10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

వైద్యులంటే అసహ్యం వేస్తోంది

ఈ మధ్య అనుకోకుండా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే పేరుతో ప్రస్తావించ బడుతున్న చేతి వేళ్ళకు సంబందించిన ఓ వ్యాధితో బాధపడుతున్నాను. నిన్న నెప్పి ఎక్కువైతే దగ్గరలో ఉన్న ఓ MD చదువుకున్న ఓ వైద్యుని వద్దకు అత్యవసర పరిస్తితిలో వెళవలసి వచ్చింది. ఆ వైద్యులు గారు నా గోడు పూర్తిగా వినకుండానే ఓ నాలుగు రక్త పరిక్షలు వ్రాసి ఇచ్చారు. అందులో షుగర్ ఉందో లేదో అని తెలుసుకునే, RBS అంటే రాండమ్ బ్లడ్ షుగర్ పరిక్ష కూడా ఉంది. ఆ తరువాత మాటల మధ్యలో నాకు షుగర్ లేదని చెబుతుంటే, వినిపించుకోకుండా, ఆ పరిక్ష చేయ్యాల్సిందే అని చెప్పారు.

గత సంవత్సరంలో నవంబర్ నెలలో ఆఖరి సారిగా రక్త పరీక్ష చేయించుకున్నాను అంతేకాకుండా గత సంవత్సరంలో యాక్సిడెంట్ కారణంగా ఓ నాలుగు సార్లు చేయించుకున్నాను అని చెప్పిన  తరువాత విషయాన్ని విని ఓ నాలుగు రకాల మందులు వ్రాసి ఇచ్చారు. ప్రస్తుతానికి ఇవి వాడండి ఆ తరువాత పరిక్షలు చేయించుకుని రండి అప్పుడు చూద్దాం, అన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, జబ్బులు రోగులకు క్రొత్త కానీ వైద్యులకు క్రొత్త కాదు. చిటికెడు చెబితే చారెడు గ్రహించయ్యటం వీరికి అనుభవంలో వస్తుంది. కానీ రోగులకు విషయం చెప్పాలి కదా!! ఇలా వ్రాసుకుంటూ పోతే మరేదో వ్రాసేస్తాను.. విషయంలోకి వస్తే..

వైద్యో నారాయణ హరి.. అంటారు కదా, ఆయన చెప్పిన పరీక్షలకు రక్తం ఇచ్చి ఓ వెయ్యి రూపాయల బిల్లు చెల్లించి ఇంటికి చేరుకున్నాను. ఇచ్చిన మందులు వేసుకుని నొప్పి తగ్గుతుందేమో అని ఎదురు చూస్తూ గడిపేసాను. తీరా సాయంత్రం రిపోర్టులు తీసుకుని వెళ్ళి చూసే సరికి ఆ వైద్యులు గారు ఊరిలో లేరని తిరిగి సోమవారం వస్తారని తెలిసింది. ఇంతకు ముందు నాకు యాక్సిడెంట్ అయ్యినప్పుడు ట్రీట్ చేసిన వైద్యులు కూడా అంతే, వెళ్ళంగానే xరే తీయించుకుని రమ్మంటారు. తీయించుకుని వచ్చిన తరువాత దానిని చూడను కూడా చూడరు సరి కదా, చూపించ బోతే, “ నాకు తెలుసు ..” అంటూ మాట దాటేస్తారు.

ఇవన్నీ చూస్తున్న తరువాత వైద్యులపై గౌరవం కలుగకపోగా, అసహ్యం వేస్తోంది. అన్నింటికీ మించి, ఈ వైద్యులు గారు ప్రిస్క్రిప్షన్ ద్వారా ఇచ్చిన మందులు వారి ప్రక్కనే ఉన్న కొట్లో కొనుక్కోవాలన్నమాట. అమ్మే దుకాణానికి లైసెన్స్ లేదు. దీనికి తోడుగా, వీరు చెప్పిన పరీక్షలు కూడా ఆ ప్రక్కనే ఉన్న దుకాణం వెనకాల ఉన్న గదిలో చేయించుకోవాలన్నది వీరి డిమాండ్. అక్కడ కాకపోతే సరి అయిన లేదా కరక్ట్ రిజల్ట్స్ రావంట. సరే నొప్పి తగ్గాలి కదా అని వీరు చెప్పిన మందులు తీసుకుని ఆ ప్రక్కనే ఉన్న గదిలో రక్తాన్ని ఇచ్చి ఇంటీకి చేరుకున్నా.

దీని నుంచి నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే, కొంచం ఖర్చు ఎక్కువైనా వ్యాపార పరంగా ఉన్న పెద్ద హాస్పిటల్స్ ఫరవాలేదనిపిస్తోంది.

31, డిసెంబర్ 2011, శనివారం

కొత్త సంవత్సరమా !!

స్వతహాగా నాకు ఆంగ్ల సంవత్సరం అంటే పెద్ద పట్టింపు ఉండేది కాదు. అది మఱో రోజు. కానీ ఈ మధ్య అందిన ఓ సమాచారం నన్ను ఆలోచించ చేసింది. ఆ సమాచారాన్ని యధావిధిగా ఇక్కడ ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇది కొందరికి నచ్చక పోవచ్చు. కానీ నాకు నచ్చింది అందుకని ఇక్కడ ఉంచుతున్నాను.

జనవరి ౧ వ తారీఖున క్యాలెండర్ మారుతుంది

తెల్లవాడిని అనుసరించే గొఱెలు నమ్మే విషయం భారతీయ సింహాలు నమ్మే విషయాలు
తేదీ మార్పు అర్దరాత్రి 12 గంటలకు  తేదీ మారుతుందా?
ఎలా మారుతుంది?
ఏమార్పు కనిపిస్తుంది?
ఈ తేదీ మార్పునకు ఆధారం ఏమీ లేదు..
సూర్యోదయంతో చీకట్లు తొలగి ప్రపంచం నిదుర వీడి వెలుగు రేఖలు ప్రసరించాక సహజంగా వచ్చిన మార్పుతో తారీఖు మారుతుంది.
     
సంవత్సరం మార్పు జనవరి 1వతారీఖునకు గానీ డిసెంబర్ 30వ తారీఖునకు కానీ ప్రకృతిలో కానీ, వాతావరణంలో కానీ, గ్రాహాల స్థితిలో కానీ, భూమి గమనంలో కానీ ఏమార్పు ఉండదు. చాలా మంది తెల్లవాడి గొఱ్ఱెలకు జనవరి 1 నే సంవత్సరం  మారుతుందనుకుంటారు ఉగాది నాడు ప్రకృతిలో క్రొత్త ఆకులు చిగిర్చి, కోయిల పాటతో, శోభాయమానమైన వాతావరణంతో, నవీన శోభతో గ్రహ గమనాల ఆధారంగా కలిగే మార్పునే క్రొత్త సంవత్సరంగా భారతీయ సింహాలు భావిస్తారు.
     
క్యాలెండర్ మార్పు తెల్లవాడి క్యాలెండర్లో కేవలం వారాలు, తేదీలు మాత్రమే తెలుస్తాయి
ఏ రోజు ఏమి చెయ్యాలో / ఎప్పుడు తెలవారుతుందో / ఎప్పుడు ఏఏ మార్పులు వస్తాయో చెప్పలేని ఒక గీతల కాగితం గోడకు వేలాడుతుంది
తిధి, వారం, నక్షత్రం, కరణం, యోగం, అనే పంచ అంగాలతో సంవత్సరం పొడువునా ఏరోకు ఏమి చెయ్యాలో, విత్తు ఏప్పుడు నాటాలో, పెండ్లి ఎప్పుడు చెయ్యాలో, పగలు, రాత్రి, ఎప్పుడెప్పుడు వస్తాయో, చంద్రుడి గమనం ఏమిటో వివరిస్తూ, గ్రహాణాలు ఎప్పుడు వస్తాయో చెబుతూ, జీవితానికి క్రమపద్దతిలో ప్లానింగ్ ఇచ్చేది భారతీయ పంచాంగం

శాస్త్రీయంగా, విఙ్ఞానంగా, సనాతనంగా ఈ దేశంలో వస్తున్న పద్దతులను వదిలేసి, అశాస్త్రీయతకు ఆధారమైన తెల్ల వాడి పద్దతులపై ఎందుకీ వ్యామోహం?

వైఙ్ఞానీకంగా, ప్రకృతి సహజంగా, మానవాభివృద్ధికి ఆధారంగా ఉన్న మన ఉగాదిని సంబరంగా నూతన సంవత్సరంగా జరుపుకుందాం..

తెల్ల వాడి గొఱ్ఱెలుగా మారొద్దు. భారతీయ సింహాలు కండి..

13, డిసెంబర్ 2011, మంగళవారం

మానవ దేవుళ్ళు – ఓ ఆలోచన

డాక్టర్ కొమ్మూరి వేణుగోపాల రావు గారు రచించిన, “ఆలోచన ఒక యఙ్ఞం” అనే శీర్షికతో, “అందులోంచి అద్బుత జీవితం” అనే ఉప శీర్షికతో ఉన్న పుస్తకం, ఈ మధ్య నేను చదువుతున్న ఓ పుస్తకం. ఈ పుస్తకం గురించిన ఓ రివ్యూ మఱో సారి వ్రాస్తాను. కాకపోతే, కొన్ని వాక్యాలు / పేరాలు ఇక్కడ యధావిధిగా ఉంచేస్తున్నాను. ఈ పుస్తకం అందరూ చదివి ఉండవచ్చు అలాగే చదివి ఉండక పోనూ వచ్చు. ఈ పుస్తకాన్ని నేను ఇంకా పూర్తి చెయ్యక పోయినా, కొన్ని ఆలోచనలను యధావిధిగా ఇక్కడ ఉంచుకోకపోతే మర్చి పోతానేమో అన్న భయంతో ఇక్కడ యధాతధంగ ఉంచుతున్నాను.


పేజీ: 144

నా మనసు క్షోభింపచేస్తున్నదల్లా మానవ దేవుళ్ళే!

వీరిలో కూడా ఆదిలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కుని, తరువాత జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి పోయి, ప్రస్తుతం ప్రజల క్షేమమే దృష్టిలో పెట్టుకుని కృషి చేస్తున్న వారిని అభినందిస్తూ అంజలి ఘటిస్తున్నాను గాని వారిక్ జోలికి పోవటం లేదు!

దేవుడనేవాడు యుగానికి ఒకటి రెండుసార్లో, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారో అవతరిస్తాడు. మిగతావారు రమణ మహర్షి, రామ కృష్ణ పరమ హంస వంటి దివ్యపురుషులు. వారు భగవత్ స్వరూపులుగా ఆరాధనలు పొందారు గానీ, మేమే దేముళ్ళమని ఎప్పుడూ ప్రకటించుకోలేదు.

చిన్మయానంద, శివానంద ఇంకా కొందరు మహా పురుషులు ప్రజలను ఆధ్యాత్మిక దృష్టివైపు మళ్ళించి, వారిలో పరివర్తన తీసుకురావటానికి ప్రయత్నించారు కానీ, అందరితో కలసి జీవించారు. కానీ మేమే దేముళ్ళమని ఎప్పుడూ బడాయిలు చెప్పుకోలేదు. పైగా అందరితో కలసి భగవంతుణ్ని కీర్తించారు. భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం, వీటి గొప్పదనాన్ని తమదైన శైలిలో అద్భుతంగా వ్యాఖ్యానించి, ప్రజలకు అందుబాటులోకి రావటానికి ఎనలేని సేవ చేశారు.

మానవ దేవుళ్ళు ….

ప్రతీ అయిదేళ్ళకూ, పదేళ్ళకూ ఒకసారి వెలుస్తూ ఉంటారు. కొందరు, ఆ ఊరి వరకే పరిమితమై ఉంటారు. కొందరు జిల్లా స్థాయికి, రాష్ట్రస్థాయికి, జాతీయ స్థాయికి, ఎదుగుతూ ఉంటారు, వారి వారి శక్తి సామర్ధ్యాలను బట్టి.

వీళ్ల నెక్కువగా ఆర్ధికంగా చితికి పోయి, కుటుంబ వైఫల్యాలతో విసిగిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలు ఆశ్రయిస్తూంటారు.

ఎందుకూ?

భగవంతుడు ప్రత్యక్షంగా కనబడుతున్నాడని అనుకుంటున్నారు.

ఎవరెవరికో ఏమేమో జరిగాయని కధలు చెప్పుకుంటున్నారు.

“నన్ను కొలవండి. మీ కష్టాలు తీరిపోతాయి” అని హామీలు ఇస్తున్నారు.

మొదట్లో అంతగా నమ్మకం కుదరక తటస్థంగా, ఊగిసలాడుతుంటే, సీనియర్ వీర భక్తులు వాళ్ల మీద ఒత్తిడి తీసుకు వచ్చి బలవంతంగా చేర్పించేస్తున్నారు.

ఒకసారి అడుగుపెడితే… ఇక అక్కడ ఇరుక్కు పోయినట్టే!!

మొదట ప్రేమతత్వం…

భరోసాలు …

కొన్ని జిమ్మిక్స్ ….

వాళ మీద నమ్మకం, గురి కుదిరేలా చేస్తారు.

తమ సమస్యలు తీరుతాయన్న ఆశయంతో వాళ్ళ ప్రలోభాలకి ఒకటొకటిగా లొంగి పోతుంటారు.

“మీకు భక్తి చాలలేదు. మీలో మార్పు రాలేదు.”

“అది చెయ్యండి. ఇది చెయ్యండి”

ఎవేవో కార్యకలాపాలు చేయిస్తుంటారు.

అసలే ఆర్దిక దుఃస్థితిలో ఉంటే ప్రతీ సారి డబ్బు ఖర్చు… అప్పో సొప్పో చేసి … తప్పించుకోవటానికి వీల్లేని చిక్కు పరిస్థితిలో ఇరుక్కు పోతూ ఉంటారు.

ఒక సారి లోక కళ్యాణం కోసం …

ఒకసారి వ్యక్తిగత సమస్యలు చిటికెలో తీరటం కోసం ….

ఇంకోక సారి ఆర్ధికాభి వృద్ది కోసం ….

ఎవేవో తతంగాలు.

ఇలా కాకుండా, కొన్ని తప్పని సరి కార్యక్రమాలు విరుచు పడుతుంటాయి.

నూతన సంవత్సర సందేశం ….

దేవుడు గారి పుట్టిన రోజుల వేడుకలు ….

దేముడి గారి భార్య గారి జన్మదిన సంరంభాలు, దేముడు గారి కళ్యాణ మహోత్సవం (సీతారాముల కళ్యాణంలా).

ఇలా ప్రతి రెండు మూడు నెలలకూ ఏదో ఒక తతంగం, ఉత్సవాలు, డబ్బు వసూళ్ళు..

ఇంచుమించు స్థాయి భేదాలు మినహాయించి మానవ దేవుళ్లు వెలసిన చోటల్లా ఇవే విన్యాసాలు!

ఇంతటితో ఆగదు, వారి ఖ్యాతి విస్తరిస్తోన్న కొద్ది ఇప్పుడున్న ఆశ్రమం పరిధిలు సరిపోవు. వారి దృష్టి జాతీయ – అంతర్జాతీయ స్థాయి మీదకి మళ్లుతుంది. పని పాటు లేనట్లు ఎక్కడెక్కణుంచో ఫారినర్స్ రావటం మొదలయ్యే సరికి ఈ ఆకర్షణ ఇంకా ఎక్కువవుతుంది. ఇలా పైకి వస్తున్న దేవుళ్ళ  దగ్గర చూడండి, విధిగా కొంత మంది విదేశీయులు కనిపిస్తారు. మన భాషలో, వాళ్ల స్టయిల్లో పాటలు పాడుతూ కనువిందూ, వీనుల విందూ చేస్తూ ఉంటారు.

భారీ ఎత్తున ఆశ్రమాలు నిర్మాణం మొదలవుతుంది, కోట్ల రూపాయల బడ్జెట్ తో.

డబ్బు…. చందాలు… వేల, లక్షల స్థాయిలో,

అసలే సమస్యలతో నలిగి పోతూ, హృదయ విదారకస్థితిలో ఉన్న భక్తులను ఇంకా పీల్చి పిప్పి చేస్తుంటారు.

“దుఃఖం నుండి విముక్తి, సమస్యల పరిష్కారం” ఈ నినాదాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి.

చిత్రమేమిటంటే ఇందులోకి చేరాక కూడా ఏ సమస్యకూ పరిష్కారం లభించని వారు కూడా ఆత్మ వంచన చేసుకుంటూ ఈ ప్రచారం చేస్తూ ఉంటారు.

వాళ్లకూ మధ్య మధ్య అనేక సందేహాలొస్తూ ఉంటాయి. ప్రశ్నలు ఉదయిస్తూంటాయి.

“మీకు భక్తి లేదు. మీలో అహంకారం పోలేదు. మీలో ఇంకా మార్పులు రాలేదు.” అంటూ వారిని అణగదొక్కేస్తూ ఉంటారు.

కొంత మంది బాధ ఆపుకోలేక కొంచం సూటిగా అడగబోతే అవహేళన చేస్తూ, అవమానం కలిగే రీతిలో హీనంగా మాట్లాడుతారు. మిగతా వాళ్ళు తాము చాలా గొప్ప వాళ్లయినట్లు ఫీలైపోతూ, హేళనగా నవ్వి, అలా అడిగిన వాళ్ళను పురుగుల్లా చూడటం మొదలు పెడతారు.

అంటే, భక్తుడిలో ప్రశ్నలు ఉండకూడదు.

అతడికి వ్యక్తిత్వం ఉండకూడదు.

అతను ఓ బానిసలా ఉండాలి.

మానవదేవుళ్ల ఉనికి ఇలా బానిసల్ని తయారు చేయటం మీదే ఆధార పడి వుంటుంది ..


ఇలా సాగిన తరువాత వీరు ఓ మాంచి మాట వ్రాస్తారు

“మానవ దేవుళ్ళు” అబద్దం కావచ్చు కానీ మంచి గురువులున్న మాట “మాత్రం” నిజం!

 

ఈ వాక్యంలో ఎన్ని నిఘూడమైన అర్దాలున్నాయో!!

11, అక్టోబర్ 2011, మంగళవారం

మింగుడు పడలేని నిజం

వృత్తి రీత్యా చాలా ప్రదేశాలు తిరిగినా, ప్రస్తుతం భాగ్యనగరంలో స్థిరపడ్డాను. నా వృత్తిలో ఎక్కువకాలం నేను భాగ్యనగరంలోనే గడిపాను అలాగే పెళ్ళైన తరువాత ఆరేళ్ళనుంచి ఇక్కడే ఉన్నాను. కావున ఇంకెక్కడికీ వెళ్ళాలనుకోవటం లేదు. ఇక్కడే ఉంటాను అనుకుంటున్నాను. కానీ కొన్ని నిజాలు నన్ను ఆలోచనలోకి తోస్తున్నాయి. వాటిల్లో మొదటిది ఆత్మహత్యల వివరాలు అలాగే మహిళలపై జరుగుతున్న హింసలపై ప్రభుత్వం చూపిస్తున్న గణాంకాలు. ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చినవి మాత్రమే అని మఱచి పోకుండా, వెలుగులోకి రాకుండా ఎన్ని ఉన్నాయో అన్న భావన మరింత కృంగదీస్తోంది.
భారత దేశంలో హింస గురించి లెక్కా పత్రాలు తయారు చేసే పనిని కేంద్ర ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, NCRB, నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో, వారు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం వారి వెబ్ సైట్ నందు 2009  సంవత్సర ప్రతిపాదకపట్టీ ఉంది. వారి లెక్కల ప్రకారం భారత దేశంలో మహిళలపై జరుగుతున్న హింసలలో ఆంద్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని. నమ్మబుద్ది కావటం లేదు కదూ, కానీ ఇది నిజమని లెక్కలే చెబుతుంటే, ఇదా నా ఆంద్రప్రదేశ్ అని ఏడవాలనిపిస్తోంది.
వీరి లెక్కలలో మఱో నగ్న సత్యం ఏమిటంటే, 2009 సంవత్సరంలో ఆత్మహత్యల ద్వారా చనిపోయిన వారి సంఖ్య 1,27,151. అంటే, సంవత్సరానికి 365 రోజుల లెక్కన ప్రతీ రోజు దాదాపుగా మూడువొందల యాభై మంది చనిపోతున్నారు. ప్రతీ నాలుగున్నర నిమిషాల వ్యవధిలో ఒక్కరు చొప్పున గంటకి పదిహేను మంది చొప్పున చనిపోతున్నారంటే, ఎందుకో అర్దం కాని పరిస్థితి. ఇదా నా భారత దేశం అని ఎంత చింతిస్తున్నానో అర్దం కావటం లేదు.
మొన్నా మధ్య అమెరికా వెళ్ళినప్పుడు ఇలాంటి వార్తలనే వారి నేషనల్ మ్యూజియంలో ఉన్నప్పుడు చిత్రీకరించి దానిపై ఓ పుటా వ్రాదామనుకున్నంతలో, హతవిధీ ఇలాంటి నిజాలు అక్కడే కాదు హింసా ప్రవృత్తి ఉన్న ప్రతీ చోట ఇది పునరావృత్తం అవుతూనే ఉంటుంది అనిపించింది. అమెరికాలో ప్రతీ రెండు గంటలకీ పన్నెండు మంది పిల్లలను హత్య చేస్తున్నారన్న విషయం నమ్మలేని మఱో నగ్న సత్యం.
USTripLiquidHub1 2010 248
ఇది నేను కల్పించిన చిత్రం కాదు, ఫిలడెల్ఫియాలోని నేషనల్ మ్యూజియం వారు బహిరంగంగా ఉంచినది.

ఎందుకీ హింసా ప్రవృత్తి? .. ఇప్పుడు కాదు, మఱోసారి.

5, అక్టోబర్ 2011, బుధవారం

క్రొత్తగా నేర్చుకున్న పాఠం

చదరంగం ఆట అంటే నాకు ఎందుకో తెలియని ఇష్టం. చాలా రోజులుగా నేను ఈ ఆటని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆడుతునే ఉన్నాను. అంతా కాకపోయినా కొంతలో కొంత ఘటికుడనే అని చెప్పుకోవాలి. కానీ నాలోని ఓ బలహీనత నన్ను ఈ ఆట యందు ఎదగకుండా ఉంచుతున్నదని నాకు కొంతకాలం వరకూ తెలియదు. కానీ తెలిసేటప్పటికి పుణ్యకాలం కాస్తా దాటిపోయింది. ఆలశ్యంగా నైనా అసలు విషయం తెలిసినందులకు కొంతలో కొంత మెఱుగైనా, పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలదాకా వస్తాయన్న సామెత పరంగా కొన్ని కొన్ని అలవాట్లు నన్ను వదలి పోనంటున్నాయి.

ఇంతకు ముందు కొంతకాలం క్రిందట, అనుభవాలనుంచి నేను నేర్చుకోవటం లేదని వ్రాసుకున్నట్లు గుర్తు. ఇది జరిగి దాదాపుగా ఓ తొమ్మిది నెలలైనా, ఈ నిజం వంటపట్టడానికి చాలా కాలం పట్టేట్టు ఉంది. తోలు మందంకదా. అందునా ఒంటి నిండా కొవ్వుందని ఈ మధ్యనే డాక్టర్ గారు తేల్చేశారు. అంత కొవ్వు కరిగి నిజం మింగుడు పడాలంటే, కొంచం కష్టమే కానీ నిజం నిజం కాకపోతుందా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, చదరంగం ఆట మఱియు నా ప్రవేశం గురించి.

ప్రతీ సంవత్సరం మా ఆఫీస్ వాళ్ళు చదరంగం పోటీలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా నేను పాలు పంచుకుంటాను. క్రిందటి ఏడాది ఇలాగే పాలు పంచుకుని ఓ అనామకుని చేతిలో ఓడిపోయ్యాను. ఈసారి కూడా గెలుపు అంచులదాకా వెళ్ళి ఓడిపోయ్యానని ఒప్పుకుని విరమించుకున్నాను. నేను ఓడిపోయ్యాను అన్న స్థితికి ఒక్క నిమిషం వరకూ ఆలోచిస్తే, అన్ని కోణాల్లోనూ నాదే పైచేయ్యిగా సాగుతున్న ఆట అది. కానీ ఇక్కడ నా ప్రత్యర్ది పోరాట పఠిమని మెచ్చుకోకుండా ఉండలేను. తాను ఓడిపోవడనికి అన్ని దారుల్లోనూ వీలుంది అని తెలిసి కూడా చచ్చేవరకూ పోరాడాలి అన్న ఒకే ఒక్క ఆలోచన అతనిని గెలిపించింది.

మానవుడన్న తరువాత తప్పులు అనేవి సహజం. ఒక్కొసారి మనం చేసే తప్పుల వల్ల మనం ఎంతటి మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందో నాకు ఎన్ని సార్లు అవగతం అవుతున్నా, నేను తెలుసుకోలేక పోతున్నా. చేసిన తప్పులే పునరావృత్తం అవుతున్నాయి. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, స్వతహాగా నాలో ఓ చిన్న భావన ఎప్పటి నుంచో ఉన్నది. మనం ఆడే ఆట వల్ల ఒక్కోసారి ఎదుటి వారికి పోరాడటానికి అవకాశం ఇవ్వకుండా, దుందుడుకుగా యదేశ్చగా ఓడించుకుంటూ పోకుండా, వారికీ పోరాడి ఓడిపోయ్యాం అన్న భావన కలిగించి కొంత ఉపశమనం కలిగిద్దాం అని ఆడేవాడిని. అదిగో అందువల్లే ఇంతకు ముందు నేను గెలవాల్సిన ఆట ఓడిపోవడనికి దారి తీసింది.

పోనీలే అని ఊరుకోకుండా, నిష్కర్షగా ఎలా పడితే అలా నరుక్కుంటూ పోతే అప్పుడు ఎదుటి వారు బాధ పడుతున్నారు అన్న భావన నాలో ఉత్పన్నం అవకుండా ఉండి, నేను గెలవాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో చివ్వరిదాకా పోరాడాలి అన్న క్రొత్త పాఠం నేను నేర్చుకున్నాను. ఎదుటి వారు ఫీల్ అవుతారని నేను ఫీల్ అవ్వడం ఇంతకాలం నేను చేసిన ఓ తప్పిదం అని ప్రస్తుత కాలం ఓ గుణపాఠాన్ని నేర్పింది. రాబోయే కాలం ఇంకేం నేర్పుతుందో.

 
Clicky Web Analytics