21, ఏప్రిల్ 2012, శనివారం

అంగీకరించగలగడం అనేది ఓ పెద్ద కష్టమైన పని

ఈ మధ్య నాలో జరుగుతున్న ఆత్మ విమర్స లేదా పరిశీలన లోని కొన్ని ఆలోచనల కోణాలు నన్ను ఈ పుట వ్రాసేందుకు ప్రోత్సాహకంగా నిలిచాయి. ఉపోద్ఘాతంగా వ్రాసేందుకు నా పాత పుటలలో ప్రాశ్చాత్యుల జీవితాలపై నా పరిశీలనలు పనికి వస్తాయి. ఆ పుటలు చాలా మంది దృష్టిని ఆకట్టుకున్నాయి. ఇలా ఆకట్టుకోవడం వెనుక నా పుటలలో ఉన్న సారం కన్నా, విమర్శా పధంగా సాగిన నా రచనా శైలి అని అనుకోవచ్చు. వాటి యందు వ్యంగ్య భావన పుటమరించి ఉంది అని పాఠకుల భావన. వారి దృక్కోణంలో ఆలోచించినప్పుడు నాకు అది నిజముగానే అనిపించింది. వారి భావన యందు దోషం కనబడ లేదు. ఇది నేను అంగీకరించడాని చాలా కష్టపడవలసి వచ్చింది. అదిగో అప్పుడు అనిపించింది, ఏదైనా విషయాన్ని మన మనోభవాలకు విబేధంగా ఉన్నప్పుడు దాని యందు ఉన్న తత్వాన్ని యధా విధిగా అంగీకరించడానికి బదులుగా వ్యతిరేక భావన కలగడం ఎంత సహజమో, అలాగే ఆ విషయాన్ని ఆ విధంగా అంగీకరించి యధాతధంగా స్వీకరించడానికి చాలా మనోబలం కావాలి కూడా అని.

ఇలాంటి ఆత్మా మధనంలోని భావాలకు ఆధ్యం పోసినట్లుగా మఱో ఘటన ఈ మధ్య జరిగింది. ఆ ఘటన గురించి నా భావనను వ్రాసే ముందు ఆ ఘటన లోని విషయాన్ని, అలాగే దానియందు నాకు కలిగిన భావనను ప్రస్తావిస్థాను.

వృత్తి పరంగా పనికి వస్తుందని మఱో సెమినార్ భాగ్యనగరంలో జరుగుతోందని తెలిసిన తరువాత వీలుచేసుకుని హాజరయ్యాను. అక్కడకు వచ్చిన వారిలో ఓ విదేశీ యువతి ఉంది. ఆ యువతి ఆహార్యం ప్రకారం వివరించాల్సి వస్తే, తల నీలాలకు తైల సంస్కారం లేదు. నీలలను చక్కగా ఒద్దికగా ప్రక్కకి అదిమి పాపిడ తీసి లేవు. ఇక దుస్తులు విషయానికి వస్తే,  తొడలు కనబడేలా ఉండి లోదుస్తులు కనబడే విధంగా ఉన్నాయి. వీటన్నింటికీ తోడుగా, నోటిలోని దంతాలు పచ్చగా ఉండి దుర్ఘందాన్నిస్తున్నాయి. అన్నింటినో మించి ఘాటైన స్ప్రే ఆ చుట్టుప్రక్కల ఉన్న వారి ముక్కు పుటాలను అదరగొడుతోంది.

ఇలాంటి యువతులను ఇంతకు పూర్వం చాలా మందిని చూసాను. కానీ ఆ నాడు నాకు కలగని ఆలోచన ఈ నాడు కలిగింది. ఒక్కసారి నా ఆహార్యం గురించి అలాగే అదే సమయంలో నేను ఎలా ఉన్నానో ఒక్కసారి చూసుకున్నాను. తలారా స్నానం చేసి నుదుట వీభూతి ధరించినా, నేను సెమినార్ హాల్ చేరుకునేటప్పటికి నుదురుపై ఉన్న వీభూతి కనబడలేదు. నొసట కుంకుమ ధరించి, చక్కటి ఇస్త్రీ చేసిన దుస్తులు వేసుకుని, శరీర దుర్గందం రాకుండా ఉండే విధంగా (నా ఉద్దేశ్యంలో చమట పట్టకుండా..) శ్రద్ద తీసుకుని సెమినార్ జరిగే స్థలానికి చేరుకున్నాను. సెమినార్ జరిగే ప్రదేశం అంతా ఏసీ ఉండటం వల్ల ఎటువంటి వాసన అయినా పసిగెట్టేయ్యవచ్చు.

ఇప్పుడు ఒక ప్రశ్న. నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఇలా ఉండాలి అని నాకు అనిపించింది, దానికి సవా లక్ష కారణాలు. అవి ఇప్పుడు అప్రస్తుతం. అలాగే ఆ విదేశీ యువతి ఎందుకు అలా ఉంది? దానికి సమాధానంగా, అలా ఉంటే తాను అందంగా ఉన్నాను అని ఆ అమ్మాయి అనుకుంది. అలా ఉంటే తాను బాగుంటాను అని ఆ అమ్మాయి మనసు చెప్పి ఉండవచ్చు. అలా ఉంటే ఆ అమ్మాయి మనసు తృప్తి చెందుతుండవచ్చు. అది ఆ అమ్మాయి స్వాతంత్ర్యం. అది ఆ అమ్మాయి అభీష్టం. అది ఆ అమ్మాయి మనో సంకల్పం. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్లు, “రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండాలన్నట్లు..”, ఆ అమ్మాయి భారత దేశంలో ఉన్నప్పుడు భారతీయ యువతిలా ఉందా అనే ప్రశ్న ఇక్కడ అప్రస్తుతం. ఎక్కడ ఉన్నా నేను నేనులా ఉన్నాను అని ఆ అమ్మాయి ఆ ఆహార్యం చెబుతోంది.

మఱొ అడుగు వేసి, ఒకవేళ ఆ అమ్మాయి

  • ఆహార్యాన్ని నేను ప్రశ్నిస్తే..
  • శరీర తత్వాన్ని నేను ఆక్షేపిస్స్తే ..
  • ప్రవర్తనా విధానన్ని వ్యతిరేకిస్తే ..
  • .. .. ఇంకా ఇంకా  .. .. డాష్ .. డాష్ .. చేస్తే ..

ఆ అమ్మాయి తిరిగి నన్ను ప్రశ్నించ వచ్చు. కానీ కొంచం మర్యాద పూర్వకంగా ఆలోచిస్తే, నాకు ఇలా అనిపించింది.

“ .. నువ్వెందుకు అలా ఉండాలి అని అనుకున్నావో నాకు అనవసరం. అలాగే నేను ఎందుకు ఇలా ఉన్నానో నీకు అనవసరం అని అనక పోయినా, నేను ఇలా ఉండాలని నేను అనుకున్నాను కాబట్టి నేను ఇలా ఉన్నాను. నన్ను నన్నుగా అంగీకరించు .. .. ”

ఆంగ్లంలో వ్రాయాల్సి వస్తే, నాకు ఇలా అనిపించింది.

“.. you decide to be what you are, so the same with me. I decide to be what I’m, so I’m .. .. accept me as I’m .. ”

ఇలాంటి ఆలోచనతో / దృక్పధంతో / ధృకోణంతో ఆలోచిస్తే, ఇంతకు ముందు నేను పాశ్చాత్యులపై వ్రాసిన నా అభిప్రాయాలు నాకు వింతగా అనిపిస్తున్నాయి. వారు ఆవిధంగా జీవించాలి అనుకుంటున్నారు. ఆ ఆలోచనల గురించి మఱో సారి ..

18, ఏప్రిల్ 2012, బుధవారం

నీతి శాస్త్రం : నడువడి ఎలా ఉండాలి

ఈ మధ్య కాలంలో ఏమీ వ్రాయాలని అనిపించక వ్రాయటం లేదు. ఇవ్వాళ మాత్రం ఇది వ్రాయక తప్పదని నిశ్చయించుకుని మొదలు పెడుతున్నాను. ఇక్కడ ప్రస్తావించే విషయాన్ని మానవ దృక్పధంతో ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీనిని కులమతాలకు అతీతంగా ఆలోచించాలి. భావం ప్రధానం కాని భాష్యం కాదు అని అనుకుంటే, సమగ్రంగా అర్దం అవుతుంది.

కొంతకాలంగా వీలు చేసుకుని శ్రీ మహా భాగవతము చదువుతున్నాను. అందలి కొన్ని విషయాలు ఇప్పుడు నన్ను ఇలా ప్రేరేపించాయి. పోతనగారి గురించి నేను ఏమి వ్రాసినా అది దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటుంది. ఎందుకంటే, సాహిత్యం అనే పదమే కానీ దానిలోని గొప్పతనన్ని చాలా కాలం వరకూ ( .. గ్రహించడం మాట అటువుంచి, ఆ గొప్పతనాన్ని .. ) హేయాభావంతో చూస్తూ బ్రతికిన నాకు దాని గురించి ప్రస్తావించడం మినహా ఆఖ్యానించకూడదని అవగతం అయ్యింది. అలాంటి సాహిత్యానికి తలమానికమైన భాగవత, తెలుగు అనువాద రచయిత అయిన పోతనగారి గురించే!! అందునా నేను కామెంట్ చెయ్యటమా!!! హరి హరి.. ఎంతటి సాహసమో కదా అని చదివే వారు ముక్కున వేలువేసుకుని నోటితోనే కాదు చేతితోకూడా నవ్వుతారు. ఇప్పటికే ఎన్నో రాళ్ళు పడ్డాయి, వాటికి తోడుగా మరిన్ని అవసరమా నాకు. అందుకని పోతనగారిని ప్రస్తావిస్తూ, వారి కవితా చాతుర్యానికి వేవేల కొనియాడుతూ, వారు రచించిన కొన్ని పద్యాలను ఇక్కడ ప్రస్తావిస్తాను.

శ్రీ కృష్ణ భగవానుని నిర్యాణాంతరం ద్వారక నుండి ఖిన్నుడై వచ్చిన అర్జునుని చూచి ధర్మరాజు దుఃఖ హేతువుని తెలియక ప్రశ్నించిన ఘట్టమున రచించిన శ్లోకములు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

క. ఓడితివో శత్రువులకు నాడితివో సాధుదూషాలామ్ముల్
గూడితివో పరసతులను వీడితివో మానధనము వీరుల నడుమన్.

క. తప్పితివో యిచ్చెద నని, చెప్పితివో కపట సాక్షి చేసిన మేలుం
దప్పితివో శరణార్ధుల, రొప్పితివో ద్విజులఁ బసుల రోగుల సతులన్.

క. అడిచితివో భూసురులను, గుడిచితివో బాల వృద్ధు గురువులు వెలిగా
విడిచితివో యాశ్రితులను, ముడిచితివో పరుల విత్తములు లోభమునన్

అనిఅడుగుతారు ధర్మరాజు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వీటి అర్దాలు నాకు అంతగా అవగతం అవ్వక పోయినా, నాకు అర్దం అయ్యినంత వరకూ ఏమి అర్దం అయ్యిందో వ్రాస్తాను.

మొదటి శ్లోకంలో ..

౧) శత్రువుల చేతిలో ఓడి పోయ్యావా
౨) సాధువుల యందు దూషణ చేసావా
౩) పరసతులను కూడి రమించావా, అంటే పర స్త్రీలతో రతి సంగమం కావించావా
౪) వీరుల మధ్యలో ఉండి మానము ధనము వంటి వాటిని వదిలి ప్రవర్తించావా

రెండొవ శ్లోకంలో ..

౫) ఏదైనా చేస్తాను అని ఇచ్చిన మాట తప్పావా
౬) కపటమైనటువంటి శాక్ష్యం చెప్పావా
౭) చేసిన మేలుకి తిరిగి మేలు చెయ్యడం అనే ప్రక్రియను తప్పావా (లేక మఱో భావంగా, మేలు చేసిన వారి మేలుని మెచ్చుకోక పోగా దెప్పి పొడిచేటట్టుగా ప్రవర్తించడం చేసావా )
౮) శరణార్దులను రక్షించకుండా ఏడిపించావా అంత యేకాక, పైన ప్రస్తావించిన వాటిల్లో, ద్విజులు రాజులు రోగులు లేదా స్త్రీలు ఉన్నారా

మూడొవ శ్లోకంలో ..

౯) భూసురులు అంటే రాజులను అణచావా
౧౦) బాలలను వృధులను గురువులను .. [[ ఏమి చేసారు అని అన్నారో అర్దం కాలేదు. నాకు తెలుగుని అర్దం చేసుకునే ఇంగితం లేనందున ]]
౧౧) ఆశ్రయించి ఉన్న వారిని విడిచి వెళ్లి పోయ్యావా
౧౨) లోభత్వం కలిగి ఉండి పరుల విత్తమును దాచుకున్నావా

అని నాకు అర్దం అయ్యింది. అంతే కాకుండా నాకు మఱింకో విషయం కూడా అర్దం అయ్యింది. ఒక వేళ అర్జునుడు పైన ఉదహరించిన వాటిల్లో ఏదైనా చేసి ఉన్నట్లైతే, కొన్నింటి యందు తత్వ చింతన చేస్తేనే అర్దమయ్యే విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. మరికొన్నింటిలో తత్వ చింతన చేసినా నిస్పక్ష పాతంగా ఆలోచించగలిగే మనసు కలిగి ఉండాలి. అప్పుడే చేసిన పని తప్పు అని తెలిసి చింతిస్తారు. ఉదాహరణకి, సాధువుల యందు దూషణ అనే కార్యం తీసుకున్నాం అనుకుంటే, అర్జునుడు దూషణ చేసి ఉన్నా, అది సాధువులయందు అని గ్రహించడానికి మనసు ఒప్పుకోదు. వారేదో వెధవ పని చేసారు కాబట్టి నేను దూషణ చేసాను అని సమర్దించు కునే వాడు. అలా సమర్దించుకున్నా, తన తప్పు తెలుసుకుని పశ్చాతాపంతో దుఃఖించే స్థితికి చేరుకోవడం అంటే ఎంతో నిబద్దతతో కూడుకున్న వ్యక్తిత్వం కలిగిన వారై ఉండాలి. అలాంటి స్థితిలో అర్జునుడు ఉన్నాడు అని అనుకోవాలి.

ఇక్కడ ఉన్న విషయాలను క్షుణ్ణంగా కాకపోయినా మన స్థాయికి తగ్గట్టుగా ఆలోచించుకున్నా, చాలా విషయాలు మనకు అవగతం అవుతాయి. కానీ ఇక్కడ ప్రస్థావించినవి ఎన్ని వందల ఏళ్ళ క్రిందట అనే మాట ప్రక్కన పెడితే, ఎన్ని రోజులు క్రిందటిదైనా పాత చింతకాయ పచ్చడి రుచిగానే ఉన్నట్లు, ఈ మాటలు కూడా చాలా ప్రశస్తంగా మరింత క్రొత్తగా ఈ నాటి రోజులకు అనుగుణంగా రచించారా అన్నట్లు ఉన్నాయి. ఎవ్వరి గురించో నాకెందుకు, నా గురించి నేను ఆలోచించుకుంటే..

అను నిత్యం నేను శత్రువుల చేతిలో ఓడిపోతూనే ఉన్నాను. సాధువుల యందు దూషణ చేస్తూనే ఉన్నాను. పర సతులను కూడి బ్రతకటం లేదు కానీ కపట శాక్ష్యాలు అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను. చేసిన మేలుకి కృతఙ్ఞతా పూర్వకంగా తిరిగి మేలు చేయకపోయినా, వారి సహృదయానికి గుర్తుగా ఉన్న (నా యందు వారు చేసిన) మేలుని మఱచి జీవిస్తూ ఉంటాను. ఆఖరులో లోభత్వం కలిగి పరుల విత్తమును అని అనను కానీ నాకు ఉధ్యోగం ఇచ్చే వ్యవస్థను సంకట స్థితిలో ఉంచి నా జీతాన్ని బేరం చేస్తూనే ఉన్నందున వారి ధనాన్ని ఆకాక్షించి దోచుకుని దాచుకుంటున్నాను అనిపిస్తోంది.

ఇదంతా నా గురించి నేను ఆత్మ విమర్స చేసుకునే సమయంలో ఒలికిన భావనలోని కొన్ని వాక్యాలు మాత్రమే. కానీ నా గురించి తీసి ప్రక్కన పెడితే, ప్రస్తుతం నేను ఉన్న సమాజంలో ఎంతమంది ఇలాంటి వాటిని గమనించి మెచ్చుకుంటారు? మెచ్చుకోవడం ఒక మాట అయితే, వాటిని అవగాహన చేసుకుని అర్దం చేసుకుని ఆ విధంగా జీవించే వారు ఎంతమంది? ఇలాంటి ప్రశ్నల పరంపర ప్రక్కన పెడితే ఇంత చక్కగా ప్రతీ మనిషి తన తోటి వారియందు సతు బుద్ది కలిగి ఉండాలి అని మన గ్రంధాలు చెబుతున్నాయని ఒప్పుకునే వారు చాలా అఱుదు అని నా అభిప్రాయం

10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

వైద్యులంటే అసహ్యం వేస్తోంది

ఈ మధ్య అనుకోకుండా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే పేరుతో ప్రస్తావించ బడుతున్న చేతి వేళ్ళకు సంబందించిన ఓ వ్యాధితో బాధపడుతున్నాను. నిన్న నెప్పి ఎక్కువైతే దగ్గరలో ఉన్న ఓ MD చదువుకున్న ఓ వైద్యుని వద్దకు అత్యవసర పరిస్తితిలో వెళవలసి వచ్చింది. ఆ వైద్యులు గారు నా గోడు పూర్తిగా వినకుండానే ఓ నాలుగు రక్త పరిక్షలు వ్రాసి ఇచ్చారు. అందులో షుగర్ ఉందో లేదో అని తెలుసుకునే, RBS అంటే రాండమ్ బ్లడ్ షుగర్ పరిక్ష కూడా ఉంది. ఆ తరువాత మాటల మధ్యలో నాకు షుగర్ లేదని చెబుతుంటే, వినిపించుకోకుండా, ఆ పరిక్ష చేయ్యాల్సిందే అని చెప్పారు.

గత సంవత్సరంలో నవంబర్ నెలలో ఆఖరి సారిగా రక్త పరీక్ష చేయించుకున్నాను అంతేకాకుండా గత సంవత్సరంలో యాక్సిడెంట్ కారణంగా ఓ నాలుగు సార్లు చేయించుకున్నాను అని చెప్పిన  తరువాత విషయాన్ని విని ఓ నాలుగు రకాల మందులు వ్రాసి ఇచ్చారు. ప్రస్తుతానికి ఇవి వాడండి ఆ తరువాత పరిక్షలు చేయించుకుని రండి అప్పుడు చూద్దాం, అన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, జబ్బులు రోగులకు క్రొత్త కానీ వైద్యులకు క్రొత్త కాదు. చిటికెడు చెబితే చారెడు గ్రహించయ్యటం వీరికి అనుభవంలో వస్తుంది. కానీ రోగులకు విషయం చెప్పాలి కదా!! ఇలా వ్రాసుకుంటూ పోతే మరేదో వ్రాసేస్తాను.. విషయంలోకి వస్తే..

వైద్యో నారాయణ హరి.. అంటారు కదా, ఆయన చెప్పిన పరీక్షలకు రక్తం ఇచ్చి ఓ వెయ్యి రూపాయల బిల్లు చెల్లించి ఇంటికి చేరుకున్నాను. ఇచ్చిన మందులు వేసుకుని నొప్పి తగ్గుతుందేమో అని ఎదురు చూస్తూ గడిపేసాను. తీరా సాయంత్రం రిపోర్టులు తీసుకుని వెళ్ళి చూసే సరికి ఆ వైద్యులు గారు ఊరిలో లేరని తిరిగి సోమవారం వస్తారని తెలిసింది. ఇంతకు ముందు నాకు యాక్సిడెంట్ అయ్యినప్పుడు ట్రీట్ చేసిన వైద్యులు కూడా అంతే, వెళ్ళంగానే xరే తీయించుకుని రమ్మంటారు. తీయించుకుని వచ్చిన తరువాత దానిని చూడను కూడా చూడరు సరి కదా, చూపించ బోతే, “ నాకు తెలుసు ..” అంటూ మాట దాటేస్తారు.

ఇవన్నీ చూస్తున్న తరువాత వైద్యులపై గౌరవం కలుగకపోగా, అసహ్యం వేస్తోంది. అన్నింటికీ మించి, ఈ వైద్యులు గారు ప్రిస్క్రిప్షన్ ద్వారా ఇచ్చిన మందులు వారి ప్రక్కనే ఉన్న కొట్లో కొనుక్కోవాలన్నమాట. అమ్మే దుకాణానికి లైసెన్స్ లేదు. దీనికి తోడుగా, వీరు చెప్పిన పరీక్షలు కూడా ఆ ప్రక్కనే ఉన్న దుకాణం వెనకాల ఉన్న గదిలో చేయించుకోవాలన్నది వీరి డిమాండ్. అక్కడ కాకపోతే సరి అయిన లేదా కరక్ట్ రిజల్ట్స్ రావంట. సరే నొప్పి తగ్గాలి కదా అని వీరు చెప్పిన మందులు తీసుకుని ఆ ప్రక్కనే ఉన్న గదిలో రక్తాన్ని ఇచ్చి ఇంటీకి చేరుకున్నా.

దీని నుంచి నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే, కొంచం ఖర్చు ఎక్కువైనా వ్యాపార పరంగా ఉన్న పెద్ద హాస్పిటల్స్ ఫరవాలేదనిపిస్తోంది.

31, డిసెంబర్ 2011, శనివారం

కొత్త సంవత్సరమా !!

స్వతహాగా నాకు ఆంగ్ల సంవత్సరం అంటే పెద్ద పట్టింపు ఉండేది కాదు. అది మఱో రోజు. కానీ ఈ మధ్య అందిన ఓ సమాచారం నన్ను ఆలోచించ చేసింది. ఆ సమాచారాన్ని యధావిధిగా ఇక్కడ ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇది కొందరికి నచ్చక పోవచ్చు. కానీ నాకు నచ్చింది అందుకని ఇక్కడ ఉంచుతున్నాను.

జనవరి ౧ వ తారీఖున క్యాలెండర్ మారుతుంది

తెల్లవాడిని అనుసరించే గొఱెలు నమ్మే విషయం భారతీయ సింహాలు నమ్మే విషయాలు
తేదీ మార్పు అర్దరాత్రి 12 గంటలకు  తేదీ మారుతుందా?
ఎలా మారుతుంది?
ఏమార్పు కనిపిస్తుంది?
ఈ తేదీ మార్పునకు ఆధారం ఏమీ లేదు..
సూర్యోదయంతో చీకట్లు తొలగి ప్రపంచం నిదుర వీడి వెలుగు రేఖలు ప్రసరించాక సహజంగా వచ్చిన మార్పుతో తారీఖు మారుతుంది.
     
సంవత్సరం మార్పు జనవరి 1వతారీఖునకు గానీ డిసెంబర్ 30వ తారీఖునకు కానీ ప్రకృతిలో కానీ, వాతావరణంలో కానీ, గ్రాహాల స్థితిలో కానీ, భూమి గమనంలో కానీ ఏమార్పు ఉండదు. చాలా మంది తెల్లవాడి గొఱ్ఱెలకు జనవరి 1 నే సంవత్సరం  మారుతుందనుకుంటారు ఉగాది నాడు ప్రకృతిలో క్రొత్త ఆకులు చిగిర్చి, కోయిల పాటతో, శోభాయమానమైన వాతావరణంతో, నవీన శోభతో గ్రహ గమనాల ఆధారంగా కలిగే మార్పునే క్రొత్త సంవత్సరంగా భారతీయ సింహాలు భావిస్తారు.
     
క్యాలెండర్ మార్పు తెల్లవాడి క్యాలెండర్లో కేవలం వారాలు, తేదీలు మాత్రమే తెలుస్తాయి
ఏ రోజు ఏమి చెయ్యాలో / ఎప్పుడు తెలవారుతుందో / ఎప్పుడు ఏఏ మార్పులు వస్తాయో చెప్పలేని ఒక గీతల కాగితం గోడకు వేలాడుతుంది
తిధి, వారం, నక్షత్రం, కరణం, యోగం, అనే పంచ అంగాలతో సంవత్సరం పొడువునా ఏరోకు ఏమి చెయ్యాలో, విత్తు ఏప్పుడు నాటాలో, పెండ్లి ఎప్పుడు చెయ్యాలో, పగలు, రాత్రి, ఎప్పుడెప్పుడు వస్తాయో, చంద్రుడి గమనం ఏమిటో వివరిస్తూ, గ్రహాణాలు ఎప్పుడు వస్తాయో చెబుతూ, జీవితానికి క్రమపద్దతిలో ప్లానింగ్ ఇచ్చేది భారతీయ పంచాంగం

శాస్త్రీయంగా, విఙ్ఞానంగా, సనాతనంగా ఈ దేశంలో వస్తున్న పద్దతులను వదిలేసి, అశాస్త్రీయతకు ఆధారమైన తెల్ల వాడి పద్దతులపై ఎందుకీ వ్యామోహం?

వైఙ్ఞానీకంగా, ప్రకృతి సహజంగా, మానవాభివృద్ధికి ఆధారంగా ఉన్న మన ఉగాదిని సంబరంగా నూతన సంవత్సరంగా జరుపుకుందాం..

తెల్ల వాడి గొఱ్ఱెలుగా మారొద్దు. భారతీయ సింహాలు కండి..

13, డిసెంబర్ 2011, మంగళవారం

మానవ దేవుళ్ళు – ఓ ఆలోచన

డాక్టర్ కొమ్మూరి వేణుగోపాల రావు గారు రచించిన, “ఆలోచన ఒక యఙ్ఞం” అనే శీర్షికతో, “అందులోంచి అద్బుత జీవితం” అనే ఉప శీర్షికతో ఉన్న పుస్తకం, ఈ మధ్య నేను చదువుతున్న ఓ పుస్తకం. ఈ పుస్తకం గురించిన ఓ రివ్యూ మఱో సారి వ్రాస్తాను. కాకపోతే, కొన్ని వాక్యాలు / పేరాలు ఇక్కడ యధావిధిగా ఉంచేస్తున్నాను. ఈ పుస్తకం అందరూ చదివి ఉండవచ్చు అలాగే చదివి ఉండక పోనూ వచ్చు. ఈ పుస్తకాన్ని నేను ఇంకా పూర్తి చెయ్యక పోయినా, కొన్ని ఆలోచనలను యధావిధిగా ఇక్కడ ఉంచుకోకపోతే మర్చి పోతానేమో అన్న భయంతో ఇక్కడ యధాతధంగ ఉంచుతున్నాను.


పేజీ: 144

నా మనసు క్షోభింపచేస్తున్నదల్లా మానవ దేవుళ్ళే!

వీరిలో కూడా ఆదిలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కుని, తరువాత జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి పోయి, ప్రస్తుతం ప్రజల క్షేమమే దృష్టిలో పెట్టుకుని కృషి చేస్తున్న వారిని అభినందిస్తూ అంజలి ఘటిస్తున్నాను గాని వారిక్ జోలికి పోవటం లేదు!

దేవుడనేవాడు యుగానికి ఒకటి రెండుసార్లో, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారో అవతరిస్తాడు. మిగతావారు రమణ మహర్షి, రామ కృష్ణ పరమ హంస వంటి దివ్యపురుషులు. వారు భగవత్ స్వరూపులుగా ఆరాధనలు పొందారు గానీ, మేమే దేముళ్ళమని ఎప్పుడూ ప్రకటించుకోలేదు.

చిన్మయానంద, శివానంద ఇంకా కొందరు మహా పురుషులు ప్రజలను ఆధ్యాత్మిక దృష్టివైపు మళ్ళించి, వారిలో పరివర్తన తీసుకురావటానికి ప్రయత్నించారు కానీ, అందరితో కలసి జీవించారు. కానీ మేమే దేముళ్ళమని ఎప్పుడూ బడాయిలు చెప్పుకోలేదు. పైగా అందరితో కలసి భగవంతుణ్ని కీర్తించారు. భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం, వీటి గొప్పదనాన్ని తమదైన శైలిలో అద్భుతంగా వ్యాఖ్యానించి, ప్రజలకు అందుబాటులోకి రావటానికి ఎనలేని సేవ చేశారు.

మానవ దేవుళ్ళు ….

ప్రతీ అయిదేళ్ళకూ, పదేళ్ళకూ ఒకసారి వెలుస్తూ ఉంటారు. కొందరు, ఆ ఊరి వరకే పరిమితమై ఉంటారు. కొందరు జిల్లా స్థాయికి, రాష్ట్రస్థాయికి, జాతీయ స్థాయికి, ఎదుగుతూ ఉంటారు, వారి వారి శక్తి సామర్ధ్యాలను బట్టి.

వీళ్ల నెక్కువగా ఆర్ధికంగా చితికి పోయి, కుటుంబ వైఫల్యాలతో విసిగిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలు ఆశ్రయిస్తూంటారు.

ఎందుకూ?

భగవంతుడు ప్రత్యక్షంగా కనబడుతున్నాడని అనుకుంటున్నారు.

ఎవరెవరికో ఏమేమో జరిగాయని కధలు చెప్పుకుంటున్నారు.

“నన్ను కొలవండి. మీ కష్టాలు తీరిపోతాయి” అని హామీలు ఇస్తున్నారు.

మొదట్లో అంతగా నమ్మకం కుదరక తటస్థంగా, ఊగిసలాడుతుంటే, సీనియర్ వీర భక్తులు వాళ్ల మీద ఒత్తిడి తీసుకు వచ్చి బలవంతంగా చేర్పించేస్తున్నారు.

ఒకసారి అడుగుపెడితే… ఇక అక్కడ ఇరుక్కు పోయినట్టే!!

మొదట ప్రేమతత్వం…

భరోసాలు …

కొన్ని జిమ్మిక్స్ ….

వాళ మీద నమ్మకం, గురి కుదిరేలా చేస్తారు.

తమ సమస్యలు తీరుతాయన్న ఆశయంతో వాళ్ళ ప్రలోభాలకి ఒకటొకటిగా లొంగి పోతుంటారు.

“మీకు భక్తి చాలలేదు. మీలో మార్పు రాలేదు.”

“అది చెయ్యండి. ఇది చెయ్యండి”

ఎవేవో కార్యకలాపాలు చేయిస్తుంటారు.

అసలే ఆర్దిక దుఃస్థితిలో ఉంటే ప్రతీ సారి డబ్బు ఖర్చు… అప్పో సొప్పో చేసి … తప్పించుకోవటానికి వీల్లేని చిక్కు పరిస్థితిలో ఇరుక్కు పోతూ ఉంటారు.

ఒక సారి లోక కళ్యాణం కోసం …

ఒకసారి వ్యక్తిగత సమస్యలు చిటికెలో తీరటం కోసం ….

ఇంకోక సారి ఆర్ధికాభి వృద్ది కోసం ….

ఎవేవో తతంగాలు.

ఇలా కాకుండా, కొన్ని తప్పని సరి కార్యక్రమాలు విరుచు పడుతుంటాయి.

నూతన సంవత్సర సందేశం ….

దేవుడు గారి పుట్టిన రోజుల వేడుకలు ….

దేముడి గారి భార్య గారి జన్మదిన సంరంభాలు, దేముడు గారి కళ్యాణ మహోత్సవం (సీతారాముల కళ్యాణంలా).

ఇలా ప్రతి రెండు మూడు నెలలకూ ఏదో ఒక తతంగం, ఉత్సవాలు, డబ్బు వసూళ్ళు..

ఇంచుమించు స్థాయి భేదాలు మినహాయించి మానవ దేవుళ్లు వెలసిన చోటల్లా ఇవే విన్యాసాలు!

ఇంతటితో ఆగదు, వారి ఖ్యాతి విస్తరిస్తోన్న కొద్ది ఇప్పుడున్న ఆశ్రమం పరిధిలు సరిపోవు. వారి దృష్టి జాతీయ – అంతర్జాతీయ స్థాయి మీదకి మళ్లుతుంది. పని పాటు లేనట్లు ఎక్కడెక్కణుంచో ఫారినర్స్ రావటం మొదలయ్యే సరికి ఈ ఆకర్షణ ఇంకా ఎక్కువవుతుంది. ఇలా పైకి వస్తున్న దేవుళ్ళ  దగ్గర చూడండి, విధిగా కొంత మంది విదేశీయులు కనిపిస్తారు. మన భాషలో, వాళ్ల స్టయిల్లో పాటలు పాడుతూ కనువిందూ, వీనుల విందూ చేస్తూ ఉంటారు.

భారీ ఎత్తున ఆశ్రమాలు నిర్మాణం మొదలవుతుంది, కోట్ల రూపాయల బడ్జెట్ తో.

డబ్బు…. చందాలు… వేల, లక్షల స్థాయిలో,

అసలే సమస్యలతో నలిగి పోతూ, హృదయ విదారకస్థితిలో ఉన్న భక్తులను ఇంకా పీల్చి పిప్పి చేస్తుంటారు.

“దుఃఖం నుండి విముక్తి, సమస్యల పరిష్కారం” ఈ నినాదాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి.

చిత్రమేమిటంటే ఇందులోకి చేరాక కూడా ఏ సమస్యకూ పరిష్కారం లభించని వారు కూడా ఆత్మ వంచన చేసుకుంటూ ఈ ప్రచారం చేస్తూ ఉంటారు.

వాళ్లకూ మధ్య మధ్య అనేక సందేహాలొస్తూ ఉంటాయి. ప్రశ్నలు ఉదయిస్తూంటాయి.

“మీకు భక్తి లేదు. మీలో అహంకారం పోలేదు. మీలో ఇంకా మార్పులు రాలేదు.” అంటూ వారిని అణగదొక్కేస్తూ ఉంటారు.

కొంత మంది బాధ ఆపుకోలేక కొంచం సూటిగా అడగబోతే అవహేళన చేస్తూ, అవమానం కలిగే రీతిలో హీనంగా మాట్లాడుతారు. మిగతా వాళ్ళు తాము చాలా గొప్ప వాళ్లయినట్లు ఫీలైపోతూ, హేళనగా నవ్వి, అలా అడిగిన వాళ్ళను పురుగుల్లా చూడటం మొదలు పెడతారు.

అంటే, భక్తుడిలో ప్రశ్నలు ఉండకూడదు.

అతడికి వ్యక్తిత్వం ఉండకూడదు.

అతను ఓ బానిసలా ఉండాలి.

మానవదేవుళ్ల ఉనికి ఇలా బానిసల్ని తయారు చేయటం మీదే ఆధార పడి వుంటుంది ..


ఇలా సాగిన తరువాత వీరు ఓ మాంచి మాట వ్రాస్తారు

“మానవ దేవుళ్ళు” అబద్దం కావచ్చు కానీ మంచి గురువులున్న మాట “మాత్రం” నిజం!

 

ఈ వాక్యంలో ఎన్ని నిఘూడమైన అర్దాలున్నాయో!!

 
Clicky Web Analytics