18 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
18 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, ఏప్రిల్ 2012, బుధవారం

నీతి శాస్త్రం : నడువడి ఎలా ఉండాలి

ఈ మధ్య కాలంలో ఏమీ వ్రాయాలని అనిపించక వ్రాయటం లేదు. ఇవ్వాళ మాత్రం ఇది వ్రాయక తప్పదని నిశ్చయించుకుని మొదలు పెడుతున్నాను. ఇక్కడ ప్రస్తావించే విషయాన్ని మానవ దృక్పధంతో ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీనిని కులమతాలకు అతీతంగా ఆలోచించాలి. భావం ప్రధానం కాని భాష్యం కాదు అని అనుకుంటే, సమగ్రంగా అర్దం అవుతుంది.

కొంతకాలంగా వీలు చేసుకుని శ్రీ మహా భాగవతము చదువుతున్నాను. అందలి కొన్ని విషయాలు ఇప్పుడు నన్ను ఇలా ప్రేరేపించాయి. పోతనగారి గురించి నేను ఏమి వ్రాసినా అది దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటుంది. ఎందుకంటే, సాహిత్యం అనే పదమే కానీ దానిలోని గొప్పతనన్ని చాలా కాలం వరకూ ( .. గ్రహించడం మాట అటువుంచి, ఆ గొప్పతనాన్ని .. ) హేయాభావంతో చూస్తూ బ్రతికిన నాకు దాని గురించి ప్రస్తావించడం మినహా ఆఖ్యానించకూడదని అవగతం అయ్యింది. అలాంటి సాహిత్యానికి తలమానికమైన భాగవత, తెలుగు అనువాద రచయిత అయిన పోతనగారి గురించే!! అందునా నేను కామెంట్ చెయ్యటమా!!! హరి హరి.. ఎంతటి సాహసమో కదా అని చదివే వారు ముక్కున వేలువేసుకుని నోటితోనే కాదు చేతితోకూడా నవ్వుతారు. ఇప్పటికే ఎన్నో రాళ్ళు పడ్డాయి, వాటికి తోడుగా మరిన్ని అవసరమా నాకు. అందుకని పోతనగారిని ప్రస్తావిస్తూ, వారి కవితా చాతుర్యానికి వేవేల కొనియాడుతూ, వారు రచించిన కొన్ని పద్యాలను ఇక్కడ ప్రస్తావిస్తాను.

శ్రీ కృష్ణ భగవానుని నిర్యాణాంతరం ద్వారక నుండి ఖిన్నుడై వచ్చిన అర్జునుని చూచి ధర్మరాజు దుఃఖ హేతువుని తెలియక ప్రశ్నించిన ఘట్టమున రచించిన శ్లోకములు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

క. ఓడితివో శత్రువులకు నాడితివో సాధుదూషాలామ్ముల్
గూడితివో పరసతులను వీడితివో మానధనము వీరుల నడుమన్.

క. తప్పితివో యిచ్చెద నని, చెప్పితివో కపట సాక్షి చేసిన మేలుం
దప్పితివో శరణార్ధుల, రొప్పితివో ద్విజులఁ బసుల రోగుల సతులన్.

క. అడిచితివో భూసురులను, గుడిచితివో బాల వృద్ధు గురువులు వెలిగా
విడిచితివో యాశ్రితులను, ముడిచితివో పరుల విత్తములు లోభమునన్

అనిఅడుగుతారు ధర్మరాజు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వీటి అర్దాలు నాకు అంతగా అవగతం అవ్వక పోయినా, నాకు అర్దం అయ్యినంత వరకూ ఏమి అర్దం అయ్యిందో వ్రాస్తాను.

మొదటి శ్లోకంలో ..

౧) శత్రువుల చేతిలో ఓడి పోయ్యావా
౨) సాధువుల యందు దూషణ చేసావా
౩) పరసతులను కూడి రమించావా, అంటే పర స్త్రీలతో రతి సంగమం కావించావా
౪) వీరుల మధ్యలో ఉండి మానము ధనము వంటి వాటిని వదిలి ప్రవర్తించావా

రెండొవ శ్లోకంలో ..

౫) ఏదైనా చేస్తాను అని ఇచ్చిన మాట తప్పావా
౬) కపటమైనటువంటి శాక్ష్యం చెప్పావా
౭) చేసిన మేలుకి తిరిగి మేలు చెయ్యడం అనే ప్రక్రియను తప్పావా (లేక మఱో భావంగా, మేలు చేసిన వారి మేలుని మెచ్చుకోక పోగా దెప్పి పొడిచేటట్టుగా ప్రవర్తించడం చేసావా )
౮) శరణార్దులను రక్షించకుండా ఏడిపించావా అంత యేకాక, పైన ప్రస్తావించిన వాటిల్లో, ద్విజులు రాజులు రోగులు లేదా స్త్రీలు ఉన్నారా

మూడొవ శ్లోకంలో ..

౯) భూసురులు అంటే రాజులను అణచావా
౧౦) బాలలను వృధులను గురువులను .. [[ ఏమి చేసారు అని అన్నారో అర్దం కాలేదు. నాకు తెలుగుని అర్దం చేసుకునే ఇంగితం లేనందున ]]
౧౧) ఆశ్రయించి ఉన్న వారిని విడిచి వెళ్లి పోయ్యావా
౧౨) లోభత్వం కలిగి ఉండి పరుల విత్తమును దాచుకున్నావా

అని నాకు అర్దం అయ్యింది. అంతే కాకుండా నాకు మఱింకో విషయం కూడా అర్దం అయ్యింది. ఒక వేళ అర్జునుడు పైన ఉదహరించిన వాటిల్లో ఏదైనా చేసి ఉన్నట్లైతే, కొన్నింటి యందు తత్వ చింతన చేస్తేనే అర్దమయ్యే విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. మరికొన్నింటిలో తత్వ చింతన చేసినా నిస్పక్ష పాతంగా ఆలోచించగలిగే మనసు కలిగి ఉండాలి. అప్పుడే చేసిన పని తప్పు అని తెలిసి చింతిస్తారు. ఉదాహరణకి, సాధువుల యందు దూషణ అనే కార్యం తీసుకున్నాం అనుకుంటే, అర్జునుడు దూషణ చేసి ఉన్నా, అది సాధువులయందు అని గ్రహించడానికి మనసు ఒప్పుకోదు. వారేదో వెధవ పని చేసారు కాబట్టి నేను దూషణ చేసాను అని సమర్దించు కునే వాడు. అలా సమర్దించుకున్నా, తన తప్పు తెలుసుకుని పశ్చాతాపంతో దుఃఖించే స్థితికి చేరుకోవడం అంటే ఎంతో నిబద్దతతో కూడుకున్న వ్యక్తిత్వం కలిగిన వారై ఉండాలి. అలాంటి స్థితిలో అర్జునుడు ఉన్నాడు అని అనుకోవాలి.

ఇక్కడ ఉన్న విషయాలను క్షుణ్ణంగా కాకపోయినా మన స్థాయికి తగ్గట్టుగా ఆలోచించుకున్నా, చాలా విషయాలు మనకు అవగతం అవుతాయి. కానీ ఇక్కడ ప్రస్థావించినవి ఎన్ని వందల ఏళ్ళ క్రిందట అనే మాట ప్రక్కన పెడితే, ఎన్ని రోజులు క్రిందటిదైనా పాత చింతకాయ పచ్చడి రుచిగానే ఉన్నట్లు, ఈ మాటలు కూడా చాలా ప్రశస్తంగా మరింత క్రొత్తగా ఈ నాటి రోజులకు అనుగుణంగా రచించారా అన్నట్లు ఉన్నాయి. ఎవ్వరి గురించో నాకెందుకు, నా గురించి నేను ఆలోచించుకుంటే..

అను నిత్యం నేను శత్రువుల చేతిలో ఓడిపోతూనే ఉన్నాను. సాధువుల యందు దూషణ చేస్తూనే ఉన్నాను. పర సతులను కూడి బ్రతకటం లేదు కానీ కపట శాక్ష్యాలు అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను. చేసిన మేలుకి కృతఙ్ఞతా పూర్వకంగా తిరిగి మేలు చేయకపోయినా, వారి సహృదయానికి గుర్తుగా ఉన్న (నా యందు వారు చేసిన) మేలుని మఱచి జీవిస్తూ ఉంటాను. ఆఖరులో లోభత్వం కలిగి పరుల విత్తమును అని అనను కానీ నాకు ఉధ్యోగం ఇచ్చే వ్యవస్థను సంకట స్థితిలో ఉంచి నా జీతాన్ని బేరం చేస్తూనే ఉన్నందున వారి ధనాన్ని ఆకాక్షించి దోచుకుని దాచుకుంటున్నాను అనిపిస్తోంది.

ఇదంతా నా గురించి నేను ఆత్మ విమర్స చేసుకునే సమయంలో ఒలికిన భావనలోని కొన్ని వాక్యాలు మాత్రమే. కానీ నా గురించి తీసి ప్రక్కన పెడితే, ప్రస్తుతం నేను ఉన్న సమాజంలో ఎంతమంది ఇలాంటి వాటిని గమనించి మెచ్చుకుంటారు? మెచ్చుకోవడం ఒక మాట అయితే, వాటిని అవగాహన చేసుకుని అర్దం చేసుకుని ఆ విధంగా జీవించే వారు ఎంతమంది? ఇలాంటి ప్రశ్నల పరంపర ప్రక్కన పెడితే ఇంత చక్కగా ప్రతీ మనిషి తన తోటి వారియందు సతు బుద్ది కలిగి ఉండాలి అని మన గ్రంధాలు చెబుతున్నాయని ఒప్పుకునే వారు చాలా అఱుదు అని నా అభిప్రాయం

18, ఆగస్టు 2011, గురువారం

భద్రాచలం – నా ప్రాప్తం : మొదటి భాగం

ఈశ్వరానుగ్రహం వల్ల నేను ఈ మధ్యనే భద్రాచలం వెళ్ళి వచ్చాను. ఇలా భద్రాచలం వెళ్ళడం మొదటి సారి కాదేమో, కాని నాకు బాగా ఊహ తెలిసి మొదటి సారి అని చెప్పుకోవచ్చు. దానికి తోడు భార్యకూడా వచ్చింది. దర్మ పత్నీ సమేతంగా వెళ్ళి రావడం కొంచం ఊరటగా ఉంది. అన్నింటికన్నా మించిన తృప్తినిచ్చిన విషయాలు ఒక్కటి అని చెప్పుకోవడానికి ఏదో తెలియటం లేదు.

యాక్సిడెంట్ అయిన తరువాత ఒక్కడినే నడుచుకుంటూ వెళ్ళడం అందునా ప్రయాణం చెయ్యడం ఇదే మొదటి సారి. కుంటుకుంటూ వెళుతున్నాను, ఏమైనా అవుతుందేమో అన్న భయం మనసులో ఉన్నా, అంతా శ్రీరామునిపై భారం వేసేసి, ధైర్యం చేసి బయలు దేరాను. నాలుగు రోజులు ముందు వరకూ నా ఆలోచనలో ప్రయాణం అంతా కారులో వెళ్ళడం గురించి ప్రళాణిక వేసుకుంటున్నంతో, హితులైన కృపాల్ కశ్యప్ గారి రూపంలో ఈశ్వరుడు మా ఇంటికి విచ్చేసి, భద్రాచలం వెళ్ళడానికి రైల్ ఉందు చూసుకోండి అని సలహా ఇచ్చారు. అంతే, అప్పుడే జాలంలో మనకు అందుబాటులో ఉన్న రైల్వే వారి బుక్కింగ్ సైట్లో వెతికితే, ఆఖరుగా రెండే రెండు సీట్లు మిగిలి ఉన్నాయి.

DSCN2432వెంటనే బుక్ చేసేసుకున్నాను. ఇది యాదృశ్చికమా లేక సదృశ్యమా అంటే, అది ఈశ్వరుని కృపే అని నేను నమ్ముతాను. అదిగో అలా మొదలైంది నా భద్రాచల ప్రయాణం. ప్రయాణం చక్కగా మొదలైంది అనుకునేంతలో ఓ విఘాతం బాలయ్య రూపంలో చేరుకుంది. మేము ప్రయాణిస్తున్న రైల్లోనే బాలయ్యకూడా భద్రాచలం వస్తున్నారంట. ఇంకేం భాట్రాజులు ఉండనే ఉంటారుకదా, నువ్వది ఈకావో, నువ్విద్ది పీకావో, అంటూ తిరిగే వాళ్ళన్నమాట, వారు ఎంత హడావిడి చేసేస్తున్నారంటే, తలకాయి నెప్పొంచిందనుకోండి. సరే వారి విషయం నాకు అనవసరం అనుకుంటూ నేను ఎంత జాగ్రత్తగా ఉండాలో అని ఆలోచించుకుంటూ నాకు కేటాయించిన చోటకు చేరుకున్నాను. చక్కగా సికింద్రాబాద్ నుంచి మొదలైన ప్రయాణం భద్రచలం రోడ్డు అనే స్టేషన్ అయిన కొత్తగూడం చేరుకునేటప్పటికి ఉదయం ఐదు గంటలైంది.

ఉదయం ఐదు గంటల వేళ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ స్టేషన్ నుంచి బయటకు వచ్చేటప్పటికి, బయట మూగిన జనాలు, మన హీరో గారి అభిమానులు అంతా జారుకున్నారు. అక్కడ మాకు ఒక్క ప్రయాణ సాధనం ఆటో తప్పితే మరింకేం కనబడలేదు. ఆటో వాళ్ళేమో మూడువందల యాభై రూపాయలనుంచి వారి నోటికి ఎంత తోస్తే అంత అడుగుతున్నారు. ఇలా ఐతే ఎలా అనుకుంటూ,  మెల్లగా బయటకు చేరుకునేటప్పటికి, ఓ ప్రైవేట్ ట్రావల్స్ బండి వాడు కనబడ్డాడు. ఒక్కొక్కరికి నలభై రూపాయలు అడిగాడు, హమ్మయ్య, అనుకుని సౌకర్యంగా భద్రాచలం చేరుకున్నాను. అప్పటికి తెలతెల్లవారుతోంది.

DSCN2436

ఇదిగో అక్కడ కూడా మన బాలయ్యగారి రాబోయే సినిమా, “శ్రీరామ రాజ్యం” పాటల సందడికి సంబందించిన బ్యానర్లు మాకు స్వాగతం ఇచ్చాయి. కానీ నాకు నచ్చని విషయమేమిటంటే, పూజ్యనీయమైన బద్రాచల శ్రీరాముని గుడికి వెళ్ళే ముఖ ద్వారమైన దారికి వీరు ఇలా బ్యానర్లు తగిలించడం ఎందుకో మింగుడు పడలేదు. కానీ ప్రస్తుతం మనం ఉన్నది ప్రజాపాలన కలిగిన రాజ్యంలో అని రాజ్యాంగం చెబుతోంది కదా, అందువల్ల ప్రజలు ఏమి చేసినా మనం మాట్లాడ కూడదు. అలాగే ఈ విషయంలో కూడా, అనుకుని, శ్రీరాముని తలచుకుని ముందుకు సాగాను. తెలవారు ఝామున ఇలాంటి దృశ్యం నాకు అనుకోని అనుభూతిని మిగిల్చింది. ఇంతటి అనుభూతిలో, బాలయ్యలాంటి వ్యక్తి కూడా భాగమైనందులకు కించిత్ బాధగా ఉన్నా, గురుతుల్యులు చెప్పిన ఓ విషయం ఇక్కడ ఙ్ఞప్తికి వస్తుంది. చండాలుడియందు అలాగే విఙ్ఞుల యందు సమదృష్టికలిగి ఉండాలి అన్న మాట గుర్తు తెచ్చుకుని, అందరియందు సమదృష్టి కలిగి ఉండాల్సిన ఆలోచనను పెంచుకునేందుకే ఈశ్వరుడు ఇలా చెపారని అనుకున్నాను.

DSCN2437

ఈశ్వరుని కృప మనకు ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు. కాకపోతే మనం అందుకు సిద్దంగా ఉండటమే ముఖ్యం. భద్రాచలం వెళ్ళడానికి ఆయితే టికెట్లు రిజర్వ్ చేయించుకున్నాను కానీ ఎక్కడ ఉండాలా అని అనుకుంటుంటే, ప్రయాణానికి ఒక్క రోజు మఱో హితుల రూపంలో ఈశ్వరుడు నాతో చెప్పించారు. వారికి తెలిసిన స్నేహితులు అక్కడే నివాశితులై ఉన్నారని, వారు నాకు ముందుగా ఓ రూము రిజర్వ్ చేయించి పెడతానని. అదిగో అదే ఈ “శ్రీరామ నిలయం”. తిరుపతిలో లాగా ఇక్కడ కూడా ఓ రిజర్వేషన్ కౌంటర్ యందు మనం ముందుగా రిజర్వ్ చేయించుకుంటే, ఇక్కడ ఉండటానికి మనకు అనుమతి లభిస్తుంది. ఈ శ్రీరామ నిలయం ప్రక్కనే “సీతా నిలయం” కూడా దేవాలయం వారు కట్టారు. గదుల లోపల నిర్వాహణా పరమైన లోపాలు చాలా ఉన్నా, భక్తితో వచ్చిన నాకు మరింకేం ఇబ్బంది కాలేదు. చక్కగా కాల కృత్యాలు తీర్చుకుని, గోదావరిలో స్నానం చేసివద్దాం అని ప్రక్కనే ఉన్న గోదావరికి చేరుకున్నాను.

DSCN2438వరద రావడం వల్ల అలాగే అక్కడ ఉన్న భక్తుల అత్యుత్సాహం గమనించిన తరువాత గోదావరిలో మునగలేక పోయ్యాను కానీ గోదావరీ జలాలను నెత్తిమీద జల్లుకున్నాను. వరద వల్ల నీరంతా బురద బురదగా ఉన్నా ఫరవాలేదు కానీ, అత్యుత్సాహంతో ఉన్న భక్తులు కుంటి వాడిని కాకపోయినా, అపరేషన్ చేసిన కాలు పూర్తి స్థాయిలో నడవనివ్వక పోవడం వల్ల నిలదొక్కుకోలేని నన్నువారు గమనించకుండా ఎన్ని గంతులు వేస్తున్నారో గమనించిన తరువాత వారితో కలసి నీళ్ళల్లోకి దూకడానికి సాహసించలేక పోయ్యాను.

అలా గోదావరీ జలాలతో ప్రోక్షణ చేసుకుని, సత్రానికి చేరుకుని, తలారా స్నానం చేసి ఈస్వరుని తలచుకుని, ఆలయం వైపు అడుగులు వేశాను. సాధారణంగా చాలా సార్లు నాకు దైవ దర్శనం అయ్యేంత వరకూ చుట్టూ ఉన్న (లేదా) జరుగుతున్న పరిణామాలు నాలో కోపాన్ని లేదా అసహనానికి గురిచేస్తాయి. కానీ ఏమి విచిత్రమో ఏమో, ఆరోజు ఉదయం నుంచి చాలా ఘటనలు నన్ను అసహనానికి గురిచేసినా నా మనస్సులో ప్రసాంతత దూరం కాలేదు. ఓ ప్రక్కన జరుగుతున్న పరిణామాలు నన్ను గుర్తుపెట్టుకునేటట్టు చేసినా, అవి నన్ను ఏమీ చెయ్యలేక పోయాయంటే, దానివెనకాల శ్రీరాముని కృప ఎంత సత్యమో నాకు మాత్రమే తెలుసు.

ఇలా ఒక్కో విషయానికి ఇంతగా వ్రాసుకుంటూ పోతే, ఒక్క పోస్టు చాలదేమో.. మరిన్ని వివరాలతో, మరో పోస్టు

18, జులై 2010, ఆదివారం

తల్లి చేసే అతి ముఖ్యమైన పనులు – మొదటి పుట

తల్లి .. ఇది నిజం.. తల్లి గురించి ఇంతకంటే ఎక్కువ నేను వ్రాయాలనుకోవటం లేదు.. వ్రాసినా అది ఎటువంటి అనర్దాలకు మరియు అపార్ధాలకు దారి తీస్తుందో అన్న భయం నన్ను ఇక్కడ ఆపేస్తోంది..

mom

అమ్మ .. చాలా పనులు చేస్తుంది .. పవన్ కళ్యాణ్ పులి సినిమా ఆడియూ రిలీజ్ ఫంక్షన్ లో ఒక చోట రెహమాన్ గురించి మరియు రెహమాన్ తల్లి గురించి ప్రస్తావిస్తూ అన్న మాటలు ..

“.. మొదటి గురువు తల్లి.. విలువలు మరియు వినయం తల్లి నేర్పిస్తుంది ..”

ఈ మాటలు చాలా మంది ఇంతకు ముందు చెప్పినా మఱోసారి తలచుకోవాలనిపిస్తోంది .. ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చూడకండి .. ఆ మాటల వెనకాల ఎంత అర్దం దాగి ఉందో అర్దం చేసుకోవడాని ప్రయత్నించండి.

తల్లి అనే రెండక్షరాలు వివరించడానికి ఒక జీవితం చాలదు. ఏది ఏమైనా తల్లి కావలని తపిస్తున్న ప్రతీ స్త్రీకి ఉండ వలసిన ముఖ్యలక్షణాలు .. విలువలు మరియు వినయం.

వీటిల్లో మొదటిది .. విలువలు.. లేకనే రావణాసురుని తల్లి సమయం కాని వేళల్లో రతి కార్యం చేసి రావణాసురుడికి జన్మనిచ్చింది. కాని,  ఆవిడకు గాని రావణాసురునికి గాని వినయం లేదని నేనను..

 
Clicky Web Analytics