31, జులై 2011, ఆదివారం

నేనేం చెయ్యాలి? భాధ పడాలా? మరింకేం చెయ్యాలి

ఆది లక్ష్మి గారికి కలిగిన దెబ్బ విషయం తెలిసిన తరువాత దానిని జీర్ణించుకోలేక తల్లడిల్లిపోవడం తప్ప ఏమీ చెయ్యలేక పోయిన నాకు నేనేమి చెయ్యాలి అన్న ఆలోచన పురుగల్లే తొలిచి వేస్తోంది. అమ్మ గురించి అమ్మఒడి గురించి తెలియని వారు ఉండరు, తెలుసుకోని వారు అభాగ్యులై అనాధలుగా కొన్ని చోట్ల కనబడినా వారి శాతం చాలా తక్కువనే చెప్పుకోవాలి. అలాంటి వారి గురించి ప్రక్కన పెడితే, ఆది లక్ష్మి గారికి ఎదురైన ఈ అవస్థకు లేదా వీరి ప్రస్తుత ఆపత్కాలానికి నేనేమీ చెయ్యలేక పోతున్నానే అనే భావన నన్ను మరింత కృంగదీస్తోంది.

వీరికి ఫోన్ చేసి మాట్లాడదాం అని ఒకసారి ప్రయత్నం చేస్తే నా నోటి వెంట మాటరాక నేనే చిన్నపిల్ల వాడిలాగా ఏడ్చేస్తున్నాను. అలాంటిది నా ద్వారా వీరికి మరింత బాధని అందజేసిన వాడనౌతున్నాను. అలా అని ఊరకే ఉందాం అనుకుంటే, మనసు మాట వినదాయె. మఱో ప్రయత్నంగా ఇంకొకసారి చేస్తే, ఈ సారి నాది అదే పరిస్థితి. ఓదార్చాల్సిన నేనే ఏడుస్తూ కూర్చుంటే, ఆ తల్లిని సముదాయించే వారెవ్వరు? ధైర్యం తెచ్చుకోండి అని చెప్పాల్సిన నేనే మూగబోయి ఆవిడ బాధకి మరింత తోడై, అగ్నికి ఆజ్యం పోసిన వాడనౌతున్నాను.

మా నాన్నగారు ఓ విషయాన్ని ఎల్ల వేళలా చెబుతూ ఉండేవారు. మనం ఎవ్వరికైనా సహాయం చెయ్యకపోయినా ఫరవాలేదు కాని మన వల్ల వేరొక్కరు నష్ట పోకూడదని. కానీ ఆదిలక్ష్మి గారి విషయంలో, నా వల్ల వీరి బాధ అధికం అవుతోంది కాని, వీరికి ఉపశమనం మాట అటుంచి, మఱచి పోతున్న ఙ్ఞాపకాలను తవ్వి వెలికి తీస్తున్నట్లుంది నా పరామర్శ. సరిగ్గా పరామర్శించడం చేతకాదు, పోనీ సరిగ్గా మాట్లాడడమా చాతకాదు, ధైర్యం చెబుదామా అంటే అదేలాగో తెలియదు, ఎందుకీ స్థితి నాకు? ఏమీ చాతకాని నేను ఏమి చెయ్యాలి.

ఏదో వారి బ్యాంక్ ఎక్కౌంట్ ఇచ్చారు కాబట్టి అంతో ఇంతో, అదిఇదీ కాకపోతో ఎంతోకొంత వారి బ్యాంక్ ఎక్కౌంటులో జమ చేసి మౌనంగా బ్రతికేయ్యాలా!! దిక్కుతోచని స్థితి. నామీద నాకే అసహ్యం వేస్తోంది.

23, జూన్ 2011, గురువారం

అమెరికా వాళ్ళే పిసినారోళ్ళు కాదు

ఇంతకు ముందు అమెరికా వాళ్ళ పిసినారి తనం గురించి ఓ వివరం వ్రాసుకున్నట్లు గుర్తు. కానీ ఇవ్వాళ ఈ లంకెలోని వ్యాసాన్ని చదివిన తరువాత నోటివెంట మాటరాలేదు. అమెరికా వారి గురించి వ్రాసుకున్నప్పుడు ఎనిమిది వందల బిలియన్ డాలర్ల గురించి ప్రస్తావిస్తే, గ్రాంట్ థ్రాన్‍టన్ సంస్థలో పనిచేస్తున్న హరీష్ చెపొచ్చేదేమిటంటె, ఇరవై బిలియన్ డాలర్ల ($20m) సొమ్ము నికరంగా నగదురూపంలో ప్రైవేట్ ఇన్వెస్టర్ల వద్ద మూలుగుతోంది. ఇంత పెద్ద మొత్తం కూడా పెట్టుబడికి సిద్దంగా ఉంది.

ఈయన కన్నా ఓ అడుగు ముందుకు వేసి బెంగళూర్ స్థానంగా వ్యాపారాన్ని నడుపుతున్న IDC Ventures యొక్క అధిపతి అయిన సుధీర్ సేథి ఇంకొంచం ముందుకెళ్ళి తొక్కలో ఇరవై ఏమిటి, చక్కగా ఓ డెబ్బైయ్యో లేదా డెబ్బైఅయిదు బిలియన్ డాలర్లు పెట్టుబడి చెయ్యక నగదు రూపంలో మూలుగుతున్నాయి అని అంటున్నారు. ఇలా అనడమే కాకుండా, వారి ఆలోచనలకు సాధ్యాసాధ్యలకు అనువైనటువంటి ఆలోచనలకు రూపం ఇచ్చేలాగా అంకెలతో గారడి చేస్తున్నారు.

ఈ అంకెల గారడి అంతా హంబక్.. పనిలేని వాళ్ళు వ్రాసుకునే చెత్త రాతలు అని అనుకుందాం అనుకుంటే, నేను బొర్లా పడ్డట్టే. ఎందుకంటే, ఈ సంవత్సరంలో మే నాటికి భారత దేశం నుంచి బయట దేశాలలో పెట్టుబడి పెట్టే నిమిత్తం తరలి వెళ్ళిన ధనాన్ని లెక్కల్లోకి తీసుకుంటే, క్రిందటి సంవత్సరానికన్నా దాదాపు సగానికి పడిపోయి (అంటే 59%), చూచాయిగా మూడున్నర బిలియన్ డాలర్లకు దగ్గరి దగ్గరగా ($3.7b) ఉంది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు తెలియజేసారంటె, మన భారత దేశం నుంచి బయటకు వెళ్ళాల్సిన పెట్టుబడి ఆగి పోయినట్లే కదా. ఈ విషయాన్ని ఈ వ్యాసంలో చదువుకోంటుంటె, అదే వ్యాసంలో మఱో చోట మొత్తం మీద క్రిందటి సంవత్సరం కన్నా భారతీయులు ఈ సంవత్సరంలో చాలా తక్కువగా పెట్టుబడులు పెడుతున్నారని తెలియజేసే విధానం నాకు అబ్బుర పఱచింది.

ఇలాంటి విషయాలను చదువుతుంటె, పాపం అమెరికా వాళ్ళు మాత్రమే పిసినారోళ్ళు కదనిపిస్తోంది. ఇలా అమెరికా వారి గురించి వ్రాసినందుకు కించిత్ బాధగా ఉన్నా, ఎక్కడ ఎనిమిది వందల బిలియన్ డాలర్లు ఎక్కడ ఇరవై బిలియన్ డాలర్లు, లేదు కాదు అనుకుంటే, అధికపక్షం ఓ ఎనబై బిలియన్ డాలర్లను బేరీజు వేసుకుంటే, అమెరికా వాళ్ళ గురించి అలా వ్రాయడం పెద్ద విషయం కాదని దానిగురించి నేను అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తోంది.

17, జూన్ 2011, శుక్రవారం

పుట్టపర్తి – యజుర్ మందిరం వివరాలు నాకు అసహ్యాన్ని కలిగించాయి

ఇంతకాలం వరకూ పుట్టపర్తి సాయిబాబపై నాకు ఎటువంటి అభిప్రాయం లేదు. కానీ ఇవ్వాళ సత్యసాయి ట్రస్ట్ సభ్యులు వెల్లడించిన వివరాలు నాలో విస్మయాన్ని కలిగించాయి. అవి నాకు మింగుడు పడటం లేదు. సత్యసాయి బాబాను దైవంగా కొలిచే వారికి ఎటువంటి విషయమైనా అది దైవీక పరంగా కనబడుతుంది, అలా చూడని వారికి ప్రతీ చిన్న విషయం పెద్ద వివాదంగా కనబడుతుంది. అలా నేను వివాదస్పదమైనటువంటి భావనను కలిగించుకోవటం లేదు కానీ ఇంత ఆస్తిని కలిగి ఉండటం వెనుక ఉన్న వివరం నాకు అర్దం కావటం లేదు. అసలు విషయం లోకి వెళ్ళే ముందు పత్రికలలో వచ్చిన నిజాల గురించి ఒకసారి అవలోకనం చేసుకుంటే..

  1. పదకొండున్నర కోట్ల రూపాల నగదు లభ్యం అయ్యింది
  2. తొంభై ఎనిమిది కిలోల బరువు కలిగిన బంగారం
  3. మూడు వందల ఏడు కిలోల వెండి
  4. వగైరా .. వగైరా..

ఇంతటి విలువైన ఆభరణాలు కొన్నింటిని కలిగి ఉండటం వెనక సమర్దించుకునే్ కారణాలు కనబడుతున్నాయి. కానీ కొన్నింటి యందు నాకు అర్దం కావటం లేదు.  సత్యసాయి ట్రస్ట్ విషయంలో లక్షల కోట్లు కలిగి ఉండటం పెద్ద ఆశ్చర్య కరమైన విషయం కాదు. కానీ అవి అన్నీ బ్యాంకులలో లెక్కా పత్రంగా కలిగి ఉంటాయి అనేది వ్యవస్థగా ఎదిగిన అన్నింటికి ఒక ఖచ్చితమైన నియమం. అలా నియమాన్ని పాటిస్తూ సత్యసాయి ట్రస్ట్ వారు ఎంత టాక్స్ కట్టారో, ఎంత కట్టాలో వంటి వివరాల గురించి ప్రభుత్వం వారిని అడిగితే సమాచార చట్టం పరంగా మనకు అన్నీ నకలు పత్రాలు దొరుకుతాయి. కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో నగదు అందునా అయ్యవారి సేవా మందిరంలో కలిగి ఉండాల్సిన అవసరం నాకు కనబడటం లేదు.

నగదు పరంగా ఎవ్వరైనా వీరికి ఇచ్చినా, లేక వీరు ఎవ్వరికైనా ఇవ్వాల్సి వచ్చినా, వాటిని చెక్ పరంగా తీసుకోవడమో లేక ఇవ్వడమో చెయ్యకుండా ఇంత పెద్ద మొత్తంలో నగదుని ఒక్క రోజే కలిగి ఉండటాన్ని నేను జీర్ణించుకో లేక పోతున్నాను. నగదు రూపంలో ఇంత పెద్ద మొత్తాన్ని కలిగి ఉండాటాన్ని నేను హర్షించను.

ఇక బంగారం మఱియు వెండి విగ్రహాల విషయానికి వస్తే, ప్రతీ రోజు వీఐపీలు దర్శనార్దం వస్తూ ఉంటారు కాబట్టి, వారుకి ఆశీర్వాదంగా ఇచ్చే ప్రక్రియలో వీరు ముందుగా వీటిని తయారు చేయించి పెట్టుకున్నారు అన్న సమర్దన నాకు అంగీకారమే. అందువల్ల అలాంటి వాటిని నేను శంకించను. లాటుగా ఒకేసారి వీటిని తయారు చేయించు ఉంచుకోవడం వల్ల పలు సౌకర్యాలు ఉంటాయి. అందువల్ల సత్య సాయి బాబా అనునాయిలు ఇలా భారీ మొత్తంలో బంగారు విగ్రహాలు చేయించి ఉంచుకోవడం వల్ల పలు లాభాలు గమనించి ఉంటారు.

ఏది ఏమైనా, సత్యసాయి బాబా గారి మందిరం నుంచి ఇంత పెద్ద మొత్తం ధనం లభించడం వీరి యడల నాకు కించిత గౌరవభావం తగ్గింది అనే చెప్పు కోవాలి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి చుట్టూ కూడా ధనం తన ప్రభావాన్ని చూపించేటట్టు కనబడటం నాకు అసహ్యాన్ని కలిగిస్తోంది. ఇలా వ్రాసినందున నాకు ధనలక్ష్మి పట్ల సత్ భావన లేదనుకోవద్దు. నాకు ధన లక్ష్మి పట్ల అమితమైన గౌరవం. అలాంటి గౌరవాన్ని విధిగా ఎవ్వరు తప్పు చేసి మాట్లాడినా వ్యతిరేకిస్తాను. ఉదాహరణకి, కొంత మంది ఊతపదంగా ఇలా అంటూ ఉంటారు, “డబ్బుదేముందడి ..”. అలాంటి వారిని అప్పుడు వారు చేస్తున్న చర్చను ఆపి ధన లక్ష్మి గురించి తప్పుగా వాగొద్దని ఓ చిన్న సైజు క్లాసు పీకి ఆ తరువాత తిరిగి చర్చలోకి వస్తూ ఉంటాను. కాకపోతే ఇలాంటి ధనలక్ష్మిని జాగ్రత్తగా బద్రంగా క్షేమంగా లెక్కా పత్రంతో దాచుకోవాలి. కానీ లెక్కా పత్రం లేకుండా ఇంతటి నల్లధనాన్ని ప్రోత్సాహించడం మాత్రం జీర్ణించుకోలేక పోతున్నాను.

భాద్యతా యుతమైన స్థాయిలో ఉంటూ నలుగురికి ఓ ఆదర్శమైన వ్యక్తిగా వెలుగొందాల్సిన వ్యక్తి వద్ద ఇంత మొత్తంలో ధన నిలువలు నాకు అర్దం కావటం లేదు. అందువల్ల వీరు కూడా ధనానికే పెద్ద పీట వేసే వ్యక్తే అని నేను నమ్ముతున్నాను. ఒకవేళ తప్పవ్వవచ్చు. కానీ ప్రస్తుతానికి వీరి ప్రవర్తన నాకు నచ్చలేదు.

14, జూన్ 2011, మంగళవారం

మహిళా సంఘాలు – నిద్దరోతున్నారా!!

మహిళా సంఘాలు ఈ మధ్య నిద్దరోతున్నట్లున్నాయి. మహిళలను కించ పఱచే విధంగా ఎటువంటి ప్రకటనలు వచ్చినా వాటిని కారణంగా పెట్టుకుని మీడియాలో పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసే మహిళా సంఘాలకు ఎయిర్ టెల్ వారి ప్రకటనలో మహిళలపై జరుగుతున్న అమర్యాదను మరియు మగాళ్ళ హీన ప్రవృత్తి కనబడట్టు లేదు. ఎందుకంటే, దానిలో వారికి ఎటువంటి అసభ్యం కనబడటం లేదు కదా అని సమర్దించుకుంటారు. అంతే కానీ నైతికమైన విలువలకు గండి కొట్టి హింసా ప్రవృత్తిని ప్రేరేపించే విధంగా సాగుతున్న ఈ ప్రకటన ఎవ్వరి కంటా పడట్టు లేదు.

ఈ ప్రకటన జాగ్రత్తగా గమనిస్తే, ఓ ముసలాయన తన మనవడితో చేసిన సంబాషణ ఇలా ఈ క్రింది విధంగా సాగింది.

మనవడు : తాతా, ఇక్కడెందుకు ఆగవు?

తాత : మా పెళ్ళికి ముందు ఇక్కడే.. కాంతీ లాల్ అనే బద్మాష్ మీ బామ్మ బుగ్గపై <డాష్ .. డాష్ ..> వాడి పళ్ళు ఊడకొట్టలేక పోయ్యాను..

మనవడు : ఒక్క నిమిషం ఆగు. హాల్లో !! కిషన్ గంజ్ లోని కాంతీలాల్ గోడ్ బోలే ఎవ్వరికైనా తెలుసా!!

[[ కొంత సేపటికి సీన్ కాంతీలాల్ గోడ్ బోలే ఇంటి ముందు ..]]

ఆ ఇంటి వాకిలికి ఇవతల తాత మనవడు అటువైపు సదరు కాంతీలాల్ తన భార్యతో ఉంటాడు. ఈ కధలోని తాతగారు, “హిసాబ్ బరాబర్ ..” అంటూ అటువైపు ఉన్న మహిళ బుగ్గపై ముద్దుపెట్టి పారిపోతాడు.

నాకు అర్దం అయ్యిందేమిటంటే, ఎవ్వడైనా నా భార్యని ముద్దు పెట్టుకుంటే, నేను వెళ్ళి వాడి బార్యని ముద్దు పెట్టుకుంటే సరి పోతుందన్న మాట. కాకపోతే నేను చేసేటప్పుడు ప్రక్కన ఓ పిల్లవాడిని పెట్టుకుంటే సరిపోతుందన్నమాట.

ఇక్కడ చూపించిన ప్రకటనలో రెండుసార్లు ముద్దుకు గురైన మహిళలకు మర్యాద అక్కరలేదన్నమాట. రెండు సార్లు ముద్దు పెట్టుకున్న మగాడు హీరో అన్నమాట. ఇలా కంటికి కన్ను పంటికి పన్ను అనే నైపధ్యంలో సాగిన ఈ ప్రకటన మహిళల మర్యాదకు ఎటువంటి భంగపాటు కలగలేదన్నమాట.

ఇవేనా మనం మన తరువాతి తరం వారికి నేర్పే నైతిక విలువలు? తొక్కలో విలువలు, ఇక్కడ అందులో పోయిందేముంది మీ చాదస్తం తప్పితే అంటారా.. అయితే నిజ్జంగానే నాకు చాదస్తం. ఏమి చేస్తాం? నేను ఓల్డ్ ఫాషన్ కదా..

12, జూన్ 2011, ఆదివారం

బొత్స సత్యన్నారాయణ – నా అభిప్రాయం

బొత్స సత్యన్నారయణ గారి గురించి క్రొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్రొడక్షన్ అవసరం లేని వ్యక్తి అని నా అభిప్రాయం. కాకపోతే, ఒక్క సారి వారి గతాన్ని అవలోకించుకుంటే, కొన్ని పచ్చి నిజాలు నాకు మింగుడు పడని పచ్చి వెలక్కాయలు అవుతాయి. ఒకప్పుడు నాకు కాంగ్రెశ్ అంటే ప్రజల పరంగా సేవ చేసే ఓ రాజకీయ వ్యవస్థగా మంచి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు కూడా ఓ అభిప్రాయం ఉంది, కాకపోతే అది ఒక రాజకీయ పార్టీగా కాక రాజకీయ వ్యాపార వ్యవస్థగా ఓ మంచి వ్యాపార దృక్పధం కలిగిన సంస్థగా లాభాలను ఆర్జించే దిశలో సాగి అభివృద్ది చెందుతున్న లంచాల పార్టీగా నాకు అనిపిస్తోంది.

ఈ అభిప్రాయం వెనకాల కొన్ని (నన్ను మఱియు నా ఆలోచనలను సమర్దించుకునే) వివరాలు. మున్ముందుగా రాజకీయాల గురించి నాకు ఉన్న ఒకే ఒక అభిప్రాయం ఏమిటంటే, అది కాకాపట్టడం చేతనైన వారి వ్యాపారం అని. కనబడ్డ ప్రతీ వాడిని నువ్వు అది పీకావో లేక నువ్వు ఇది పీకావో అని డప్పుకొట్టి, అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ, అవసరం తీరిన తరువాత తొక్కేసే వాళ్ళకు అది ఓ మంచి వృత్తి. ప్రజా సేవ / సామాజిక అభివృద్ది / డాష్ .. డాష్.. వంటి మాటలు ఉత్తుత్తి ప్రగల్భాలు మాత్రమే. ఇక్కడ కొన్ని విషయాలలో కొంత మందిని మనం విడిచి పెట్టవచ్చు, ఉదాహరణకి లోక్ సత్తా కన్వీనియర్ గారైన జెపీ లాంటి వారిని చాలా విషయాలలో ప్రస్తుత రాజకీయ నాయకులతో పోల్చలేం. కాబట్టి ఇలాంటి వారు ఈ వ్యాపార పరిగణలోకి రారు.

ఇక వివరాల్లోకి వెళితే, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి రాజ్యం ఏలిందంటూ, వేరే పార్టీ పెట్టి, ఎన్నికలలో పోటీ చేసి, స్వతంత్ర పార్టీగా ఎదిగిన ప్రజా రాజ్యం పార్టీ, సదరు ముఖ్యమంత్రిగారు మరణించిన తరువాత, ప్రస్తుతం అవినీతి / లంచ గొండితనం / వగైరా వగైరా లేవు కాబట్టి, ప్రరాపా అవసరం లేదు, చక్కగా కాంగేస్ పార్టీలో కలసి పోతాం అన్న వివరం నాకు మింగుడు పడటం లేదు. దీని వెనుక మాకేమీ ధనలాభం జరగలేదు అని ప్రరాపా వారు అంటే, నిరూపించడానికి నావద్ద సాక్ష్యాలు లేవు. కానీ అదంతా ఒఠి హంబక్, అంటూ నమ్మెయ్యమంటే కొంచం కష్టం మరి.

రారె గారు, రాజశేఖర్ రెడ్డి గారు అని ఇకపై చదువుకోమనవి. రారెగారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వాగెన్ స్కాం ద్వారా తన పదవిని కోల్పోయిన ప్రస్తుత బొస గారు, (బొత్స సత్యన్నారాయణ గారు), ఆంద్రప్రదేశ్ కాంగ్రేశ్ పార్టీకి అధ్యక్ష్యులు అయ్యారు. అప్పటి స్కాం కనుక ప్రతి పక్షం వారు పట్టించుకోకుంటే, మఱో కర్మాగారం ఆంద్ర ప్రదేశ్ కు వచ్చేది. అదేనండి కార్ల తయారి కర్మాగారం. దాని ద్వారా చాలా మందికి ఉపాధి దొరికేది. సరే, అది అంతా గతం, అదే గనుక జరిగి ఉంటే, బొస గారు చక్కగా ఆ సంస్థ పనులలో బిజీగా ఉండి ఇలా అయ్యేవారు కాదేమో. ఇలా జరిగినందులకు బొసగారు అప్పటి ప్రతి పక్ష నాయకుడైన నాచనా గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, చాలా ఋణ పడి ఉంటారు. ఉండాలి కూడా.

నాచానా గారు పట్టు పట్టి బొసగారిని పంచాయితీ రాజ్ వ్యవస్థనుంచి తప్పించ కుంటే, బొసగారిలో కసి పెరిగేది కాదు. అలా బొసగారిలో కసి పెంచి వారి కుటుంబం నుంచి ఏకంగా నలుగురు వ్యక్తులను ఎమ్ ఎల్ ఎ లుగా చేసేటట్టు చేసిన నాచానా గారికి బొసగారు ఓ పెద్ద పార్టీ ఇవ్వాలి. ఈ రోజుల్లో ఒక్కరు ఎన్నికల్లో గెలవడమే చాలా కష్టమైన సందర్బాలుండగా, ఏకంగా ఒకే కుటుంబం నుంచి నలుగురికి పార్టీ టికెట్టులు తెచ్చుకుని, ఆ నలుగురిని గెలిపించే భాద్యత బుజాల మీదకు వేసుకున్న బొసగారు సామాన్యుడు కాదని మనం గమనించాలి. నిజమే, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎన్నికల్లో పార్టీ సీటు రావడం గొప్ప కాదు, కానీ ఏకంగా ఒకే కుటుంబం నుంచి నలుగురికి కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఇచ్చిందంటే, ఆ కుటుంబం అయితే ప్రజా సేవలో నిరతిశయమైన కృషి చేసుండాలి లేదా మరింకేమైనా చేసి ఉండాలి. బొసాగారి కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ టికెట్టు లభించిన నలుగురు వ్యక్తుల గురించి ప్రజలకు అంతగా కాదు కద కొంతగా కూడా తెలియదనే చెప్పుకోవాలి. ఇక్కడ నా మట్టి బుర్రకు సమాధానం లభించని కొన్ని ప్రశనలు.

  • కొంతగా కూడా తెలియని ఈ నలుగురికి కాంగ్రెస్ టికెట్టు ఏ బేసిస్ మీద ఇచ్చిందబ్బా?
  • ఇలా టికెట్టు కొట్టేసిన నలుగురు ఏ విధంగా గెలిచారబ్బా?
  • గెలిచిన ఈ నలుగురి వెనుక బొసగారి సపోర్ట్ లేదంటే నా మది ఎందుకు అంగీకరించటం లేదబ్బా?
  • .. ఇంకా

రారేగారి హయాములో వోక్స్ వాగన్ స్కాంలోనుంచి క్లీన్ గా బయట పడి, తన ప్రతాపమేమిటో నాచానా గారికి అలాగే కాంగ్రేశ్ పార్టీలో అందరికీ షాకులు ఇస్తున్న బొసాగారిని అభినందించ కుండా ఉండలేను. ఏది ఏమైనా వీరు మాత్రం చాలా యునీక్, అంటే ఓ స్పెషల్ ఐటం అన్న మాట. దేవుడు వీరిని ఎలా చేశాడో కానీ చాలా స్పెషల్ గా తయారు చేసారు. కాకపోతే వీరి అభివృద్ది అంతా ప్రజా సేవ వల్లే జరిగింది అంటే మాత్రం హాస్యాస్పదంగా ఉంటుంది. వీరు చేసిన ప్రజా సేవ ఏమిటో నాకు అర్దం కావటం లేదు. ఒక్కసారి వీరి నియోజక వర్గం అయిన విజయనగరం జిల్లాకు వెళ్ళి అక్కడ జరిగిన అభివృద్ది పనులేమిటో చూసి వస్తా. అంత వరకూ బొసాగారు, మీరు ఇక విజృంబించేయ్యండి. ఆల్ ద బెస్ట్

 
Clicky Web Analytics