిని తయారు చేయించు ఉంచుకోవడం వల్ల పలు సౌకర్యాలు ఉంటాయి. అందువల్ల సత్య సాయి బాబా అనునాయిలు ఇలా భారీ మొత్తంలో బంగారు విగ్రహాలు చేయించి ఉంచుకోవడం వల్ల పలు లాభాలు గమనించి ఉంటారు.

ఏది ఏమైనా, సత్యసాయి బాబా గారి మందిరం నుంచి ఇంత పెద్ద మొత్తం ధనం లభించడం వీరి యడల నాకు కించిత గౌరవభావం తగ్గింది అనే చెప్పు కోవాలి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి చుట్టూ కూడా ధనం తన ప్రభావాన్ని చూపించేటట్టు కనబడటం నాకు అసహ్యాన్ని కలిగిస్తోంది. ఇలా వ్రాసినందున నాకు ధనలక్ష్మి పట్ల సత్ భావన లేదనుకోవద్దు. నాకు ధన లక్ష్మి పట్ల అమితమైన గౌరవం. అలాంటి గౌరవాన్ని విధిగా ఎవ్వరు తప్పు చేసి మాట్లాడినా వ్యతిరేకిస్తాను. ఉదాహరణకి, కొంత మంది ఊతపదంగా ఇలా అంటూ ఉంటారు, “డబ్బుదేముందడి ..”. అలాంటి వారిని అప్పుడు వారు చేస్తున్న చర్చను ఆపి ధన లక్ష్మి గురించి తప్పుగా వాగొద్దని ఓ చిన్న సైజు క్లాసు పీకి ఆ తరువాత తిరిగి చర్చలోకి వస్తూ ఉంటాను. కాకపోతే ఇలాంటి ధనలక్ష్మిని జాగ్రత్తగా బద్రంగా క్షేమంగా లెక్కా పత్రంతో దాచుకోవాలి. కానీ లెక్కా పత్రం లేకుండా ఇంతటి నల్లధనాన్ని ప్రోత్సాహించడం మాత్రం జీర్ణించుకోలేక పోతున్నాను.

భాద్యతా యుతమైన స్థాయిలో ఉంటూ నలుగురికి ఓ ఆదర్శమైన వ్యక్తిగా వెలుగొందాల్సిన వ్యక్తి వద్ద ఇంత మొత్తంలో ధన నిలువలు నాకు అర్దం కావటం లేదు. అందువల్ల వీరు కూడా ధనానికే పెద్ద పీట వేసే వ్యక్తే అని నేను నమ్ముతున్నాను. ఒకవేళ తప్పవ్వవచ్చు. కానీ ప్రస్తుతానికి వీరి ప్రవర్తన నాకు నచ్చలేదు.

14, జూన్ 2011, మంగళవారం

మహిళా సంఘాలు – నిద్దరోతున్నారా!!

మహిళా సంఘాలు ఈ మధ్య నిద్దరోతున్నట్లున్నాయి. మహిళలను కించ పఱచే విధంగా ఎటువంటి ప్రకటనలు వచ్చినా వాటిని కారణంగా పెట్టుకుని మీడియాలో పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసే మహిళా సంఘాలకు ఎయిర్ టెల్ వారి ప్రకటనలో మహిళలపై జరుగుతున్న అమర్యాదను మరియు మగాళ్ళ హీన ప్రవృత్తి కనబడట్టు లేదు. ఎందుకంటే, దానిలో వారికి ఎటువంటి అసభ్యం కనబడటం లేదు కదా అని సమర్దించుకుంటారు. అంతే కానీ నైతికమైన విలువలకు గండి కొట్టి హింసా ప్రవృత్తిని ప్రేరేపించే విధంగా సాగుతున్న ఈ ప్రకటన ఎవ్వరి కంటా పడట్టు లేదు.

ఈ ప్రకటన జాగ్రత్తగా గమనిస్తే, ఓ ముసలాయన తన మనవడితో చేసిన సంబాషణ ఇలా ఈ క్రింది విధంగా సాగింది.

మనవడు : తాతా, ఇక్కడెందుకు ఆగవు?

తాత : మా పెళ్ళికి ముందు ఇక్కడే.. కాంతీ లాల్ అనే బద్మాష్ మీ బామ్మ బుగ్గపై <డాష్ .. డాష్ ..> వాడి పళ్ళు ఊడకొట్టలేక పోయ్యాను..

మనవడు : ఒక్క నిమిషం ఆగు. హాల్లో !! కిషన్ గంజ్ లోని కాంతీలాల్ గోడ్ బోలే ఎవ్వరికైనా తెలుసా!!

[[ కొంత సేపటికి సీన్ కాంతీలాల్ గోడ్ బోలే ఇంటి ముందు ..]]

ఆ ఇంటి వాకిలికి ఇవతల తాత మనవడు అటువైపు సదరు కాంతీలాల్ తన భార్యతో ఉంటాడు. ఈ కధలోని తాతగారు, “హిసాబ్ బరాబర్ ..” అంటూ అటువైపు ఉన్న మహిళ బుగ్గపై ముద్దుపెట్టి పారిపోతాడు.

నాకు అర్దం అయ్యిందేమిటంటే, ఎవ్వడైనా నా భార్యని ముద్దు పెట్టుకుంటే, నేను వెళ్ళి వాడి బార్యని ముద్దు పెట్టుకుంటే సరి పోతుందన్న మాట. కాకపోతే నేను చేసేటప్పుడు ప్రక్కన ఓ పిల్లవాడిని పెట్టుకుంటే సరిపోతుందన్నమాట.

ఇక్కడ చూపించిన ప్రకటనలో రెండుసార్లు ముద్దుకు గురైన మహిళలకు మర్యాద అక్కరలేదన్నమాట. రెండు సార్లు ముద్దు పెట్టుకున్న మగాడు హీరో అన్నమాట. ఇలా కంటికి కన్ను పంటికి పన్ను అనే నైపధ్యంలో సాగిన ఈ ప్రకటన మహిళల మర్యాదకు ఎటువంటి భంగపాటు కలగలేదన్నమాట.

ఇవేనా మనం మన తరువాతి తరం వారికి నేర్పే నైతిక విలువలు? తొక్కలో విలువలు, ఇక్కడ అందులో పోయిందేముంది మీ చాదస్తం తప్పితే అంటారా.. అయితే నిజ్జంగానే నాకు చాదస్తం. ఏమి చేస్తాం? నేను ఓల్డ్ ఫాషన్ కదా..

 
Clicky Web Analytics