Truth లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Truth లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, ఏప్రిల్ 2012, శనివారం

అంగీకరించగలగడం అనేది ఓ పెద్ద కష్టమైన పని

ఈ మధ్య నాలో జరుగుతున్న ఆత్మ విమర్స లేదా పరిశీలన లోని కొన్ని ఆలోచనల కోణాలు నన్ను ఈ పుట వ్రాసేందుకు ప్రోత్సాహకంగా నిలిచాయి. ఉపోద్ఘాతంగా వ్రాసేందుకు నా పాత పుటలలో ప్రాశ్చాత్యుల జీవితాలపై నా పరిశీలనలు పనికి వస్తాయి. ఆ పుటలు చాలా మంది దృష్టిని ఆకట్టుకున్నాయి. ఇలా ఆకట్టుకోవడం వెనుక నా పుటలలో ఉన్న సారం కన్నా, విమర్శా పధంగా సాగిన నా రచనా శైలి అని అనుకోవచ్చు. వాటి యందు వ్యంగ్య భావన పుటమరించి ఉంది అని పాఠకుల భావన. వారి దృక్కోణంలో ఆలోచించినప్పుడు నాకు అది నిజముగానే అనిపించింది. వారి భావన యందు దోషం కనబడ లేదు. ఇది నేను అంగీకరించడాని చాలా కష్టపడవలసి వచ్చింది. అదిగో అప్పుడు అనిపించింది, ఏదైనా విషయాన్ని మన మనోభవాలకు విబేధంగా ఉన్నప్పుడు దాని యందు ఉన్న తత్వాన్ని యధా విధిగా అంగీకరించడానికి బదులుగా వ్యతిరేక భావన కలగడం ఎంత సహజమో, అలాగే ఆ విషయాన్ని ఆ విధంగా అంగీకరించి యధాతధంగా స్వీకరించడానికి చాలా మనోబలం కావాలి కూడా అని.

ఇలాంటి ఆత్మా మధనంలోని భావాలకు ఆధ్యం పోసినట్లుగా మఱో ఘటన ఈ మధ్య జరిగింది. ఆ ఘటన గురించి నా భావనను వ్రాసే ముందు ఆ ఘటన లోని విషయాన్ని, అలాగే దానియందు నాకు కలిగిన భావనను ప్రస్తావిస్థాను.

వృత్తి పరంగా పనికి వస్తుందని మఱో సెమినార్ భాగ్యనగరంలో జరుగుతోందని తెలిసిన తరువాత వీలుచేసుకుని హాజరయ్యాను. అక్కడకు వచ్చిన వారిలో ఓ విదేశీ యువతి ఉంది. ఆ యువతి ఆహార్యం ప్రకారం వివరించాల్సి వస్తే, తల నీలాలకు తైల సంస్కారం లేదు. నీలలను చక్కగా ఒద్దికగా ప్రక్కకి అదిమి పాపిడ తీసి లేవు. ఇక దుస్తులు విషయానికి వస్తే,  తొడలు కనబడేలా ఉండి లోదుస్తులు కనబడే విధంగా ఉన్నాయి. వీటన్నింటికీ తోడుగా, నోటిలోని దంతాలు పచ్చగా ఉండి దుర్ఘందాన్నిస్తున్నాయి. అన్నింటినో మించి ఘాటైన స్ప్రే ఆ చుట్టుప్రక్కల ఉన్న వారి ముక్కు పుటాలను అదరగొడుతోంది.

ఇలాంటి యువతులను ఇంతకు పూర్వం చాలా మందిని చూసాను. కానీ ఆ నాడు నాకు కలగని ఆలోచన ఈ నాడు కలిగింది. ఒక్కసారి నా ఆహార్యం గురించి అలాగే అదే సమయంలో నేను ఎలా ఉన్నానో ఒక్కసారి చూసుకున్నాను. తలారా స్నానం చేసి నుదుట వీభూతి ధరించినా, నేను సెమినార్ హాల్ చేరుకునేటప్పటికి నుదురుపై ఉన్న వీభూతి కనబడలేదు. నొసట కుంకుమ ధరించి, చక్కటి ఇస్త్రీ చేసిన దుస్తులు వేసుకుని, శరీర దుర్గందం రాకుండా ఉండే విధంగా (నా ఉద్దేశ్యంలో చమట పట్టకుండా..) శ్రద్ద తీసుకుని సెమినార్ జరిగే స్థలానికి చేరుకున్నాను. సెమినార్ జరిగే ప్రదేశం అంతా ఏసీ ఉండటం వల్ల ఎటువంటి వాసన అయినా పసిగెట్టేయ్యవచ్చు.

ఇప్పుడు ఒక ప్రశ్న. నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఇలా ఉండాలి అని నాకు అనిపించింది, దానికి సవా లక్ష కారణాలు. అవి ఇప్పుడు అప్రస్తుతం. అలాగే ఆ విదేశీ యువతి ఎందుకు అలా ఉంది? దానికి సమాధానంగా, అలా ఉంటే తాను అందంగా ఉన్నాను అని ఆ అమ్మాయి అనుకుంది. అలా ఉంటే తాను బాగుంటాను అని ఆ అమ్మాయి మనసు చెప్పి ఉండవచ్చు. అలా ఉంటే ఆ అమ్మాయి మనసు తృప్తి చెందుతుండవచ్చు. అది ఆ అమ్మాయి స్వాతంత్ర్యం. అది ఆ అమ్మాయి అభీష్టం. అది ఆ అమ్మాయి మనో సంకల్పం. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్లు, “రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండాలన్నట్లు..”, ఆ అమ్మాయి భారత దేశంలో ఉన్నప్పుడు భారతీయ యువతిలా ఉందా అనే ప్రశ్న ఇక్కడ అప్రస్తుతం. ఎక్కడ ఉన్నా నేను నేనులా ఉన్నాను అని ఆ అమ్మాయి ఆ ఆహార్యం చెబుతోంది.

మఱొ అడుగు వేసి, ఒకవేళ ఆ అమ్మాయి

  • ఆహార్యాన్ని నేను ప్రశ్నిస్తే..
  • శరీర తత్వాన్ని నేను ఆక్షేపిస్స్తే ..
  • ప్రవర్తనా విధానన్ని వ్యతిరేకిస్తే ..
  • .. .. ఇంకా ఇంకా  .. .. డాష్ .. డాష్ .. చేస్తే ..

ఆ అమ్మాయి తిరిగి నన్ను ప్రశ్నించ వచ్చు. కానీ కొంచం మర్యాద పూర్వకంగా ఆలోచిస్తే, నాకు ఇలా అనిపించింది.

“ .. నువ్వెందుకు అలా ఉండాలి అని అనుకున్నావో నాకు అనవసరం. అలాగే నేను ఎందుకు ఇలా ఉన్నానో నీకు అనవసరం అని అనక పోయినా, నేను ఇలా ఉండాలని నేను అనుకున్నాను కాబట్టి నేను ఇలా ఉన్నాను. నన్ను నన్నుగా అంగీకరించు .. .. ”

ఆంగ్లంలో వ్రాయాల్సి వస్తే, నాకు ఇలా అనిపించింది.

“.. you decide to be what you are, so the same with me. I decide to be what I’m, so I’m .. .. accept me as I’m .. ”

ఇలాంటి ఆలోచనతో / దృక్పధంతో / ధృకోణంతో ఆలోచిస్తే, ఇంతకు ముందు నేను పాశ్చాత్యులపై వ్రాసిన నా అభిప్రాయాలు నాకు వింతగా అనిపిస్తున్నాయి. వారు ఆవిధంగా జీవించాలి అనుకుంటున్నారు. ఆ ఆలోచనల గురించి మఱో సారి ..

10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

వైద్యులంటే అసహ్యం వేస్తోంది

ఈ మధ్య అనుకోకుండా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే పేరుతో ప్రస్తావించ బడుతున్న చేతి వేళ్ళకు సంబందించిన ఓ వ్యాధితో బాధపడుతున్నాను. నిన్న నెప్పి ఎక్కువైతే దగ్గరలో ఉన్న ఓ MD చదువుకున్న ఓ వైద్యుని వద్దకు అత్యవసర పరిస్తితిలో వెళవలసి వచ్చింది. ఆ వైద్యులు గారు నా గోడు పూర్తిగా వినకుండానే ఓ నాలుగు రక్త పరిక్షలు వ్రాసి ఇచ్చారు. అందులో షుగర్ ఉందో లేదో అని తెలుసుకునే, RBS అంటే రాండమ్ బ్లడ్ షుగర్ పరిక్ష కూడా ఉంది. ఆ తరువాత మాటల మధ్యలో నాకు షుగర్ లేదని చెబుతుంటే, వినిపించుకోకుండా, ఆ పరిక్ష చేయ్యాల్సిందే అని చెప్పారు.

గత సంవత్సరంలో నవంబర్ నెలలో ఆఖరి సారిగా రక్త పరీక్ష చేయించుకున్నాను అంతేకాకుండా గత సంవత్సరంలో యాక్సిడెంట్ కారణంగా ఓ నాలుగు సార్లు చేయించుకున్నాను అని చెప్పిన  తరువాత విషయాన్ని విని ఓ నాలుగు రకాల మందులు వ్రాసి ఇచ్చారు. ప్రస్తుతానికి ఇవి వాడండి ఆ తరువాత పరిక్షలు చేయించుకుని రండి అప్పుడు చూద్దాం, అన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, జబ్బులు రోగులకు క్రొత్త కానీ వైద్యులకు క్రొత్త కాదు. చిటికెడు చెబితే చారెడు గ్రహించయ్యటం వీరికి అనుభవంలో వస్తుంది. కానీ రోగులకు విషయం చెప్పాలి కదా!! ఇలా వ్రాసుకుంటూ పోతే మరేదో వ్రాసేస్తాను.. విషయంలోకి వస్తే..

వైద్యో నారాయణ హరి.. అంటారు కదా, ఆయన చెప్పిన పరీక్షలకు రక్తం ఇచ్చి ఓ వెయ్యి రూపాయల బిల్లు చెల్లించి ఇంటికి చేరుకున్నాను. ఇచ్చిన మందులు వేసుకుని నొప్పి తగ్గుతుందేమో అని ఎదురు చూస్తూ గడిపేసాను. తీరా సాయంత్రం రిపోర్టులు తీసుకుని వెళ్ళి చూసే సరికి ఆ వైద్యులు గారు ఊరిలో లేరని తిరిగి సోమవారం వస్తారని తెలిసింది. ఇంతకు ముందు నాకు యాక్సిడెంట్ అయ్యినప్పుడు ట్రీట్ చేసిన వైద్యులు కూడా అంతే, వెళ్ళంగానే xరే తీయించుకుని రమ్మంటారు. తీయించుకుని వచ్చిన తరువాత దానిని చూడను కూడా చూడరు సరి కదా, చూపించ బోతే, “ నాకు తెలుసు ..” అంటూ మాట దాటేస్తారు.

ఇవన్నీ చూస్తున్న తరువాత వైద్యులపై గౌరవం కలుగకపోగా, అసహ్యం వేస్తోంది. అన్నింటికీ మించి, ఈ వైద్యులు గారు ప్రిస్క్రిప్షన్ ద్వారా ఇచ్చిన మందులు వారి ప్రక్కనే ఉన్న కొట్లో కొనుక్కోవాలన్నమాట. అమ్మే దుకాణానికి లైసెన్స్ లేదు. దీనికి తోడుగా, వీరు చెప్పిన పరీక్షలు కూడా ఆ ప్రక్కనే ఉన్న దుకాణం వెనకాల ఉన్న గదిలో చేయించుకోవాలన్నది వీరి డిమాండ్. అక్కడ కాకపోతే సరి అయిన లేదా కరక్ట్ రిజల్ట్స్ రావంట. సరే నొప్పి తగ్గాలి కదా అని వీరు చెప్పిన మందులు తీసుకుని ఆ ప్రక్కనే ఉన్న గదిలో రక్తాన్ని ఇచ్చి ఇంటీకి చేరుకున్నా.

దీని నుంచి నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే, కొంచం ఖర్చు ఎక్కువైనా వ్యాపార పరంగా ఉన్న పెద్ద హాస్పిటల్స్ ఫరవాలేదనిపిస్తోంది.

11, అక్టోబర్ 2011, మంగళవారం

మింగుడు పడలేని నిజం

వృత్తి రీత్యా చాలా ప్రదేశాలు తిరిగినా, ప్రస్తుతం భాగ్యనగరంలో స్థిరపడ్డాను. నా వృత్తిలో ఎక్కువకాలం నేను భాగ్యనగరంలోనే గడిపాను అలాగే పెళ్ళైన తరువాత ఆరేళ్ళనుంచి ఇక్కడే ఉన్నాను. కావున ఇంకెక్కడికీ వెళ్ళాలనుకోవటం లేదు. ఇక్కడే ఉంటాను అనుకుంటున్నాను. కానీ కొన్ని నిజాలు నన్ను ఆలోచనలోకి తోస్తున్నాయి. వాటిల్లో మొదటిది ఆత్మహత్యల వివరాలు అలాగే మహిళలపై జరుగుతున్న హింసలపై ప్రభుత్వం చూపిస్తున్న గణాంకాలు. ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చినవి మాత్రమే అని మఱచి పోకుండా, వెలుగులోకి రాకుండా ఎన్ని ఉన్నాయో అన్న భావన మరింత కృంగదీస్తోంది.
భారత దేశంలో హింస గురించి లెక్కా పత్రాలు తయారు చేసే పనిని కేంద్ర ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, NCRB, నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో, వారు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం వారి వెబ్ సైట్ నందు 2009  సంవత్సర ప్రతిపాదకపట్టీ ఉంది. వారి లెక్కల ప్రకారం భారత దేశంలో మహిళలపై జరుగుతున్న హింసలలో ఆంద్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని. నమ్మబుద్ది కావటం లేదు కదూ, కానీ ఇది నిజమని లెక్కలే చెబుతుంటే, ఇదా నా ఆంద్రప్రదేశ్ అని ఏడవాలనిపిస్తోంది.
వీరి లెక్కలలో మఱో నగ్న సత్యం ఏమిటంటే, 2009 సంవత్సరంలో ఆత్మహత్యల ద్వారా చనిపోయిన వారి సంఖ్య 1,27,151. అంటే, సంవత్సరానికి 365 రోజుల లెక్కన ప్రతీ రోజు దాదాపుగా మూడువొందల యాభై మంది చనిపోతున్నారు. ప్రతీ నాలుగున్నర నిమిషాల వ్యవధిలో ఒక్కరు చొప్పున గంటకి పదిహేను మంది చొప్పున చనిపోతున్నారంటే, ఎందుకో అర్దం కాని పరిస్థితి. ఇదా నా భారత దేశం అని ఎంత చింతిస్తున్నానో అర్దం కావటం లేదు.
మొన్నా మధ్య అమెరికా వెళ్ళినప్పుడు ఇలాంటి వార్తలనే వారి నేషనల్ మ్యూజియంలో ఉన్నప్పుడు చిత్రీకరించి దానిపై ఓ పుటా వ్రాదామనుకున్నంతలో, హతవిధీ ఇలాంటి నిజాలు అక్కడే కాదు హింసా ప్రవృత్తి ఉన్న ప్రతీ చోట ఇది పునరావృత్తం అవుతూనే ఉంటుంది అనిపించింది. అమెరికాలో ప్రతీ రెండు గంటలకీ పన్నెండు మంది పిల్లలను హత్య చేస్తున్నారన్న విషయం నమ్మలేని మఱో నగ్న సత్యం.
USTripLiquidHub1 2010 248
ఇది నేను కల్పించిన చిత్రం కాదు, ఫిలడెల్ఫియాలోని నేషనల్ మ్యూజియం వారు బహిరంగంగా ఉంచినది.

ఎందుకీ హింసా ప్రవృత్తి? .. ఇప్పుడు కాదు, మఱోసారి.

5, అక్టోబర్ 2011, బుధవారం

క్రొత్తగా నేర్చుకున్న పాఠం

చదరంగం ఆట అంటే నాకు ఎందుకో తెలియని ఇష్టం. చాలా రోజులుగా నేను ఈ ఆటని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆడుతునే ఉన్నాను. అంతా కాకపోయినా కొంతలో కొంత ఘటికుడనే అని చెప్పుకోవాలి. కానీ నాలోని ఓ బలహీనత నన్ను ఈ ఆట యందు ఎదగకుండా ఉంచుతున్నదని నాకు కొంతకాలం వరకూ తెలియదు. కానీ తెలిసేటప్పటికి పుణ్యకాలం కాస్తా దాటిపోయింది. ఆలశ్యంగా నైనా అసలు విషయం తెలిసినందులకు కొంతలో కొంత మెఱుగైనా, పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలదాకా వస్తాయన్న సామెత పరంగా కొన్ని కొన్ని అలవాట్లు నన్ను వదలి పోనంటున్నాయి.

ఇంతకు ముందు కొంతకాలం క్రిందట, అనుభవాలనుంచి నేను నేర్చుకోవటం లేదని వ్రాసుకున్నట్లు గుర్తు. ఇది జరిగి దాదాపుగా ఓ తొమ్మిది నెలలైనా, ఈ నిజం వంటపట్టడానికి చాలా కాలం పట్టేట్టు ఉంది. తోలు మందంకదా. అందునా ఒంటి నిండా కొవ్వుందని ఈ మధ్యనే డాక్టర్ గారు తేల్చేశారు. అంత కొవ్వు కరిగి నిజం మింగుడు పడాలంటే, కొంచం కష్టమే కానీ నిజం నిజం కాకపోతుందా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, చదరంగం ఆట మఱియు నా ప్రవేశం గురించి.

ప్రతీ సంవత్సరం మా ఆఫీస్ వాళ్ళు చదరంగం పోటీలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా నేను పాలు పంచుకుంటాను. క్రిందటి ఏడాది ఇలాగే పాలు పంచుకుని ఓ అనామకుని చేతిలో ఓడిపోయ్యాను. ఈసారి కూడా గెలుపు అంచులదాకా వెళ్ళి ఓడిపోయ్యానని ఒప్పుకుని విరమించుకున్నాను. నేను ఓడిపోయ్యాను అన్న స్థితికి ఒక్క నిమిషం వరకూ ఆలోచిస్తే, అన్ని కోణాల్లోనూ నాదే పైచేయ్యిగా సాగుతున్న ఆట అది. కానీ ఇక్కడ నా ప్రత్యర్ది పోరాట పఠిమని మెచ్చుకోకుండా ఉండలేను. తాను ఓడిపోవడనికి అన్ని దారుల్లోనూ వీలుంది అని తెలిసి కూడా చచ్చేవరకూ పోరాడాలి అన్న ఒకే ఒక్క ఆలోచన అతనిని గెలిపించింది.

మానవుడన్న తరువాత తప్పులు అనేవి సహజం. ఒక్కొసారి మనం చేసే తప్పుల వల్ల మనం ఎంతటి మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందో నాకు ఎన్ని సార్లు అవగతం అవుతున్నా, నేను తెలుసుకోలేక పోతున్నా. చేసిన తప్పులే పునరావృత్తం అవుతున్నాయి. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, స్వతహాగా నాలో ఓ చిన్న భావన ఎప్పటి నుంచో ఉన్నది. మనం ఆడే ఆట వల్ల ఒక్కోసారి ఎదుటి వారికి పోరాడటానికి అవకాశం ఇవ్వకుండా, దుందుడుకుగా యదేశ్చగా ఓడించుకుంటూ పోకుండా, వారికీ పోరాడి ఓడిపోయ్యాం అన్న భావన కలిగించి కొంత ఉపశమనం కలిగిద్దాం అని ఆడేవాడిని. అదిగో అందువల్లే ఇంతకు ముందు నేను గెలవాల్సిన ఆట ఓడిపోవడనికి దారి తీసింది.

పోనీలే అని ఊరుకోకుండా, నిష్కర్షగా ఎలా పడితే అలా నరుక్కుంటూ పోతే అప్పుడు ఎదుటి వారు బాధ పడుతున్నారు అన్న భావన నాలో ఉత్పన్నం అవకుండా ఉండి, నేను గెలవాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో చివ్వరిదాకా పోరాడాలి అన్న క్రొత్త పాఠం నేను నేర్చుకున్నాను. ఎదుటి వారు ఫీల్ అవుతారని నేను ఫీల్ అవ్వడం ఇంతకాలం నేను చేసిన ఓ తప్పిదం అని ప్రస్తుత కాలం ఓ గుణపాఠాన్ని నేర్పింది. రాబోయే కాలం ఇంకేం నేర్పుతుందో.

31, జులై 2011, ఆదివారం

నేనేం చెయ్యాలి? భాధ పడాలా? మరింకేం చెయ్యాలి

ఆది లక్ష్మి గారికి కలిగిన దెబ్బ విషయం తెలిసిన తరువాత దానిని జీర్ణించుకోలేక తల్లడిల్లిపోవడం తప్ప ఏమీ చెయ్యలేక పోయిన నాకు నేనేమి చెయ్యాలి అన్న ఆలోచన పురుగల్లే తొలిచి వేస్తోంది. అమ్మ గురించి అమ్మఒడి గురించి తెలియని వారు ఉండరు, తెలుసుకోని వారు అభాగ్యులై అనాధలుగా కొన్ని చోట్ల కనబడినా వారి శాతం చాలా తక్కువనే చెప్పుకోవాలి. అలాంటి వారి గురించి ప్రక్కన పెడితే, ఆది లక్ష్మి గారికి ఎదురైన ఈ అవస్థకు లేదా వీరి ప్రస్తుత ఆపత్కాలానికి నేనేమీ చెయ్యలేక పోతున్నానే అనే భావన నన్ను మరింత కృంగదీస్తోంది.

వీరికి ఫోన్ చేసి మాట్లాడదాం అని ఒకసారి ప్రయత్నం చేస్తే నా నోటి వెంట మాటరాక నేనే చిన్నపిల్ల వాడిలాగా ఏడ్చేస్తున్నాను. అలాంటిది నా ద్వారా వీరికి మరింత బాధని అందజేసిన వాడనౌతున్నాను. అలా అని ఊరకే ఉందాం అనుకుంటే, మనసు మాట వినదాయె. మఱో ప్రయత్నంగా ఇంకొకసారి చేస్తే, ఈ సారి నాది అదే పరిస్థితి. ఓదార్చాల్సిన నేనే ఏడుస్తూ కూర్చుంటే, ఆ తల్లిని సముదాయించే వారెవ్వరు? ధైర్యం తెచ్చుకోండి అని చెప్పాల్సిన నేనే మూగబోయి ఆవిడ బాధకి మరింత తోడై, అగ్నికి ఆజ్యం పోసిన వాడనౌతున్నాను.

మా నాన్నగారు ఓ విషయాన్ని ఎల్ల వేళలా చెబుతూ ఉండేవారు. మనం ఎవ్వరికైనా సహాయం చెయ్యకపోయినా ఫరవాలేదు కాని మన వల్ల వేరొక్కరు నష్ట పోకూడదని. కానీ ఆదిలక్ష్మి గారి విషయంలో, నా వల్ల వీరి బాధ అధికం అవుతోంది కాని, వీరికి ఉపశమనం మాట అటుంచి, మఱచి పోతున్న ఙ్ఞాపకాలను తవ్వి వెలికి తీస్తున్నట్లుంది నా పరామర్శ. సరిగ్గా పరామర్శించడం చేతకాదు, పోనీ సరిగ్గా మాట్లాడడమా చాతకాదు, ధైర్యం చెబుదామా అంటే అదేలాగో తెలియదు, ఎందుకీ స్థితి నాకు? ఏమీ చాతకాని నేను ఏమి చెయ్యాలి.

ఏదో వారి బ్యాంక్ ఎక్కౌంట్ ఇచ్చారు కాబట్టి అంతో ఇంతో, అదిఇదీ కాకపోతో ఎంతోకొంత వారి బ్యాంక్ ఎక్కౌంటులో జమ చేసి మౌనంగా బ్రతికేయ్యాలా!! దిక్కుతోచని స్థితి. నామీద నాకే అసహ్యం వేస్తోంది.

23, జూన్ 2011, గురువారం

అమెరికా వాళ్ళే పిసినారోళ్ళు కాదు

ఇంతకు ముందు అమెరికా వాళ్ళ పిసినారి తనం గురించి ఓ వివరం వ్రాసుకున్నట్లు గుర్తు. కానీ ఇవ్వాళ ఈ లంకెలోని వ్యాసాన్ని చదివిన తరువాత నోటివెంట మాటరాలేదు. అమెరికా వారి గురించి వ్రాసుకున్నప్పుడు ఎనిమిది వందల బిలియన్ డాలర్ల గురించి ప్రస్తావిస్తే, గ్రాంట్ థ్రాన్‍టన్ సంస్థలో పనిచేస్తున్న హరీష్ చెపొచ్చేదేమిటంటె, ఇరవై బిలియన్ డాలర్ల ($20m) సొమ్ము నికరంగా నగదురూపంలో ప్రైవేట్ ఇన్వెస్టర్ల వద్ద మూలుగుతోంది. ఇంత పెద్ద మొత్తం కూడా పెట్టుబడికి సిద్దంగా ఉంది.

ఈయన కన్నా ఓ అడుగు ముందుకు వేసి బెంగళూర్ స్థానంగా వ్యాపారాన్ని నడుపుతున్న IDC Ventures యొక్క అధిపతి అయిన సుధీర్ సేథి ఇంకొంచం ముందుకెళ్ళి తొక్కలో ఇరవై ఏమిటి, చక్కగా ఓ డెబ్బైయ్యో లేదా డెబ్బైఅయిదు బిలియన్ డాలర్లు పెట్టుబడి చెయ్యక నగదు రూపంలో మూలుగుతున్నాయి అని అంటున్నారు. ఇలా అనడమే కాకుండా, వారి ఆలోచనలకు సాధ్యాసాధ్యలకు అనువైనటువంటి ఆలోచనలకు రూపం ఇచ్చేలాగా అంకెలతో గారడి చేస్తున్నారు.

ఈ అంకెల గారడి అంతా హంబక్.. పనిలేని వాళ్ళు వ్రాసుకునే చెత్త రాతలు అని అనుకుందాం అనుకుంటే, నేను బొర్లా పడ్డట్టే. ఎందుకంటే, ఈ సంవత్సరంలో మే నాటికి భారత దేశం నుంచి బయట దేశాలలో పెట్టుబడి పెట్టే నిమిత్తం తరలి వెళ్ళిన ధనాన్ని లెక్కల్లోకి తీసుకుంటే, క్రిందటి సంవత్సరానికన్నా దాదాపు సగానికి పడిపోయి (అంటే 59%), చూచాయిగా మూడున్నర బిలియన్ డాలర్లకు దగ్గరి దగ్గరగా ($3.7b) ఉంది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు తెలియజేసారంటె, మన భారత దేశం నుంచి బయటకు వెళ్ళాల్సిన పెట్టుబడి ఆగి పోయినట్లే కదా. ఈ విషయాన్ని ఈ వ్యాసంలో చదువుకోంటుంటె, అదే వ్యాసంలో మఱో చోట మొత్తం మీద క్రిందటి సంవత్సరం కన్నా భారతీయులు ఈ సంవత్సరంలో చాలా తక్కువగా పెట్టుబడులు పెడుతున్నారని తెలియజేసే విధానం నాకు అబ్బుర పఱచింది.

ఇలాంటి విషయాలను చదువుతుంటె, పాపం అమెరికా వాళ్ళు మాత్రమే పిసినారోళ్ళు కదనిపిస్తోంది. ఇలా అమెరికా వారి గురించి వ్రాసినందుకు కించిత్ బాధగా ఉన్నా, ఎక్కడ ఎనిమిది వందల బిలియన్ డాలర్లు ఎక్కడ ఇరవై బిలియన్ డాలర్లు, లేదు కాదు అనుకుంటే, అధికపక్షం ఓ ఎనబై బిలియన్ డాలర్లను బేరీజు వేసుకుంటే, అమెరికా వాళ్ళ గురించి అలా వ్రాయడం పెద్ద విషయం కాదని దానిగురించి నేను అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తోంది.

17, జూన్ 2011, శుక్రవారం

పుట్టపర్తి – యజుర్ మందిరం వివరాలు నాకు అసహ్యాన్ని కలిగించాయి

ఇంతకాలం వరకూ పుట్టపర్తి సాయిబాబపై నాకు ఎటువంటి అభిప్రాయం లేదు. కానీ ఇవ్వాళ సత్యసాయి ట్రస్ట్ సభ్యులు వెల్లడించిన వివరాలు నాలో విస్మయాన్ని కలిగించాయి. అవి నాకు మింగుడు పడటం లేదు. సత్యసాయి బాబాను దైవంగా కొలిచే వారికి ఎటువంటి విషయమైనా అది దైవీక పరంగా కనబడుతుంది, అలా చూడని వారికి ప్రతీ చిన్న విషయం పెద్ద వివాదంగా కనబడుతుంది. అలా నేను వివాదస్పదమైనటువంటి భావనను కలిగించుకోవటం లేదు కానీ ఇంత ఆస్తిని కలిగి ఉండటం వెనుక ఉన్న వివరం నాకు అర్దం కావటం లేదు. అసలు విషయం లోకి వెళ్ళే ముందు పత్రికలలో వచ్చిన నిజాల గురించి ఒకసారి అవలోకనం చేసుకుంటే..

  1. పదకొండున్నర కోట్ల రూపాల నగదు లభ్యం అయ్యింది
  2. తొంభై ఎనిమిది కిలోల బరువు కలిగిన బంగారం
  3. మూడు వందల ఏడు కిలోల వెండి
  4. వగైరా .. వగైరా..

ఇంతటి విలువైన ఆభరణాలు కొన్నింటిని కలిగి ఉండటం వెనక సమర్దించుకునే్ కారణాలు కనబడుతున్నాయి. కానీ కొన్నింటి యందు నాకు అర్దం కావటం లేదు.  సత్యసాయి ట్రస్ట్ విషయంలో లక్షల కోట్లు కలిగి ఉండటం పెద్ద ఆశ్చర్య కరమైన విషయం కాదు. కానీ అవి అన్నీ బ్యాంకులలో లెక్కా పత్రంగా కలిగి ఉంటాయి అనేది వ్యవస్థగా ఎదిగిన అన్నింటికి ఒక ఖచ్చితమైన నియమం. అలా నియమాన్ని పాటిస్తూ సత్యసాయి ట్రస్ట్ వారు ఎంత టాక్స్ కట్టారో, ఎంత కట్టాలో వంటి వివరాల గురించి ప్రభుత్వం వారిని అడిగితే సమాచార చట్టం పరంగా మనకు అన్నీ నకలు పత్రాలు దొరుకుతాయి. కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో నగదు అందునా అయ్యవారి సేవా మందిరంలో కలిగి ఉండాల్సిన అవసరం నాకు కనబడటం లేదు.

నగదు పరంగా ఎవ్వరైనా వీరికి ఇచ్చినా, లేక వీరు ఎవ్వరికైనా ఇవ్వాల్సి వచ్చినా, వాటిని చెక్ పరంగా తీసుకోవడమో లేక ఇవ్వడమో చెయ్యకుండా ఇంత పెద్ద మొత్తంలో నగదుని ఒక్క రోజే కలిగి ఉండటాన్ని నేను జీర్ణించుకో లేక పోతున్నాను. నగదు రూపంలో ఇంత పెద్ద మొత్తాన్ని కలిగి ఉండాటాన్ని నేను హర్షించను.

ఇక బంగారం మఱియు వెండి విగ్రహాల విషయానికి వస్తే, ప్రతీ రోజు వీఐపీలు దర్శనార్దం వస్తూ ఉంటారు కాబట్టి, వారుకి ఆశీర్వాదంగా ఇచ్చే ప్రక్రియలో వీరు ముందుగా వీటిని తయారు చేయించి పెట్టుకున్నారు అన్న సమర్దన నాకు అంగీకారమే. అందువల్ల అలాంటి వాటిని నేను శంకించను. లాటుగా ఒకేసారి వీటిని తయారు చేయించు ఉంచుకోవడం వల్ల పలు సౌకర్యాలు ఉంటాయి. అందువల్ల సత్య సాయి బాబా అనునాయిలు ఇలా భారీ మొత్తంలో బంగారు విగ్రహాలు చేయించి ఉంచుకోవడం వల్ల పలు లాభాలు గమనించి ఉంటారు.

ఏది ఏమైనా, సత్యసాయి బాబా గారి మందిరం నుంచి ఇంత పెద్ద మొత్తం ధనం లభించడం వీరి యడల నాకు కించిత గౌరవభావం తగ్గింది అనే చెప్పు కోవాలి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి చుట్టూ కూడా ధనం తన ప్రభావాన్ని చూపించేటట్టు కనబడటం నాకు అసహ్యాన్ని కలిగిస్తోంది. ఇలా వ్రాసినందున నాకు ధనలక్ష్మి పట్ల సత్ భావన లేదనుకోవద్దు. నాకు ధన లక్ష్మి పట్ల అమితమైన గౌరవం. అలాంటి గౌరవాన్ని విధిగా ఎవ్వరు తప్పు చేసి మాట్లాడినా వ్యతిరేకిస్తాను. ఉదాహరణకి, కొంత మంది ఊతపదంగా ఇలా అంటూ ఉంటారు, “డబ్బుదేముందడి ..”. అలాంటి వారిని అప్పుడు వారు చేస్తున్న చర్చను ఆపి ధన లక్ష్మి గురించి తప్పుగా వాగొద్దని ఓ చిన్న సైజు క్లాసు పీకి ఆ తరువాత తిరిగి చర్చలోకి వస్తూ ఉంటాను. కాకపోతే ఇలాంటి ధనలక్ష్మిని జాగ్రత్తగా బద్రంగా క్షేమంగా లెక్కా పత్రంతో దాచుకోవాలి. కానీ లెక్కా పత్రం లేకుండా ఇంతటి నల్లధనాన్ని ప్రోత్సాహించడం మాత్రం జీర్ణించుకోలేక పోతున్నాను.

భాద్యతా యుతమైన స్థాయిలో ఉంటూ నలుగురికి ఓ ఆదర్శమైన వ్యక్తిగా వెలుగొందాల్సిన వ్యక్తి వద్ద ఇంత మొత్తంలో ధన నిలువలు నాకు అర్దం కావటం లేదు. అందువల్ల వీరు కూడా ధనానికే పెద్ద పీట వేసే వ్యక్తే అని నేను నమ్ముతున్నాను. ఒకవేళ తప్పవ్వవచ్చు. కానీ ప్రస్తుతానికి వీరి ప్రవర్తన నాకు నచ్చలేదు.

 
Clicky Web Analytics