12, నవంబర్ 2012, సోమవారం

గాయత్రీ మంత్రం .. ఇందుకా!!

గాయత్రీ మంత్రం.. ఎలా మొదలు పెట్టాలి అన్న ఆలోచనతో సతమతమౌతున్నప్పుడు, ఉన్నదేదో సూటిగా చెప్పేస్తే పోలా అన్న ఆలోచనతో ఎక్కువ చించకుండా మొదలుపెట్టేసాను.

 

ఉపోద్ఘాతం:

ఓ పెద్దాయన, గాయత్రీ మంత్రాన్ని తన ఇంట్లో కాలింగ్ బెల్ యొక్క సౌండుగా పెట్టుకున్నారు.

ఓ పెద్దాయన, గాయత్రీ మంత్రాన్ని తన సెల్ ఫోన్ రింగ్ టోనుగా పెట్టుకున్నారు.

ఓ పెద్దావిడ, గాయత్రీ మంత్రాన్ని తన ఫోన్ కాలర్ టోనుగా పెట్టుకున్నది.

ఓ కుర్రవాడు, గాయత్రీ మంత్రాన్ని తన కారు రివర్స్ చేసుకునేటప్పుడు హెచ్చరిక చేసే విధానంగా వాడుకున్నాడు.

ఓ యువతి, గాయత్రీ మంత్రాన్ని నలుగురు వినేటట్టు ఓ లౌడ్ స్పీకర్లో పొద్దు పొద్దునే పెట్టేసింది..

..

..

 

ఇక అసలు భావన

గాయత్రీ మంత్రం అనేది జగమెరిగిన రహస్యం. అట్టి గాయత్రిని ఉపనయన సంస్కరం అప్పుడు తండ్రి మాత్రమే చెప్పాలి, కొడుకు మాత్రమే వినాలి అన్నది ఆచారం. ఆ పద్దతిలో ఉపనయన క్రతువు జరిపించే బ్రహ్మగారు కూడా వినకూడదు అన్నట్లుగా, కొడుకు చెవిలో గాయత్రిని ఉపదేశించే తండ్రిని గోప్యంగా ఉంచాలన్న ఉద్దేశ్యంతో, వారిని కప్పుతూ ఉండే విధంగా ఓ పంచని కప్పుతారు. ఇది ఎన్నో ఏళ్లుగా వస్తున్న విధి విధానం. అందరూ పాటిస్తున్నా, ఈ విషయం తెలిసిన వారు కూడా ఖండించ కుండా మౌనం వహించి బ్రతకడం అంగీకరించ లేక పోతున్నాను.

ఎన్నో విషయాలు తెలిసాయి అనుకుని బ్రమ పడేవారు సైతం ఈ విషయాన్ని విశ్మరించి, జీవిస్తూ పెద్దవారిగా చెలామణి అవుతుంటే, అసహ్యం వేస్తోంది. వివరించి చెబుదాం అని ప్రయత్నం చేయ్యబోతే, వయస్సు రీత్యా చిన్నవాడివి నాకు చెప్పేంత సాహసం చేస్తావా అని దబాయించి బ్రతికేస్తున్నారు. చెట్టుకీ పుట్టకీ వస్తాయి, ఆలెక్కలో వేసుకుని ముందుకి సాగి పోతే సరి.

అందువల్ల చెప్పొచ్చినది ఏమిటంటే, సంస్కృతి అనేది ఒకటి ఉంది అని తెలుసుకుని ఆ విధంగా చేసేసుకుందాం.

19, సెప్టెంబర్ 2012, బుధవారం

పిల్లలూ.. మీరెప్పుడైనా వినాయక చవితి చేసుకున్నారా!!

వినాయకుడు

 

నాకు వివాహం అయ్యి ఆరు సంవత్సరాలైనా ఇంతవరకూ పిల్లలు లేరు, అది ఇక్కడ అప్రస్తుతం. కానీ ప్రస్తుతమైనదేమిటంటే, పిల్లల గురించి. ఇలా ఎందుకు ఆలోచించాల్సి వచ్చిందంటే, పైన చిత్రంలో ఉంచిన విఘ్నేశ్వర స్వామిని నా చేత్తో చేసుకున్న ప్రతిమ. ఈ ప్రతిమను చేసిటప్పుడు నేను ఎంత శ్రమ పడ్డానో నాకు మాత్రమే తెలుసు. చక్కగా ఓ ముద్రించిన మట్టి మూర్తిని కూడా తెచ్చుకున్నాను, అయినా ఇలా మూర్తిని చేసుకుని పూజించుకోవటంలో ఏదో తెలియని తృప్తి. ఇలా నేను తీర్చి దిద్దుకున్న ప్రతిమ పైనే ఇంతటి ఆప్యాయత ఏర్పరచుకున్నానే, మరి పిల్లలు కన్న తల్లి తండ్రుల గురించి ఒక్కసారి ఆలోచిస్తుంటే నా బుర్ర తిరిగి పోతోంది.

అన్ని నెలలు కని పెంచిన తల్లి పడ్డ బాధను ఈ పిల్లలలో ఎవ్వరు గమనించారు? నిద్ర ఆహారాలు మాని ఎన్ని రాత్రులు ఆ తండ్రి ఈ పిల్లలను సాకారో ఎంతమంది పిల్లలకు గుర్తుకు ఉంటుంది? అలా ఉంటుంది అని అనుకోకుండా అది వారి భాద్యతగా ఎంతటి శ్రద్దతో వీరిని పెంచిన తల్లి తండ్రులను ఎంతమంది పిల్లలు అర్దం చేసుకుంటారు? ఇవన్నీ ఎందుకు ఆలోచనకు వచ్చాయి అంటే, ఈ మూర్తిని నేనే మలచాను అన్న భావనే నన్ను ఇంతగా ఏటాచ్ మెంట్ పెంచేసుకునేటట్టు చేస్తే, మరి పిల్లలు ఉన్న తల్లి తండ్రులకు ఎంతటి ఎటాచ్ మెంట్ ఉంటుందో అన్న భావనే ఈ పుటకు ప్రేరణ.

20, ఆగస్టు 2012, సోమవారం

మూడో సారి అమెరికా ప్రయాణం

ప్రస్తుతం వ్రాస్తున్న భావనలు మూడో సారి అమెరికాని విజిట్ చేసిన తరువాత వ్రాస్తున్నవి. మొదటి సారిగా 2008లో అమెరికాని చూడటమైనది. మఱో రెండేళ్ల తరువాత 2010లో, మఱో రెండేళ్ల తరువాత ఇప్పుడు. ఈ నాలుగేళ్లలో అమెరికా ఏమీ మారలేదు. మొదటి సారి విచ్చేసినప్పుడు ఉన్న పరిస్తితులు, అప్పటి మనుష్యుల ప్రవర్తనలు, ఆ అలవాట్లు, నేను గమనించాను అని అనుకున్నవి అన్నీ అలానే ఉన్నాయి. వాటిల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. కానీ నాలోనే ఏదో మార్పు వచ్చినట్లుంది.

అది ఎందుకు వచ్చిందో అర్దం కాలేదు కానీ, ఇంతకు ముందు ఎప్పుడో వ్రాసుకున్నట్లు అంగీకరించడం ఎందుకో కష్టంగా ఉంది. కానీ నిజాన్ని నిజం అని ఒప్పుకోక తప్పదు. కానీ నిజాన్ని ఒప్పుకునేంత ఉన్నతమైన వ్యక్తిత్వం నాలో ఎందుకు కలగలేదో అర్దం కావటం లేదు. ఒక్కొక్క సారి చాలా కుశ్చితంగా ఆలోచిస్తున్నాను అని వ్రాసుకోవడానికి సిగ్గుగా లేదు కానీ, ఇలా వ్రాసుకోవడానికి చాలా ధైర్యం తెచ్చుకోవాల్సి వచ్చింది. నేను ఇలా నారో మైండెడ్ గా తయరవ్వడానికి నా ఆలోచనలే కారణమని నాకు తెలియడానికి చాలా కాలం పట్టింది.

ఇలా వ్రాసినంత మాత్రాన నేను ఇంతక ముందు వ్రాసినవన్నీ యాదార్దాలు కాకపోలేదు. ఆచారాన్ని సహిస్తాను కానీ అనాచారారాన్ని అంగీకరించలేను. ఇది అనాచారము అని నిర్ణయించే హక్కు నాకు లేక పోయినా, ఆచారముగా చెప్పబడినదానికి విరుద్దంగా ప్రవర్తించి మా ప్రవర్తన ఇంతే, ఎవ్వరో నిర్ణయించిన ఆ ఆచారాన్ని మేము పాటించము, మా ఆచారాన్ని మేము వ్రాసుకుని మాకు నచ్చినట్లు ఉంటాము అనే వారి ఆచారము నాకు అనాచారముగా అనిపిస్తోంది అనేది మాత్రం నిజం. ఏది సదాచారము? ఏది దురాచారము? అని నేను నిర్ణయించే స్థితిలో నేను లేకపోయినా, అలాంటి చర్చకు కూడా నేను సిద్దంగా లేను. అంతే కాదు సరికదా, అలాంటి చర్చను కూడా స్వాగతించే  హక్కు నాకు లేదు. ఈ చర్చ ఇప్పుడు అప్రస్తుతం అయనా, ముఖ్యమైన విషయం ఏమిటంటే, నా ఆలోచనా విధానంలో వచ్చిన మార్పు.

నేను కొంచం (కొంచం ఏం ఖర్మ, చాలానే..) దూకుడు మన:తత్వం కలిగిన వాడిని. అలాంటి నాకు ఈ సారి అమెరికా ప్రయాణంలో చాలా అవరోధాలు ఎదురైనా చిరునవ్వుతో దాటవేసే గుణం ఎందుకు కలిగిందో నాకు అర్దం కాలేదు. నా ప్రస్తుత ప్రయాణాన్ని ఉదాహరణగా తీసుకుంటే, హైదరాబాద్ నుంచి బయలు దేరిన విమాన యానం ముంబైలో మఱో అంకానికి చేరుకుంది. అక్కడి నుంచి పారీస్ వరకూ బాగానే సాగినా అక్కడి నుంచే మొదలైంది అసలైన కధ. నేను శాఖాహారిని. ముంబై నుంచి వచ్చే లేదా ముంబైకి వెళ్లే ప్లైట్లలో చాలామంది శాఖాహారులు ఉండటం అనేది చాలా సామాన్యం. కావున సదరు విమానాలలో విమానయానం చేసే ప్రయాణీకుల సౌకర్యార్దం కొన్ని శాఖాహార భోజనాలు ఎక్కువగా అందుబాటులో ఉంచుతూ ఉంటారు. కానీ పారీస్ నుంచి అటు పశ్చిమంగా వెళ్లే వారిలో శాఖాహారులు ఉండటం అనేదు అఱదు. కావున ప్రత్యేకంగా చెప్పకపోతే గాని శాఖాహారాన్ని అందు బాటులో ఉంచుకోరు. ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు నేను టికెట్ కౌంటర్లో శాఖాహారిని అని చెప్పనందున వారు నా విషయాన్ని ప్రస్తావించలేదు. అందువల్ల నేను సాధారణ మాంసాహారిని అన్నమాట.

శాఖాహారం తినటం అనేది నాకు పరంపరగా వచ్చిన ఆచారం. మా ఇంటికి అతిధి వస్తే లేదా మేము ఆహ్వానిస్తే, మేము శాఖాహారమే పెడతాము. అదే విధంగా మాంశాహారం పశ్చిమ దేశాలలో ఆచారంగా వస్తున్నందున అక్కడి వారు కూడా అక్కడికి విచ్చేసే యాత్రికులకు అదే ఆచారం ప్రకారం పద్దతలు పాటిస్తారు కదా, అదే పంధాలో అక్కడికి వచ్చే వారికి కూడా మాంశాహారాన్ని పెడతారు కదా!! అలాగే నా విషయంలో మాంశాహారాన్ని నా ప్రధాన ఆహార ఆచారంగా తీసేసుకున్నారు. కానీ నేను శాఖాహారిని అని తెలిసిన తరువాత శాఖహారం వడ్డించడం జరగక పోయినా, శాఖాహారం లేదని చెప్పినప్పుడు చాలా కోపం వచ్చినా, నాలోని సహనం ఆ కోపాన్ని అధిగమించేసింది. నవ్వుతో ఆనాటికి పళ్ల రసంతో సరిపెట్టుకుని, బ్రెడ్డు ముక్కలు తిని చాలించాను. అదిగో అలా మొదలైంది మఱో వింత అనుభవం. ఏదో తెలియని క్రొత్త ఆలోచనలు. సరి క్రొత్త భావనలు.

 

అదే ప్రపంచం మఱో కోణంలో కనబడటం మొదలైంది.

23, జులై 2012, సోమవారం

అమెరికా ఏమీ మారలేదు ??

ప్రస్తుతం అమెరికా లోని మసాచూసెట్స్ అనే రాష్ట్రంలోని పిట్స్ ఫీల్డ్ అనే ఊరినించి వ్రాస్తున్నాను. అమెరికా కు విచ్చేయడం ఇది నాకు మూడో విడత. మొదటి సారి వచ్చినప్పుడు టెక్సస్ లోని ఆస్టిన్ అనే ఊరికి వెళ్లాను. రెండొవ విడతలో ఫిలడెల్ఫియాలోని రెడ్డింగ్, ఇదిగో ఇప్పుడు ఇక్కడ. మొదటి సారికి రెండొవ సారికి పోలికలు ఓ పోస్టులో వ్రాసుకుంటూ ఏవేవో ఆలోచించిన నాకు మూడోసారి ప్రయాణం కించిత్ కష్టం గా సాగినా, ఎందుకో మనసు అంతా ప్రశాంతతో కూడుకుని అన్నింటినీ క్షమించేసింది. అమెరికా లో నాకు చాలా విషయాలు నచ్చకపోయినా, నచ్చినా.. అవన్నీ ఇప్పుడు భావాతీతంగా అనిపిస్తున్నాయి. అమెరికా లోని ప్రజల అలవాట్లు నాకు ఎప్పటికీ అర్దం కాకపోయినా, వాటిల్ని అర్దం చేసుకోవాలన్న ఆలోచన ఇప్పుడు లేదు. ఇక్కడ విభిన్నమైన జాతులు కలసి మెలసి ఉంటున్నా, అప్పుడప్పుడు నాలాంటి మానశిక వికలాంగులకు అమెరికా అప్పుడప్పుడు ఓ అర్దం కాని విచిత్రమే.

 

అమెరికా లోని ప్రజల జీవన విధానం పై మొదటగా నేను వ్రాసుకున్న విషయాలు ఇప్పటికీ మారక పోయినా, నా దృక్పధంలో మార్పు ఎందుకు వచ్చిందో నాకు తెలియటం లేదు. వ్యక్తుల మధ్య ఉన్న బంధాలు అనుబంధాల గురించి అన్యోపదేశంగా ఎవేవి వ్రాసినా, అమెరికా లోని ప్రజల గురించి ఏమి వ్రాసినా అది అర్ద రహితంగానే ఉంటుందనిపిస్తోంది. ఆరోజుల్లోని నా ఆలోచనలు వాటిపై పడ్డ మొట్టికాయలు ఇప్పుడు ఎందుకో గుర్తుకు రావటం లేదు. మొదటి సారిగా అమెరికా వచ్చినప్పుడు వేసుకున్న నీలిరంగు చొక్కా ఇప్పటికీ గుర్తుండి తీసుకురావడం ఇప్పుడు అదే వేసుకుని మూడోసారి కూడా క్లైంటు వద్దకు వెళ్ళడం ఎదుకో చిత్రంగా అనిపిస్తోంది. ఇంత సింహావలోకనం చేసినా, ఇప్పుడు చెప్పాలనుకున్నది ఎక్కడ మొదలు పెట్టలో అర్దం కావటం లేదు.

 

మఱో సారి ప్రారంభిస్తాను. అప్పుడు ఆలోచనలు ఓ రూపాన్ని తెచ్చుకుని అక్షరంగా ఇక్కడ కనబడుతుందేమో!!! అప్పటిదాకా ..

 

సశేషం ..

5, జూన్ 2012, మంగళవారం

సత్యమేవ జయతే కాదది, అపహాస్యమేవ జయతే ..

హర్యానా, పంజాబ్ మఱియు ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో జరుగుతున్న విషయాన్ని ప్రధానంగా తీసుకుని కొందరు ప్రముఖులతో చర్చా ఘోష్టిగా నిర్వహించిన జూన్ రెండొవ నాటి ఐదవ ఎపిసోడ్ గురించి వ్రాసే ముందు, ఆ నాటి చర్చాంచం గురించి ఒక్కసారి తలచుకోవడం ఎంతైనా అవసరమే. ప్రేమించడం నేరమా!!

మొదటి కధ:

ఓ గ్రామంలోని ఓ అబ్బాయి మఱో గ్రామంలోని ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అతనికి అమ్మాయి తరుఫువారి నుంచి కష్టాలు వచ్చాయి. వాటిని తప్పించుకునే ప్రయత్నంలో భార్యభర్తలిద్దరూ చాలా పట్టణాలు తిరిగారు. అధికార దుర్వినియోగం చేసిన పోలీసులు వీరికి చాలా కష్టాలు చూపించారు. ఈ విషయాన్ని ఆ ప్రేమికులే వారి స్వయం అనుభవాలుగా వివరించారు

రెండొవ కధ:

ఓ గ్రామంలోని ఓ అబ్బాయి మఱో గ్రామంలోని ఓ అమ్మాయిని ప్రేమించాడు. అతనికి అమ్మాయి తరుఫువారి నుంచి కష్టాలు వచ్చాయి. వాటిని తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులు కధనం ప్రకారం అబ్బాయి రైల్వే పట్టాల మీద శవమై కనబడ్డాడు. అంటే దీనిని ఆత్మహత్య క్రింద చిత్రీకరించారని సమాజంలోని కొన్ని మహిళా సంఘాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసి న్యాయం జరగాలని పోరాటం జరిపారు. ఈ విషయం అంతా చనిపోయిన అబ్బాయి తల్లి చేత చెప్పించారు.

మూడవ కధ:

ఓ గ్రామంలోని ఓ అబ్బాయి మఱో గ్రామంలోని ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఉన్న చిక్కల్లా ఒక్కటే.. వారిద్దరూ ఒకే గోత్రానికి చెందిన వారు. అతనికి అమ్మాయి తరుఫువారి నుంచి కష్టాలు వచ్చాయి వాటికి తోడుగా అక్కడి పెద్దలు కూడా వీరి వివాహానికి సమ్మతినివ్వలేదు. వాటిని  సమర్దించుకునే ప్రయత్నంలో భార్యభర్తలిద్దరూ కలసి ఢిల్లీ వెళుతుంటే, దారిలో కాపు కాచి బస్సులో ప్రయాణం చేస్తున్న అబ్బాయిని కొందరు పెద్దమనుషులు ఆయుధాలతో కిరాతకంగా నరికి చంపారు. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లినందుకు అబ్బాయి చెల్లెల్ని కూడా చంపించే ప్రయత్నం చేసారని ఆ అమ్మాయే చెప్పింది. న్యాయస్థానం కొందరు హంతకులను గుర్తించి పలువురికి ఉరిశిక్షను ఖరారు చేసింది. మఱి కొందరికి జీవిత ఖైదు శిక్ష పడింది. ప్రస్తుతం ఆ కేసు సుప్రీం కోర్టులో నడుస్తున్నది.


ఇలాంటి వారిద్దరి కధలే ఈ నాటి చర్చాంశం.

 

సత్యమేవ జయతే గురించి జరిగిన ప్రచారంలో కొన్ని నగ్న సత్యాలు నన్ను చాలా భాదించాయి. అందుకని సత్యాన్ని నగ్నంగా నైనా చూసే ధైర్యం లేని నాలాంటి వాడు మొదటి ఎపిసోడ్ నందలి కొన్ని నిజాలు తెలుసుకున్న తరువాత, నిజాన్ని జీర్ణించుకు లేని స్థితిలో తరువాతి ఎపిసోడ్స్ చూడలేదు.

 

ఆ తరువాత చూసిన మఱో ఎపిసోడ్ ఇది. నేను ఈ ఎపిసోడ్ చూసే సమయానికి ఎంత భాగం అయ్యిందో తెలియదు. కానీ అమీర్ ఖాన్ గారు, ఓ గ్రామ పంచాయితీలోని ఓ ఐదుగురు పెద్దవాళ్లతో చర్చిస్తున్నారు. చర్చ ఎప్పుడూ మంచిదే కాదనను, కానీ చర్చ అనేది ఒక వైపుగా జరగ కూడదు. ఇరువైపులనుంచి జరగాలి. కానీ పంచాయితీ పెద్దలతో ఇక్కడ జరిగిన తతంగం చర్చలా కాకుండా, వారిని అపహాస్యం చేస్తుంటే, ప్రేక్షకులలో కూర్చున్న వారు ఆనందిస్తూ చప్పట్లు కొడుతున్నారు. గ్రామ పంచాయితీ పెద్దలేమో పరంపర / Tradetion అంటూ ఉంటే, మన అమీర్ ఖాన్ గారేమో భారతదేశ రాజ్యాంగం గురించి ప్రస్తావిస్తున్నారు. వీరి చర్చను పూర్తి చెయ్యకుండానే అమీర్ ఖాన్ గారు మధ్యలో ముగిస్తూ మఱో వ్యక్తిని ప్రవేశ పెట్టారు

 

వీరి తరువాత మఱో వ్యక్తి వచ్చారు. ఆయన లవ్ కమాండోస్ అనే ఓ సమాజానికి ప్రతీకగా వచ్చారు. ఇంటర్ కాస్ట్ మారేజస్ మాత్రమే మన భారత దేశాన్ని ముక్కలు కాకుండా కాపాడుతున్నాయని, అవి మాత్రమే భారతదేశ గౌరవాన్ని నిలబెడతాయని సుప్రిం కోర్ట్ చెప్పిందని ఈయన చెబుతున్నారు. ప్రేమ మూర్తులుగా కనబడే దేవతలను ఉదహరింపుగా రాధా శ్రీకృష్ణులను చూపిస్తున్నారు కదా!! అలాంటి వారందరికీ ఓ మాట చెబుతున్నాను, వీలైతే ఆ మూర్తులున్న గుడిలలో పూజలైనా ఆపేయ్యండి లేదా.. ప్రేమియోంక ప్రేమ్ కో స్వీకార్ కర్లో.. love shall conquer the world.. అనేది వీరి భాష్యంలోని ఆఖరి అంశం.

వీటి తరువాత, ఉదాహరణగా మఱో ప్రేమ జంట గురించి ప్రస్తావించారు. అలాగే, ఆ ప్రేమ జంట యొక్క చరిత్రను వివరిస్తూ వారి కుటుంబం వారిని పాతిక సంవత్సారాలు దూరంగా ఉంచిన తరువాత వారికి మఱో సారి సాంప్రదాయ బద్దంగా వారికి వివాహం జరిపించిన వైనాన్ని చిత్రీకరించి ప్రేక్షకులకు సెంటిమెంట్ అందేపరంగా చూపించారు.

ముగింపులోకి వస్తుండగా, ప్రేమ వివాహం చేసుకున్న ఆ యువతి తన తండ్రికి సందేశానిస్తూ క్షమించమని వేడుకోవడం దానిని అమీర్ ఖాన్ గారు సమర్దిస్తూ ఆ పిల్ల తల్లి తండ్రులను బుజ్జగించే ప్రయత్నం చేసే పనిగా, ఓ చక్కని పాటని అందించారు.

ఇది అక్కడ జరిగింది. నా అభిప్రాయం మఱో సారి విపులంగా వ్రాస్తాను. ఈ పుటని ఇక్కడతో ముగించి, “సత్యమేవ జయతే ..” లో ఈ ఎపిసోడ్ గురించి నా అభిప్రాయాలు వ్రాసే ముందుగా, ప్రేమ అనే పదం గురించిన నా నిర్వచనాన్ని ఇక్కడ ప్రస్తావిస్తే, నా భావన ఏమిటో .. అది ఏ కోణం నుంచి చూస్తూ వ్రాస్తున్నానో అనే విషయం పై ఒక ఖచ్చితమైన అవగాహన వస్తుంది.


ప్రేమ పై నా నిర్వచనం

ప్రేమ అనే పదాన్ని ఒక్కొక్కరు ఒక్కొవిధంగా అభివర్ణిస్తాను. నా భావనలో మాత్రం, ప్రేమ అంటే భాద్యత. మనం ఎవ్వరినైనా ప్రేమిస్తున్నాం అంటే వారి భాద్యత తీసుకున్నట్లే. ఇది భార్యా భర్తల విషయమైనా లేదా తల్లి పిల్లల విషయమైనా లేదా తండ్రి పిల్లల విషయమైనా లేదా మరింకేదైనా. ఆ విధంగా ప్రేమించడం అంటే భాద్యతని భుజాలపై వేసుకుని, ప్రేమించ బడుతున్న వారికి ఒక రకమైన భద్రతా భావనని ఇవ్వటమే అని నా అభిప్రాయం మఱియు అనుభవం.

21, ఏప్రిల్ 2012, శనివారం

అంగీకరించగలగడం అనేది ఓ పెద్ద కష్టమైన పని

ఈ మధ్య నాలో జరుగుతున్న ఆత్మ విమర్స లేదా పరిశీలన లోని కొన్ని ఆలోచనల కోణాలు నన్ను ఈ పుట వ్రాసేందుకు ప్రోత్సాహకంగా నిలిచాయి. ఉపోద్ఘాతంగా వ్రాసేందుకు నా పాత పుటలలో ప్రాశ్చాత్యుల జీవితాలపై నా పరిశీలనలు పనికి వస్తాయి. ఆ పుటలు చాలా మంది దృష్టిని ఆకట్టుకున్నాయి. ఇలా ఆకట్టుకోవడం వెనుక నా పుటలలో ఉన్న సారం కన్నా, విమర్శా పధంగా సాగిన నా రచనా శైలి అని అనుకోవచ్చు. వాటి యందు వ్యంగ్య భావన పుటమరించి ఉంది అని పాఠకుల భావన. వారి దృక్కోణంలో ఆలోచించినప్పుడు నాకు అది నిజముగానే అనిపించింది. వారి భావన యందు దోషం కనబడ లేదు. ఇది నేను అంగీకరించడాని చాలా కష్టపడవలసి వచ్చింది. అదిగో అప్పుడు అనిపించింది, ఏదైనా విషయాన్ని మన మనోభవాలకు విబేధంగా ఉన్నప్పుడు దాని యందు ఉన్న తత్వాన్ని యధా విధిగా అంగీకరించడానికి బదులుగా వ్యతిరేక భావన కలగడం ఎంత సహజమో, అలాగే ఆ విషయాన్ని ఆ విధంగా అంగీకరించి యధాతధంగా స్వీకరించడానికి చాలా మనోబలం కావాలి కూడా అని.

ఇలాంటి ఆత్మా మధనంలోని భావాలకు ఆధ్యం పోసినట్లుగా మఱో ఘటన ఈ మధ్య జరిగింది. ఆ ఘటన గురించి నా భావనను వ్రాసే ముందు ఆ ఘటన లోని విషయాన్ని, అలాగే దానియందు నాకు కలిగిన భావనను ప్రస్తావిస్థాను.

వృత్తి పరంగా పనికి వస్తుందని మఱో సెమినార్ భాగ్యనగరంలో జరుగుతోందని తెలిసిన తరువాత వీలుచేసుకుని హాజరయ్యాను. అక్కడకు వచ్చిన వారిలో ఓ విదేశీ యువతి ఉంది. ఆ యువతి ఆహార్యం ప్రకారం వివరించాల్సి వస్తే, తల నీలాలకు తైల సంస్కారం లేదు. నీలలను చక్కగా ఒద్దికగా ప్రక్కకి అదిమి పాపిడ తీసి లేవు. ఇక దుస్తులు విషయానికి వస్తే,  తొడలు కనబడేలా ఉండి లోదుస్తులు కనబడే విధంగా ఉన్నాయి. వీటన్నింటికీ తోడుగా, నోటిలోని దంతాలు పచ్చగా ఉండి దుర్ఘందాన్నిస్తున్నాయి. అన్నింటినో మించి ఘాటైన స్ప్రే ఆ చుట్టుప్రక్కల ఉన్న వారి ముక్కు పుటాలను అదరగొడుతోంది.

ఇలాంటి యువతులను ఇంతకు పూర్వం చాలా మందిని చూసాను. కానీ ఆ నాడు నాకు కలగని ఆలోచన ఈ నాడు కలిగింది. ఒక్కసారి నా ఆహార్యం గురించి అలాగే అదే సమయంలో నేను ఎలా ఉన్నానో ఒక్కసారి చూసుకున్నాను. తలారా స్నానం చేసి నుదుట వీభూతి ధరించినా, నేను సెమినార్ హాల్ చేరుకునేటప్పటికి నుదురుపై ఉన్న వీభూతి కనబడలేదు. నొసట కుంకుమ ధరించి, చక్కటి ఇస్త్రీ చేసిన దుస్తులు వేసుకుని, శరీర దుర్గందం రాకుండా ఉండే విధంగా (నా ఉద్దేశ్యంలో చమట పట్టకుండా..) శ్రద్ద తీసుకుని సెమినార్ జరిగే స్థలానికి చేరుకున్నాను. సెమినార్ జరిగే ప్రదేశం అంతా ఏసీ ఉండటం వల్ల ఎటువంటి వాసన అయినా పసిగెట్టేయ్యవచ్చు.

ఇప్పుడు ఒక ప్రశ్న. నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఇలా ఉండాలి అని నాకు అనిపించింది, దానికి సవా లక్ష కారణాలు. అవి ఇప్పుడు అప్రస్తుతం. అలాగే ఆ విదేశీ యువతి ఎందుకు అలా ఉంది? దానికి సమాధానంగా, అలా ఉంటే తాను అందంగా ఉన్నాను అని ఆ అమ్మాయి అనుకుంది. అలా ఉంటే తాను బాగుంటాను అని ఆ అమ్మాయి మనసు చెప్పి ఉండవచ్చు. అలా ఉంటే ఆ అమ్మాయి మనసు తృప్తి చెందుతుండవచ్చు. అది ఆ అమ్మాయి స్వాతంత్ర్యం. అది ఆ అమ్మాయి అభీష్టం. అది ఆ అమ్మాయి మనో సంకల్పం. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్లు, “రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండాలన్నట్లు..”, ఆ అమ్మాయి భారత దేశంలో ఉన్నప్పుడు భారతీయ యువతిలా ఉందా అనే ప్రశ్న ఇక్కడ అప్రస్తుతం. ఎక్కడ ఉన్నా నేను నేనులా ఉన్నాను అని ఆ అమ్మాయి ఆ ఆహార్యం చెబుతోంది.

మఱొ అడుగు వేసి, ఒకవేళ ఆ అమ్మాయి

  • ఆహార్యాన్ని నేను ప్రశ్నిస్తే..
  • శరీర తత్వాన్ని నేను ఆక్షేపిస్స్తే ..
  • ప్రవర్తనా విధానన్ని వ్యతిరేకిస్తే ..
  • .. .. ఇంకా ఇంకా  .. .. డాష్ .. డాష్ .. చేస్తే ..

ఆ అమ్మాయి తిరిగి నన్ను ప్రశ్నించ వచ్చు. కానీ కొంచం మర్యాద పూర్వకంగా ఆలోచిస్తే, నాకు ఇలా అనిపించింది.

“ .. నువ్వెందుకు అలా ఉండాలి అని అనుకున్నావో నాకు అనవసరం. అలాగే నేను ఎందుకు ఇలా ఉన్నానో నీకు అనవసరం అని అనక పోయినా, నేను ఇలా ఉండాలని నేను అనుకున్నాను కాబట్టి నేను ఇలా ఉన్నాను. నన్ను నన్నుగా అంగీకరించు .. .. ”

ఆంగ్లంలో వ్రాయాల్సి వస్తే, నాకు ఇలా అనిపించింది.

“.. you decide to be what you are, so the same with me. I decide to be what I’m, so I’m .. .. accept me as I’m .. ”

ఇలాంటి ఆలోచనతో / దృక్పధంతో / ధృకోణంతో ఆలోచిస్తే, ఇంతకు ముందు నేను పాశ్చాత్యులపై వ్రాసిన నా అభిప్రాయాలు నాకు వింతగా అనిపిస్తున్నాయి. వారు ఆవిధంగా జీవించాలి అనుకుంటున్నారు. ఆ ఆలోచనల గురించి మఱో సారి ..

18, ఏప్రిల్ 2012, బుధవారం

నీతి శాస్త్రం : నడువడి ఎలా ఉండాలి

ఈ మధ్య కాలంలో ఏమీ వ్రాయాలని అనిపించక వ్రాయటం లేదు. ఇవ్వాళ మాత్రం ఇది వ్రాయక తప్పదని నిశ్చయించుకుని మొదలు పెడుతున్నాను. ఇక్కడ ప్రస్తావించే విషయాన్ని మానవ దృక్పధంతో ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీనిని కులమతాలకు అతీతంగా ఆలోచించాలి. భావం ప్రధానం కాని భాష్యం కాదు అని అనుకుంటే, సమగ్రంగా అర్దం అవుతుంది.

కొంతకాలంగా వీలు చేసుకుని శ్రీ మహా భాగవతము చదువుతున్నాను. అందలి కొన్ని విషయాలు ఇప్పుడు నన్ను ఇలా ప్రేరేపించాయి. పోతనగారి గురించి నేను ఏమి వ్రాసినా అది దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటుంది. ఎందుకంటే, సాహిత్యం అనే పదమే కానీ దానిలోని గొప్పతనన్ని చాలా కాలం వరకూ ( .. గ్రహించడం మాట అటువుంచి, ఆ గొప్పతనాన్ని .. ) హేయాభావంతో చూస్తూ బ్రతికిన నాకు దాని గురించి ప్రస్తావించడం మినహా ఆఖ్యానించకూడదని అవగతం అయ్యింది. అలాంటి సాహిత్యానికి తలమానికమైన భాగవత, తెలుగు అనువాద రచయిత అయిన పోతనగారి గురించే!! అందునా నేను కామెంట్ చెయ్యటమా!!! హరి హరి.. ఎంతటి సాహసమో కదా అని చదివే వారు ముక్కున వేలువేసుకుని నోటితోనే కాదు చేతితోకూడా నవ్వుతారు. ఇప్పటికే ఎన్నో రాళ్ళు పడ్డాయి, వాటికి తోడుగా మరిన్ని అవసరమా నాకు. అందుకని పోతనగారిని ప్రస్తావిస్తూ, వారి కవితా చాతుర్యానికి వేవేల కొనియాడుతూ, వారు రచించిన కొన్ని పద్యాలను ఇక్కడ ప్రస్తావిస్తాను.

శ్రీ కృష్ణ భగవానుని నిర్యాణాంతరం ద్వారక నుండి ఖిన్నుడై వచ్చిన అర్జునుని చూచి ధర్మరాజు దుఃఖ హేతువుని తెలియక ప్రశ్నించిన ఘట్టమున రచించిన శ్లోకములు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

క. ఓడితివో శత్రువులకు నాడితివో సాధుదూషాలామ్ముల్
గూడితివో పరసతులను వీడితివో మానధనము వీరుల నడుమన్.

క. తప్పితివో యిచ్చెద నని, చెప్పితివో కపట సాక్షి చేసిన మేలుం
దప్పితివో శరణార్ధుల, రొప్పితివో ద్విజులఁ బసుల రోగుల సతులన్.

క. అడిచితివో భూసురులను, గుడిచితివో బాల వృద్ధు గురువులు వెలిగా
విడిచితివో యాశ్రితులను, ముడిచితివో పరుల విత్తములు లోభమునన్

అనిఅడుగుతారు ధర్మరాజు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వీటి అర్దాలు నాకు అంతగా అవగతం అవ్వక పోయినా, నాకు అర్దం అయ్యినంత వరకూ ఏమి అర్దం అయ్యిందో వ్రాస్తాను.

మొదటి శ్లోకంలో ..

౧) శత్రువుల చేతిలో ఓడి పోయ్యావా
౨) సాధువుల యందు దూషణ చేసావా
౩) పరసతులను కూడి రమించావా, అంటే పర స్త్రీలతో రతి సంగమం కావించావా
౪) వీరుల మధ్యలో ఉండి మానము ధనము వంటి వాటిని వదిలి ప్రవర్తించావా

రెండొవ శ్లోకంలో ..

౫) ఏదైనా చేస్తాను అని ఇచ్చిన మాట తప్పావా
౬) కపటమైనటువంటి శాక్ష్యం చెప్పావా
౭) చేసిన మేలుకి తిరిగి మేలు చెయ్యడం అనే ప్రక్రియను తప్పావా (లేక మఱో భావంగా, మేలు చేసిన వారి మేలుని మెచ్చుకోక పోగా దెప్పి పొడిచేటట్టుగా ప్రవర్తించడం చేసావా )
౮) శరణార్దులను రక్షించకుండా ఏడిపించావా అంత యేకాక, పైన ప్రస్తావించిన వాటిల్లో, ద్విజులు రాజులు రోగులు లేదా స్త్రీలు ఉన్నారా

మూడొవ శ్లోకంలో ..

౯) భూసురులు అంటే రాజులను అణచావా
౧౦) బాలలను వృధులను గురువులను .. [[ ఏమి చేసారు అని అన్నారో అర్దం కాలేదు. నాకు తెలుగుని అర్దం చేసుకునే ఇంగితం లేనందున ]]
౧౧) ఆశ్రయించి ఉన్న వారిని విడిచి వెళ్లి పోయ్యావా
౧౨) లోభత్వం కలిగి ఉండి పరుల విత్తమును దాచుకున్నావా

అని నాకు అర్దం అయ్యింది. అంతే కాకుండా నాకు మఱింకో విషయం కూడా అర్దం అయ్యింది. ఒక వేళ అర్జునుడు పైన ఉదహరించిన వాటిల్లో ఏదైనా చేసి ఉన్నట్లైతే, కొన్నింటి యందు తత్వ చింతన చేస్తేనే అర్దమయ్యే విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. మరికొన్నింటిలో తత్వ చింతన చేసినా నిస్పక్ష పాతంగా ఆలోచించగలిగే మనసు కలిగి ఉండాలి. అప్పుడే చేసిన పని తప్పు అని తెలిసి చింతిస్తారు. ఉదాహరణకి, సాధువుల యందు దూషణ అనే కార్యం తీసుకున్నాం అనుకుంటే, అర్జునుడు దూషణ చేసి ఉన్నా, అది సాధువులయందు అని గ్రహించడానికి మనసు ఒప్పుకోదు. వారేదో వెధవ పని చేసారు కాబట్టి నేను దూషణ చేసాను అని సమర్దించు కునే వాడు. అలా సమర్దించుకున్నా, తన తప్పు తెలుసుకుని పశ్చాతాపంతో దుఃఖించే స్థితికి చేరుకోవడం అంటే ఎంతో నిబద్దతతో కూడుకున్న వ్యక్తిత్వం కలిగిన వారై ఉండాలి. అలాంటి స్థితిలో అర్జునుడు ఉన్నాడు అని అనుకోవాలి.

ఇక్కడ ఉన్న విషయాలను క్షుణ్ణంగా కాకపోయినా మన స్థాయికి తగ్గట్టుగా ఆలోచించుకున్నా, చాలా విషయాలు మనకు అవగతం అవుతాయి. కానీ ఇక్కడ ప్రస్థావించినవి ఎన్ని వందల ఏళ్ళ క్రిందట అనే మాట ప్రక్కన పెడితే, ఎన్ని రోజులు క్రిందటిదైనా పాత చింతకాయ పచ్చడి రుచిగానే ఉన్నట్లు, ఈ మాటలు కూడా చాలా ప్రశస్తంగా మరింత క్రొత్తగా ఈ నాటి రోజులకు అనుగుణంగా రచించారా అన్నట్లు ఉన్నాయి. ఎవ్వరి గురించో నాకెందుకు, నా గురించి నేను ఆలోచించుకుంటే..

అను నిత్యం నేను శత్రువుల చేతిలో ఓడిపోతూనే ఉన్నాను. సాధువుల యందు దూషణ చేస్తూనే ఉన్నాను. పర సతులను కూడి బ్రతకటం లేదు కానీ కపట శాక్ష్యాలు అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను. చేసిన మేలుకి కృతఙ్ఞతా పూర్వకంగా తిరిగి మేలు చేయకపోయినా, వారి సహృదయానికి గుర్తుగా ఉన్న (నా యందు వారు చేసిన) మేలుని మఱచి జీవిస్తూ ఉంటాను. ఆఖరులో లోభత్వం కలిగి పరుల విత్తమును అని అనను కానీ నాకు ఉధ్యోగం ఇచ్చే వ్యవస్థను సంకట స్థితిలో ఉంచి నా జీతాన్ని బేరం చేస్తూనే ఉన్నందున వారి ధనాన్ని ఆకాక్షించి దోచుకుని దాచుకుంటున్నాను అనిపిస్తోంది.

ఇదంతా నా గురించి నేను ఆత్మ విమర్స చేసుకునే సమయంలో ఒలికిన భావనలోని కొన్ని వాక్యాలు మాత్రమే. కానీ నా గురించి తీసి ప్రక్కన పెడితే, ప్రస్తుతం నేను ఉన్న సమాజంలో ఎంతమంది ఇలాంటి వాటిని గమనించి మెచ్చుకుంటారు? మెచ్చుకోవడం ఒక మాట అయితే, వాటిని అవగాహన చేసుకుని అర్దం చేసుకుని ఆ విధంగా జీవించే వారు ఎంతమంది? ఇలాంటి ప్రశ్నల పరంపర ప్రక్కన పెడితే ఇంత చక్కగా ప్రతీ మనిషి తన తోటి వారియందు సతు బుద్ది కలిగి ఉండాలి అని మన గ్రంధాలు చెబుతున్నాయని ఒప్పుకునే వారు చాలా అఱుదు అని నా అభిప్రాయం

10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

వైద్యులంటే అసహ్యం వేస్తోంది

ఈ మధ్య అనుకోకుండా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే పేరుతో ప్రస్తావించ బడుతున్న చేతి వేళ్ళకు సంబందించిన ఓ వ్యాధితో బాధపడుతున్నాను. నిన్న నెప్పి ఎక్కువైతే దగ్గరలో ఉన్న ఓ MD చదువుకున్న ఓ వైద్యుని వద్దకు అత్యవసర పరిస్తితిలో వెళవలసి వచ్చింది. ఆ వైద్యులు గారు నా గోడు పూర్తిగా వినకుండానే ఓ నాలుగు రక్త పరిక్షలు వ్రాసి ఇచ్చారు. అందులో షుగర్ ఉందో లేదో అని తెలుసుకునే, RBS అంటే రాండమ్ బ్లడ్ షుగర్ పరిక్ష కూడా ఉంది. ఆ తరువాత మాటల మధ్యలో నాకు షుగర్ లేదని చెబుతుంటే, వినిపించుకోకుండా, ఆ పరిక్ష చేయ్యాల్సిందే అని చెప్పారు.

గత సంవత్సరంలో నవంబర్ నెలలో ఆఖరి సారిగా రక్త పరీక్ష చేయించుకున్నాను అంతేకాకుండా గత సంవత్సరంలో యాక్సిడెంట్ కారణంగా ఓ నాలుగు సార్లు చేయించుకున్నాను అని చెప్పిన  తరువాత విషయాన్ని విని ఓ నాలుగు రకాల మందులు వ్రాసి ఇచ్చారు. ప్రస్తుతానికి ఇవి వాడండి ఆ తరువాత పరిక్షలు చేయించుకుని రండి అప్పుడు చూద్దాం, అన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, జబ్బులు రోగులకు క్రొత్త కానీ వైద్యులకు క్రొత్త కాదు. చిటికెడు చెబితే చారెడు గ్రహించయ్యటం వీరికి అనుభవంలో వస్తుంది. కానీ రోగులకు విషయం చెప్పాలి కదా!! ఇలా వ్రాసుకుంటూ పోతే మరేదో వ్రాసేస్తాను.. విషయంలోకి వస్తే..

వైద్యో నారాయణ హరి.. అంటారు కదా, ఆయన చెప్పిన పరీక్షలకు రక్తం ఇచ్చి ఓ వెయ్యి రూపాయల బిల్లు చెల్లించి ఇంటికి చేరుకున్నాను. ఇచ్చిన మందులు వేసుకుని నొప్పి తగ్గుతుందేమో అని ఎదురు చూస్తూ గడిపేసాను. తీరా సాయంత్రం రిపోర్టులు తీసుకుని వెళ్ళి చూసే సరికి ఆ వైద్యులు గారు ఊరిలో లేరని తిరిగి సోమవారం వస్తారని తెలిసింది. ఇంతకు ముందు నాకు యాక్సిడెంట్ అయ్యినప్పుడు ట్రీట్ చేసిన వైద్యులు కూడా అంతే, వెళ్ళంగానే xరే తీయించుకుని రమ్మంటారు. తీయించుకుని వచ్చిన తరువాత దానిని చూడను కూడా చూడరు సరి కదా, చూపించ బోతే, “ నాకు తెలుసు ..” అంటూ మాట దాటేస్తారు.

ఇవన్నీ చూస్తున్న తరువాత వైద్యులపై గౌరవం కలుగకపోగా, అసహ్యం వేస్తోంది. అన్నింటికీ మించి, ఈ వైద్యులు గారు ప్రిస్క్రిప్షన్ ద్వారా ఇచ్చిన మందులు వారి ప్రక్కనే ఉన్న కొట్లో కొనుక్కోవాలన్నమాట. అమ్మే దుకాణానికి లైసెన్స్ లేదు. దీనికి తోడుగా, వీరు చెప్పిన పరీక్షలు కూడా ఆ ప్రక్కనే ఉన్న దుకాణం వెనకాల ఉన్న గదిలో చేయించుకోవాలన్నది వీరి డిమాండ్. అక్కడ కాకపోతే సరి అయిన లేదా కరక్ట్ రిజల్ట్స్ రావంట. సరే నొప్పి తగ్గాలి కదా అని వీరు చెప్పిన మందులు తీసుకుని ఆ ప్రక్కనే ఉన్న గదిలో రక్తాన్ని ఇచ్చి ఇంటీకి చేరుకున్నా.

దీని నుంచి నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే, కొంచం ఖర్చు ఎక్కువైనా వ్యాపార పరంగా ఉన్న పెద్ద హాస్పిటల్స్ ఫరవాలేదనిపిస్తోంది.

 
Clicky Web Analytics